Wednesday, March 18, 2026

731. యుగాది

 

యుగాది



• ఉగాది   ఉగాది

  యుగముకి   జీవం  పోసే   ఆది .

• యుగములు    నాలుగైనా

  ఉగాదులు   మాత్రం   ఎన్నో . . . ఎన్నెన్నో…


• ఉగాది    ఉగాది

  యుగముకి    జీవం  పోసే   ఆది .

• ఈ  కాలం  లోని    సౌందర్యం

  మనసు   కోరుకునే    ఔషధం .

• ఈ  సమయం  లోని   సంతోషం

  మనిషి    అనుభవించే   ఇంధనం .


• ఉగాది    ఉగాది

  యుగముకి   జీవం   పోసే   ఆది .

• మామిడి    చిగుళ్ళు

  మది   పచ్చదనానికి   తోరణాలు  .

• కోయిల     సవ్వళ్లు

  శ్రవణ    సొంపుల    తరంగాలు .


• ఉగాది    ఉగాది

  యుగముకి    జీవం  పోసే  ఆది .

• యుగములు     నాలుగైనా

  ఉగాదులు   మాత్రం    ఎన్నో . . . ఎన్నెన్నో…


• భావోద్వేగాల    సంబరం 

  షడ్రుచుల        మేళనం .

• కొత్త  ఆశల      అంబరం 

   రాశిఫలాల      రాజసం .


• పంచాంగ    శ్రవణం 

  పంచభూతాల    ఆశీర్వాదం .

• ఈ ఆచారాల    సాంప్రదాయం

  తెలుగు  సంస్కృతి     ఉల్లాసం.


• ఉగాది      ఉగాది

  యుగముకి    జీవం  పోసే   ఆది .

• యుగములు    నాలుగైనా

  ఉగాదులు  మాత్రం   ఎన్నో . . . ఎన్నెన్నో…


• బుతువుల    బుణానుబంధం

  ఈ వసంతాల    వైభోగం .

• ఉగాది    ఉగాది

  యుగముకి   జీవం   పోసే   ఆది .



ప్రపంచ వ్యాప్తంగా 

" గోదావరి గలగలలు "  బ్లాగు ను 

ఆదరిస్తున్న తెలుగు వారందరికి 

నా హృదయ పూర్వక 

కృతజ్ఞతలు 🙏

  ఉగాది శుభాకాంక్షలు 💐 .


ఓం శాంతి

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 18 March 2026 , 9:00 PM.



Tuesday, March 17, 2026

730. యజ్ఞం దాహం

 

యజ్ఞం  దాహం 



ఒక ఊరిలో యజ్ఞం జరుగుతోంది యజమానికి యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది. ఆయన ఆశ్చర్యపోయాడు .

అప్పుడు భార్య ఇలా చెప్పింది.

“నిన్న పొరపాటున యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాను . అదే ఈ రోజు బంగారు ముద్ద అయింది.”

ఇంటి యజమాని పరీక్షించేందుకు తానూ యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాడు .

మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది.

ఈ వార్త ఆనోటా ఈ నోటా పాకింది. అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞ కుండంలో ఊసేశారు . బంగారు ముద్దలు పొందారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.


“యజ్ఞం పవిత్రమైనది. యజ్ఞ కుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం. నా కర్తవ్యం. బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే  బద్దలైనా  నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు” అన్నాడాయన.


 ఊరు ఊరంతా ధనవంతులయ్యారు . ఒక్క అర్క సోమయాజి తప్ప.

ఆయన భార్యకు ఇది నచ్చలేదు.

“మనమూ ఉమ్మేద్దాం . బంగారం పొందేద్దాం” అని నచ్చచెప్పింది .

అర్కసోమయాజి  ససేమిరా అన్నాడు.

చివరికి ఆమె కోపంతో పుట్టింటికి పయనమైంది .

ఆమెకు నచ్చచెబుతూ అర్క సోమయాజి కూడా ఆమె వెనకే వెళ్లాడు.

ఊరి పొలిమేర దాటాడో  లేదో... ఊళ్లో పెద్దగా గొడవలు మొదలయ్యాయి. బంగారం ముద్దల పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇళ్లు కాలిపోతున్నాయి . మనుషులు చచ్చిపోతున్నారు. మొత్తం ఊరు ఊరు బూడిదైపోయింది. ఒక్కరూ మిగల్లేదు.

అర్క సోమయాజి, ఆయన భార్య తప్ప.


అప్పుడే *కలిపురుషుడు* వారికి ఎదురు వచ్చాడు.

