Wednesday, July 15, 2026

767. ఇది మనం గమనిస్తున్నామా ?

 

  ఇది మనం గమనిస్తున్నామా ?




• మనకు గుర్తు ఉందా ? 2000 సంవత్సరం కంటే ముందు పుట్టిన మనం మన చిన్న తనం , ఇంట్లో పెరుగుతూ ఉన్న సమయంలో తల్లి తండ్రులు, పాఠశాల లో ఉపాధ్యాయులు తరచూ మనకు నీతి ని బోధించే వారు . వారికి మనసు లో మన పట్ల  ప్రేమ మమకారం ఉన్నా సరే బయటకు పెద్ద గా వ్యక్త పరచకుండా , కేవలం వారి దృష్టి మన నడవడిక మీద పెట్టి గమనిస్తూ ఉండేవారు .

 ఎందుకంటే నడవడిక సరి లేక పోతే, వీడు భవిష్యత్తులో ఎందుకు పనికి రాకుండా పోతాడు అనేవారు .   అంటే దాని అర్థం ఏ పని (వృత్తి) చేయలేడు అని కాదు . ఏ పని ని బాధ్యతాయుతంగా చేయలేడు అని అర్థం . అంటే ఒక మనిషి నడవడిక, ప్రవర్తన సరిగా లేకపోతే అత్యంత ప్రమాదకరమైన స్థితి , ఆ మనిషి కే కాదు భవిష్యత్తులో తన కుటుంబానికి , చుట్టూ ఉన్న సమాజానికి కూడా చేటు జరుగుతుంది అని , మన తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు ఆలోచించే వారు . వారి ఆలోచన సరళి కొంత వయసు వరకు , కాస్తంత కఠినం గా అనిపించినా . . . అందులో సూక్ష్మం మాత్రం ఆ వ్యక్తి శ్రేయస్సు , సమాజ శ్రేయస్సు దాగి ఉండేది ‌. 

 ఒక తప్పు చేస్తే చాలు దండించే వారు . శిక్షించే వారు .  తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనే భయం , భావన మన బాల్యం నుంచే ప్రతి ఒక్కరికీ ఆ రోజుల్లో అనుభవం అయ్యేది , ముఖ్యం గా మనసుల్లో ముద్రించుకు పోయేది.

• ఒకవేళ తప్పులు  చేసి కప్పి పుచ్చుకొనో  లేక శిక్షలకు దొరకకుండా పెరిగిన వారు , ఆ తప్పుడు పనుల స్వభావం తోనే  నేటికీ జీవిస్తూ ఉంటారు అనడం లో సందేహం లేదు .  అది వారికి బాల్యం నుంచి ఒక అలవాటు తో కూడిన ఆనందం అవుతుంది ‌. ఎందుకంటే వారికి తమ స్వభావం పట్ల పరిపక్వత ఉండదు . “మొక్కై వంగనిది మానై వంగునా “ అని అందుకే అంటారు.


• ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థల్లో , సమాజం లో , ప్రజలకు సేవ చేస్తాం అని చెప్పే రాజకీయ పార్టీ ల్లో ,  ప్రతీ చోట బహిరంగంగా వికృత వికార చేష్టలతో, హింస తో అనేక మంది  ప్రత్యక్షం గా పార్కుల్లో , వేదిక ల పైన , యూట్యూబ్ వీడియోల లో విచ్చలవిడి వికారీ  చేష్టలతో ప్రవర్తిస్తూ ఉండడం మనం గమనిస్తున్నాం . ఇటువంటి వారు ముమ్మాటికీ తల్లి తండ్రుల , ఉపాధ్యాయులు చెప్పిన నీతి ని చిన్న తనం నుంచి ఆచరించని వారే. ఇటువంటి వీరే సంఘవిద్రోహ శక్తులు గా తయారవుతూ సమాజం లో స్వేచ్చ ను హరిస్తూ , సామాన్య పౌరులకు శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నారు. 

ఇది ప్రత్యక్షంగా   మన సమాజంలో ప్రతి రోజూ నేడు నిత్యం అనుక్షణం చూస్తున్నాం . ఇది ఇంతింతై అన్నట్టుగా పెరుగుతూ ఉంది కానీ , … నీతి , విలువలు , అభ్యుదయ భావాలు లాంటి విషయాలు, మాటలు జీర్ణించుకోలేని దుస్థితి కి నేడు అధిక శాతం యువత తయారవుతుంది అనడం లో సందేహం లేదు. ఇందులో గంజాయి, మాదకద్రవ్యాలు, మద్యం వంటివి వీరికి ప్రోత్సాహకాలు గా అందించే రాజకీయ వ్యవస్థలు తయారు అయ్యాయి . 

 వారిలో ఉన్న ఆలోచన మంచి ని ప్రేరేపిస్తుందా  లేదా చెడు ని ప్రేరేపిస్తుందా అనే కనీస మానసిక అవగాహన లేకుండా, సరియైన పునాది లేని వ్యక్తిత్వం తో , హద్దులు లేని స్వేచ్చ తో , తమో గుణ ప్రవర్తన ను ఆచరించడానికి పూర్తిగా అలవాటు పడి పోయారు . దీనికి ప్రధాన కారణం నేడు కాలం లో విస్తృతం గా వ్యాపించిన ఇంటర్నెట్ మాయా కమ్యూనికేషన్. 


• ఇదంతా చివరికి …. దేనికి చేరువ అవుతుంది అంటే  వినాశనానికి . జన జీవన వినాశనానికి . కుటుంబ  వ్యవస్థ ల  వినాశనానికి . ఇప్పటికే ఈ వినాశనం  బీజం పడి  మొలకెత్తి వృక్షం అయి , అంట్లు గా సమాజం లో అల్లుకుపోయింది . దీనిని నివారించడం అసాధ్యం అనేంతగా తయారయ్యింది .  

• గమనించండి ….. 2000 సంవత్సరం కంటే ముందు కాలం లో సమాజం, జన జీవనం , ప్రకృతి ఇంత అలజడుల తో ఉండేదా . నేడు 50 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతీ ఒక్కరికీ తమ జీవితాల ద్వారా ఇదంతా ప్రత్యక్ష అనుభవం కావడం లేదా?


