Tuesday, May 19, 2026

746. శ్రీకృష్ణోపదేశం - కలియుగాంతం

 

 శ్రీకృష్ణోపదేశం  - కలియుగాంతం


• ఒకసారి శ్రీకృష్ణుడు , పాండవుల కు సృష్టి మరియ యుగాల గురించి ఉపదేశిస్తూ కలియుగం ఆరంభం గురించి వివరించగా , పాండవులు కలియుగ అంతం గురించి తెలియ చేయమని అడగడం జరిగింది .

  వెంటనే , శ్రీ కృష్ణుడు కలియుగ అంత్య సమయం ఎలా ఉంటుందో వివరించడం కంటే ముందు , తన శక్తి తో  అది స్వయం గా   వారికి  చూపించాలని నిర్ణయించుకొని , పాండవులకు  ఒక  పరీక్ష పెడతాడు .  ఆ పరీక్ష లో   ధర్మరాజు ను మినహాయించి . . . తన వద్ద ఉన్న నాలుగు బాణాలు తీసి , నాలుగు దిక్కుల వైపుకు వేసి అవి తీసుకుని రమ్మని అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు కి  చెపుతాడు .


వారు నలుగురు  తలో దిక్కు కు వెళతారు . 


• అర్జునుడు తాను వెళ్లిన దిక్కు లో దొరికిన బాణం తీసుకుని వస్తుండగా , ఒకచోట ఒక విచిత్రం చూస్తాడు. అప్పుడే దూడకు జన్మనిచ్చిన ఆవు, అదే పనిగా దూడను విపరీతంగా నాకుతూ ఉంటుంది. ఆ దూడను ఎంతకూ వదిలి పెట్టదు . అక్కడ ఉన్న వారు, ఆవు ను బలవంతంగా దూరం గా ఉంచినా సరే పరిగెత్తుకుంటూ ఆవు , దూడ దగ్గర కు వెళ్లి నాకుతూ ఉంటుంది . ఇది అర్జునుడికి చాలా ఆశ్చర్యం గా అనిపిస్తుంది . అది చూసి అర్జునుడు బయలుదేరుతాడు.


• ఇక రెండవ దిక్కు నుండి భీముడు బాణం తీసుకుని వస్తూ ఉంటే , ఆ మార్గంలో ఒక కోకిల బ్రతికి ఉన్న కుందేలు ను పొడుచుకుని తింటూ ఉంటుంది . భీముడు ఆశ్చర్యపోతాడు కోకిల ఎంతో మృధువైనది. ఎంతో మృదువుగా రాగం ఆలపిస్తుంది . అటువంటిది , కుందేలు ను పొడుచుకుని ఆహారం గా తినడం ఏమిటి . ఏమిటి ఈ విపరీతం అని, సందేహం తో భీముడు అక్కడి నుంచి బయలుదేరుతాడు .


• ఇక మూడవ దిక్కు నుంచి నకులుడు బాణం తీసుకుని తిరిగి వస్తుండగా , ఒక చోట వింత చూస్తాడు . ఒక పెద్ద బావి , దాని సమీపంలో నాలుగు చిన్న బావులు ఉంటాయి . కేవలం పెద్ద బావి లో మాత్రమే నీళ్ళు ఉండడం వలన , అక్కడి ప్రజలు నీళ్ళు తోడి చుట్టూ ఉన్న నాలుగు చిన్న బావుల్లో సమానం గా నింపుతూ ఉంటారు . కొంత సమయానికి పెద్ద బావి లో నీళ్ళు పూర్తిగా నిండుకుంటాయి . వెంటనే అక్కడి ప్రజలు, అయ్యయ్యో పెద్ద బావి లో కొన్ని నీళ్ళు అయినా ఉండాలి కదా అని , చుట్టూ ఉన్న నాలుగు బావుల లో ఇది వరకు వేసిన కొన్ని నీళ్ళు కొంచెం కొంచెం తోడి పెద్ద బావి లో వెయ్యాలని ప్రయత్నిస్తే , ఆ నాలుగు చిన్న బావుల లోని నీళ్ళు తోడే సరికే , అవి ఆవిరి అయిపోతుంటాయి ‌. కానీ పెద్ద బావి కి ఒక్క నీటి చుక్క కూడా దొరకదు .

 అది చూసిన నకులుడు ఏంటి ఈ విచిత్రం కళ్ళ ముందే ఇలా జరుగుతుంది అని అనుకుని అక్కడి నుండి బయలుదేరుతాడు .

• ఇక నాల్గవ దిక్కు న ఉన్న బాణం సేకరించిన సహదేవుడు తనకు దొరికిన బాణం తీసుకుని శ్రీకృష్ణుని వద్దకు బయలుదేరుతుండగా , ఒక విచిత్రం చూస్తాడు . ఒక పెద్ద బండరాయి , మహా పర్వతం పై నుంచి, దొర్లుకుంటూ వస్తుంది. అది అలా దొర్లుకుంటూ వచ్చేటప్పుడూ ఎంతో ఏపుగా ఆ పర్వతం పై పెరిగిన మహ వృక్షాలను కూలదోస్తూ , దొర్లుకుంటూ దొర్లుకుంటూ వచ్చి ఆఖరికి ఒక చిన్న గడ్డిపోచను అడ్డుకొని పర్వతం మధ్యలో ఆగి పోతుంది . సహదేవుడు కి చాలా ఆశ్చర్యం కలుగుతుంది అంత పెద్ద బండరాయి చిన్న గడ్డిపోచను ఆనుకొని ఆగిపోవడం ఏమిటి . ఏమిటి ఈ విచిత్రం అని అనుకుంటూ అక్కడ నుంచి బయలు దేరుతాడు .


• ఆ నలుగురు శ్రీకృష్ణుని చేరి , తాము చూసిన వింత అనుభవాలు వివరిస్తారు . అందుకు సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా చెపుతాడు . కలియుగం చివరిలో అంతం అవుతుంది అనడానికి అవే సంకేతాలు . . వాటిలోని సూక్ష్మం మీకు అర్దం చేయిస్తాను అని , శ్రీకృష్ణుడు ఇలా చెప్పడం ఆరంభిస్తాడు .

• మొదటి వృత్తాంతం ఆవు , దూడను నాకుతూ ఉండడం. . . కలియుగం అంత్య కాల సమయం లో జన్మ నిచ్చన తల్లి తండ్రులు తమ పిల్లలకు అతి గా ప్రేమ ను పంచుతూ , సాకుతూ ఉంటారు . పిల్లలకు కష్టం తెలియకుండా సమస్తం సమకూరుస్తూ , మమకారం అనే మైకంలో పిల్లలకు , తల్లిదండ్రులు బానిసలు లా ప్రవర్తిస్తూ ఉంటారు . కష్టం తెలియని పిల్లలు సోమరులై , అపసవ్య దిశలో జీవనం సాగిస్తారు . అందుకు నిదర్శనం ఆ ఆవు దూడ వృత్తాంతం అని శ్రీకృష్ణుడు చెపుతాడు. వాస్తవానికి దూడ ఆవు గర్భం నుంచి భూమిపై పడిన కొన్ని క్షణాలలో తనకు తాను లేచి పరిగెట్టాలి , ఇది సృష్టి ధర్మం. కానీ సృష్టి ధర్మం తప్పి నపుడు జీవులకు అదే వినాశన కాలం అని చెపుతాడు .