ఇన్నాళ్లూ నువ్వున్నావనే ఊరిని వదిలేశా. ఊరు ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా, నువ్వు, నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది.

అందుకే నువ్వు ఊళ్లో ఉన్నంత సేపూ ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేయగానే నాపనిని నేను చేసి, ధర్మ హీనులను ధ్వంసం చేశాను. అన్నాడు కలిపురుషుడు.

...*ధర్మం తప్పని వాడు ఎప్పుడూ విజేతే*...

ధర్మం ఆచరించే వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు అయినప్పుడు అది చూసి కొందరు మూర్ఖులు నవ్వుతూ హేళన చేస్తూ రాక్షసానందం పొందుతారు ...

కానీ చివరకు  *ధర్మమే గెలుస్తుంది* ...

II ధర్మో రక్షతి రక్షితః II.

పై కధ  రాసిన  రచయిత కి  మనస్ఫూర్తిగా ధన్యవాదాలు .🙏


ప్రతి  మనిషి  ఆలోచనల తోనే  కర్మలు చేయడం ఆరంభిస్తాడు  .  ఆ ఆలోచనలే  ఒక శక్తి  అయి  తన చుట్టూ ఒక (ఆరా) వలయం వలే ఏర్పడుతుంది.   ఈ ఆలోచనలు మంచివి లేదా చెడువి  ఏవైనా అయి ఉండవచ్చు. 

ఉదాహరణకు  పాజిటివ్ ఆలొచనలు కలిగి ఉండి , ధర్మ యుక్తం గా మనిషి  కర్మలు ఆచరిస్తున్నపుడు   తనలోని ఆరా తనకు మరియు  తన చుట్టూ ఉన్న కుటుంబీకులకు , సమాజం లోని అందరికీ ఒక రక్షణ కవచం వలే ఏర్పడి , నీడ వలే ఉంటుంది . ఇక్కడ  అర్దం చేసుకో వలసిన విషయం , మంచి  అనేది   చెడు ను కూడా సంరక్షిస్తుంది.  

ఏనాడైతే మంచి అనేది  దూరం అవుతుందో , అప్పుడు చెడు స్వైరవిహారం  చేస్తుంది , పిదప చెడు తనను తానే  శిక్షించుకొని  చివరికి  భక్షించు కుంటుంది .  అదే  కలిపురుషుడు  లీల .

మంచి  అనేది  చెడుని ఆకళింపు చేసుకుని ఉండగలదు. మంచి లో ఉండేది  భగవంతుని శక్తి .  అందుకే భగవంతుడు అయిన శివుడు తారతమ్యం ఎరుగక  అందరినీ ఆదరిస్తాడు .  అందరినీ మంచి గా మార్చడానికి కావలసిన శక్తిని ధారణ చేస్తాడు .

చెడు మాత్రం  మంచి తో   కలిసి  సుధీర్ఘంగా ఉండలేదు. చెడు లో  ఉండేది అసుర శక్తి . అందుకే అసురుడు అయిన రావణుడు ,   శివుని (మంచి) చెంత  చేరినప్పటికిని  తన బుద్ధి హీనత వలన  కామాంధుడై  చివరికి శివుని (మంచి) విడిచి  పోతాడు .

మంచి కి   ,  చెడు కు   ఉన్న   భేదం  ఇదే .

మంచి చెడు అనేవి మనుషుల లో ఉండే గుణాలు మరియు  లక్షణాలు . మనుషులు ఎంచుకున్న  స్నేహాలు , సాంగత్యాల లో  కూడా ఇవి ప్రస్ఫుటంగా  కనిపిస్తాయి .  అందుకే అనుభవజ్ఞులైన పెద్దవారు  అంటారు ,  నీవు ఎలాంటి వాడివి  అనేది , నీ  స్నేహితులను , నీ సాంగత్యాలను  చూసి  చెప్పవచ్చు  అని . . . 


ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 17 March 2026 , 8:00 PM.


Sunday, March 15, 2026

729. శకునాలు - మూఢనమ్మకాలు

 


శకునాలు - మూఢనమ్మకాలు


చెడు శకునాలు మరియు మూఢనమ్మకాల ప్రభావం నుండి అతీతంగా అవ్వండి.

