Wednesday, April 8, 2026

736. నీ తోడు - భాగస్వామ్యం ఎవరు ?

 

నీ తోడు - భాగస్వామ్యం ఎవరు ?



• ఈ భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి కి ఒక తోడు అవసరం. ఆ ప్రాణి మనిషి  , పక్షి , పశువు , జంతువు ఇలా ఏ రకమైన జీవి అయినా కావచ్చు.

 ఈ తోడు . . . అవసరం . . . అనేవి ప్రతి ప్రాణి యొక్క జీవన స్థితి  మరియు  తమ ధర్మాన్ని అనుసరించి ఉంటాయి .


• మనుషులమైన మనం ఏకాంతం గా జీవించగలం కానీ ఒంటరితనం తో జీవించలేము . ఈ ఒంటరితనం అధిగమించడానికే  మనిషి తనకు సరిపడా తోడు ను  కోరుకొని ఆశ్రయిస్తాడు . ఆ తోడు లోనే ఎన్నో రకాల బంధాలు ,  వివాహం, ‌స్నేహం , సహచర్యం , కుటుంబం , పిల్లలు ఇలా ఎన్నో ఎన్నెన్నో  అనుబంధాలు  .  వీటన్నింటిలో  అడుగడుగునా మనిషి ప్రాథమికంగా ఆలోచించేది తనకు కావలసిన తోడు . . .  తన ఆలోచనలకు సరిపడే తోడు .  ఎందుకంటే , ఔనన్నా కాదన్నా మనిషి స్వార్థజీవి . . . ఇందులో తప్పు లేదు.


• అసలు ఈ తోడు అవసరం ఎందుకు ? 

 ఈ మాయా ప్రాపంచిక లోకంలో మనిషి పుట్టిన దగ్గర్నుంచి జీవన పోరాటం లో  ఎన్నో సమస్యలను , సవాళ్ళను (ఛాలెంజెస్) నిరంతరం ఎదుర్కోవలసి వస్తుంది . అందుకు తనకు ఉన్న మానసిక శక్తి అన్ని వేళలా సరిపోదు. ఆ సమయంలో తప్పక ఒక తోడు పై ఆధారపడ వలసిన అవసరం పూర్తిగా ఉంటుంది .

  శరీర ధర్మం ప్రకారం అవసరమయ్యే తోడు కోసం ఇక్కడ ప్రస్తావించడం లేదు . ఎందుకంటే ఏ మనిషి కైనా మానసిక మైన తోడు లభిస్తే నే   తన  జీవితాన్ని తీరం దాటించుకోగలడు  మరియు జన్మను  సార్థకం చేసుకోగలడు . అంతకంటే మోక్షం మరొకటి లేదు .


• కానీ . . .  ఈ తోడు భాగస్వామ్యం అనేది నేటి కాలం మనిషి తనకు  ఉన్న  స్నేహల ద్వారా గాని. . .  వివాహం ద్వారా గాని . . .  బంధాల ద్వారా  గాని పొందగలుగుతున్నాడా ?  తోడు ను అనుభవించ గలుగుతున్నాడా ? . . .  లేక  మనిషి ఈ బంధాలన్నింటిలో    జీవిస్తూ నే    నటిస్తూ నే ఒంటరితనం అనుభవిస్తున్నాడా ?


ఎందుకంటే  , నిజం గా  ఒక మనిషి కి సరియైన తోడు భాగస్వామ్యం  ఉంటే అసంతృప్తి , కొరత  అనే  అంశాలు మచ్చుకైనా  తన  జీవితంలో ఉండవు . నిత్యం సంతోషంగా , ఆనందంగా , ఏ లోటూ లేకుండా ఉంటాడు . ఈ స్థితి కి కారణం తనకున్న  తోడు ఎప్పటికప్పుడు  అర్దం చేసుకుని కావలసిన శక్తిని ఇస్తూ  బాలెన్స్ చేస్తుంది .

అందుకే . . . ప్రతి మనిషి తనను అర్దం చేసుకోవడం కోసం తోడు ఉండాలి అనుకుంటాడు . కానీ ఈ తోడు  అనే భాగస్వామ్యం లో ఉన్న వారు అదే ఫ్రీక్వెన్సీ కలిగి ఉండక పోవడం తోనే సమస్య ఆరంభం అవుతుంది . ఉన్న తోడు కాస్త శత్రుత్వం, సమస్య గా తయారవుతుంది. నేటి అధిక శాతం మానవుల జీవన సరళి లో  ఇదే జరుగుతుంది .


• భాగస్వామ్య తోడు అనేది మనిషి కి ఒక ధైర్యం , భరోసా , నమ్మకం . కానీ నేటి కలియుగంలో ఈ తోడు లో మాయ, మోసం , ద్వేషం, అసహనం, కామం , క్రోధం , కపట ప్రేమలు  వంటివి అణువణువునా ఎన్నో చొప్పించబడి మనుషుల జీవితాలు  అల్లకల్లోలంగా తయారవుతున్నాయి  అనడం లో    ఏ మాత్రం సందేహం లేదు . 


• ఒక మనిషి తన జీవితంలో తాను సరియైన తోడు కలిగి ఉన్నాను అనే భావన కలిగి ఉంటే . . . , ఆ తోడు ఉన్న వ్యక్తి భౌతికంగా అనుక్షణం తన ప్రక్కన ఉన్న లేకపోయినా సరే . . . నీడ లా తనతో నే ఉంది అనే భరోసా తో  కూడిన నమ్మకం ఒక మంచి భాగస్వామ్య  తోడు  మనసు కి  ఇవ్వగలదు .

