ఆలయ భక్తి లోని జ్ఞాన సూక్ష్మాలు
• చెప్పులు అరిగి పోయి తెగిపోయినా , పాతవి గా అయిపోయినా సరే వాటిని వదిలి కొత్తవి ధరిస్తాం. అదే విధంగా శరీరం (దేహం) కూడా కోలుకోలేని విధంగా అనారోగ్యం పాలైనా , వృద్ధాప్యం మీరినా ఈ శరీరం వదిలేసి (మరణం పొంది) మనలోని ఆత్మ తిరిగి కొత్త జన్మ ధరిస్తుంది. శరీరం శాశ్వతమా?, ఆత్మ శాశ్వతమా? అంటే ఆత్మే శాశ్వతం. ఆత్మ కి మరణం లేదు .
• మనం దేవాలయం లోపల భగవంతుడు దగ్గరకు వెళ్ళేటప్పుడు చెప్పులు ఆలయం బయట విడిచి వెళతాం . ఎన్నో మలినాలు చెప్పులకు అంటి ఉంటాయి . పరిశుభ్రత కోసం బయట వదిలి వేస్తాం అని అనుకుంటాం. కానీ మన దేహం లో ఎన్నో విషయ వికారాల రూపేణా మలినమైన ఆలోచనలు నిత్యం నడుస్తూ ఉంటాయి . మలినాల తో ఉన్న దేహ భ్రాంతి ని , ఆలోచనలను చెప్పుల వలే ఆలయం బయట విడిచి, అనగా భగవంతుడి సన్నిధి లో ఉన్న కాసేపు అయినా , శరీరం పై ఉన్న అభిమానాన్ని , ఆలోచనలను , శారీరక దృష్టి ని , దేహ మమకారాన్ని ఆలయం బయటే వదిలి వేయాలి అని అర్దం .
ఆలయం బయట చెప్పులు విడవాలి అనడం లో దాగి ఉన్న యధార్థ సూక్ష్మ జ్ఞాన అర్దం .
🌹🌹🌹🌹🌹🌹
• సాధారణంగా స్త్రీలు మాత్రమే నిత్యం బొట్టు ధరిస్తారు . కానీ శివాలయం లోనికి ప్రవేశించిన తరువాత పురుషులు సైతం , స్త్రీలతో సమానం గా బొట్టు ధరిస్తారు . మనం బొట్టు పెట్టుకునే స్థానమే మనలో ఆత్మ ఉండే స్థానం. పరమాత్మ అయిన శివుని (లింగ రూపం) కలిసేందుకు మన నుదుట లోపల ఉన్న ఆత్మను అలంకారం చేసి చైతన్యం చేయడమే ఇందుకు లోని దీని సూక్ష్మ జ్ఞాన అర్థం. ఇక్కడ మన శరీర ప్రస్తావన ఉండదు . పరమాత్మ శివునికి స్త్రీ పురుషుల ఇరువురూ సమానమైన ఆత్మ లే .
🌹🌹🌹🌹🌹🌹
• ఆలయం లో భగవంతుని విగ్రహానికి హారతి ఇస్తూ గంట మోగిస్తారు . ఆ హరతి ని అందరూ కళ్ళకు అద్దుకొని నమస్కరిస్తారు . అసలు ఈ హారతి ఎందుకు ? . . .
• భగవంతుడు జ్యోతి బిందు స్వరూపుడు . మనలో అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి వెలుగు నింపే జ్ఞానసాగరుడు . మన లో ఉన్న ఆత్మ , పరమాత్మ జ్యోతి నే కోరుకుంటుంది . కానీ నేడు మనం మనలోని ఆత్మను పూర్తిగా మరచి శరీరం అనే స్పృహ భావన తో జీవిస్తున్నాం . అందుకే మన శరీరానికి ఏది ఎందుకు చేస్తున్నాం ? హరతి ఎందుకు ఇస్తున్నాం ? దీపం ఎందుకు వెలిగిస్తున్నాం ? అందులో ఉన్న అసలు సూక్ష్మ విషయం ఏమిటో తెలియదు .