• మనిషి కి బాల్యం నుంచి పెరుగుతూ ఉన్న సమయంలో నీతి కధలు, నీతి , విలువలు, కష్టం సుఖం , మంచి చెడు , పరులకు సహాయం , దైవం వంటివి తెలియక పోతే మొదట నాశనం అయ్యేది ఆ మనిషే , తరువాత తన కుటుంబం లోని భార్య , భర్త , పిల్లలు …… ఆ తరువాతే సమాజం . వాడు ఎంత ధనవంతుడైన , పేదవాడు అయినా జరిగేది ఇదే . 

• నేడు మనం అవసరాలకు మించిన ధనం సంపాదిస్తూ , సౌకర్యాలు అనుభవిస్తూ అభివృద్ధి చెందుతున్నాం,  నాకేంటి!  అనే మాయా ముసుగు లో  పైకి  జీవిస్తున్నాం , మంచిదే . . .  కానీ అంతకంటే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిత్వాలు కలిగిన మనుషుల తో , వైట్ కాలర్ సైకో లతో ( పైకి సాధారణంగా కనిపించే ఉన్మాదులు), ప్రమాదకరమైన మానసిక రోగులతో కలిసి ఇటు కుటుంబ వ్యవస్థ లలో , అటు సమాజం లో కలిసి సహ జీవనం చేస్తూ ఉన్నాం . అందువలనే క్రైమ్ రేటు ఇంతగా పెరుగుతుంది . ఇందులో ప్రధాన మొదటిది అక్రమ శారీరక సంబంధాలు, రెండవది అక్రమ ధన సంపాదన .  

• ఇటీవల పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా గత 15 ఏళ్ళలో సమాజంలోని ప్రజలు , మానవ జీవితాల పట్ల చేసిన దురాగతాలు బయట పడుతుంటే , డబ్బు కోసం ఆమె ప్రవర్తించిన తీరు చూసినప్పుడు ఆలోచిస్తే …… ప్రాథమికంగా ఒకటే లోపం అనిపిస్తుంది . . . ఆమె పెరిగిన తీరు , పెంపకం లో లోపం , స్వభావం లోని లోపం . ఆమె కి ఎంతో ధనం సహజంగా ఉండి ఉన్నా సరే అత్యాశతో చేసిన దురాగతాలు . ఇటువంటి కొందరు నాయకులు దేశం నిండా అనేకులు వ్యాపించి ఉన్నారు .  ఇది కేవలం రాజకీయ నాయకులకే కాదు , సర్వ మానవాళిలో ఈ స్వభావం ఎంతో కొంత అటుఇటుగా వ్యాపించుకు పోయి ఉన్నాది .


• ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లో ఉన్న ప్రతి మనిషి కి రక్షణ , ఉన్నంతలో జీవన సంతృప్తి ఉండేది . మనుషుల మధ్య ఎన్ని అంతర్యుద్ధాలు వచ్చిన తెల్లారే సరికి సమసిపోయి, అందరూ కలిసి ఉండేవారు. విలువలు ఉండేవి . పిల్లలు పెంపకం జీవన విధానం విలువలతో బాగుండేది . ఏదైనా సమస్యను అనుభవం తో  యుక్తిగా , ఎలా  పెద్ద వారు పరిష్కారించు కుంటున్నారో ప్రత్యక్షంగా పిల్లలు గమనించే వారు , సమాజం లో నలుగురితో ఎలా మెలగాలో , ఇంటి వాతావరణం నుంచే అలవడేది . కానీ నేటి కాలంలో మన ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో మనకు మనమే ప్రశ్నించుకోవాలి, ఆలోచించు కోవాలి .  

భర్త మంచి చెపితే భార్య కి నచ్చదు, భార్య మంచి చెపితే భర్తకు నచ్చదు. అహంకారాలతో  కూడిన ఈ  విభిన్న వ్యక్తిత్వాలు , మనస్తత్వాలు కలిసి తమ శారీరక సుఖం మరియు సామాజిక అవసరాల కోసం కలిసి జీవిస్తున్నాం అన్నట్లు ఉంటుంది . కానీ  ... వారి  తీరు , ప్రభావం  వారి  పిల్లల  పై  ఏ విధంగా  ప్రభావితం అవుతుందో  అని గమనించే స్థితిలో లేము , అనేది వాస్తవం . ఇక పిల్లల వ్యక్తిత్వాన్ని  ఇటువంటి తల్లిదండ్రులు ఎలా తీర్చి దిద్దగలరు ?


నేటి స్వతంత్ర కుటుంబాలలో మనిషి కి అవసరానికి మించిన  ధనం , స్వేచ్ఛ , తద్వారా విచ్చలవిడితనం లభిస్తుంది . . . అంతకు మించి వీటి ద్వారా మనిషి  ఏమి కోల్పోతున్నాడో తాను తెలుసుకో లేక పోతున్నాడు  . 


• మన ఇంటి పెరట్లో పెరిగిన మొక్క కి చీడ పడితే , ఇంటిలో మిగిలిన మొక్కల కి విస్తరిస్తుందని తెలిసి తీసి బయట పడెస్తాము , వెంటనే వీధి లో మొక్క లకు కూడా ఆ చీడ సోకుతుంది . అలా కాకుండా ఆది లోనే నివారించడానికి మంచి ఘాటైన మందు ఇంటి పెరట్లో నే పిచికారి చేస్తే , ఆ చీడ బయట మొక్కలకు వ్యాపించదు . ఒకవేళ ఆ మొక్క శ్రేష్టమైనది అయితే పట్టిన చీడ నుంచి బయటపడి వృద్ధి అవుతుంది . శ్రేష్టమైనది కాకపోతే పిచికారి చేసిన మందుకి చీడ తో పాటు కలిసి చస్తుంది . 

అదే విధంగా, మనలో  మొలకెత్తిన రాచపుండు ను ప్రాధమిక స్థాయిలో నిర్మూలించక పోతే, అదే కాన్సర్ అయి మనల్ని నిర్మూలిస్తుంది. . .  ఇక్కడ రాచపుండు అంటే అవగుణాలు , వికారాలు పైత్యాలు.


• మంచికి , మార్పుకి  పునాది  మన మనసు ,  మన చేతులు , మన చేతలే అవుతాయి  కానీ , మన చుట్టూ ఉన్న సమాజం కాదు . 

అంతర్ముఖం  ‌శుద్ధి గా  లేకపోతే  బాహ్య ముఖం అష్ట వంకరలతో  (వికారాల తో)  కనిపిస్తుంది . 