  మరి మనిషి తనకు సరిపడా తోడు ను కలిగి ఉంటున్నాడా లేక రాజీపడుతున్నాడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న .


• సున్నితమైన వారు కలిగి ఉన్న తోడు తో రాజీ పడతారు . కఠోరమైన వారు సరియైన తోడు దొరికేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు .


🌹 🌹 🌹 🌹 🌹


• ఇక  అసలు వాస్తవమైన  జ్ఞానం సత్యం లోని కి వస్తే  . . . ప్రతి  మనిషి ఎకైకం  , ఏకత్వం . అనగా ఏకైక తత్వాన్ని  కలిగి ఉండడం . 

అంటే  Every Human being  is Unique. 

ఏ ఇద్దరి మనుషుల రూపు రేఖలు, ఆలోచనలు , స్వభావాలు  ఒకే విధంగా ఉండవు. అందుకే ప్రతి మనిషి తనకు తాను విలక్షణం. 

మరి , ఏ ఇద్దరు మనుషుల స్వభావం ఒకేలా ఉండనపుడు,  ఒకరి  ఆలోచనలను పోలి సహకరించే విధంగా ఈ సృష్టిలో మరొకరు  ముమ్మాటికీ తయారయి ఉండరు . అటువంటప్పుడు ఒక మనిషి కి సరియైన తోడు లేదా ఒక మనిషి ని  యధార్థ రీతిలో  అర్దం చేసుకోవడానికి మరో మనిషి తోడు గా , భాగస్వామ్యం గా  ఎలా ఉండగలడు ? ఎలా సాధ్యం ? 


• అందుకోసమే  . . . దీనికి పరిష్కారం గా  భగవంతుడే   ప్రతి మనిషి కి  సరియైన విధంగా , ప్రతి మనిషి ని అర్దం  చేసుకునే  విధంతో   తోడుగా అవుతుంటాడు .  భగవంతుడైన  శివుడు ఒక తండ్రి గా, తల్లి గా,  సద్గురువు గా , భార్య గా, భర్త గా , ప్రియుడు గా , ప్రియురాలు గా,  టీచరు గా , స్నేహితుడు గా, ఎన్నో రూపాలలో అనుక్షణం మనిషి కి తోడు ఉండి  స్వచ్చత తో , సత్యత తో  ధైర్యంతో నమ్మకం తో  మనిషికి  అనుక్షణం  సేవ చేస్తూ మనిషి ని నడిపిస్తాడు .

కానీ , దురదృష్టం ఏమిటంటే , మనిషే భగవంతుడైన  శివుని  ని సరియైన తోడు గా భావించడం లేదు. కారణం  మనిషి లో ని మాయ. మాయ అంటే మనిషి లోని బలహీనతలు .


• మనిషి  , భగవంతుడు ని  ఎక్కడో దూరంగా గుడిలో ఉంచుతాడు , ఇంటిలో పూజ చేస్తాడు , మొక్కుతాడు , కోరికలు కోరుతాడు . . .  కానీ  అదే భగవంతుడు ని   తన గుండె లో , మనసు లో , తనకున్న  ప్రతీ ఆలోచనలో  తోడు గా ఉంచుకున్న నాడు  అద్బుతాలు జరుగుతాయి. మనిషి జీవితాన్ని  అతి సహజంగా  తీరం దాటించి గమ్యం చేరుస్తాడు శివుడు . కానీ ఈ విషయం మనిషి గ్రహించలేడు నమ్మడు విశ్వసించడు .  నోటితో పైకి మాటలు మాట్లాడుతాడు కానీ, మనసు లో భగవంతునికి చోటు ఇవ్వలేక పోతాడు . 


 ఓ మనిషి . . . నీతో , నీ చుట్టూ ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నీ ఆలోచనలు శుభ్రమైనవి అయితే , వాటిని ఆచరిస్తూ ఉన్నట్లయితే  నీవు వ్యక్తిగా ఉన్నతి సాధించినట్లే . నీవు ఏకాంతం లో ఉండొచ్చు కానీ ఒంటరివి కానే కావు , ఎందుకంటే శివుడు నీకు తోడు గా నీతోనే ఉన్నాడు . . . ఎప్పటికీ ఉంటాడు . కానీ నీవు మాత్రం ఆ పరమ శివుని మరువకు , విడువకు .


• ఈ రచన యొక్క సారాంశం, మనకు తోడుగా ఉన్నవారిని ,  మనుషులందరినీ   విస్మరించమని కాదు …. ప్రతీ ఒక్కరితో అన్ని భవబంధాలలో ఉంటూనే   మనసు లో  శివుని ని మాత్రమే  తోడు గా  చేసుకోమని భావం . 

ఎందుకంటే భాగస్వామ్యం గా , తోడు గా  ఉన్న మనుషులు , ఏ రోజైనా మనల్ని వదిలి శాశ్వతంగా వెళ్లిపోవచ్చు లేదా వారి వలన కోలుకోలేని విధంగా వంచింప బడవచ్చు  . కానీ శివుడు నిన్ను ఎన్నడూ విడవడు, వంచించడు. శివుడు మాత్రమే నీ మేలు కోరే వాడు, అది నువ్వు శరీరం తో ఉన్నాసరే   లేదా  శరీరం విడిచి పెట్టినా సరే  అంటే మరణించినా సరే.