• ఇక రెండవ అంశం అయిన కోయిల కుందేలు వృత్తాంతం గురించి చెపుతూ. . . సృష్టి లో కోయిల స్వరం భగవంతుని ఆశీర్వాదం . ఆ విధంగా కోయిల వలే , దైవానుగ్రహం తో సంపాదించిన జ్ఞానాన్ని కలిగి ఉన్న పండిత పుంగవులు తమ గొంతు, స్వరం , మాటలతో , కుందేలు వంటి అమాయకులను ధనం కోసం పీల్చి పిప్పి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు . విద్య , వైద్య , దైవీ జ్ఞానం వంటివి అనుభవజ్ఞులు కు ,  పండితులకు , గురువులకు లోక కళ్యాణార్దం భగవంతుని అనుగ్రహం చేత లభిస్తుంది . కానీ , ధనం కోసం తమ జ్ఞానాన్ని భ్రష్టు పట్టించి అమాయకులను పీడిస్తారు. అందుకు ఉదంతమే కోయిల , కుందేలు పట్ల  ప్రవర్తన అని శ్రీకృష్ణుడు చెపుతాడు.


• ఇక ముడవ అంశం . . . అతి పెద్ద బావి వలే విశాల హృదయం ఉన్న తల్లి తండ్రులు ఉమ్మడి కుటుంబం లోని తమ పిల్లలందరికీ సమానంగా కావలసినంత ప్రేమ సహయ సహకారాలు అందిస్తారు . కలియుగ అంతం లో ఈ ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయి , వృద్ధాప్యం లో ఉన్న తల్లి తండ్రులకు తమ పిల్లలు కడివెడు ప్రేమను కూడా పంచరు సరికదా అనాధల వలే చూస్తారు. అందుకే చిన్న బావుల్లో నీరు పెద్ద బావి కి చేరలేదు .


ఇక నాల్గవ అంశం బండరాయి గడ్డిపోచ . . . కలియుగం లో భగవంతునికి కోసం  ఎన్నో  వ్యయ ప్రయాసలతో   ఆలయాలు నిర్మించి  , అంగరంగ వైభవంగా విగ్రహాలు తయారు చేయించి ఆలయాలకు  సమర్పించిన వారికి కూడా సర్వ శక్తివంతుడు అయిన భగవంతుడు , పరమాత్ముడు లభించడు .  కారణం  ఆడంబరాలు అలంకారాలు , మాయా ఆకర్షణల తో చేసే  భక్తి   భగవంతుని కి  అణువంత కూడా ప్రీతి పాత్రం  కాదు . ఆ విధమైన వాటన్నింటినీ   దాటుకుని  . . .   భగవంతుని పై సత్యమైన ప్రేమ , మనసు కలిగి ఉన్న  గడ్డిపోచ  వంటి  అమాయకుని చెంతకు స్వయం గా పరమాత్ముడే వెతుక్కుంటూ వెళతాడు.   నిరుపేద అయిన మనసు లోనే  భగవంతుడు ఆసీనుడు అవుతాడు . దాని ఉదంతమే బండరాయి వలే  శక్తి వంతమైన  పరమాత్మ  , గడ్డి పోచ ను ఆనుకొని ఉండడం అని శ్రీకృష్ణుడు పాండవుల కు చెపుతాడు.


సేకరణ :   గీతా జ్ఞానం - రాజయోగం .


• శ్రీకృష్ణుడు చెప్పిన ఈ సందర్భాలు నేడు జరుగుతున్నాయో లేదో , ఇది కలియుగ అంత్య సమయమో కాదో నేటి కాలంలో మనిషే గ్రహించాలి . . . లేదంటే ఇంకా కలియుగం ప్రధమ పాదే , జంబూ ద్వీపే , భరతఖండే , భరతవర్షే , అంటూ నామ గోత్రాలు జపిస్తూ , ఇంకా కలియుగం ప్రధమ పాదం లో ఉన్నాం అనుకుని అమాయకత్వం తో ఉండవలసి వస్తుంది.


• Written by the Energies Conjunction of KARMIC planet SATURN 🪐 and Past Lifes Spiritual Mastery experienced planet KETU .


ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 


ఆత్మ  ✍️ 19 May 2026 11:30 PM 

Thursday, May 14, 2026

745. సమస్యల సావధానం

 

  సమస్యల సావధానం

(సావధానం = శ్రద్ద)



• సరిగా  ఆలోచిస్తే సమస్యలను మనమే సృష్టించుకున్నాము .  అవును  మనం ఒక విషయాన్ని  సమస్య గా భావిస్తుంటే, ఆ సమస్య కి మూల కారణం మనమే . అది తెలియక తరచూ ఇతరులను నిందించడం జరుగుతుంది .

• సమస్య ను  విశ్లేషించుకునే  మానసిక శక్తి , అవగాహన  లోపించినపుడు  దానికి కారణం తరచూ ఇతరులు గా   భావించడం జరుగుతుంది . వాస్తవానికి సమస్య మనది కాబట్టి కారణం కూడా మనమే . మనకు ఉన్న ఆలోచనా లేమి తో సమస్య ను సృష్టించుకునేందుకు మనమే అవకాశం ఇస్తాము లేదా ఇతరులకు ఆ అవకాశం మనమే స్వయంగా కల్పిస్తాము .


• సమస్యను ఎప్పుడూ బాహ్య దృష్టి తో కంటే , అంతర్దృష్టి తో చూసి నపుడు , ఏ దశలో మనము తప్పు చేశాము లేదా సరియైన నిర్ణయం తీసుకోలేక పోయాము  లేదా   సరియైన విధంగా ప్రవర్తించ లేకపోయాము  అనేది మనకు మాత్రమే తెలుస్తుంది . దీనికి కాస్త ఆత్మ శుద్ది అవసరం . ఆత్మ శుద్ది లేని నాడు మన సమస్యలకు సమాధానం గాని, పరిష్కారం గాని పొందలేము .

• నేను కరెక్ట్ అనే భావన ద్వారా సరళత ఉన్న వారికి ఎన్నడూ తమకు సంబంధించిన ఏ విషయం పైన మనసు లో కించిత్ బాధ, దుఃఖం సహజంగా కూడా అనుభవించరు . ఎందుకంటే వారు తమ విషయాలనే కాదు ఎవరి విషయాలను కూడా సమస్యాత్మకంగా చూడరు, సమస్యను అనుభవం పొందరు . ఒకవేళ వారికి సమస్య ఉన్నా లేనట్లే ఉంటారు. కానీ, ఇందులో ఒకవేళ అహంకారం నిండి  ఉంటే  తమను తామే పాతాళానికి చేర్చుకునే ప్రయాణం అవుతుంది.

• వాస్తవానికి కొన్ని సార్లు, మనకు ఏ విధమైన సమస్యలు లేక పోయినా సరే , సమస్యలను అధికం గా ఫీల్ అవుతూ ఉంటాం . ఇది ఒక మానసిక మైన రోగం, బలహీనత.

  

• మనలో మంచి గుణాలు లేనపుడు తప్పని సరిగా ఏదో విధంగా , ఏదో రూపంలో ఇతరులు మనకు గుణపాఠం నేర్పిస్తారు . ఈ విషయం గ్రహించిన నాడు మనం మేలు పొందిన వారమే అవుతాం . కర్మ పాఠాలు, గుణ పాఠాలు నేర్చుకోవడానికి మన జీవితంలోని కాలం  మనకు ఏదో ఒక వయసు లో , ఏదో ఒక సమయంలో అవకాశాన్ని ఇస్తుంది . అది సద్వినియోగం చేసుకున్న వారు భాగ్యవంతులు . కానీ ఇక్కడే ఒక సమస్య . . . అనేక కాలాలు గా మనిషి బుద్ధి బురదలో దొర్లి దొర్లి ఉండడం వలన , పాత సంస్కారాలు పాత ఆలోచనలు కి అలవాటు పడి పోయి ఉండడం వలన . . . గుణ పాఠాలు ఎదురైనా సరే తిరిగి బురదలో దొర్లాడే జీవి లా జీవించాలి అని  అనిపిస్తుంది . ఇటువంటి వారిని మాయా జీవులు అంటారు. అంటే మాయ కు, కొన్నిరకాల బలహీనతలకు పూర్తిగా వశం అయిపోయిన వారు అని అంటారు .