కొన్ని గ్రహాలు,  ప్రదేశాలు,  సంఖ్యలు, రంగులు, వస్తువులు,  వ్యక్తులు , జీవాలు  మరియు భౌతిక శరీరాల వెలుపల ,  సూక్ష్మ శరీరాలలో ఉండే కొన్ని ఆత్మల శక్తి మరియు ప్రకంపనలు (vibrations) – దురదృష్టాన్ని  తెస్తాయని  మనం నమ్మకం కలిగి ఉండడం తో, ఆ భయం వలన బాధితులులా జీవిస్తాము .   కాబట్టి , మనం వాటి నెగెటివ్ ప్రభావానికి లోనయ్యి  మన జీవితంలో నెగెటివ్ పరిస్థితులను ఆకర్షిస్తాము . 

చెడు శకునాలను మరియు మూఢనమ్మకాలపై నమ్మకం మన మనస్సులలో అనాది నుంచి చాలా లోతుగా పాతుకుపోయి ఉన్నాయి . అదే మన బలహీనత అని గ్రహించలేని స్థితి తో  నేడు  జీవిస్తున్నాము .  కొన్ని వస్తువులను లేదా సంఘటనలను అదృష్టం లేదా దురదృష్టంతో కనెక్ట్ చేయడం వల్ల మనకు సహజంగా  ఉన్న  స్థితి , పరిస్థితుల కంటే కూడా అది మనల్ని బలహీనంగా తయారు చేస్తుంది. ఇది సత్యం.


1. మీ మూఢనమ్మకాలను  సవాలు చేస్తే అవి మీ మనస్సులో ఉన్నాయని మీరు గ్రహిస్తారు. గ్రహల కదలికలు,  వస్తువులు,  పరిస్థితులు, తమ శక్తిని ప్రసరింపజేస్తాయి . అదే విధంగా మనుషులు కూడా తమ ఆలోచనల ద్వారా శక్తి ని ప్రకంపనల (vibrations) రూపేణా విడుదల చేస్తారు , ఇది వాస్తవం.  

కానీ , ఇతర బాహ్య ప్రభావం నుంచి రిలీజ్ అయ్యే శక్తుల కంటే   , మీ  జీవితంపై మీ మనస్సు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే మన మనస్సును  దృఢం గా ఉంచుకునే అభ్యాసం చేయాలి.


2. మీ ఆలోచనలు మీ భావాలుగా మారుతాయి. మీ భావాలు  మీ వైఖరిని ఏర్పరుస్తాయి . మీ వైఖరి కార్యరూపం దాల్చుతుంది. పదే పదే చేసే కర్మలు అలవాటుగా మారతాయి. మీ అలవాట్లన్నీ  కలిసి, మీ వ్యక్తిత్వం గా  తయారు అవుతుంది . మీ వ్యక్తిత్వం మీ అదృష్టాన్ని సృష్టిస్తుంది. కాబట్టి, మీ ఆలోచనలు మీ అదృష్టాన్ని సృష్టిస్తాయి.


3. మీ ఆలోచనలు నెగెటివ్ గా, బలహీనంగా ఉంటే, బాహ్య శక్తులు మీ ఆలోచనలను మరియు ఫలితంగా మీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయి. 

మీ ఆలోచనలు స్వచ్ఛంగా, పాజిటివ్ గా , శక్తిశాలి వైబ్రేషన్స్ కలిగి ఉంటే, బాహ్య అంశాలు మీ అదృష్టం పై ప్రభావం చూపవు. మీ లో ఉన్న నెగెటివ్ భావాలు (మైనస్ “-“) ఆలోచనలను మొదట మీ  మనసు అంగీకరించ గలిగాలి. అంగీకరించినపుడు మనసు మొదట నిర్లిప్తత  శూన్యం (జీరో  “0” ) దిశగా అడుగులు వేయడం ప్రారంభిస్తుంది . శూన్యం నుంచి పాజిటివ్ భావాలు ( ప్లస్   “ + ” ) , ఆలోచనలతో ఎదుగుదల జరుగుతుంది  మరియు అదృష్టం తయారవుతుంది .

4. మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకోండి మరియు ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆలోచనలు మరియు భాషా పదాలతో మీరు చేసే పనులను ఆశీర్వదించండి. మీ స్వంత భావోద్వేగ  ఫిట్ నెస్ , సంకల్పం, క్రమశిక్షణ మరియు పాజిటివ్ ఆధ్యాత్మిక ప్రయత్నాలు కావలసిన అదృష్టాన్ని మీ కోసం సృష్టిస్తాయి.