ప్రతి మనిషి కి , ప్రతీ ప్రాణి కి శివుడు పూల బాట ఎప్పడో వేశాడు. కానీ మనిషే  స్వయంకృతాపరాధం తో  ఆ బాట ను చెదర కొట్టుకుంటున్నాడు .

మూలం గమనిస్తే , అసాధ్యం లోనే  సాధ్యం ఉంది . . . విరక్తి  లోనే  రక్తి  దాగి  ఉంది .


మానవమాత్రులైన   తల్లి , తండ్రి , గురువు , పుత్రిక , పుత్రుడు , సామాజిక బంధాలు  ఇలా . . . ఏ మనిషి కూడా  ఇంకొక  మనిషి కి  ముక్తి ని , సద్గతి ని ప్రసాదించలేడు . నిన్ను నన్ను సృష్టించిన వాడే ఆ పని చేయగలడు.  ముక్తి అంటే మరణం పొందడం, తిరిగి జన్మ పొందక పోవడం అని అనుకుంటారు. అది  పొరపాటు.  ముక్తి అంటే ప్రస్తుతం ఉంటున్న లేదా ఉన్న స్థితి నుంచి మనకు  మనం విడుదల అయి ఉన్నతమైన స్థితి కి మన ఆత్మ పయనించడం. ఇది కేవలం శివుని కి మాత్రమే సాధ్యం. అందుకే శివుని తోడు గా చేసుకుంటే నీకు నీడ గా ఉంటాడు. 

ఈశ్వరుని తోడు గా  చేసుకొని బంధాలలో ఉన్న అందరినీ  ప్రేమించండి, అందరినీ గౌరవించండి . . . కానీ బంధీలుగా  కాకండి . 🙏


జీవితం లో   వదిలి  వెళ్ళిన వారి  గురించి ఆలోచించకు .  జీవితం లో ఉన్నవారందరూ శాశ్వతం అని భావించకు. 

ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు. నీకు నీవే ధైర్యం కావాలి. నీకు నీవే తోడు గా కావాలి.


గమనిక  : ఇవి  ఆలోచనలు, అభిప్రాయాలు అనుభవాలు అనడం కంటే , రచన లో సత్యా సత్యాలను సూక్ష్మ  విశ్లేషణ చేయగలగడం అభినందనీయం .


 ఓం శాంతి

 ఓం నమఃశివాయ 🙏

 యడ్ల శ్రీనివాసరావు 8 Apr 2026 . 11:00 PM.


Saturday, April 4, 2026

735 .మూసిన కనులు మసకబారవు

 

మూసిన కనులు మసకబారవు



• కనులు మూయడం అంటే ఒకటి నిద్ర పోవడం, రెండవది మరణించడం . ఈ రెండింటిలో జరిగే సూక్ష్మం ఒక్కటే . నిద్ర పోయినప్పుడు , మన స్పృహ నుంచి శరీరం విడుదల అయి భారం తెలియకుండా తేలికగా అవుతుంది . తిరిగి నిద్ర లేచేటప్పుటికి కొత్త శక్తి నిండుకొని శరీరం భారవంతంగా ఉంటుంది.

మరణించినపుడు కూడా ఇదే ప్రక్రియ జరుగుతుంది . ఆత్మ శరీరం నుంచి విడుదల అయి తేలికగా అవడం జరుగుతుంది . మరణం తర్వాత సరికొత్త రూపం తో దేహం లభించి జన్మించడం జరుగుతుంది.

 ఈ రెండూ కూడా కనులు మూసికొని ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. కనులు మూస్తే మసకబారి చీకటి ఆవహిస్తుంది అనుకుంటాం . కానీ శక్తి పునరుత్తేజం పొందేది కనులు మూసి ఉన్నప్పుడే.

మూసిన కనులు ఎన్నడూ మసకబారవు , అంధత్వం తో ఉండవు .


• కనులు తెరిచి ఉన్నప్పుడు జరుగుతున్నది అంతా కూడా అలసట, ప్రయాస , అలజడి , అల్ప కాలిక మైన కృత్రిమ సంతోషం మరియు సుఖం. అందుకే చివరికి మనం అలసి పోతాం , ఇందులో మనం పొందే శక్తి ఏమీ లేదు.

 కనులు మూసినపుడు లభించేది ఈ భౌతిక మాయా ప్రపంచం నుండి విశ్రాంతి, విముక్తి , భార రహిత స్థితి .


• అతి ఆలోచనలు , ఆందోళనలు కలిగి ఉన్నవారు కనులు మూసినంత మాత్రన విశ్రాంతి  , నూతన శక్తి లభించదు . అది నిద్ర లేదా మరణం కావచ్చు. ఎందుకంటే వారి ఆలోచనలు శరీరానికి అతీతంగా బుద్ధి లో, ఆత్మ లో నిరంతరం అతిగా పని చేస్తూ ఉంటాయి . అవి శరీరానికి నిరంతరం శ్రమ, ఒత్తిడి కలిగిస్తూ ఉంటాయి . అటువంటి స్థితిలో వారు పునరుత్తేజం , నూతన శక్తి ఎన్నటికీ పొందలేరు. అది నిద్ర నుండి  మేల్కొవడం  కావచ్చు లేదా మరణం పొంది తిరిగి జన్మించడం కావచ్చు .