• మన అంతరంగం పరిణితి చెంది ఉన్నంతలో , సాధించేది ఏమీ లేదు. పరిణితి తో పాటు దృఢత్వం అత్యంత అవసరం . ఈ దృఢత్వం సరియైన నియమాలు తో కూడిన నిర్ణయాలను ధైర్యం గా తీసుకునేందుకు సహకరిస్తుంది .

• సమస్యలు అనుభవాన్ని పెంచడానికి , వాటిని పరిష్కారించు కొనే మార్గం తెలియచేయడానికి వస్తాయి . అంతే కానీ వాటిని తప్పించుకు తిరగడానికి కాదు .‌ సమస్యలు అనేవి శాశ్వతంగా తీరిపోయేటివి కాదు . ఒకటి పోతే మరొకటి, మనిషి జీవించి ఉన్నంత వరకు ఏదో రూపంలో వస్తూనే ఉంటాయి . వాటిని ఎదుర్కోవడం అనగా సమస్య పై యుద్ధం చేయడం , ఒక బుద్ధి హీనత. 

అంత కంటే కూడా, ‌సమస్యను అర్దం చేసుకోవడం అలవాటుగా  చేసుకుంటే తిరిగి పునరావృతం కాకుండా జాగ్రత్త వహించవచ్చు . ఆ అనుభవం తో మన సమస్యలనే కాదు , ఇతరుల సమస్యలకు కూడా అలవోకగా పరిష్కారం చూపించవచ్చు. . . కానీ అందుకు ఓర్పు సహనం తో పాటు సత్యమైన విశాల హృదయం కావాలి .

• కొన్ని సార్లు కొన్ని సమస్యలకు మూలం సరియైన కమ్యూనికేషన్ లోపం , అవగాహన లోపం ,  స్పష్టత లో లోపం . ఈ కమ్యూనికేషన్ లో ఆలోచన , మాట , కర్మ ఉంటాయి . వీటిని నిజాయితీ గా  ఆచరించనపుడు మాత్రమే , జరిగిన పొరపాట్లుకు , అనుభవిస్తున్న  సమస్యల కు  తిరిగి  అవే  ఆలోచనలు  , మాట , కర్మ  పరిష్కారం చూపిస్తాయి .

• మనిషి జీవించి ఉన్నంత వరకు సమస్యలు ఏదో రూపంలో వస్తూనే ఉంటాయి. అందులో అనుమానం లేదు. ఎందుకంటే మనకు తెలియని సత్యం ఏమిటంటే , ఈ కలికాలం లో మనిషి జీవించడమే ఒక పెద్ద సమస్య , దీనికి ఉన్నోడు లేనోడు అనే మినహాయింపు లేదు . ధనం తో అసలు సంబంధం లేదు.  అనేక జన్మలు గా వికర్మలు చేసిన వారే కలియుగం లో జన్మలు తీసుకుంటారు . ఆ కర్మల ఫలితం పూర్తిగా అనుభవించి , శుద్ది కాబడిన వారు మాత్రమే తిరిగి రాబోయే సత్య యుగం లో దైవీక జన్మలు తీసుకుంటారు . . అవునన్నా కాదన్నా ఇదే సత్యం .



• భారతదేశం వేద భూమి, పుణ్య భూమి, కర్మ భూమి. ఇది జగమెరిగిన సత్యం. భగవత్ జ్ఞానం లో స్వస్తిక్ గుర్తులో సృష్టి రహస్యం దాగి ఉంది . అది నాలుగు యుగాల సంకేతం , సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం , కలి యుగం . ఈ నాలుగు యుగాలలో నే  సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. ఒకొక్క యుగం 1250 సంవత్సరాలు. సృష్టి మొత్తం 5000 సంవత్సరాలు . దీనిని ఒక కల్పం అంటారు. ఇప్పటికే ఎన్నో కల్పాలు జరిగాయి. అందుకే సృష్టి చరిత్ర లక్షల సంవత్సరాలు అనే మాట శాస్త్రాలలో  అంటుంటారు . ప్రస్తుత కాలం కలియుగం పూర్తిగా వినాశనం అయ్యే కాలం. ఆరంభం కూడా అయింది. అందుకు ఎన్నో నిదర్శనాలు ఉదాహరణలు  నిత్యం చూడడం జరుగుతుంది.

  క్రమేపీ సత్య యుగం ఆరంభం కూడా భరత ఖండము నుంచే ఆరంభం ఔతుంది.


• నిజం లో ప్రయాణించడం, నిజం తో కలిసి జీవించడం అసాధ్యం కాదు, కానీ అందుకు కావలసింది నిజాయితిని  కలిగి ఉండాల్సిన అంతరంగం 

ధనం ఉంటే గుణం చూడరు . అదే లేకుంటే  పుట్టుమచ్చ నైనా  రోగం లా చూపేందుకు వెనుకాడరు  .


  ఓం శాంతి

  ఓం నమఃశివాయ

  యడ్ల శ్రీనివాసరావు   14 May 2026 1:00 AM .


Wednesday, May 13, 2026

744. వర్ణాల లో వెలుగు శివం

 

వర్ణాల లో వెలుగు శివం



• ఎంతని   చూసేది    శివ

  ఏమని చెప్పేది   నా తండ్రి  శివ .


• సృష్టి  వర్ణాల లో   వెలుగై 

‌  వికసించిన    నీ రూపం . . . 

  చూశాయి    నా కనులు

  కలవరింతల   భాగ్యం లో .


• ఎంతని    చూసేది   శివ

  ఏమని చెప్పేది    నా తండ్రి  శివ


• ఎన్ని   జన్మలెత్తినా  వదలలేను 

  నీ  శివ  నామం

• ఎందరి లో  కలిసున్నా   విడువలేను 

  నీ  శివ  నామం

• అదే . . .  నా గుండె  లయకారం .

  అదే  . . . నా  నోట   నుడికారం.


• శిల లోని   లేని  నీవు

  శిధిలమైన  మనసు లో  నిండావు .

• మది   ఎరుగని  మహిమలను

  మాట తో   పలికించావు 

  నా మాట లో   నీవు  కనిపించావు.


• ఎంతని    చూసేది    శివ

  ఏమని చెప్పేది   నా  తండ్రి  శివ .


• సృష్టి  వర్ణాలలో    వెలుగై  

  వికసించిన   నీ   రూపం . . . 

  చూశాయి    నా కనులు

  కలవరింతల   భాగ్యం లో .


• తనువు లోని   తపనలన్నీ 

  నీ తలంపు తో   తరిగి   తరిగి

  తురుములైనాయి .

• వెలుగు లోని    నీ రూపం

  నా  వెనుక   ఉండి

  నీడ ను   చూపిస్తుంది

  నా  నీడ ను   నడిపిస్తుంది .


• ఈ యేటి లోని     గలగలలు

  పలుకుతున్నాయి   శివ రాగం .

• ఈ గాలి లోని     సుడిగుండాలు

  ఆడుతున్నాయి    శివ నాట్యం .


• సిరులు   కురిపించేటి   సుగంధం

  శివ    నామ   స్తోత్రం .

• వెతలు    వొలిచేటి    వ్యాపకం

  శివ    నామ   స్తోత్రం  .


• ఎంతని     చూసేది     శివ

  ఏమని  చెప్పేది    నా  తండ్రి   శివ .

• సృష్టి వర్ణాలలో   వెలుగై 

  వికసించిన   నీ  రూపం . . . 

  చూశాయి    నా కనులు

  కలవరింతల   భాగ్యం లో . .



యడ్ల శ్రీనివాసరావు 13 May 2026. 11:00 PM.