నిశితంగా గమనించాలి 🙏 . . .   
మనిషి చైతన్యం , వర్తమాన కాలంలో వాస్తవాల కోసమే  ఈ రచన. . .  అంతకు మించి ,  ఏ మనిషి ని  విమర్శించడానికి  , లోపాలను ఎత్తి చూపడానికి  కాదు .  ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూపుడం వలన ఎవరికీ ఏ ప్రయోజనం ఉండదు. ఎవరిని వారే శుద్ది చేసుకోవాలి .


  ఓం శాంతి 

  ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 15 July 2026 11:30 AM 


Monday, July 13, 2026

766. ఆధ్యాత్మికత - పురోగతి

 

ఆధ్యాత్మికత - పురోగతి 



• భగవంతుని సాన్నిధ్యాన్ని ఒక్క క్షణమైనా నిజంగా అనుభవించ గలిగితే , అది మన జీవితంలో వెలుగును వెలిగించడానికి చాలు. దీపం వెలిగితే నీడ కూడా వెంట వస్తుంది. కానీ ఆ వెలుగు మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జీవితానికి కొత్త దిశను చూపుతుంది.


• ప్రతిసారి భగవంతుని గురించి ఆలోచించినప్పుడు, అది ఒక అద్భుతమైన దివ్య శక్తిని అనుభవించినట్లుగా అనిపిస్తుంది. భగవంతుడు ఉన్నాడా లేదా అనే వాదన కంటే, మన విశ్వాసమే ఆయనను లేదా ఆయన శక్తి ని మన హృదయంలో సజీవంగా నిలబెడుతుంది.


 మనలో ఒక అద్భుతమైన శక్తి ఉంది. అదే మనకు జీవించే ఉత్సాహాన్ని, ఆలోచించే సామర్థ్యాన్ని, కార్యాచరణను ప్రసాదిస్తుంది. ఆ శక్తిని మనలో నింపింది ఎవరు? ఆ పరమశక్తినే మనం భగవంతుడు అని పిలుస్తాం.

విభిన్న అభిప్రాయాలు ఉండటం సహజం. కానీ ద్వేషం ఈర్ష్య అసూయ మాత్రం ఎప్పటికీ ఎవరి పట్ల సమర్థనీయం కాదు.  “విజ్ఞానాన్ని ఎప్పుడూ మనస్సాక్షి  నడిపించాలి .” 


• చరిత్ర ఎల్లప్పుడూ భవిష్యత్తుకు పాఠాలు నేర్పుతుంది. ఆధునిక యుగంలో కూడా సూర్యుడు తూర్పునే ఉదయిస్తూ పశ్చిమ దిక్కునే అస్తమిస్తాడు.  సత్యాలు ఎన్నటికీ మారవు . అవి సృష్టి నియమాలు. వాటిని గౌరవించడం , అనుసరించడం , ఆచరించడం   మన బాధ్యత.


• మన ప్రతి శ్వాస‌ , ప్రతి ఉచ్ఛ్వాసం, ప్రతి నిశ్వాసం ఒక పరమశక్తి దృష్టిలోనే జరుగుతుంది. ఆ శక్తిని మనం ఏ పేరుతో పిలిచినా పరవాలేదు. కానీ మన సమాజాన్ని నిర్మించి, ముందుకు నడిపించిన విలువలను, విశ్వాసాలను, సంప్రదాయాలను , మూలాలను  గౌరవించండి.


• అద్దం ముక్కలుగా పగిలిపోయినా, ప్రతి ముక్కలో మన ప్రతిబింబం కనిపిస్తుంది. తన స్వభావాన్ని అది కోల్పోదు. అలాగే మనం తెలిసో తెలియకో తప్పులు చేసినా, భగవంతుడు మనల్ని విడిచిపెట్టడు.

మన కర్తవ్యం , జ్ఞానంతో ఆయనను తెలుసుకోవడం, స్థిరమైన విశ్వాసంతో ఆయనను నమ్మడం, నిర్మలమైన హృదయంతో ఆయనను అంగీకరించడం.


• జీవన పురోగతి కి అవసరమైన వృత్తి ఉద్యోగం , కుటుంబ పోషణ వృద్ధి పై దృష్టి సారించడం ప్రతీ ఒక్కరి భాధ్యత . అదే విధంగా ఉన్న కొద్ది పాటి విలువైన జీవితాన్ని కుట్రలకు కుతంత్రాలకు కామ వికారాలకు వ్యర్థ విషయాలకు తావు ఇస్తూ  కాలయాపన చేస్తే . . . భవిష్యత్తులో మరింత దుర్భరమైన కాలం లోకి మానవ జీవిత ప్రయాణం ఉంటుంది. అది ఆర్తనాదాలు తో నిండి ఉంటుంది అని అనడం లో ఏ సందేహం లేదు.  

సత్యం పలకడం , సత్యం ఆచరించడం అనేది నరం లేని ప్రతి నరుడి నాలుక కి ప్రాధమిక అవసరం . 

• ఆద్యాత్మికత అంటే వృద్దాప్యం లోకి అడుగుడిన తరువాత లేదా అవయవాలు సహకరించక , శరీరం మూల చేరిన సమయం లో మాత్రమే మనిషి కి అవసరం అనుకునే పుంగవులు , తమ యొక్క పాపాల భారాన్ని ఒక అనంతమైన నిధి వలే తమ తలపై జన్మ జన్మల కోసం సమకూర్చుకుంటున్నారు అని అర్దం. 

మనలో సత్యత  చిగురించినపుడే  సత్ సాంగత్యం పొంద  గలము. సత్ సాంగత్యాలు మాత్రమే సన్మార్గం లో నడిపిస్తాయి.

ఓం శాంతి 

ఓం నమఃశివాయ 

ఆత్మ 

13 July 2026 , 11:30 PM.


Friday, July 3, 2026

765. జీవాత్మ సత్యం

 

జీవాత్మ సత్యం 



• ఏది నాది . . . ఏది నీది

  నాది అనుకున్న దంతా  

  ఏమైందో  . . .  ఈనాడు .


• నాద నే   ధనము కై  

‌ రేయి పగలు   పరుగు లెట్టాను . 

• నావి   నావను కొని   

  వస్తు   వైభోగాల కై 

‌  వెంపర్లు  పడ్డాను . 