 దీనిని జయించాలంటే ఒకటే పరిష్కారం. ధ్యానం. మనం శివుని పై మనసు లగ్నం చేసి నిత్యం ఒక నిర్ణీత సమయంలో ధ్యానం చేయడం వలన వ్యర్ధ ఆలోచనల, అలజడులు, ఆందోళనలు క్రమేపీ తగ్గి మనసు పై నియంత్రణ కలిగి విశ్వం లో శక్తి ని (cosmic energy) తీసుకుని మన వెన్నుముక లో పొందుపరచు కోవచ్చు. మనకు ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు, అది కేవలం ఒక శివుని పై మాత్రమే ఎందుకు మనసు లగ్నం చేయాలి అని. అవును శివుడు మాత్రమే మానవుని కి ధ్యాన యోగం ద్వారా శక్తి ఎలా పొందవచ్చో తెలియచేశాడు. అందుకు ప్రతీకగా శంకరుడు ని ఫోటో లలో ధ్యాన స్థితిని చూపించడం జరిగింది. శివుడు ఈ విశ్వానికి జ్ఞాన ధ్యాన యోగ గురువు.


• మనం ఆహారం తీసుకోవడం ద్వారా పొందే శక్తికి పూర్తి భిన్నంగా ఈ శక్తి ఉంటుంది. దీనిని యోగశక్తి అంటారు. రెండు మూడు రోజులు ఆహారం తీసుకోకపోయినా సరే యోగశక్తి వెన్ను లో నిల్వ ఉండడం వలన మానసికంగా శారీరకంగా దైనందిన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఎన్నో అనారోగ్యాలను , వాటికి గల కారణాలను జయించవచ్చు. నిత్యం నూతనోత్సాహం తో ఉండవచ్చు.

 అందుకే , మూసిన కనులు మసకబారవు . ఆలోచన నీ శక్తి అయినపుడు కనులు తెరిచి ఆలోచించి నిర్ణయం తీసుకున్న దానికి , కనులు మూసి మనో నేత్రం తో ఆలోచించి నిర్ణయం తీసుకున్న దానికి , సఫలత పొందే విషయం లో చాలా వ్యత్యాసం ఉంటుంది.


• ఈ భౌతిక మాయా ప్రపంచం లో నీ రెండు కళ్ళు నిన్ను ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటాయి . అందుకే ఏం చేసినా, ఏం పొందినా చివరికి అశాంతి దుఃఖం వెంటాడుతూ ఉంటాయి. కలియుగంలో జన్మించిన ఏ మనిషి అతీతం ఇందుకు కాదు.

 కనులు మూసినపుడు మాత్రమే , ఏకాంత స్థితిలో మన బలహీనతలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అవి సరిచేసుకొనే అదృష్టం లభిస్తుంది.


• మనం ఒకరిని ఎక్కువగా నమ్మడం వలన రెండు రకాల ఫలితాలు ఎదురుకావచ్చు. ఒకటి మనకు జీవితాంతం తోడుండే  ఓ మిత్రుడు దొరకచ్చు . ఇంకోటి జీవితాంతం గుర్తుంచుకోదగిన  గుణపాఠం నేర్పేవాళ్ళు  దొరకవచ్చు . 

 ఈ రెండింటి కి అతీతంగా కావాలంటే మన లో ఉన్న ఆత్మను గుర్తించి , ఆత్మను గమనించినపుడు , ఆత్మ పై నమ్మకం (విశ్వాసం) ఉంచి  ఉన్నతి చేసుకున్నపుడు  . . . ఆత్మ , పరమాత్మ అయిన శివుని తో శాశ్వతంగా అనుభవ పూర్వకంగా అనుసంధానం అవుతుంది . అపుడు మన జీవితం మనకు స్పష్టం గా కనిపించడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా మార్గదర్శకం అవుతుంది.

మనల్ని మనము (మనసు ను) పట్టుకోవడంలో కలిగేది అమితమైన ఆనందం , అదే ఇతరులను (మనసులను ) పట్టుకోవడం లో మిగిలేది భరించలేని నొప్పి, దుఃఖం .


• నీ లోని నీ ఆత్మ మరియు నీ పై లోకంలోని శివ పరమాత్మ , కేవలం మూసిన కనులకు మాత్రమే చైతన్య శక్తి స్వరూపం లో కనిపిస్తారు. అందుకే అన్నాను , మూసిన కనులు మసకబారవు .


 ఓం శాంతి 🙏

 ఓం నమఃశివాయ 🙏

 యడ్ల శ్రీనివాసరావు 4 APR 2026 , 10:30 PM.


Tuesday, March 24, 2026

734. మలుపుల జీవితం

 


మలుపుల  జీవితం



• మలుపుల   జీవితం     మకరందం

  నా మలుపుల   జీవితం   మకరందం.

తలపు లన్ని     తరిగి   తరిగి

  శివుని    వలపుకి    చేరాయి .

• తపన లన్ని      తిరిగి   తిరిగి

  శివుని   కలిమి కి  చేరాయి.

  

• మలుపుల   జీవితం      మకరందం

  నా  

  మలుపుల   జీవితం   మకరందం .