Tuesday, May 12, 2026

743. భగవంతుడు మనిషితో మాట్లాడి తే -2

 

 భగవంతుడు మనిషితో మాట్లాడితే-2


భగవంతుడు  సృష్టి కర్త. అత్యంత శక్తివంతడు . మనిషి భగవంతుని భక్తి చేస్తూ ప్రార్ధిస్తాడు, కీర్తిస్తాడు . భగవంతుని కోసం అన్వేషిస్తూ ఉంటాడు . తనను దుఃఖం నుంచి విడిపించుకుని అడుగు తాడు , కోరికలను తీర్చమని ప్రాధేయపడతాడు .


మనిషి ఇన్ని చేసినా భగవంతుడు మాత్రం మనిషి తో మాట్లాడినట్టు ఎక్కడా అనిపించదు. సమాధానం ఇచ్చి నట్టు వినిపించదు . మౌనం గా నే ఉంటాడు .


• కానీ అప్పటి వరకూ ఎదురు చూసిన మనిషి భగవంతుని పై  ఓర్పు నశించి, సహనం కోల్పోయి , భగవంతుని పై నమ్మకం సన్నగిల్లి ఉంటాడు . ఇదే మనిషి యొక్క అజ్ఞానం , మాయా ప్రభావం .


• మనిషికి , భగవంతుడు లభించేది , మనిషి తో మాట్లాడేది కేవలం మౌనం లోనే , మౌనం తోనే . మౌనం మహత్తరమైన శక్తి . ఏకాంతం లో ఉంటూ మౌనం తో , శబ్ద రహితమైన స్థితి లో భగవంతుని తో కూర్చుని ధ్యానం చేస్తూ అనుసంధానం అయినపుడు, భగవంతుడు మాట్లాడుతాడు . ఆ భాష మౌన భాష . ఆ సంకేతం మనిషి ఎదురు చూస్తున్న దానికి సమాధానం . మాట్లాడడానికి మించి  స్పష్టం గా కంటికి  అన్నీ  చూపిస్తాడు .


• మౌనం . . . సృష్టి స్థితి లయల శక్తితో నిండి ఉన్న దివ్యమైన భాష . అదే భగవంతుడు మనిషితో మాట్లాడడానికి , అనుసంధానం అవడానికి ఎంచుకున్న విధానం అని  నేటి కాలపు మనిషి కి తెలియదు .


• సంపూర్ణ మైన మౌనం తో  రోజూ కొన్ని గంటల సమయం ఏకాంతం గా, తెల్లవారుజామున నిశ్శబ్ద వాతావరణంలో , ఏ శబ్దం నోటితో పలకకుండా భగవంతుడిని , మనసు లో స్మృతి చేస్తూ ఉంటే, భగవంతుడు మనిషి కి సమాధానం ఇవ్వడం ఆరంభిస్తాడు .


• ఇందులో మొదట మనిషి కి అర్దం చేయించేది , నీవు ఎవరు?  నేను ఎవరు?  నీవు ఎందుకు జన్మ తీసుకున్నావు ? నీవు ప్రస్తుతం ఏం చేస్తున్నావు ? ఇలా ఎన్నో ఎన్నెన్నో  సూక్ష్మ రహస్యాలు తెలియ చేస్తాడు . 

మనిషిని పవిత్రంగా , ఉన్నతంగా కావించేందుకు మనిషి యొక్క లోపాలు మానసిక వికారాలు , బలహీనతలు , జన్మాంతరాలుగా  సంపూర్ణం కాకుండా   మిగిలి  ఉన్న  కర్మలు , కర్మ బంధనాలు , చేసిన పాప పుణ్య కర్మల లెక్కల ఖాతాలు  అన్నీ  క్రమేపీ ఆధారాలతో అర్దం చేయిస్తాడు . వాటన్నింటి నుంచి సంపూర్ణంగా విముక్తుడిని చేసే మార్గం చూపిస్తాడు .

ఇదంతా భగవంతుని పై నిశ్చయం తో , పూర్తి బలిహరం అయినప్పుడే సాధ్యం అవుతుంది .


• సమస్య అంతా మనిషి కి ఇక్కడే ఎదురవుతుంది . ఎందుకంటే మనిషి దేనిని అంత సులభంగా అంగీకరించడు . సాక్షాత్ భగవంతుడు వచ్చి మనిషి కి తన అంతర్గత స్థితి ని అర్దం చేయించి పరివర్తన చెయ్యాలి అనుకున్నా సరే భగవంతుడిని శిరసావహించ లేడు . ఎందుకంటే మనిషి లో  నేను అనే అహం , మాయ మైకం తో పేరుకు పోయిన అజ్ఞానం , తన శరీరం పై ఉన్న వ్యామోహం , మమకారం . మరియు కామ వికారాల ప్రభావం. ఇంద్రియ నిగ్రహము లేకపోవడం.  ఇవన్నీ కలిసి మనిషి ని భగవంతుని కి దూరంగా చేస్తాయి .


• భక్తి లో పతిత పావన రండి , వచ్చి మమ్మల్ని పావనం చేయండి అని పాటలు పాడుతూ భగవంతుడుని మనిషి పిలుస్తాడు . తీరా భగవంతుడు వచ్చి తన శక్తి తో జ్ఞానం ఇచ్చి , మనిషి ని చైతన్య వంతం గా  పవిత్రుడు గా చేయాలని , తన సమానంగా దివ్య గుణాల వారసుడిగా చేయడం ఆరంభిస్తే , మనిషి అందుకు సంసిద్ధం కాడు , కాలేడు . ఎందుకంటే అనేక జన్మలు గా మాయ, వికారాల ఊబిలో కూరుకు పోయి ఉండడం , వాటికి దాసోహం అయిపోవడమే కారణం . నేడు , శారీరక మానసిక వికారాలు లేకుండా , శుద్ది కలిగిన మనసు తో , సత్యమైన మాట తో బ్రతక లేని స్థితి లో మనిషి జీవిస్తున్నాడు అనేది ఏ మనిషి కి  తెలియని యదార్థం కాదు .


• శరీరం వేరు , ఆత్మ వేరు అనే రహస్యమైన విషయం గ్రహించ లేని స్థితిలో మనిషి భగవంతుని భక్తి చేస్తాడు . ఈ విషయం స్వయం భగవంతుడు అర్దం చేయించే వరకు , నేను ఆత్మ ను అనే విషయం ఎవరికీ తెలియదు.


• భగవంతుడి శక్తి ని మనిషి స్వీకరించినపుడు, ఆ శక్తి తోనే మనసు , బుద్ధి , ఆత్మ సంపూర్ణ పవిత్రంగా అయి భగవంతుని సన్నిధి చేరుకోగలం . సన్నిధి చేరడం అంటే భగవంతుని వలే జనన మరణాలకు అతీతంగా అవడం కానేకాదు . భగవంతుడి సన్నిధి చేరడం అంటే తిరిగి విశ్వ రాజ్యాధికారిగా  ఉన్నతమైన  జన్మలు ఎత్తే భాగ్యం కలిగి ఉండడం .


• మనిషి తాను ఒక శరీరం అనే భావన కంటే తాను ఒక ఆత్మ మరియు శక్తి అనే సత్యమైన స్థితి లో ఉన్నప్పుడు మాత్రమే పరమాత్ముడు  ఒక  శక్తి స్వరూపం అనే అనుభవం పొంది …. భగవత్ శక్తి స్వీకరించగలడు , తద్వారా సత్కర్మలు ఆచరించగలడు .


జీవితం లో  మనకు అన్నీ దొరకక పోవచ్చు. కానీ దొరికిన వాటి విలువ తెలుసుకుంటే  జీవితం చాలా అందంగా ఉంటుంది.