• ఏది నాది . . . ఏది నీది 

  నాది అనుకున్న  దంతా  

  ఏమైందో . . . ఈనాడు .

  

• దేహము  పై   ప్రీతి తో  

  పన్నీరు   స్నానాలు   చేసాను . 

• నా సొగసు   సౌందర్యానికి  

  తీరిక లేని   సేవ  లెన్నో చేసాను .


• బంధు    మిత్రులను 

  రాజభోగాల తో   సత్కరించాను .

• తరతరాలకు   తరగని 

  ఆస్తుపాస్తులెన్నో    కూడ  గట్టాను . 



• ఏది నాది . . . ఏది నీది 

  నా దను కున్న దంతా  

  ఏమైందో . . . ఈనాడు .


• నను    నట్టింట   చాప లో 

  నేడు    చుట్టి   పెట్టారు.

  ఏమైంది  . . .  నాకు  .

• నా  అనుకున్న   వారంతా 

  నను   తాకటం  లేదు . 

  ఏమైంది  . . .  నాకు 


• ఎవరు నేను   . . ‌.  ఎవరు నేను 

  నను   నేను   మరిచి  తిరిగాను ఇన్నాళ్లు

   ఎందుకో .

• ఆలు   బిడ్డలే    శాశ్వతమని

  తండ్రి  తో     బంధం  

  ఎరుగక    జీవించాను.

• ఆ   బంధం కోసం   నేడు

  ఆరాట పడుతుంటే  

  దేహము  లేక   . . . దేహము లేక 

  దిక్కులు   చూస్తున్నాను .


• ఏది నాది . . . ఏది నీది 

  నా దను కున్న దంతా  

  ఏమైందో . . . ఈనాడు .


శరీరము ఉన్న సమయంలో నే , ఈ సృష్టి  మూలానికి  తండ్రి  అయిన శివ పరమాత్మ తో   స్మృతి బంధం  కలిగి ఉంటే , శరీరం వదిలిన తరువాత ఆయన సన్నిధి చేరడం సాధ్యం అవుతుంది . 

ప్రాపంచిక , సంసార బంధాలలో ఉంటూ , తండ్రి శివుని తో బంధం కొనసాగించడమే  జీవుని కి కర్మ బంధ మోక్షం . 

జీవునికి  శరీరం ఉన్నప్పుడు కంటికి కనిపించక , శరీరం లేనప్పుడు  ఆత్మ కి  కనిపిస్తూ  అన్ని వేళలా శాశ్వతం గా   తోడు  ఉండేది  శివుడు ఒక్కడే . 

అందుకే శివుని పూజించాలి , ప్రేమించాలి ,  ధ్యానించాలి .

 

ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

ఆత్మ   4 July 2026 10:00 AM.



Wednesday, July 1, 2026

764. స్వస్థితి - పరస్థితి

 

స్వస్థితి - పరస్థితి


• స్వ అంటే స్వయం , ఆత్మ , మనసు అని  అర్థాలు ఉన్నాయి . స్థితి అంటే ఉండవలసిన విధానం . 

  మన మనసు గాని , ఆత్మ గాని ఆచరిస్తూ ఉండవలసిన విధానమే మన స్వస్థితి .   

  పర స్థితి నుంచి వచ్చిన పదం పరిస్థితి . పరిస్థితి అనగా  మనది  కాని  స్థితి అదే  పర స్థితి . 


• మనం అనేక సార్లు అంటుంటాం . . . పరిస్థితి ల వలన అలా జరిగింది , ఇలా జరిగింది అని .  

  మనలో ఉన్న మన బుద్ధి మన యధార్థ  స్థితి ని తెలుసుకొని    స్వ స్థితి ని  కలిగి  ఉన్న నాడు, పరిస్థితులు (పర స్థితిలు) మనపై ప్రభావం చూపవు. అనగా మన చుట్టూ ఉండే పరిస్థితి లు మనల్ని లోబరుచుకో  లేవు . 


• అసలు  స్వ స్థితి లో  ఉండ వలసిన ఏడు గుణాలు ఏమిటి అంటే . . . శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం , జ్ఞానం (సత్యం), శక్తి , పవిత్రత . ఇవే మనల్ని దేని పైనా ఆధారపడకుండా జీవితాన్ని తీరం దాటించే సుగుణాలు . ఇవే  మన స్వస్థితి అనే వృక్షానికి బలమైన కొమ్మలు . 

  ఇవి మనలో బలహీనం అయినపుడు పరిస్థితి, పర స్థితి ల పై ఆధారపడటం , ఆ పర స్థితులకు  మనం లోబడి ఉండడం ,  వికారీ గుణాలకు దాసోహం కావడం , తద్వారా చెడు కర్మలు చేసి  దుఃఖం పొందడం వంటివి జరుగుతూ ఉంటాయి . 

గమనించాలి . . .  స్వ స్థితి  అనే మాట వినగానే  మనం  సహజంగా  అనుకునే  నేను  నాది  అనే అహంకార  సంస్కారం  కాదు . అదే విధంగా పర స్థితి అంటే  ఇతరులు , పరులు అని కూడా కాదు .  


• స్వ స్థితి లో ఉండ వలసిన గుణాలు కాకుండా మరే ఇతర ఏ గుణాలను అయినా మనం మనసు తో ఆహ్వానించి నా , వాటిని కలిగి ఉన్నా సరే పరిస్థితి లకు లొంగి  జీవించ వలసిందే . పర స్థితు లలో ఉండేవి అన్నీ మాయా గుణాలు .


• స్వ స్థితి వలన మనసు కి ఆత్మకు ప్రయోజనాలు ఏమిటి అంటే . . . 

 1. శాంతి  అనే గుణం ఉండడం వలన మనసు లో భావోద్వేగాల అలజడుల  ఊగిసలాట (Emotional  Unbalance) ఉండదు . 

 2. సుఖం అనే గుణం ఉండడం వలన మనసు ఏ సందర్భంలోనూ అలసట (Tired ) పొందక , ఉన్న దానిని  సద్వినియోగం చేసుకుంటూ , అందులో మాధుర్యాన్ని అనుభవిస్తూ . . . శరీరాన్ని  వ్యర్థ కోరికలు  వ్యామోహల  నుంచి దూరంగా ఉంచుతుంది.