• ప్రతి  మలుపు లోని    చీకటి

  ఓ  కొత్త   వెలుగు  నిచ్చింది  .

• ప్రతి  తలపు లోని     తరంగం 

  సరికొత్త    తీరం   చేరుస్తున్నాయి .


• ఆశించిన   ఆశల   కంటే

  ఆశించని    "అందల మై"

  సొంతమయ్యాడు    శివుడు .

• ఊహించిన   దారుల   కంటే

  ఊహించని    ఉన్నతులెన్నో 

  ధారణ   చేస్తున్నాడు   శివుడు .


• మలుపుల   జీవితం     మకరందం

  నా  

  మలుపుల  జీవితం    మకరందం.


• ఆట  తెలియని    

  ఈ  మనసు

  ఆడి ఆడి   అలిసింది .

• ఆడేందుకు   కాదు   

  నీ   మనసు

  అని

  ఆట కు  నిర్ణేతగా  చేశాడు  శివుడు .


• కోరుకున్న   వాటి   కంటే

  కొండంత   ఇస్తున్నాడు   శివుడు .

• ఈ ఆనందం    కొలవడానికి

  ఎన్ని   కాలాలు   పయనించాలో . 


• మలుపుల   జీవితం    మకరందం

  నా 

  మలుపుల   జీవితం   మకరందం.

• తలపు లన్ని    తరిగి తరిగి

  శివుని    వలపుకి   చేరాయి .

• తపన లన్ని    తిరిగి   తిరిగి

  శివుని    కలిమి కి   చేరాయి .


• మలుపుల    జీవితం   మకరందం

  నా 

  మలుపుల  జీవితం    మకరందం.



తలపు = ఆలోచన

తరిగి‌ = తగ్గి , కరిగి.

వలపు = అభిలాష , ప్రేమ 

తపన = ఆసక్తి ,  కోరిక , ఉత్కంఠ.

కలిమి = స్నేహం 



యడ్ల శ్రీనివాసరావు 24 March 2026 9:00 PM .


Monday, March 23, 2026

733 . నవ వసంతం

 

 నవ వసంతం 


• ఏ  సంతమిది     ఏ  వసంతమిది .

  సమిధలు    విరిసే    కాలమిది

  సమయం   చిగురించే   రాత ఇది .


• ఎగిరే   తూనిగ లు    పైరు  గాలిని

  పలకరించి   పోతున్నాయి .

• కలిగే    భావన లు     చిరు గాలి లో 

  చిలకరించి    వెళుతున్నాయి . . .

  నా పై   . . . 

  చిలకరించి     వెళుతున్నాయి.


• భావన లో       ఏముందంటే

  ఉరుము    లాంటి    సంతోషం .

• చిరుగాలి లో     ఏముందంటే

  చెప్పలేని      సంబరం .


• ఏ  సంతమిది      ఏ  వసంతమిది

  సమిధలు    విరిసే    కాలమిది

  సమయం   చిగురించే   రాత ఇది .


• పూత   పూసిన    మామిడి

  పిందె   అయిన   తరుణమిది.

• కూత    కూసిన   కోయిల

  అందె    వేసిన   సమయమిది .


• పంచభూతాల     సోయగాలు

  ప్రకృతి కి     పాదరవిందం .

• విను  వీధిన      వైభోగాలు

  ధరణి కి     దివ్యానందం .


• ఉత్సవాలు      ఉత్సాహలు

  మేళతాళాల     మేళవింపులు .

• పసిడి  పచ్చని     అందాలు

  పల్లవింపుల    పులకరింపులు . . . .

  నా    మది కే   పులకరింపులు .


• ఏ   సంతమిది     ఏ  వసంతమిది

  సమిధలు   విరిసే    కాలమిది

  సమయం   చిగురించే    రాత ఇది .


యడ్ల శ్రీనివాసరావు 23 March 2026 10:00 PM.


Sunday, March 22, 2026

732. ఋణానుబంధ రూపేణ

 

ఋణానుబంధ రూపేణ



• "మేము బాగా ఆధ్యాత్మిక సాధన, పూజలు , పుణ్యాలు చేస్తాము మాకు ఎందుకు కష్టం వచ్చింది , అనారోగ్యం వచ్చింది " అని అడుగుతారు , కానీ సూక్ష్మంగా చేసే పొరపాట్లు మరియు అనారోగ్యం తెచ్చుకోవడానికి కారణమైన ఆహారపు అలవాట్లు బుద్ధి లో స్థిరం గా  గుర్తు ఉండవు . అందుకే ఆ కర్మలను భరించడానికి కావలసిన శక్తిని భగవంతుని నుంచి కోరుకోవాలి . ఆ కర్మలను వదిలించుకోవడానికే మనం పుట్టాము  అని గుర్తు ఉంచు కోవాలి .

• మన తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి మన పిల్లలు , కుటుంబ పరిసరాలు , స్నేహితులు బంధువులు ఇవన్నీ చూస్తే మనము ఎలాంటి కర్మ చేసుకుని పుట్టి ఉంటాము అనే విషయం ఎవరూ చెప్పకుండానే అర్థం అయిపోతుంది.