• Written by the Energies Conjunction of KARMIC planet SATURN 🪐 and Past Lifes Spiritual Mastery experienced planet KETU .


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

ఆత్మ  ✍️ 13 May 2026 1:50 AM.


Friday, May 8, 2026

742 .భగవంతుడు మనిషి తో మాట్లాడితే ?

 

భగవంతుడు మనిషి తో మాట్లాడితే ?





• భగవంతుడు మనుషులతో మాట్లాడితే ? . . . 

• అవును భగవంతుడి కోసం ఎన్నో ప్రార్థనలు, పూజలు, వ్రతాలు , ఉపవాసాలు, మొక్కులు ఎన్నో ఎన్నెన్నో మనిషి చేస్తుంటాడు . ఎందుకంటే భగవంతుడితో మనిషి కి అనేక అవసరాలు ఉన్నాయి . కానీ ఎంత భక్తి చేసినా, ఆ విగ్రహాంలో ఉన్న మూర్తి ఎందుకని మాట్లాడడం లేదు . కాలం గడుస్తుంది కానీ మనిషి సమస్యలకు, దుఃఖాలకు పరిష్కారం లభించడం లేదు సరికదా నానాటికీ ఎందుకు పెరుగుతున్నాయి . మరి మనిషి ఆంత ప్రాధేయపడి , బోలెడు ధనం వెచ్చించి భగవంతుడు కోసం ఎన్నో చేస్తున్నప్పుడు, కనీసం భగవంతుడు మాట్లాడాలి  కదా  ?


• కానీ  . . .  భగవంతుడు మనిషి తో మాట్లాడడు ,  ఎందుకంటే  ఆయన కి  భయం , ఆయన  మనిషి తో మాట్లాడితే ,  మనిషి  చాలా  బాధపడతాడు  అనే  భయం. అసలే  దుఃఖాల లో ఉన్న మనిషి మరింత దుఖితుడు గా అయిపోతాడు అనే జాలి . అందుకే  భగవంతుడు మౌనం గా ఉండి పోతాడు.

అయినా ,  భగవంతుడు మాట్లాడితే మనిషి ఎందుకు  బాధపడతాడు ,  ఇంకా సంతోష పడతాడు కదా  ?


• కలియుగంలో మనుషులందరూ అమాయకులు . ఎంత అమాయకులు అంటే  . . . 

మేడిపండు చూడ నోరూర 

పొట్ట విప్పి చూడ పురుగులుండ 

అనే చందాన ఉండడం . . . . నీతి , ధర్మం , నిజాయితీ , నిస్వార్థం అంటూ  వేదాలు వల్లిస్తారు . కానీ ఆచరించే వారు అరుదు . సత్యమే మాట్లాడాలి అంటారు . కానీ నిజం మాట్లాడే వారు అరుదు . మంచి ఆలోచనల తో జీవించాలి అంటారు , కానీ మనసు లోతుల్లో కి  వెళితే   చీకటి కోణాలు, వ్యవహారాల తో   ఎన్నో ఆలోచనలు నిండి పోయి ఉంటాయి .

• మానవ సంబంధాలు , బంధుత్వాలు , స్నేహ సాంగత్యాలలో  భ్రష్టు పుష్కలంగా పేరుకు పోయి ఉందని , ఎన్నో అనుభవాలతో మనిషి స్పృహ కి ఒక వైపు స్పష్టం గా  అర్దం అవుతుంది , మరో వైపు ఆ మత్తు నే  కోరుకుంటాడు . ఎందుకంటే అదొక మానసిక దుర్బలత . అందులో నే  కావలసిన ఎన్నో ఆనందాలు కాలక్షేపాలు , psychic  emotions లాంటివి  వెతుక్కుంటాడు . మనిషికి  మనిషికి మధ్య  మనసు లో ఆత్మీయత ఉండదు, కానీ ఆలింగనాలూ, కరచాలనాలు , విషపు నవ్వులు మెండుగా  ఉంటాయి .  అన్ని విధాలా మానసికంగా పతనం అయిపోయిన మనిషి నైతికంగా స్టేటస్ , వస్తృ వేషధారణ , హావభావాల హుందా తనం ప్రదర్శిస్తాడు . ఇదంతా కలిపి కలియగపు మనిషి అమాయకత్వం .  

• ఆలుమగలు గృహస్థ ధర్మం ఆచరిస్తాం అని పెళ్లి నాడు ,  అగ్ని సాక్షిగా ప్రమాణాలు చేస్తారు . అక్రమ సంబంధాలే  నేడు అధికంగా సక్రమ సంబంధాలు గా  మారుతున్న మనిషి పరిస్థితి ఒక దుస్థితి .  మానసిక వ్యభిచారానికి మనిషి దాసోహం అయిన , వేళ , ఏదీ తప్పు కాదు అంతా సహజం అనుకునే ఆలోచనలతో సర్దుకుంటున్నాడు . ఎందుకంటే మనిషి కి కావలసినంత స్వేచ్చ  లభిస్తుంది కాబట్టి.

• వ్యాపార ధర్మం ఆచరిస్తాను  , అని ఆరంభంలో భగవంతుడి సాక్షి గా పూజ చేస్తాడు. కల్తీ లలో తన మునక లేస్తుంటాడు .

• వృత్తి ధర్మం పాటిస్తాను అని సంతకాలు చేసి అపాయింట్మెంట్ లెటర్ తీసుకుంటాడు . లంచగొండి వ్యవహారాలు, కమీషన్లు సర్వ సాధారణం గా భావిస్తాడు .

• ఒకటేమిటి విద్య, వైద్యం అన్నింటా ఎటు చూసినా దోపిడీ, దురాగతాలు. ఇవన్నీ మనిషే అలవోకగా గుట్టు చప్పుడు కాకుండా, మూడో కంటికి తెలియకుండా తన మనసు లోని ఆలోచనల తో భద్రం గా  జాగ్రత్తగా  ఒక క్రమశిక్షణా పద్దతి లో చేస్తుంటాడు . అందులో మనిషి ఆరితేరిపోయాడు. అయినా ఇందులో తప్పేముంది, ఇదంతా మోడ్రన్ , ఆధునిక సమాజం లో ఇవి  సహజం అని అమాయకత్వం గా అనుకునే తత్వాన్ని బాగా వృద్ధి చేసుకున్నాడు మనిషి . దీనికి కారణం అవసరానికి మించిన ధనం కలిగి ఉండడం . 


• నేడు మనిషి చాలా అమాయకుడు. ఎంత అమాయకుడు అంటే , తాను చేసిన తప్పులు , పొరపాట్లను  బయట పడిన సందర్భాలలో  , ఒకవేళ ఎవరైనా సహచరులు గాని , కుటుంబీకులు గానీ , శ్రేయోభిలాషులు గాని , మిత్రులు గాని సరిచేయాలని చూస్తే అటువంటి వారి ని నిందించడం , దూషించడం అవసరమైతే హత్య చేయడానికి కూడా వెనుకాడని స్థితి లో మనిషి ఉన్నాడు . ఎందుకంటే అది  తన పరువు , అహంకారానికి సంబంధించిన అంశం కాబట్టి .


• ఇక్కడ గమనిస్తే ప్రతీ అంశం లో కూడా మనిషి అమాయకుడే . ఎందుకంటే ఇతరులను నమ్మించడం లో  ఆరితేరి పోయి , మాటలను మార్చడం లో తన నాలుక చేసే నాట్యానికి ముగ్ధుడై . . .  పాపం తన అమాయకత్వానికి తానే ఆనందపడుతూ  ,  రోజూ గుడికి  వెళ్ళి  భగవంతుడికి  వాటాలు ఇస్తూ తాను  అమాయకుడిగా   భావిస్తాడు.