3.  ప్రేమ  అనే గుణం వలన మనసు నిరంతరం రంజితం  అవుతూ , ఆ  ప్రేమ ను సృష్టి లో ఇతర జీవుల కు పంచడం జరుగుతుంది . ఈ గుణం లేక పోవడం వలన మనల్ని మనం ప్రేమించు కోలేక, అసలు ప్రేమ అంటే అర్దం తెలియక ,  ప్రేమ ను పరుల నుంచి ఆశించ వలసిన  పర స్థితి వస్తుంది . నేటి ప్రపంచంలో ఈ ప్రేమ కోసమే మనిషి పరితపిస్తూ ఉన్నాడు . అందు కోసం తన స్థితి ని దిగజారి ప్రవర్తిస్తూ ఉన్నాడు .

4. ఆనందం  కలిగి ఉండడం వలన మన చుట్టూ నిరంతరం ఒక సంతోషంతో కూడిన వలయం (ఆరా) ఏర్పడి ఉంటుంది . మనం ఒంటరిగా, ఏకాంతం గా ఉన్నా ఏ లోటూ ఉండదు సరికదా మన వలయం లోనికి వచ్చిన ఇతరులు కూడా ఆ ఆనందాన్ని అనుభవం పొందుతారు .


5. జ్ఞానం (సత్యం)  వలన వివేకం కలిగి , సూక్ష్మ దృష్టి పొంది  ఏ సమయంలో  ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే స్పష్టత తో ఉండడం జరుగుతుంది .  జ్ఞానం వలన సత్యం తెలుస్తుంది . మాయ నుంచి మనల్ని మనం ఎలా రక్షించు కోవాలో మన  మనో దృష్టి కి అర్ధం అవుతుంది.


6. శక్తి  వలన మనసు బలహీనత నొందక , ఉత్తేజం తో ఉండి  జీవితం లో మన చుట్టూ ఉండే ఎటువంటి పరిస్థితులనైనా , పర స్థితు లను అయినా సునాయాసంగా ఎదుర్కొవచ్చు . 


7. పవిత్రత  వలన బుద్ది ఆలోచనల లో శుద్ధి ఏర్పడి మనసు మంచి నిర్ణయాలు తీసుకొని, తద్వారా శరీరం తో  సత్ కర్మలు చేయడం జరుగుతుంది . 


• ఈ ఏడు గుణాలు , ఏడు లక్షణాలు మన ఆత్మ , మనసు , స్వయం మనము కలిగి ఉండడమే స్వ స్థితి. వీటిని అభ్యసించడమే రాజయోగం . జ్ఞాన ధ్యాన యోగాల అభ్యాసం నిరంతరం చేయడం వలన స్వ స్థితి సహజంగా వరిస్తుంది.

గమనిస్తే  . . . ఈ ఏడు గుణాలు   ఏడు తెల్లని అశ్వము లై  ,  మనసు ను  ఏడు కళ్లెము ల తో  స్వాధీన పరుచుకొని ,   దివ్యత్వం తీసుకు వచ్చి , జీవితం అనే  రధాన్ని  పూలబాట గా  చేసి మనిషి ని మహారాజు గా  నడిపిస్తాయి

  

  స్వ స్థితి తో  మన మనసు , ఆత్మ లేకపోతే పర స్థితులపై  ఆధారపడడం జరుగుతుంది. అదే దుఃఖానికి  , మాయ కి  ద్వారం అవుతుంది . 



ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 .

యడ్ల శ్రీనివాసరావు 1 July  2026 2:00 PM.

Monday, June 29, 2026

763 . 🌊గోదా . . . వరి🛶

 

🌊గోదా . . . వరి🛶


• గోదావరి . . . గోదా . . . వరి 

  గోదావరి . . . గోదా . ‌. . వరి 

• వరి ని     గోదాముల లో   నింపే    సిరి .

  గోదావరి . . . గోదా . . . వరి . 


• నిర్మల మైన    నీరూ పం   

  నిత్యం . . .

  నిశ్చలమై   నిలుస్తుంది   నా  లో . 

• జీవితానికి   తోడైన    నీవు . . . 

  నేనెవరో   అర్దమవని   నాడే  

  నను    అర్దాంగి గా  చేసుకున్నావు . . . 

  గోదావరి   గలగలల తో   తరించావు .


• గోదావరి . . . గోదా . . . వరి 

  గోదావరి . . . గోదా . . . వరి 

• వరి ని    గోదాముల లో    నింపే    సిరి .

  గోదావరి . . . గోదా . . . వరి .


• నాడు    నీ దరి   చేరిన    

  ఈ  బీడు  మనసు లో 

  అక్షరాల    సేద్యానికి  వరమై  

  గద్య   గోదాములు  నింపావు.

• నేడు  ప్రపంచమంతా  

  పాయలుగా   పాకి

  మనసు ల  దాహానికి 

  జీవం   పోస్తున్నావు  .


• పంచభూత మైన   నీకు 

  ఆ  ప్రాణ నాధుడే   చెప్పాడా  

  నను వరించమని .


• గోదావరి . . . గోదా . . . వరి 

  గోదావరి . . . గోదా . . . వరి 


• రాజ  రాజ    నరేంద్రుని   నగరం లో 

  నడి బొడ్డున   వెలసిన   తరంగిణి .

• నిను    కలవని   సాయంత్రం 

  నా మది   అలకదు   అక్షరములు .

• ఈ సరస్వతీ   రేవు లో    తొలి 

  పదములు  అందించి  అల్లించింది  

  నా  తల్లి   సరస్వతి .


• గోదావరి . . . గోదా . . . వరి 

  గోదావరి . . . గోదా . . . వరి 

• వరి ని   గోదాముల లో   నింపే  సిరి .

  గోదావరి . . . గోదా . . . వరి .


• నేను  లేకున్నా   . . .  నేను  లేకున్నా

  నా గుండె పరవళ్ళు   నీ తోనే   శాశ్వతం .

  నీ గలగలలే   ఈ పదగలలు .


• గోదా . . . వరి . . .  గలగలల గోదావరి

  గోదా . . . వరి . . .  గలగలల గోదావరి .


🌹🌹🌹🌹🌹🌹




ఇవి కేవలం జూన్ నెలలో రిపోర్ట్. 
ఇంకా అనేక దేశాల list Other 2.43K లో ఉన్నాయి.


బ్లాగు ఆరంభించి 2026  మే నెలకు  6 years  పూర్తి అయింది.  సుమారు గా ఒక సంవత్సరానికి  12,000 Views  వరకూ average గా  వచ్చేవి . 