5. మెడిటేషన్ ద్వారా భగవంతునికి కనెక్ట్ అవ్వండి మరియు మీ మైండ్ వైబ్రేషనల్  ఫ్రీక్వెన్సీని పెంచుకోండి. శక్తిశాలి వైబ్రేషన్స్ తో , మీరు మీ మనస్సుకు యజమానిగా, మీ జీవితం మరియు పరిస్థితులపై మాస్టర్ అవుతారు. చెడు శకునాలు మరియు మూఢనమ్మకాల భయాన్ని అధిగమిస్తారు . ఆనందం గా జీవిస్తారు. అందరికీ ఆనందం పంచుతారు .


ఓం శాంతి

ఓం నమఃశివాయ 🙏.

యడ్ల శ్రీనివాసరావు 15 March 2026 , 9:30 PM.


Saturday, March 14, 2026

728. అభిప్రాయాలు - ఇసుక రాతలు

 

అభిప్రాయాలు - ఇసుక రాతలు



• సముద్ర తీరాన ఒక కుర్రాడు ఆడుకుంటూ ఉండగా ఓ చెప్పు కనిపించకుండా పోయింది. అతను వెంటనే ఈ సముద్రం మహా దొంగ అని రాశాడు.

• కాస్తంత దూరంలో ఒక వ్యక్తి అదే సముద్రంలో వల వేసి చేపలు పట్టాడు. ఆ రోజు తాననుకున్న దానికన్నా ఎక్కువ చేపలు దొరకడంతో ఈ సముద్రం గొప్ప దాత అని రాశాడు.

• ఇంకొక వ్యక్తి ఈదుకుంటూ ప్రమాదవశాత్తు మునిగి పోయాడు. అతని తల్లి ఈ సముద్రం నా కొడుకులాంటి అమాయకులను పొట్టన పెట్టుకున్న మహమ్మారి అని రాసింది.

• ఒక పెద్దతను సముద్రంలోకి వెళ్లి ముత్యాలు సేకరించి విజయవంతంగా ఒడ్డుకు చేరి ఆ ఇసుకలో ఈ సముద్రం ఒకటి చాలు జీవితమంతా హాయిగా బ్రతికేస్తాను అని రాశాడు.

• అనంతరం ఒక పెద్ద అల వచ్చింది. వీరందరూ రాసిన మాటలను తుడిచి పెట్టేసింది. రకరకాల అభిప్రాయాలను సముద్రం తన అలలతో తుడిచేసుకుంది అలానే మన జీవితంలో ఎవరెవరో ఏదేదో అన్నారని బాధపడరాదు... ఇంకా ఇతరులు ఏవేవో చెప్పిన మాటలన్నింటిని విని ఎవరిపైనా చెడు అభిప్రాయానికి రాకూడదు. వీలయితే వారిని కూడా మంచిగా మార్చేందుకు ప్రయత్నం చేయాలి.

• ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు. చేదు అనుభవం ఎదురైనప్పుడు అలా ఎందుకు జరిగిందో అని కొంత మేరకు మాత్రమే ఆలోచించండి. అందులో కొన్ని సార్లు మన పొరపాట్లు ఉండవచ్చు. పొరపాట్లు ఉంటే సరిచేసుకోవడం , లేకపోతే కర్మ బుణం (Karmic debt) తీరిపోయింది అని భావించి ముందుకు అడుగు వేయండి.

• నిజాయితీగా , అంతరాత్మతో ఈశ్వరుణ్ణి తోడుగా చేసుకోండి . వినయం, విధేయతతో విజయం మీ సొంతం అవుతుంది


ఓం శాంతి

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 14 March 2026 , 8:00 PM.


Tuesday, March 3, 2026

727. होली

 

  होली



• హోలీ అంటే హిందీలో జరిగిందేదో జరిగింది అని అర్దం. హోలీ భారతదేశ సంస్కృతి సంప్రదాయాలలో ఒక విశిష్టత కలిగిన పండుగ. మనుష్యులు అందరూ రంగులు పూసుకుని ఆనందడోలికల్లో తేలియాడడం ప్రధానం గా అందరం బయటకు చూస్తుంటాం.

• కానీ ఈ పండుగ మూల సారాంశం లో నేటి మనిషి యొక్క సామాజిక జీవనంలో శ్రేయస్సు కోసం , మానసిక ఆనందం, పరిపక్వత తో కూడిన రహస్యం ఇమిడి ఉంది.

• మనిషి పుట్టుక నుంచి మరణం వరకు బంధాలు అనుబంధాలు బంధుత్వాల తో జరిగే ప్రయాణం లో తోటి వ్యక్తుల తో  కొన్ని సార్లు సానుకూలంగా, కొన్ని సార్లు సమస్యాత్మకంగా ,  కొన్ని సార్లు ఆనందం భరితంగా ఉంటుంది.