కానీ వాస్తవానికి మనలోని ఆత్మ కి ఈ సమస్తం తెలుసు . కానీ మనం ఆత్మ జ్ఞాన దృష్టి తో జీవించక పోవడం వలన , కేవలం శారీరక దృష్టి తో జీవిస్తూ ఉండడం వలన జ్ఞాన రహస్యాలు తెలియడం లేదు . విగ్రహం అనేది కేవలం మన దేహ సంతృప్తి కోసం , మన కళ్లతో చూస్తున్న దృష్టి కి అలంకారప్రాయం కోసం మాత్రమే . హరతి లో దాగి ఉన్న దే అసలు భగవత్ పరమాత్మ నిజ స్వరూపం .
🌹🌹🌹🌹🌹🌹
• భగవంతుని కి ఆలయం లో కొబ్బరికాయను మాత్రమే కొడతారు . ఎందుకు ?
కొబ్బరి పెచ్చు వలే మానవుని తల లో అహంకారం దృఢం గా ఉంటుంది. భగవంతుని ఎదుట ఎంత గట్టిగా కొబ్బరి కాయను కొడతామో , ఆ విధంగా మన తల లో దృఢం గా పాతుకుపోయి ఉన్న అహంకారాన్ని భగవంతుడి ముందు చెక్కలు గా పగులకొట్టి విడిచి పెట్టాలి . అప్పుడే మధురమైన తెల్లని కొబ్బరి వలే , మన ఆత్మ లో అనాదిగా దాగి ఉన్న దైవీ సుగుణాలు బయటికి వస్తాయి .
భగవంతుని కి కావలసింది మనం కొట్టే కొబ్బరి చిప్పలు కాదు , మన అస్థి లో దృఢం గా ఉన్న అహంకారం కావాలి .
కొబ్బరికాయ కొట్టడం లో దాగి ఉన్న సూక్ష్మ జ్ఞానం ఇది .
• చెప్పాలంటే . . . కొబ్బరికాయలు అనే మన నమ్మకం తో నేడు ఆలయాల లో లక్షల రూపాయల వ్యాపారం జరుగుతోంది .
🌹🌹🌹🌹🌹🌹
• శివాలయం లో కొట్టిన కొబ్బరికాయ గాని , శివుని కి పెట్టిన పువ్వులు గాని తిరిగి ఇంటికి తీసుకు వెళ్ళ కూడదు అని నంది దగ్గర విడిచి పెట్టాలి అంటారు .
దీని అర్థం . . . శివుని కి మనం ఏదైనా అర్పిస్తే , తిరిగి మరలా వెనక్కి తీసుకోకూడదు అని అర్థం. అంటే శివుని కి మన దుఃఖాలు , కష్టాలు, చెడు గుణాలు , బలహీనతలు , వేదనలు అర్పిస్తాం . శివాలయానికి వెళ్లి , ఏమైతే మనం శివుని కి మనసు తో విడిచి పెడతామో , తిరిగి వాటిని మనసు ద్వారా స్పృశించి కూడదు . . .
• శివాలయం లో కొట్టిన కొబ్బరికాయ , పువ్వులు తీసుకు వెళ్ళకూడదు అనే విషయం లో దాగి ఉన్న మర్మ రహస్యం ఇదే .
🌹🌹🌹🌹🌹🌹
• శివాలయం కి వెళ్ళినప్పుడు మూడు ప్రదక్షిణాలు చేయడం జరుగుతుంది . దీని సూక్ష్మ అర్థం, శివుడు మల్లోకాలకు అధిపతి . స్థూల లోకం (మనుషుల లోకం) , ఆపైన సూక్ష్మ లోకం (బ్రహ్మ విష్ణు శంకరుల దేవతా లోకం) , ఆ పైన మూలవతనం ( పరమాత్మ శివుడు మరియు ఆత్మల లోకం). ఈ మూడు త్రిలోకాలు తిరిగాడే సూచకం గా ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తారు .