కానీ , 2026 ఒక జూన్ నెలలో మాత్రమే అత్యధికం గా 11,000 Views బ్లాగు కి రావడం . మరియు Total  Views  87,000   cross చేయడం . . .

అదే విధంగా ఇదే నెలలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 130 దేశాల వరకు బ్లాగు Reach అవడం అనగా ఆయా దేశాల లో ని తెలుగు వారు బ్లాగు ని వీక్షించడం లో , ఆనందం అనే మాటకు తావు లేదు కానీ  చాలా  ఆశ్చర్యం గా అనిపిస్తుంది .  


ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల లో ఉన్న తెలుగు వారందరికీ , మనో వికాసం కోసం బ్లాగు లో  రచనలను చదువుతున్న వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏.


జ్యేష్ట  పౌర్ణమి  శుభాకాంక్షలు 💐 


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు . 30 June 2026 6:00 AM.


Friday, June 26, 2026

762. ఆలయ భక్తి లోని జ్ఞాన సూక్ష్మాలు

 

ఆలయ భక్తి లోని జ్ఞాన సూక్ష్మాలు 



• చెప్పులు అరిగి పోయి తెగిపోయినా , పాతవి గా అయిపోయినా సరే వాటిని వదిలి కొత్తవి ధరిస్తాం. అదే విధంగా శరీరం (దేహం) కూడా కోలుకోలేని విధంగా అనారోగ్యం పాలైనా , వృద్ధాప్యం మీరినా  ఈ శరీరం వదిలేసి (మరణం పొంది) మనలోని ఆత్మ తిరిగి కొత్త జన్మ ధరిస్తుంది. శరీరం శాశ్వతమా?, ఆత్మ శాశ్వతమా? అంటే ఆత్మే శాశ్వతం. ఆత్మ కి మరణం లేదు . 


• మనం దేవాలయం లోపల భగవంతుడు దగ్గరకు వెళ్ళేటప్పుడు చెప్పులు ఆలయం బయట విడిచి వెళతాం . ఎన్నో మలినాలు చెప్పులకు అంటి ఉంటాయి . పరిశుభ్రత కోసం బయట వదిలి వేస్తాం అని అనుకుంటాం. కానీ మన దేహం లో ఎన్నో విషయ వికారాల రూపేణా మలినమైన ఆలోచనలు నిత్యం నడుస్తూ ఉంటాయి . మలినాల తో ఉన్న దేహ భ్రాంతి ని , ఆలోచనలను  చెప్పుల వలే ఆలయం బయట విడిచి, అనగా భగవంతుడి సన్నిధి లో ఉన్న కాసేపు అయినా , శరీరం పై ఉన్న అభిమానాన్ని , ఆలోచనలను , శారీరక దృష్టి ని , దేహ మమకారాన్ని ఆలయం బయటే వదిలి వేయాలి అని అర్దం .

 ఆలయం బయట చెప్పులు విడవాలి అనడం లో దాగి ఉన్న  యధార్థ సూక్ష్మ జ్ఞాన అర్దం .


 🌹🌹🌹🌹🌹🌹


• సాధారణంగా స్త్రీలు మాత్రమే నిత్యం బొట్టు ధరిస్తారు . కానీ శివాలయం లోనికి ప్రవేశించిన తరువాత పురుషులు సైతం , స్త్రీలతో సమానం గా బొట్టు ధరిస్తారు . మనం బొట్టు పెట్టుకునే స్థానమే మనలో ఆత్మ ఉండే స్థానం. పరమాత్మ అయిన శివుని (లింగ రూపం) కలిసేందుకు మన నుదుట లోపల ఉన్న ఆత్మను అలంకారం చేసి చైతన్యం చేయడమే ఇందుకు లోని దీని సూక్ష్మ జ్ఞాన అర్థం. ఇక్కడ మన శరీర ప్రస్తావన ఉండదు . పరమాత్మ శివునికి  స్త్రీ పురుషుల  ఇరువురూ  సమానమైన ఆత్మ లే . 


 🌹🌹🌹🌹🌹🌹


• ఆలయం లో భగవంతుని విగ్రహానికి హారతి ఇస్తూ గంట మోగిస్తారు . ఆ హరతి ని అందరూ కళ్ళకు అద్దుకొని నమస్కరిస్తారు . అసలు ఈ హారతి ఎందుకు ? . . . 


• భగవంతుడు జ్యోతి బిందు స్వరూపుడు . మనలో అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి వెలుగు నింపే జ్ఞానసాగరుడు . మన లో ఉన్న  ఆత్మ , పరమాత్మ జ్యోతి నే  కోరుకుంటుంది . కానీ నేడు మనం మనలోని ఆత్మను పూర్తిగా మరచి  శరీరం అనే స్పృహ భావన తో జీవిస్తున్నాం . అందుకే మన శరీరానికి  ఏది  ఎందుకు  చేస్తున్నాం ?  హరతి ఎందుకు ఇస్తున్నాం ?   దీపం   ఎందుకు వెలిగిస్తున్నాం ? అందులో ఉన్న అసలు సూక్ష్మ విషయం ఏమిటో  తెలియదు . 

కానీ వాస్తవానికి మనలోని ఆత్మ కి ఈ  సమస్తం తెలుసు .  కానీ మనం  ఆత్మ జ్ఞాన  దృష్టి తో జీవించక పోవడం వలన , కేవలం శారీరక దృష్టి తో జీవిస్తూ ఉండడం  వలన జ్ఞాన రహస్యాలు తెలియడం లేదు . విగ్రహం అనేది కేవలం మన దేహ సంతృప్తి కోసం , మన కళ్లతో చూస్తున్న దృష్టి కి అలంకారప్రాయం కోసం మాత్రమే . హరతి లో దాగి ఉన్న దే అసలు భగవత్ పరమాత్మ నిజ స్వరూపం .


 🌹🌹🌹🌹🌹🌹


భగవంతుని కి ఆలయం లో కొబ్బరికాయను మాత్రమే కొడతారు . ఎందుకు ? 