  ఎంత కష్టంలో ఉన్నా కూడా మళ్లీ తప్పులు చేయకుండా ఉంచమని భగవంతుని కోరాలి, మళ్ళీ పాప కర్మలు చేయకుండా ఉంచినందుకు భగవంతుడుకి  కృతజ్ఞతతో  ధన్యవాదములు తెలియచేయాలి,

• కష్టాన్ని దాటించే నావలాగ భగవంతుని  తోడు మనం కోరాలి మరియు అలాంటి జీవితాన్ని మనం తయారుచేసుకోవాలి . అంతే కానీ , కష్టమే రాకూడదు అని అంటే , నువ్వు అంత పుణ్యం చేసి ఉండి ఉంటే నీకు ఈ కలియుగములో కష్టమైన జన్మ అనేది ఉండదు కదా...

• భూమి పైన పుట్టావు అంటే , అది కేవలం నీ ఋణం తీర్చుకోవడానికి మాత్రమే . ఎంతటి మహా యోగులైనా , మహా చక్రవర్తులైనా కర్మ భూమిలో పుట్టిన తర్వాత కష్టాలు తప్పించుకోలేరు .. అదే విధంగా దాటలేని కష్టం అంటూ ఏది లేదు. మనము ఎక్కువగా పట్టించుకుంటేనే  కష్టం , దానిగురించి ఆలోచించడం మానేసి , నేను చేయ వలసినది ఈశ్వర కర్తవ్యం అనుకొని , చేసుకుంటూ పోవాలి , అనుభవించే కొద్దీ ఆస్తులే కాదు కష్టాలు కూడా కరిగిపోతాయి .

• మనలో అందరూ ఎన్నో కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు   . . . 

గయ్యాళి భార్య నువ్వు చేసుకున్న కర్మ , 

బాధ్యత కలిగిన భర్త నువ్వు చేసిన పూజ ఫలితం ,

బిడ్డలు మీరు చేసిన ఋణాల ఫలితం , 

స్నేహితులు బంధువులు చేసిన దానాలకు ఫలితం ,

తల్లిదండ్రులు నువ్వు చేసిన ఆధ్యాత్మిక ధర్మ కార్యాలకు ఫలితం , 

వృత్తి వ్యాపారం  సృష్టి లోని సర్వ ప్రాణుల పట్ల ఉండే నీవు చూపిన భూత దయకు ఫలితం .

అందుకే ఋణానుబంధ  రూపేణా కనుక నువ్వు ఎవ్వరినీ నిందించడానికి అవకాశం లేదు . ఎందుకంటే    కోపం లో   ఒక మాట అయితే తరచూ   అంటుంటాము , “నా కర్మ కొద్దీ దొరికావు” అని . అది నిజం , మనకు ఈ జన్మలో దొరికిన వారు  అన్నీ  కూడా చేసిన కర్మల అనుసారమే . చేసిన పాప కర్మలు బాధించి , పుణ్య కర్మలు రక్షించి మనకు విముక్తి కలిగిస్తాయి .

మనం గత జన్మల లో చేసిన పాపాల రూపం వీళ్ళందరి  రూపంలోనే , అలాగే చేసిన పుణ్యాల రూపం కూడా వీరి రూపంలోనే  ఉంది , అనే విషయం గ్రహించి వాళ్ళను భరించే శక్తిని భగవంతుడుని కొరుకుని  , వారిని మీ ఆధ్యాత్మిక సేవ ద్వారా, యోగ సాధన ద్వారా మళ్ళీ ఆ బంధాలను గొప్పగా మార్చుకునే రాతను అవకాశం భగవంతుడు నీకు ఎప్పుడో ఇచ్చాడు . అదే నిత్యం శివ స్మృతి తో కొత్తగా ఏ పాప కర్మలు చేయకుండా జీవితాన్ని ఉన్నంతలో ఉన్నతంగా జీవించాలి .. చేతనైన సహాయం చేద్దాము ఒకరికి సహాయం చేయకపోయినా ఒకరికి ద్రోహం చేయకూడదు ఒకరి గురించి మంచి చెప్పకపోయినా  చెడు ప్రచారం చేయకూడదు.. అసూయ, అహంకారం , ఈర్ష్య , కామం , క్రోధం చాలా ప్రమాదం అవి మనకు శత్రువులు వాటిని వదిలేద్దాము . 


 శ్లోకం !!

• ఋణానుబంధ రూపేణ ! 

  పశు పత్ని సుతాలయాః !

  ఋణక్షయే క్షయం యాంతి! 

  కా తత్ర  పరిదేవనా !! హితోపదేశం .

  పశువులు , భార్యాపుత్రాదులు  , ఇళ్లు వాకిళ్లు బంధువులు స్నేహితులు - ఇవి ఋణానుబంధ రూపముగా వచ్చి , ఋణము తీరగనే  మళ్ళీ మనుష్యుని వదలి పోతున్నాయి. అట్టి వానిని గూర్చి తెలివైన జ్ఞానులు  అర్ద సహితం గా వేల సంవత్సరాల క్రితం  విచారించారు . 

మనిషి మహాజ్ఞాని . . . అని ఉద్దేశిస్తూ చేసిన ఉపదేశం ఇది .

 పశువులు , భార్యా భర్త పుత్రులు , ఇళ్ళు వాకిళ్ళు , ధనం , బంధువులు స్నేహితులు, ఏవి పోయినా దుఃఖించటం  తగదు . జ్ఞాని అయిన మానవుడు ఎన్నడూ వీటి నుంచి దుఃఖం పొందడు - అని గీత లో చెప్పబడింది.