• ఏ మనిషి అయినా తోటి వ్యక్తుల తో ఎప్పుడూ ఆనందమయంగా ఉండాలని ఆశిస్తాడు. స్వభావ సంస్కారాలు , పరిస్ధితుల రీత్యా కొన్ని సార్లు కొంత కాలం  మరియు కొన్ని సార్లు   పూర్తి జీవితకాలం వ్యక్తుల  మధ్య సమస్యలు ,  వైరాలు సృష్టించబడతాయి. వీటికి కారణం కూడా మనుషులే . దీని వలన ఒక మనిషి లో లేదా మనుషుల మధ్య అశాంతి  నెలకొని మానవ సంబంధాలు పూర్తిగా దుర్భరంగా తయారవుతాయి . కాలక్రమేణా ఇది హింసకు  లేదా మానసిక రుగ్మతలకు ప్రేరణ అవుతుంది.

 నేడు సమాజంలో పూర్తిగా వంద శాతం జరుగుతున్నది ఇదే .

• అయితే , నేటి పరిస్థితులు ఎలా ఉన్నా నాటి పరిస్థితుల వలన జరిగిందేదో జరిగింది అని , మనిషి అన్నీ విడిచి పెట్టి  మరచి పోయి  జీవితానికి ఆనందం , శాంతి, సుఖం, ప్రేమ, సత్యత, సఖ్యత , శక్తి అనే గుణాలను కొత్త రంగులు  పూసుకుని , అవి ఇతరుల పై జల్లుతూ సంతోషం అనే మిఠాయి తింటూ తినిపించుకుంటూ  పంచు కోవడమే హోలీ పండుగ సూక్ష్మ రహస్యం  .

• ఆ రోజు తెల్ల వస్త్రాలు ధరించడం లో అర్దం , సమస్యలకు కారణం అయిన నా పాత ఆలోచనలను విడిచి పెట్టాను . నేడు నా మనసు తెల్లగా స్వచ్చం గా ఉంది అని అర్దం. ఒకవేళ ఇంకా ఏమైనా మనసు లో చిన్న చిన్న లోపాలు , మరకలు వలే నాలో ఉన్నా సరే , వాటి పై నేడు పూస్తున్న రంగులతో ఆవి కనుమరుగయి …. నేను సంతోషం అనే మిఠాయి తింటూ , అందరికీ సంతోషం అనే  మిఠాయి పంచుతూ ఉంటాను  అనే సంకేతం ఇమిడి  ఉంది.

• ఇదే మనం హోలీ పండుగ మనకు తెలియ చేసే ముఖ్యమైన సందేశం .

• ఇంగ్లీష్ లో Holy అంటే పవిత్రం. మన మనసు ను పవిత్రం గా తయారు చేసుకుంటూ , అందరి మనసులను పవిత్రంగా తయారు చేయడమే హోలీ.

• హోలీ పండుగ పౌర్ణమి రోజున వస్తుంది. చంద్రుడు యొక్క విశ్వ శక్తి ఎల్లప్పుడూ మనిషి యొక్క మనసు , మెదడు ఆలోచనలపై పూర్తి ప్రభావం చూపుతుంది. పౌర్ణమి రోజున చంద్రుడి నిండు వెలుగు వలే , మన మనసు నిత్యం వెలుగుతూ ఉండాలి అని  శుభ సూచకంగా హోలీ ని  ఆ రోజు జరుపుకుంటారు.

• నా భారత దేశం చాలా గొప్పది. అడుగడుగునా మనిషి ఎలా బ్రతకాలో సంస్కృతి లో పండుగలు సాంప్రదాయాల రూపం లో మనందరికీ నేర్పుతూ నే ఉంది. కానీ దరిద్రం, దురదృష్టకరం ఏంటంటే మాయా బలహీనతలకు వశం అయి , వీటి సూక్ష్మం గ్రహించలేక పాశ్చాత్య పోకడలకు దాసోహం అవుతూ మనకు మనమే స్వయంగా ఊబిలో కూరుకుపోతూ  బలిహరం అవుతున్నాం.


ఓం శాంతి

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 4 March 2026 . 7:00 AM.


Saturday, February 28, 2026

726 . సత్యం

 

సత్యం



• భగవంతుని వైపు అడుగులు వేస్తూ పయనం సాగిస్తూ ఉంటే సత్యమే స్పష్టం గా  కనపడుతుంది. సత్యమే తెలుస్తుంది. సత్యమే మాట్లాడడం జరుగుతుంది . ఎందుకంటే భగవంతుడు అంటే నే సత్యం కాబట్టి.