🌹🌹🌹🌹🌹🌹
• భగవంతుడు పైన ఉన్నాడు అన్నీ చూస్తుంటాడు అని వేలి తో చుపిస్తాం , మరి గుడి లోపల ఉన్నది ఎవరు ?
• మన లోని ఆత్మ కి తెలుసు, భగవంతుడు పైనే ఉన్నాడని . ఎందుకంటే, మనం గతం లో అనేక సార్లు మరణించిన తరువాత మన ఆత్మ పై లోకం లో ఉన్న పరమాత్మ (భగవంతుని) వద్దకు చేరింది, యదార్ధం గా చూసింది . కానీ, ఈ విషయం నేడు మన శరీర స్పృహ కి తెలియదు. కానీ ఆత్మ కి తెలుసు అందుకనే, అప్రయత్నంగా భగవంతుడు పైన ఉన్నాడు అన్నీ చూస్తుంటాడు అని వేలు పైకి ఎత్తి మరీ అంటుంటాం .
మరి గుడి లో ఉన్నది మన సంతోషం కోసం సంతృప్తి కోసం అలంకార ప్రియం గా మనం తయారు చేసుకున్న విగ్రహం . పైన ఉన్న సూక్ష్మ మైన పరమాత్మ మన రెండు కళ్ళకు కనపడుట లేదు కాబట్టి విగ్రహ రూపంలో ఆలయాల్లో ప్రతిష్ట చేస్తాం . భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాం .
మన లోని ఆత్మ జాగృతం (చైతన్యం), అయిన నాడు మన దృష్టి , ఆలయ విగ్రహం దాటి ఆ పైన ఉన్న జ్యోతి బిందు శివ పరమాత్మ ను జ్ఞాన ధ్యాన యోగాల ద్వారా చూడడం , అనుభవం పొందడం ఆరంభం అవుతుంది .
🌹🌹🌹🌹🌹🌹
• వాస్తవానికి భక్తి లో ఎన్నో ఎన్నెన్నో జ్ఞాన యుక్తమైన విషయాల రహస్యాలు దాగి ఉన్నాయి . కానీ వాటి అర్దం పరమార్థం మనకు తెలియదు. ఎవరినైనా అడిగితే అది అంతే అంటారు , లేదంటే ఏవేవో కధలు చెపుతారు కానీ సత్యం చెప్పరు . కారణం వారికి తెలియక పోవడమే.
• అదే విధంగా భక్తి లో , అమాయక ప్రజలను భయపెడుతూ మూఢత్వ నమ్మకాలు పెంచి పోషించి , వాటిని విస్తృతంగా వ్యాపింప చేసి , వ్యాపార మార్గాలుగా మార్చుకునే విధానాలు నేడు చాలా వ్యాపించి ఉన్నాయి . ఇది కలియుగం, పూర్తి మాయ మోసాల ప్రపంచం. ఇందులో భగవంతుడి తో కూడా , మాయా బుద్ధి జీవులు వ్యాపారం చేయకుండా ఉండలేరు . ఇది వరకు చెప్పినట్లు, కొందరి లో ఉన్న అమాయకత్వాలు , నమ్మకాలు, బలహీనతలు , అజ్ఞానం మరికొందరికి జీవన భుక్తి .
• దీనికి కారణం భగవంతుడు అంటే అసలు ఎవరు? అనే సత్యం , ప్రతి మనిషి కి తెలియక పోవడమే .
• మనలో . . . ఏది ఎందుకు చేస్తున్నాం ? అనే ప్రశ్న తలెత్తనంత కాలం . . . మనసు , శరీరం ద్వారా తప్పుడు పనులు చేస్తూ ఉన్నంత కాలం . . . సత్యాన్వేషణ చేయనంత కాలం, అర్దం పర్దం లేని భయాల తో మోస పోతూ , మౌనం గానే ఉంటాం .
ఓం శాంతి
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 27 June 2026 11:00 AM.