• ఆధ్యాత్మికత మరియు శివుని జ్ఞానం ద్వారా మానవుని యొక్క సమస్త ప్రశ్నలకు, సమస్యలకు , వికారాలకు , వివాదాలకు , అన్నిటికి చక్కటి పరిష్కారాలు శివుని రాజయోగ  విద్య ద్వారా లభించును .

• సహనం తో  సేవ , ప్రేమతో సాధన చేయడం ఆరంభిస్తే జీవితంలో సుఖ, శాంతులను పొందగలం. సుఖం శాంతి అనేవి మనిషి మరణం పొందిన తరువాత ఆత్మ  పొందవలసినవి  కానే కావు , దేహం తో మనం జీవించి ఉన్నప్పుడే మన ఆత్మ అవి పొందాలి , అనుభవించాలి , అప్పుడే ముక్తి జీవన్ముక్తి.

• శివుని కి చేరువయ్యే సమయంలో ప్రతీ సూక్ష్మం స్పష్టం . అర్దం చేయించేది శివుడు, చేసుకో వలసినది మన బుద్ధి.

చేసిన బుణం  తప్పని సరిగా  తీర్చ వలసిందే . ఆ బుణం  తిరిగి చెల్లించలేని  దుస్థితి లో  ఉన్నప్పుడు  శివ స్మృతి ఉండాలి . ఎందుకంటే బుణాలను కరిగించే వాడు శివుడు .  కరిగించే వాడే కానీ , తొలగించే వాడు కాదు . 

అంతే గానీ బుణాలను తప్పించుకొని తిరగడం అసంభవం. ఎన్ని జన్మలెత్తినా బుణాల నీడలు  జాడలు  నిన్ను అల్లుకొని , నీ చుట్టూ నే తిరుగుతూ ఉంటాయి . ఇదే జీవన సత్యం.

మనకు ఉన్న బాధ్యత యే  బుణం .

సర్వం  శివ మయం


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 18 March 2026 . 10:30 PM.



Wednesday, March 18, 2026

731. యుగాది

 

యుగాది



• ఉగాది   ఉగాది

  యుగముకి   జీవం  పోసే   ఆది .

• యుగములు    నాలుగైనా

  ఉగాదులు   మాత్రం   ఎన్నో . . . ఎన్నెన్నో…


• ఉగాది    ఉగాది

  యుగముకి    జీవం  పోసే   ఆది .

• ఈ  కాలం  లోని    సౌందర్యం

  మనసు   కోరుకునే    ఔషధం .

• ఈ  సమయం  లోని   సంతోషం

  మనిషి    అనుభవించే   ఇంధనం .


• ఉగాది    ఉగాది

  యుగముకి   జీవం   పోసే   ఆది .

• మామిడి    చిగుళ్ళు

  మది   పచ్చదనానికి   తోరణాలు  .

• కోయిల     సవ్వళ్లు

  శ్రవణ    సొంపుల    తరంగాలు .


• ఉగాది    ఉగాది

  యుగముకి    జీవం  పోసే  ఆది .

• యుగములు     నాలుగైనా

  ఉగాదులు   మాత్రం    ఎన్నో . . . ఎన్నెన్నో…


• భావోద్వేగాల    సంబరం 

  షడ్రుచుల        మేళనం .

• కొత్త  ఆశల      అంబరం 

   రాశిఫలాల      రాజసం .


• పంచాంగ    శ్రవణం 

  పంచభూతాల    ఆశీర్వాదం .

• ఈ ఆచారాల    సాంప్రదాయం

  తెలుగు  సంస్కృతి     ఉల్లాసం.


• ఉగాది      ఉగాది

  యుగముకి    జీవం  పోసే   ఆది .

• యుగములు    నాలుగైనా

  ఉగాదులు  మాత్రం   ఎన్నో . . . ఎన్నెన్నో…


• బుతువుల    బుణానుబంధం

  ఈ వసంతాల    వైభోగం .

• ఉగాది    ఉగాది

  యుగముకి   జీవం   పోసే   ఆది .



ప్రపంచ వ్యాప్తంగా 

" గోదావరి గలగలలు "  బ్లాగు ను 

ఆదరిస్తున్న తెలుగు వారందరికి 

నా హృదయ పూర్వక 

కృతజ్ఞతలు 🙏

  ఉగాది శుభాకాంక్షలు 💐 .


ఓం శాంతి

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 18 March 2026 , 9:00 PM.



Tuesday, March 17, 2026

730. యజ్ఞం దాహం

 

యజ్ఞం  దాహం 



ఒక ఊరిలో యజ్ఞం జరుగుతోంది యజమానికి యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది. ఆయన ఆశ్చర్యపోయాడు .

అప్పుడు భార్య ఇలా చెప్పింది.

“నిన్న పొరపాటున యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాను . అదే ఈ రోజు బంగారు ముద్ద అయింది.”

ఇంటి యజమాని పరీక్షించేందుకు తానూ యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాడు .

మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది.

ఈ వార్త ఆనోటా ఈ నోటా పాకింది. అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞ కుండంలో ఊసేశారు . బంగారు ముద్దలు పొందారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.


“యజ్ఞం పవిత్రమైనది. యజ్ఞ కుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం. నా కర్తవ్యం. బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే  బద్దలైనా  నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు” అన్నాడాయన.


 ఊరు ఊరంతా ధనవంతులయ్యారు . ఒక్క అర్క సోమయాజి తప్ప.