  అదే  “సత్యం శివం సుందరం”.

  ఈ సత్యం తెలుస్తూ , అనుభవం అవుతూ , ఆచరిస్తూ ఉన్నప్పుడు , తొలి దశలో మన లో లోపల అనాది గా   దాగి  ఉన్న అసత్యాలు మనకు తెలియడం ప్రారంభం అవుతుంది , ఆ తరువాత వాటిని  నిర్మూలించడం ఆరంభిస్తుంది . దీనినే పరివర్తన దశ అంటారు. అనగా మనలో మార్పు సంభవించే  కాలం అని అర్థం. ఈ సమయంలో మన మనసు ఎన్నో ఆటుపోట్లకు గురి అవుతూ , ఇటు అంతరంగం లోను అటు బాహ్య ప్రపంచంతోను ఘర్షణ పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుంది.

• ఎందుకంటే ఎన్నో జన్మలు గా మన బుద్ధి అనేక అసత్యాలు కు  నెలవు గా  అయిపోయింది . మన ఆత్మ లో  పేరుకు పోయి ఉన్న అసత్యాలు , వాటితో కూడిన నమ్మకాలు మార్పు చెందుతూ ఉన్న దశలో మనసు లో అంతర్గతం గా  ఒక కురుక్షేత్రం జరుగుతుంది. ఈ దశలో  అంతర్గతంగా నే కాకుండా బాహ్య ప్రపంచం లో ముడిపడి ఉన్న వారితో కూడా తప్పని సరిగా అలజడులు తో కూడిన ఒక యుద్దం మనసు చేస్తుంది . ఎందుకంటే , బుద్ధి లో అలవాటు అయిపోయి ఉన్న అసత్యం బయటకు వెళ్లి , అందులో సత్యం ఆచరణ కోసం నిండాలి అంటే పోరాటం, ఘర్షణ అనేది మనసు కి సహజంగా ఎదుర్కొంటుంది .

• మనం  ఎప్పుడైతే   సత్యం తో  మెలగడం ఆరంభిస్తామో  , అప్పటి వరకూ  మనతో కలిసి మెలిసి ఉన్న ప్రతీ ఒక్కరూ ఇంటా బయటా మనల్ని ఒక శత్రువు గా భావించడం మొదలు పెడతారు . చెప్పాలంటే ఇది వారి యొక్క తప్పు కూడా కాదు. వారికి లేని అవగాహన, అతీతమైన మార్పు నీ లో సంభవిస్తుంది అంటే అది చూసిన వారు మొదట నిన్ను  అర్దం చేసుకోలేరు , గ్రహించ లేరు . అలా అని వారి వలే ప్రవర్తించడం నీకు  సాధ్యం కాదు .

• దీనికి కారణం, ఏనాడైతే నీవు భగవంతుడి ధ్యాస లో ఉంటూ సత్యం మాట్లాడుతూ ఉంటావో , అది నీ చుట్టూ దగ్గర గా  ఉన్న వారికి కొన్ని సందర్భాల్లో తమను కించ పరస్తున్నట్లు  భావిస్తారు. దానికి కారణం  వారిలో  కొలువై ఉన్న  అసత్యం . 

కానీ కాలక్రమేణా , నీ లోని సత్యతను ,   సత్యం యొక్క శక్తిని అందరికీ  అర్దం అవుతుంది . ఎందుకంటే సత్యం ఒక నిప్పు , నీ లో మలిన గుణాలను దహిస్తూ భగవంతుని వైపు తీసుకెళ్తూనే, ఆ నిప్పు జ్యోతి వలే ప్రకాశిస్తూ నీ చుట్టూ ఉన్న అందరికీ  వెలుగు అవుతుంది .

 సత్యాన్ని చెప్పడం , రాయడం కంటే, ఆచరించడం లోనే అద్భుతమైన అనుభవం జరుగుతుంది .

అదే  " సత్యమేవ జయతే "  .