•  మనిషి ని   సృష్టించిన  భగవంతుడికి ,  ప్రతి మనిషి యొక్క బుద్ధి  ఆలోచన  వ్యక్తిత్వం  సంస్కారం ఇలాంటివి ఏమీ తెలియదా ? . . . అంటే తెలుసు.

తెలుసు, కనుకనే  ఆయన ఎవరితోనూ మాట్లాడడు. ఒకవేళ భగవంతుడు  మాట్లాడితే సత్యమే మాట్లాడుతాడు . సత్యం తప్ప మరొకటి భగవంతుడికి తెలియదు . మనిషి బుద్ధి లో ని లోపాలను , చేసే పాపాలను కళ్ళు కు కట్టి నట్టు వివరించి  చూపించి కర్మలు లెక్కలు సూక్ష్మంగా వేసి చెపుతాడు .  మరి  , భగవంతుడు చెప్పే , ఆ సత్యం  మనిషికి  రుచిస్తుందా ? జీర్ణించుకోగలడా ?.


భగవంతుడు  నేటి కాలంలో మనిషి గురించి సత్యం మాట్లాడితే , వెంటనే మనిషి తిరిగి తనను దూషిస్తాడని , తనపై కత్తి దూస్తాడని  భయపడి మాట్లాడకుండా , రాయి లో మౌనం గా ఉండిపోయి మనిషి నటనను చూస్తూ ఉంటాడు భగవంతుడు . ఎందుకంటే , లోపాలు సరి చేయాలనుకున్న  తోటి మనిషి  పైనే  విధ్వంసం సృష్టించే మనిషికి . . . అదే మనిషి గురించి నిజాలు చెబితే తనను ఇంకేమి చేస్తాడో  అని భగవంతుడికి విపరీతమైన భయం ఉంటుంది .


• కానీ , అదేంటో విచిత్రం, గుట్టు చప్పుడు కాకుండా చీకటి ఆలోచనల  వ్యవహారాల తో , ధర్మ బద్ధం కాని ధనంతో, బుద్ధి హీనత తో ఎన్నో రకాలు గా మనిషి జీవిస్తూ , భగవంతుడికి వాటాలు సమర్పిస్తూ , భగవంతుని  కార్యాలు చేసెస్తూ  , . . . సమాజ సేవ అంటాడు. ఆ ముసుగులో  పబ్లిసిటీ ,  పేరు , కీర్తి , గుర్తింపు కోసం తహతహలాడుతాడు  మనిషి .


• భగవంతుడు  అనే పేరు తో  ఎన్ని  సేవా కార్యక్రమాలు చేసినా . . . ధర్మబద్ధం కాని పైసాను , మనో శుద్ది లేకుండా  చేసే  భగవత్ కార్యాలను భగవంతుడు అణువంత కూడా స్వీకరించడు . ఇది పరమ సత్యం . భగవద్గీతలో చెప్పబడింది . ఆ కార్యక్రమాల భాగ్యం మనిషి పుణ్య ఖాతాలో జమ కానే కాదు . ఎందుకంటే భగవంతుని కి , మనిషి నుంచి కావలసింది  పవిత్రత , మనో శుద్ది , శుద్ద మైన ప్రేమ ,  కల్మషం ఎరుగని అమాయకత్వం .  


• మనిషి గురించి సర్వస్వం సమస్తం తెలిసిన భగవంతుడు , నేడు మనిషి మానసిక పరిస్థితిని చూసి జాలిపడే స్థితి లో ఉన్నాడు . ఎందుకంటే మనిషి చాలా అమాయకుడు. ఎంతగా అంటే, తనను తాను అనుక్షణం మోసం చేసుకుంటున్నాను అనే విషయం మరచి ఇతరులను మోసం చేస్తూ , ఈ మాయా ప్రపంచం లో ఏది తప్పు ఏది ఒప్పు , ఏది సత్యం ఏది అసత్యమో తెలియక , మితి మీరిన ధనం వలన సమస్తం నాకే తెలుసు అనే అహంకారం లో చిక్కుకు పోయాడు .


భగవంతుడికి , నేటి కలి కాలపు మనిషి యొక్క మానసిక స్థితి , పరిస్థితి,  కొన్ని యుగాల క్రితమే తెలిసి  . . . త్రేతా, ద్వాపర యుగాలలో  బుషులు, మునులు జ్ఞానుల ద్వారా  రామాయణం , భారతం , పురాణాలు , ఇతిహాసాలలో   పాత్రల ద్వారా ఎలా జీవించాలో రచించాడు . నేడు ఆ గ్రంధాలను పూజించడం మినహ అందులో ఉన్న ప్రతి పాత్ర తనదే అని మనిషి గ్రహించే పరీశీలనా శక్తి కూడా నేటి మనిషి కి లేదు. ఎందుకంటే నేటి మనిషి  చాలా అమాయకుడు .


• ఈ ప్రపంచంలో  ఏ మనిషి  మరో  మనిషి కోసం జీవించడు . ప్రతి మనిషి తన అవసరాల కోసమే ఒక అమాకుడిలా  నటిస్తూ జీవిస్తాడు . ఎందుకంటే మనిషి లోని అపారమైన తెలివి తేటలు అన్నీ కూడా నటన లో ఆరితేరడానికే  సరిపోతుంటాయి … అందుకే మనిషి ఒకే మాటను మార్చి మార్చి నలుగురికి నాలుగు విధాలు గా మాట్లాడుతుంటాడు . ఇందులో సిద్ధహస్తుడు , ఏ ఎండకు ఆ గొడుగు పడుతుంటాడు . నేడు బ్రతకాడానికి ఇంతకంటే గత్యంతరం లేదు .


• ఎన్నో అమ్ముకోవడానికి  అలవాటు పడిన మనిషి మనస్సాక్షి ని కూడా అలవోకగా అమ్ముకోవడానికి ,  తాకట్టు పెట్టుకోవటానికి తనకు తెలియకుండానే అలవాటు పడిపోయాడు. ఎందుకంటే మనిషి అమాయకుడు .

• ఎన్నో కొనడానికి అలవాటు పడిన మనిషి , తనకు అవసరమైన,  తన స్వ ధర్మాలైన  శాంతి , సుఖం , ప్రేమ , జ్ఞానం , పవిత్రత , ఆనందం   ఎక్కడా  కొనలేక పోతున్నాడు . ఎందుకంటే  మనిషి చాలా అమాయకుడు కాబట్టి వాటి గురించి తెలియదు .

అందుకే భగవంతుడు తిరిగి మనిషి తో మాట్లాడడానికి భయపడుతున్నాడు . . . 


• భగవంతుడి కి తెలుసు . . . మనిషి , పూర్తిగా మాయకు వశం అయి పోయి జీవిస్తున్నాడని . అందుకే భగవంతుడు కలియుగాంతం లో , ధర్మం పూర్తిగా నశించి నపుడు భూమి పై అవతరిస్తాను అని భగవద్గీతలో చెప్పిన విధంగా అవతరించి నేటికీ 90 సంవత్సరాలు అయింది . కలియుగం అంతం కూడా ఆరంభం అయింది . అందులో భాగంగానే కరోనా లాంటి వైరస్ లు , ప్రపంచం నలువైపులా యుద్ధాలు. ఇది ఆరంభం మాత్రమే. పూర్తి స్థాయి వినాశనానికి ఇక మిగిలింది 10 సంవత్సరాలు లోపు కాలం మాత్రమే.


తనను తాను తెలుసు కోవడం లో ,  లోపాలను సరిచేసుకోవడం లోనే  మనిషి  ఉన్నతి   కాగలడు. ఎందుకంటే, మరణం తరువాత తిరిగి శ్రేష్టమైన జన్మ ఎత్తాలి అంటే  తప్పని సరిగా స్వీయ ఉన్నతి అవసరం . 