 కొబ్బరి పెచ్చు వలే మానవుని తల లో అహంకారం దృఢం గా ఉంటుంది. భగవంతుని ఎదుట ఎంత గట్టిగా కొబ్బరి కాయను కొడతామో , ఆ విధంగా మన తల లో దృఢం గా పాతుకుపోయి ఉన్న అహంకారాన్ని భగవంతుడి ముందు చెక్కలు గా పగులకొట్టి విడిచి పెట్టాలి . అప్పుడే మధురమైన తెల్లని కొబ్బరి వలే , మన ఆత్మ లో అనాదిగా దాగి ఉన్న దైవీ సుగుణాలు బయటికి వస్తాయి . 

 భగవంతుని కి కావలసింది మనం కొట్టే కొబ్బరి చిప్పలు కాదు , మన అస్థి లో దృఢం గా ఉన్న అహంకారం కావాలి  . 

 కొబ్బరికాయ కొట్టడం లో దాగి ఉన్న సూక్ష్మ జ్ఞానం ఇది . 

• చెప్పాలంటే . . ‌. కొబ్బరికాయలు అనే మన నమ్మకం తో  నేడు ఆలయాల లో లక్షల రూపాయల వ్యాపారం  జరుగుతోంది . 


 🌹🌹🌹🌹🌹🌹


• శివాలయం లో  కొట్టిన కొబ్బరికాయ గాని , శివుని కి పెట్టిన  పువ్వులు గాని  తిరిగి  ఇంటికి  తీసుకు వెళ్ళ కూడదు  అని  నంది దగ్గర  విడిచి పెట్టాలి అంటారు . 

దీని అర్థం . . . శివుని కి  మనం ఏదైనా  అర్పిస్తే , తిరిగి మరలా వెనక్కి తీసుకోకూడదు అని అర్థం. అంటే శివుని కి  మన దుఃఖాలు , కష్టాలు, చెడు గుణాలు , బలహీనతలు , వేదనలు అర్పిస్తాం  . శివాలయానికి వెళ్లి ,  ఏమైతే మనం  శివుని కి మనసు తో విడిచి పెడతామో , తిరిగి వాటిని మనసు  ద్వారా  స్పృశించి  కూడదు . . . 

• శివాలయం లో కొట్టిన కొబ్బరికాయ , పువ్వులు తీసుకు వెళ్ళకూడదు అనే విషయం లో దాగి ఉన్న మర్మ రహస్యం ఇదే .


 🌹🌹🌹🌹🌹🌹


• శివాలయం కి వెళ్ళినప్పుడు మూడు ప్రదక్షిణాలు చేయడం జరుగుతుంది . దీని సూక్ష్మ అర్థం, శివుడు మల్లోకాలకు అధిపతి . స్థూల లోకం (మనుషుల లోకం) , ఆపైన సూక్ష్మ లోకం (బ్రహ్మ విష్ణు శంకరుల దేవతా లోకం) , ఆ పైన మూలవతనం ( పరమాత్మ శివుడు మరియు ఆత్మల లోకం). ఈ మూడు త్రిలోకాలు  తిరిగాడే   సూచకం గా  ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణాలు  చేస్తారు . 


🌹🌹🌹🌹🌹🌹


• భగవంతుడు పైన ఉన్నాడు అన్నీ చూస్తుంటాడు అని వేలి తో చుపిస్తాం , మరి గుడి లోపల ఉన్నది ఎవరు ?


• మన లోని ఆత్మ కి తెలుసు, భగవంతుడు పైనే ఉన్నాడని . ఎందుకంటే, మనం గతం లో అనేక సార్లు మరణించిన తరువాత మన ఆత్మ   పై లోకం లో ఉన్న పరమాత్మ (భగవంతుని) వద్దకు చేరింది, యదార్ధం గా చూసింది . కానీ, ఈ విషయం నేడు మన శరీర స్పృహ కి తెలియదు. కానీ ఆత్మ కి తెలుసు అందుకనే, అప్రయత్నంగా భగవంతుడు పైన ఉన్నాడు అన్నీ చూస్తుంటాడు అని వేలు పైకి ఎత్తి మరీ అంటుంటాం . 

మరి గుడి లో ఉన్నది  మన సంతోషం కోసం సంతృప్తి కోసం అలంకార ప్రియం గా మనం తయారు చేసుకున్న విగ్రహం .  పైన ఉన్న సూక్ష్మ మైన  పరమాత్మ మన  రెండు కళ్ళకు కనపడుట లేదు కాబట్టి  విగ్రహ రూపంలో ఆలయాల్లో  ప్రతిష్ట చేస్తాం .  భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాం .

మన లోని ఆత్మ జాగృతం (చైతన్యం),  అయిన నాడు మన దృష్టి , ఆలయ విగ్రహం దాటి ఆ పైన ఉన్న జ్యోతి బిందు శివ పరమాత్మ ను జ్ఞాన ధ్యాన యోగాల ద్వారా చూడడం , అనుభవం పొందడం ఆరంభం అవుతుంది . 


🌹🌹🌹🌹🌹🌹


• వాస్తవానికి భక్తి లో ఎన్నో ఎన్నెన్నో జ్ఞాన యుక్తమైన విషయాల రహస్యాలు దాగి ఉన్నాయి . కానీ వాటి అర్దం పరమార్థం మనకు తెలియదు. ఎవరినైనా అడిగితే అది అంతే అంటారు , లేదంటే  ఏవేవో కధలు చెపుతారు కానీ సత్యం చెప్పరు .  కారణం వారికి తెలియక పోవడమే. 


• అదే విధంగా భక్తి లో , అమాయక ప్రజలను భయపెడుతూ మూఢత్వ  నమ్మకాలు పెంచి పోషించి , వాటిని విస్తృతంగా వ్యాపింప చేసి , వ్యాపార మార్గాలుగా మార్చుకునే విధానాలు నేడు చాలా వ్యాపించి  ఉన్నాయి . ఇది కలియుగం, పూర్తి మాయ మోసాల ప్రపంచం. ఇందులో భగవంతుడి తో  కూడా  , మాయా బుద్ధి జీవులు వ్యాపారం చేయకుండా ఉండలేరు . ఇది వరకు చెప్పినట్లు, కొందరి లో ఉన్న అమాయకత్వాలు , నమ్మకాలు, బలహీనతలు , అజ్ఞానం మరికొందరికి  జీవన భుక్తి

దీనికి కారణం భగవంతుడు అంటే అసలు ఎవరు?  అనే సత్యం  , ప్రతి మనిషి కి తెలియక పోవడమే .