• వాస్తవానికి సత్యం , సత్యమైన విషయాలు , నిజాలు అనేవి ప్రతి మనిషి కి తెలిసినవే . బాల్యం లో పాఠశాల  విద్యాభ్యాసం లో  ఎన్నో సత్య వాక్యాలు   కాపీ రైటింగ్ పుస్తకాల లో  నిత్యం పలుమార్లు  రాయడం ,  చదవడం జరిగేది . ఉదాహరణకు . . . తల్లి తండ్రులను ప్రేమించవలెను , గురువులను గౌరవించవలెను, ఈర్ష్య ద్వేషాలు ఉండరాదు , కామ క్రోధాలు మహా శత్రువులు , అబద్ధం మాట్లాడ రాదు , ఐకమత్యమే మహా బలం , అందరితో సఖ్యతగా ఉండుము , కలిసి ఉంటే కలదు సుఖం , భగవంతుని యందు భక్తి కలిగి ఉండుము , శత్రువులను ప్రేమించుము , సొంత లాభం కొంత మానుకో , ఆరోగ్యమే మహా భాగ్యం , పొరుగు వారికి సహాయం చేయుము , మంచి అలవాట్లు పాటించుము ….. ఇలా ఎన్నో, ఎన్నెన్నో లెక్కలేనన్ని నేర్చుకోవడం జరిగింది. కానీ , నేడు అవి గుర్తు ఉన్నాయా ? అంటే అవును గుర్తు ఉన్నాయి .  కానీ , వాటిని ఆచరిస్తున్నామా ? అనేది  ఒక ప్రశ్నార్ధకం .

 ఎందుకంటే నేడు మనం బాల్యం లో లేము కదా అనేది సమాధానం కావచ్చు . లేదా ఇవి వ్రాయడానికి చదవడానికి మాత్రమే బాగుంటాయి కాని జీవితం లో  ఆచరించడం కష్టం అనిపించవచ్చు .

కానీ , ఆనాటి  బాల్యం లో నేర్చుకున్న పాఠాలు మనసు లో  దృఢం గా  ఉంటేనే , వాటిని సజావుగా అంగీకరిస్తూ ఆచరిస్తే నే  కౌమారం , యవనం  , వృద్ధాప్యం  ఉన్నతంగా ఆనందం గా , ఏ  సమస్యలు  కొని  తెచ్చు కోకుండా   నడుస్తాయి  అనే విషయం బహుశా మన బుద్ధి ఏనాడో మరచి పోయింది .

• ఎందుకంటే నేటి మాయా ప్రపంచం లో మనం చాలా బిజీ . . .  గజిబిజి . మనకు మనం మన ఆధీనంలోనే (కంట్రోల్) లేని విచిత్రమైన స్థితులతో జీవితం జీవనం సాగిస్తున్నాము . భౌతిక పరిస్థితులు మనపైనే ఆధిపత్యం (డామినేట్) చేస్తున్నాయి . అందుకే అన్నీ సమృద్ధిగా ఉన్నా కూడా  , తెలియని ఆందోళనలతో , సమస్యలను నెమరు వేసుకుంటూ జీవించ వలసి  వస్తుంది.

 ఇది మన అభివృద్ధా ? లేక పతనమా ? అని ఆత్మ విమర్శ చేసుకునే సమయం కూడా నేడు లేదు .

• మనం పుట్టినప్పుడు భగవంతుని తోడు తో నే పుట్టాం , అందుకే పసి వయసులో నిద్రలో నవ్వుతూ ఆయనతో ఆడుకుంటూ ఉంటాం . ఊహా వస్తూ ఎదుగుతూ , మనలో మాయ ప్రవేశిస్తూ ఉండడం తోనే ఆయన్ను ఒక రాతి విగ్రహం గానే చూడడం ఆరంభించాం . మన మనసు లో నుంచి ఆయన్ను బయటకు పంపించి, మాయకు పెద్ద సింహాసనం వేశాం . అందుకే , మన లో లో ఉండవలసిన భగవంతుడు నేడు ఎక్కడో కొండలపైన ఉన్నాడు . అదే విధంగా మన, లో లో ఉండవలసిన సత్యం మనల్ని విడిచి ఎక్కడికో పోయింది .


నిజానంద స్వరూపం శివోహం శివోహం 


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 28 Feb 2026 , 11:00 PM .


Thursday, February 26, 2026

725 . మనశ్శుద్ధి – మనశ్శాంతి

 

మనశ్శుద్ధి – మనశ్శాంతి



• మనసు శుద్ధి గా ఉన్నప్పుడు మనస్సాక్షి అనేది జాగృతం (activate) అయి నిరంతరం మన ఆలోచనలను చర్యలను సరియైన దిశగా విశ్లేషణ చేస్తుంది . ముఖ్యంగా మానవ సంబంధాలలో , బంధుత్వాల లో , ప్రేమికులలో , ఒకరికి ఒకరు సత్సంబంధం కొనసాగాలి అంటే మనశ్శుద్ధి ప్రధానం . అప్పుడే మన మనసు సాక్షి భూతమై జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని యధాతథంగా రికార్డ్ చేసి పొందుపరచి , అవసరమైన సమయంలో మన మనసు కి గా సాక్ష్యం గా చూపిస్తుంది. దీని వలన మన బుద్ధి ద్వారా చేసి మరచి పోయిన పొరపాట్లు గాని , సంఘటనలను కానీ తిరిగి సరి చేసుకునేందుకు దోహదం అవుతుంది.