Written by the Energies Conjunction of KARMIC planet SATURN 🪐 and Past Lifes Spiritual Mastery experienced planet  KETU .

 

ఓం శాంతి 🙏

ఓం నమః శివాయ 🙏.

• ఆత్మ ✍️ , 7 May 2026 11:30 PM .



Tuesday, May 5, 2026

741. వైరాగ్యం జన్మకు సూర్యోదయం

 

  వైరాగ్యం జన్మకు సూర్యోదయం 



• మనం అనేక సార్లు వైరాగ్యం గురించి ఇలా అనుకుంటాం . వైరాగ్యం అంటే విరక్తి , నిరాశ వాదం సర్వస్వం కోల్పోయినట్లు ఉండడం  .

  అసలు వైరాగ్యం అనే పదం జ్ఞానం యొక్క పరిపక్వత తో  ఆవిర్భవించిన అనుభవం . “జ్ఞానం” అంటే ఏది సత్యమో , ఏది అసత్యమో  ఆధార భరితంగా, అనుభవ పూర్వకంగా  మనకు  అర్దం  కావించేది .


• మనుషులం అయిన మనం ఈ  మాయా ప్రపంచం లో , మాయ తో కలిసి జీవిస్తున్నాం  అనే  విషయం తెలియకుండా నే జీవిస్తున్నాం . అదే మాయ యొక్క మహిమా శక్తి .   అందుకు ఉదాహరణ నీతి , నిజాయితీ , సత్యం అంటూ  ఎన్నో విషయాలు మాట్లాడుతాం , చెపుతాం కానీ ఆచరణలో మాత్రం ఉండవు .  అదే మాయ ,   మాయా ప్రపంచపు ప్రభావం . 

 ఇక్కడ ఉన్నది అంతా నిజం అని పరిగెడుతూ, వెంపర్లాడుతూ  మనల్ని మనం మరచి పోయి, మనలో మనకు  ఉన్నది   మనకు మేలు  చేసేది ఏదో తెలియక , లేని దాని కోసం అర్రులు చాచి , చివరికి పుణ్యకాలం అంతా గడిపెస్తాం  . దీనినే అజ్ఞానం అంటారు . దుఃఖానికి , సమస్యలకు , చెడు కర్మలకు ఇదే బీజం.


• జ్ఞానం  సత్యాన్ని , నిజాన్ని తెలియచేస్తుంది , చూపిస్తుంది .‌ భక్తి లో ఇది సాధ్యం కాదు . జ్ఞానం ఏనాడైతే ఆకళింపు అవుతుందో , అది వైరాగ్యాన్ని కలుగ చేస్తుంది. వైరాగ్యం అంటే అన్నీ వదలి వేయడం కాదు .  సూక్ష్మ స్థితి తో  మనకు ఏది అవసరమో దానితో ఉండడం వైరాగ్యం  . శరీరం తో అన్నింటా ఉంటూ మనసు ను అన్నింటికీ అతీతంగా చేసుకోవడం వైరాగ్యం . ఎప్పుడైతే మనసు అన్నింటికీ అతీతంగా అవుతుందో , ఆ మనసు ప్రత్యక్షం గా  ముడిపడేది  భగవంతుని తో నే .


• వైరాగ్యం వలన పొందే ఆనందం, సంతోషం వర్ణించలేనివి .  మానవుడు ఈ ఆనందం , సంతోషం కోసమే  ఎన్నో మార్గాలు వెతుక్కుంటూ , నేడు వికారాలతో   కుప్పిగంతులు వేస్తూ , విలాసాల మైకం లో   అనారోగ్యం పాలై  చివరికి వికారిగా , బికారి గా మరణిస్తున్నాడు . ఇదంతా మాయా ప్రభావం. 

దురదృష్టం  ఏమిటంటే సంతోషం ఆనందం అనేవి మనిషి  మనసు లో నే అనాది గా కప్పబడి ఉండిపోయాయి అనే విషయం తెలియకపోవడం .


• గమనిస్తే . . .  బ్రహ్మ సరస్వతి , విష్ణువు లక్ష్మి దేవి లను బురదలో ఉన్న కమలపుష్పం లో చూపిస్తారు . దీనికి అర్దం , కలియుగ ప్రపంచం అంతా మాయ అనే బురద తో నిండి ఉంటుంది అని .  మాయా అనే బురదలో కూరుకు పోకుండా మనిషి తన లో దాగి ఉన్న దివ్యత్వాన్ని తిరిగి ఎలా పొందాలో తెలియ చేసేది శివ పరమాత్ముని జ్ఞానం . దీనినే గీతా జ్ఞానం అంటారు . భక్తి మార్గం లో ఇదే విషయాన్ని శివుడు దక్షిణామూర్తి రూపంలో చెపుతున్న విధంగా  శాస్త్రాలలో చూపిస్తారు .


• జ్ఞానం  ప్రతి మనిషి కి అవసరం . బుద్ధి, ఆలోచన సవ్యం గా , స్థిరంగా , ఏకాగ్రం గా ఉన్న నాడు జ్ఞానం యొక్క అసలు స్వరూపం తెలుసుకొని అర్దం చేసుకొని  అనుభవించ గలం . మనిషి యొక్క అన్ని సమస్యలకూ జ్ఞానం లేకపోవడం కారణం . మాయ ఆడించే  ఆటకు మనిషి ఏనాడో దాసోహం అయిపోయాడు . మాయ కూడా , భగవంతుని వలే చాలా శక్తి వంతమైనది . అందుకే మనిషి , అంత త్వరగా  తన లో గాని, తన చుట్టూ ఉన్న మాయను గ్రహించలేడు  జయించలేడు .


• శివుని గీతా జ్ఞానం లభించిన నాడు త్రికాల దర్శనం , త్రికరణ సిద్ధి లభిస్తుంది. అప్పుడే మన చుట్టూ ఉన్న శత్రువులతో పాటు మనలో ఉన్న శత్రువులు స్పష్టం గా కనిపిస్తారు .

 విచిత్రమైన విషయం ఏమిటంటే, ఏనాడైతే మనిషి జ్ఞానం తెలుసు కోవడం ఆరంభిస్తాడో , ఆనాడే మాయ మరింత ఫోర్స్ గా   ఏదొక రూపం లో  అనగా  , వ్యక్తి  ఆకర్షణ   లేదా  వస్తు ,  ధనం , వ్యామోహం  రూపంలో  లేదా  బంధన  రూపం లో  వెంట పడుతుంది . 

 ఈ విషయాన్ని మనకు ధృవీకరణ చేసేందుకు , విశ్వామిత్రుడిని భంగపరిచేందుకు  లో రంభ ఊర్వశి మేనకలు  మాయ రూపం లో  వచ్చారు అని పురాణాల లో చెప్పారు .  

అదే విధంగా సీతాదేవి అకస్మాత్తుగా మాయా లేడి  పట్ల ఆకర్షితమై , దాని వెంట పడి రావణాసురుడికి  దొరికిపోయింది.  అని రామాయణం లో చెప్పారు . 

 ఇది పరమ సత్యం .


• జ్ఞాన మార్గం లేదా  సంపూర్ణ  దైవిక ప్రయాణం ఆచరించే వారి పై మాయ ఎనలేని ప్రేమను చూపిస్తూ తవ వైపు ఆకర్షిస్తూ పాతాళానికి పడేయాలి అని చూస్తుంది . కానీ , జ్ఞానులు మాయా జీవులను కూడా భగవంతుని జ్ఞానం తో జయించ గలరు .

 మాయ ,  మనిషి లోని బలహీనతల రూపం లో కూడా ఉంటుంది . మాయ చాలా సూక్ష్మంగా ఉంటుంది. అదే మనిషి పతనానికి కారణం అని మనిషి కూడా తెలియకుండా ఎన్నో జన్మలు గడిచిపోతాయి .  మాయ అంటే అసత్యం. నిజం కానిది . 