ఆయన భార్యకు ఇది నచ్చలేదు.

“మనమూ ఉమ్మేద్దాం . బంగారం పొందేద్దాం” అని నచ్చచెప్పింది .

అర్కసోమయాజి  ససేమిరా అన్నాడు.

చివరికి ఆమె కోపంతో పుట్టింటికి పయనమైంది .

ఆమెకు నచ్చచెబుతూ అర్క సోమయాజి కూడా ఆమె వెనకే వెళ్లాడు.

ఊరి పొలిమేర దాటాడో  లేదో... ఊళ్లో పెద్దగా గొడవలు మొదలయ్యాయి. బంగారం ముద్దల పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇళ్లు కాలిపోతున్నాయి . మనుషులు చచ్చిపోతున్నారు. మొత్తం ఊరు ఊరు బూడిదైపోయింది. ఒక్కరూ మిగల్లేదు.

అర్క సోమయాజి, ఆయన భార్య తప్ప.


అప్పుడే *కలిపురుషుడు* వారికి ఎదురు వచ్చాడు.

ఇన్నాళ్లూ నువ్వున్నావనే ఊరిని వదిలేశా. ఊరు ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా, నువ్వు, నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది.

అందుకే నువ్వు ఊళ్లో ఉన్నంత సేపూ ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేయగానే నాపనిని నేను చేసి, ధర్మ హీనులను ధ్వంసం చేశాను. అన్నాడు కలిపురుషుడు.

...*ధర్మం తప్పని వాడు ఎప్పుడూ విజేతే*...

ధర్మం ఆచరించే వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు అయినప్పుడు అది చూసి కొందరు మూర్ఖులు నవ్వుతూ హేళన చేస్తూ రాక్షసానందం పొందుతారు ...

కానీ చివరకు  *ధర్మమే గెలుస్తుంది* ...

II ధర్మో రక్షతి రక్షితః II.

పై కధ  రాసిన  రచయిత కి  మనస్ఫూర్తిగా ధన్యవాదాలు .🙏


ప్రతి  మనిషి  ఆలోచనల తోనే  కర్మలు చేయడం ఆరంభిస్తాడు  .  ఆ ఆలోచనలే  ఒక శక్తి  అయి  తన చుట్టూ ఒక (ఆరా) వలయం వలే ఏర్పడుతుంది.   ఈ ఆలోచనలు మంచివి లేదా చెడువి  ఏవైనా అయి ఉండవచ్చు. 

ఉదాహరణకు  పాజిటివ్ ఆలొచనలు కలిగి ఉండి , ధర్మ యుక్తం గా మనిషి  కర్మలు ఆచరిస్తున్నపుడు   తనలోని ఆరా తనకు మరియు  తన చుట్టూ ఉన్న కుటుంబీకులకు , సమాజం లోని అందరికీ ఒక రక్షణ కవచం వలే ఏర్పడి , నీడ వలే ఉంటుంది . ఇక్కడ  అర్దం చేసుకో వలసిన విషయం , మంచి  అనేది   చెడు ను కూడా సంరక్షిస్తుంది.  

ఏనాడైతే మంచి అనేది  దూరం అవుతుందో , అప్పుడు చెడు స్వైరవిహారం  చేస్తుంది , పిదప చెడు తనను తానే  శిక్షించుకొని  చివరికి  భక్షించు కుంటుంది .  అదే  కలిపురుషుడు  లీల .

మంచి  అనేది  చెడుని ఆకళింపు చేసుకుని ఉండగలదు. మంచి లో ఉండేది  భగవంతుని శక్తి .  అందుకే భగవంతుడు అయిన శివుడు తారతమ్యం ఎరుగక  అందరినీ ఆదరిస్తాడు .  అందరినీ మంచి గా మార్చడానికి కావలసిన శక్తిని ధారణ చేస్తాడు .

చెడు మాత్రం  మంచి తో   కలిసి  సుధీర్ఘంగా ఉండలేదు. చెడు లో  ఉండేది అసుర శక్తి . అందుకే అసురుడు అయిన రావణుడు ,   శివుని (మంచి) చెంత  చేరినప్పటికిని  తన బుద్ధి హీనత వలన  కామాంధుడై  చివరికి శివుని (మంచి) విడిచి  పోతాడు .

మంచి కి   ,  చెడు కు   ఉన్న   భేదం  ఇదే .

మంచి చెడు అనేవి మనుషుల లో ఉండే గుణాలు మరియు  లక్షణాలు . మనుషులు ఎంచుకున్న  స్నేహాలు , సాంగత్యాల లో  కూడా ఇవి ప్రస్ఫుటంగా  కనిపిస్తాయి .  అందుకే అనుభవజ్ఞులైన పెద్దవారు  అంటారు ,  నీవు ఎలాంటి వాడివి  అనేది , నీ  స్నేహితులను , నీ సాంగత్యాలను  చూసి  చెప్పవచ్చు  అని . . . 


ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 17 March 2026 , 8:00 PM.


736. నీ తోడు - భాగస్వామ్యం ఎవరు ?

  నీ తోడు - భాగస్వామ్యం ఎవరు ? • ఈ భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి కి ఒక తోడు అవసరం. ఆ ప్రాణి మనిషి  , పక్షి , పశువు , జంతువు ఇలా ఏ రకమైన జ...