• మనసు లో శుద్ది లేనిదే , శుద్ధి జరగనిదే ఒక మనసు మరొక మనసు తో కలవదు  కలవలేదు . ఒకవేళ కలిసినట్లు పైకి అనిపించినా , అది కేవలం మాటల వరకు లేదా శరీరం వరకు లేదా అవసరాల వరకు పరిమితం అవుతుంది . మానసిక మైత్రి అనేది ఇరువైపులా ఉండక పోవడం వలన ఎన్నో మానవ బంధాలకు పునాది వంటి ప్రేమ కేవలం మాటలకు , ఆకర్షణలకు పరిమితం అయి సుధీర్ఘంగా ఉండలేక , తక్కువ కాలంలోనే ఆ బంధం సమసిపోతుంది .

• ఈ ప్రపంచంలో అనేకులు మాటలతో ఉంటారు , మాటలకు పరిమితం అవుతారు అంతకు మించిన సహయ సహకారాలు ఇతరుల అవసరార్థం పంచవలసి నపుడు మాత్రం చేయలేరు . ఎందుకంటే తమ ఆలోచన లలో స్వార్దం, భయం, అంతర్గత గుణాలకు సంబంధించిన సమస్యల వలన మనసు సహకరించక కేవలం పై పై మాటల వరకే పరిమితం అవుతారు , కానీ చేతల వరకు చేయలేరు . కనీసం మానసిక  ప్రేమ ను  కూడా ఇతరులకు పంచలేరు సరికదా తిరిగి తమకు కావాలని ఆశిస్తారు . శుద్ధి గా మనసు ఉంటే ప్రేమను ఎన్ని మనసుల కైనా పంచవచ్చు .(ప్రేమ అంటే  కామం శృంగారం కాదు.) ప్రేమ అంటే  సంతోషం , స్వచ్చత , త్యాగం .


• మనసు ఎటువంటి అలజడులు లేకుండా శాంతిని పొందాలంటే ఏకాంతం లో  ఒంటరిగా  ఉన్నంతలో సాధ్యం కాదు. ఉన్న సంభంద బాంధవ్యాల పట్ల మన బాధ్యత ను నిర్వర్తిస్తూ , ఆ సమయంలో చేసే కర్మల పట్ల  యోగి గా  ఉండాలి . అంటే నేను నా ధర్మం  నిర్వర్తించాను అనే  భావన, స్పృహ ఉండాలి తప్ప, మన  మనసు ను ఆ బాధ్యతలతో కూడిన కర్మలతో పాటు విలీనం కానివ్వు కూడదు. ఇది మన ఆలోచనలను అలజడులకు గురి చేస్తుంది. అలజడుల తో కూడిన ఆలోచనలు వస్తూ ఉంటే ఎప్పటికప్పుడు క్రమబద్దీకరణ చేసుకోవాలి .


• మనసు కి శాంతి లభించాలంటే కర్మయోగ స్థితి అభ్యాసం ముఖ్యం. అన్ని కర్మలు చేస్తూ మనసు ను దేనికి వశం కానివ్వకుండా, అతీతంగా ఉంచుకోవడం. ఇదే మనసు శుద్ధి కి , శాంతి కి తారక మంత్రం.

• మనసు శుద్ధి ఉంటే , చేసిన చేస్తున్న, చేయబోతున్న ప్రతీ కర్మ సత్కర్మ అవుతుంది. తద్వారా కాలం ఎటువంటి విఘ్నాలను మనకు కలుగ చేయదు. దీని వలన నిత్యం మనసు కి శాంతి లభిస్తుంది.

• మనశ్శుద్ధి లేనిదే మనశ్శాంతి లభించదు. శుద్ధి లోనే శాంతి ఉంటుంది.


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 26 Feb 2026 10:00 PM.


731. యుగాది

  యుగాది • ఉగాది   ఉగాది   యుగముకి   జీవం  పోసే   ఆది . • యుగములు    నాలుగైనా   ఉగాదులు   మాత్రం   ఎన్నో . . . ఎన్నెన్నో… • ఉగాది    ఉగాద...