• ఏదైతే మనం రెండు చేతులు ఎత్తి భగవంతుని కి మొక్కుతూ ఉంటామో, భగవంతుని కోసం దిక్కు లేని వారిగా కొండలు కోనలు ఎక్కుతూ తిప్పలు పడుతూ ఉంటామో , అదంతా మాయ వలన మనిషి కి కలిగిన దుస్థితి . ఎందుకంటే , మనం శివుని సంతానం అనే విషయాన్ని , మరచి పోయేలా మాయ చేసింది . అందుకే అనాధల వలే భగవంతుడు అయిన తండ్రి కోసం ఆర్తి తో వెతుకుతూ ఉంటాం .

• జ్ఞానం ద్వారా తెలియవచ్చిన  సత్యం ఆచరించినపుడు ప్రకృతి, సృష్టి, విశ్వం మనకు కావలసిన శక్తి ని ఇవ్వడం ఆరంభిస్తాయి . జ్ఞాని ఎన్నడూ ఆడంబరంగా జీవించడు  . ఎందుకంటే జ్ఞానికి  వైరాగ్యమే  ఊపిరి  .

అందుకే నేను అంటాను , వైరాగ్యం జన్మ కి సూర్యోదయం అని .  వైరాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం . అన్నింటా ఉంటూనే , వాటిని మనసు కి అంటక అతీతమైన స్థితితో జీవించడమే వైరాగ్యం .

ఆధ్యాత్మిక చింతన , స్పృహ కలిగిన వారికి మాత్రమే ఈ రచన .


 ఓం శాంతి 🙏

 ఓం నమః శివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 5 May 2026 1:00 PM


Wednesday, April 29, 2026

740 . ఇతరుల విజయం మన సంతోషం

 


ఇతరుల విజయం మన సంతోషం 



మనం ఇతరుల విజయాన్ని చూసి మనస్ఫూర్తిగా సంతోషించినప్పుడు, మనలో ఉన్న పోలికల ధోరణి (Comparison) అంతమవుతుంది మరియు మన జీవితంలో కొత్త అవకాశాల తలుపులు తెరుచుకుంటాయి.

ఇతరుల కోసం చప్పట్లు కొట్టినంత మాత్రాన మనం ఏ మాత్రం తక్కువ అయిపోము , మన హృదయం, మన ఆలోచన మరియు మన జీవితం మరింత విశాలమవుతాయి.

ఇతరుల సంతోషాన్ని మనం మనస్ఫూర్తిగా అనుభూతి చెందినప్పుడు, అదే సానుకూల శక్తి (Energy) మన జీవితంలోకి కూడా ప్రవహించడం మొదలవుతుంది.

చాలా సందర్భాల్లో ఇతరుల విజయాలను, వ్యక్తిత్వాన్ని బయటకు ప్రశంసిస్తూ నే , మనసు లో భారంగా ఉంటారు. దీనికి కారణం మనలోని నెగెటివ్ శక్తులైన ఈర్ష్య ద్వేషం. మనం బయటకు చక్కగా నటించినంత లో మనం ఉన్నతులుగా గుర్తించబడలేం సరికదా మన మనో స్థితి ఉన్నతం కాకుండా మనకు మనమే నిరోధకాలుగా అవుతూ మన విఘ్నాలకు మనమే కారణం అవుతాం . అందుకే విశాల హృదయులు గా కావడం మనలో మనకి చాలా ముఖ్యం.

గుర్తింపు కోసం, మంచి వారిగా అనిపించు కోవడం ఇతరులను ప్రశంసించడం మంచిది కాదు. మనసు కు స్వయం గా అనిపించిన నాడే , ఇతరుల ను ప్రశంసించడం మేలు .

ప్రశంస , పొగడ్త రెండూ ఒకేలా అనిపించినా, ఒకటి కావు. పొగడ్త లో అతిశయం, స్వలాభపేక్ష , ఉద్వేగం దాగి ఉంటాయి , ఒక పొగడ్త ఇతరుల కోసం చేసినపుడు, మనం  తిరిగి ఏదో ఒకటి ఆశించడం, కోరుకోవడం అనేది అంతర్లీనంగా జరుగుతుంది .

ప్రశంస , శరీరానికి అతీతంగా మనసు లోతు నుంచి సహజంగా వస్తుంది. ఇతరుల విజయం మన విజయం గా  అనుభవించినపుడు  సహజమైన సంతోషం తో  ప్రశంస పుడుతుంది. ఒకరిని  ప్రశంసించడం  ద్వారా మనలో  సంతోషం రెట్టింపు అవుతుంది . సంతోషం ఇతరులకు ఇవ్వడం తో పాటు , తిరిగి వారి నుంచి వచ్చిన వైబ్రేషన్స్ మనల్ని , మనలోని సంతోషాన్ని సుధీర్ఘంగా ఉండేలా చేస్తుంది.


మనిషి జీవితమే ఒక నటన . కానీ అందులో మనం సహజ నటులు గా ఉంటేనే తేలికగా ఉండగలం .

కానీ, జీవితం అనే నాటకం లో , మనం మరింత జటిలమైన నటులు గా మారితే మన జీవిత డ్రామా చాలా చిక్కులు తో నిండి  రసవత్తరం కాకుండా పోతుంది. ఒకానొక సందర్భంలో సరియైన డైరెక్షన్ మనకు మనం చేసుకోలేక విఫలం అయి అతలాకుతలం అవుతాం .

మంచి డ్రామా చరిత్ర లో నిలిచిపోతుంది. అలాగే జీవిత నాటకంలో మనం పోషించే పాత్ర ఎంత సహజంగా ఉంటే , మన ఆత్మ కి అంత సంతృప్తి లభిస్తుంది.

ఇతరుల లో చెడు గుణాలు లక్షణాలను మనం ఎంతగానో అసహ్యించు కుంటాం. వారితో కలవడానికి ఇష్ట పడం. వారి విషయాలను ఇతరులతో చర్చిస్తాం.

అదే విధంగా , మన లోని బలహీనతలను , అవ లక్షాణాలను ఇతరులు కూడా అసహ్యించు కుంటారనే విషయం మనం గమనించాలి. అంత కంటే ముందు మన అవ లక్షాణాలను మనమే గుర్తించి వాటిని అసహ్యించు కోవడం నేర్చు కోవాలి. ఇలా ఆత్మ విమర్శ చేసు కోవడం వలన ఇతరులు మనల్ని అసహ్యించు కొనే పరిస్థితి మన జీవితంలో తలెత్తకుండా ఉంటుంది .


నిశ్శబ్దం తో కూడిన సంతోషం , నీ అంతర్ముఖాన్ని తేజోవంతంగా చేస్తుంది .  సంతోషం మనలో నిలిచి ఉండాలి అంటే , ఇతరుల ను సంతోషంగా ఉంచాలి. అందుకోసం మనం ఎవరినీ కీర్తించనవసరం లేదు. కేవలం సత్య మైన  మనసు తో  పెదవి విప్పి  చెప్పే ప్రశంస చాలు. నిశ్శబ్దం తో కూడిన సంతోషం నీ కే సొంతం. 

పొగడ్తలు ప్రమాదకరం. 

ప్రశంసలు  ఆరోగ్యకరం.


యడ్ల శ్రీనివాసరావు 30 Apr 2026  6:00 AM.


746. శ్రీకృష్ణోపదేశం - కలియుగాంతం

   శ్రీకృష్ణోపదేశం  - కలియుగాంతం • ఒకసారి శ్రీకృష్ణుడు , పాండవుల కు సృష్టి మరియ యుగాల గురించి ఉపదేశిస్తూ కలియుగం ఆరంభం గురించి వివరించ...