• మనలో . . .  ఏది ఎందుకు చేస్తున్నాం ?  అనే ప్రశ్న తలెత్తనంత  కాలం . . . మనసు , శరీరం ద్వారా తప్పుడు పనులు చేస్తూ  ఉన్నంత కాలం . . . సత్యాన్వేషణ  చేయనంత  కాలం, అర్దం పర్దం  లేని భయాల తో  మోస పోతూ , మౌనం గానే ఉంటాం . 


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 27 June 2026 11:00 AM.


Wednesday, June 24, 2026

761. గురువు - జ్ఞానం మనిషి కి అవసరమా?


గురువు . . . జ్ఞానం మనిషి కి అవసరమా?



  గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః 

  గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై  శ్రీ గురవే నమః 


• భగవంతుడు   సృష్టించిన   విశ్వంలో  ఖగోళం అత్యంత  అద్బుతం . నక్షత్రాలు , ఉల్కలు, తోకచుక్కలు , పాలపుంతలు , నవ గ్రహాలు వాటి తో పాటు అనేక చిన్న చిన్న గ్రహాలు వేటికవే  ఒక విలక్షణమైన మహా శక్తిని సంతరించుకుని ఉన్నాయి . ఈ శక్తి ప్రభావం ఒకదాని  నుంచి  మరొక  దానిపై  పడుతూ విశ్వం అంతా  వ్యాపించి ఉంటుంది . 

• ఇక గ్రహాల విషయానికి వస్తే భూమి ఒక గ్రహం .‌ ఈ భూమి పై పడే విశ్వం యొక్క (గురుత్వాకర్షణ) శక్తి ప్రభావం వలన భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే , ఒక నిర్దిష్ట కక్ష్యలో తిరుగుతూ సూర్యుడు చంద్రుడు మరియు మిగిలిన గ్రహల చుట్టూ తిరుగుతుంది. ఇది సైన్స్ ద్వారా నేటి తరాలకు తెలిసిన వాస్తవం  . 

• భూమి విద్యుదయస్కాంత శక్తి కలిగి ఉండడం వలన  భూమి పై  నివసించే ప్రతి జీవి , నిర్జీవి , చెట్టు పుట్ట పక్షులు జంతువులు ఇవన్నీయు కూడా  విశ్వ శక్తి  ఆధారంగానే జీవిస్తాయి . 

 మనం విశ్వం లో ఒక భాగం. అంతే కానీ మనమే సమస్త విశ్వం కాదు . ఇదంతా  ఎందుకు అంటే , గ్రహాల యొక్క శక్తి ప్రభావం తప్పకుండా ఈ భూమి పై ఉన్న ప్రతి మానవుని పై ఉంటుంది . ఈ గుప్త విజ్ఞానాన్ని  జ్యోతిష శాస్త్రం లో  వేల సంవత్సరాల క్రితమే  పరాశర మహర్షి పొందుపరిచారు .


 జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి ,  బృహస్పతి  Jupiter ఒక ప్రత్యేక గ్రహం . దీనిని  గురు గ్రహం అంటారు . నవ గ్రహాలలో గురు గ్రహాం అత్యంత ప్రాముఖ్యమైనది . అందుకే మనకు ఉన్న రోజులలో గురు వారం (లక్ష్మి వారం) ఒక విశిష్టత సంతరించుకున్నది . 


• ఒక ఆత్మ  , భూమి పైకి వచ్చి  శరీరం ధరించి  జన్మించినపుడు అది జీవాత్మ అవుతుంది . మనం జీవాత్మలం . జీవాత్మ  (మనిషి)  నివసించడానికి . . . జీవించడానికి అవసరమైన జీవన  విధాన శక్తి ని  ఇచ్చేది   గురు గ్రహం అయిన  బృహస్పతి . బృహస్పతి ని  దేవతలకే గురువు అంటారు . బృహస్పతి  జ్ఞానం మేధస్సుకు ప్రతీక . 


• ఒక మనిషి , జీవించడానికి కావలసిన అనుకూల  జ్ఞాన శక్తి, గురు గ్రహం  బృహస్పతి ద్వారా  విశ్వం నుంచి లభిస్తుంది .  జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనిషి కుండలినీ  లో   బృహస్పతి ,  గురుగ్రహ బలం ఎలా ఉందో గమనించి , ఆ మనిషి జీవిత నడవడిక జ్ఞాన  సంస్కార   విధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనిషి కి  బృహస్పతి  శక్తి  బలం గా  ఉంటే , ఏ విఘ్నాన్ని  అయినా ధైర్యం గా ఎదుర్కొని , సమస్య ను  పరిష్కరించుకునే జ్ఞానం , సామర్థ్యం  వ్యక్తి కలిగి ఉంటాడు .   గురు శక్తి బలహీనంగా  ఉంటే  అజ్ఞానంతో  సమస్యలు సృష్టించుకుంటూ , పాప కర్మలు చేస్తుంటాడు . గురు శక్తి తక్కువగా  ఉన్న వారికి  జీర్ణ కోశ సమస్యలు తరచూ వేధిస్తూ అధికంగా ఉంటాయి .

మానవుడు గత జన్మల లో చేసిన పాప పుణ్య కర్మలు, సంస్కారాల ఆధారం గా నేటి జన్మలో గురు గ్రహ బలం,  జీవన స్థితి ఆధారపడి ఉంటాయి . గ్రహాలు అన్ని కూడా  ఒకో విశిష్టత కలిగి ఉంటాయి . వాటి శక్తి , బలం బలహీనతల ప్రభావం వలనే మనిషి స్థితి గతి ఉంటుంది .  ఇందు ముఖ్యమైనది గురు గ్రహం , తద్వారా పొందే  జీవన జ్ఞానం , మేధస్సు  . 


🌹🌹🌹🌹🌹


• సాధారణంగా , ఈ భౌతిక ప్రపంచంలో గురువు అంటే పాఠాలు చెప్పే టీచరు అని , కాలేజిలో లెక్చరర్ అని , పి.హెచ్.డి. లో ప్రొఫెసర్ అని భావిస్తారు . కొందరు అయితే తమకు జీవనోపాధి వృత్తిని నేర్పించిన వారిని గురువు గా భావిస్తారు. ఈ విధంగా గౌరవించడం మంచిదే . కానీ వాస్తవానికి వీరెవరూ పరిపూర్ణత నిచ్చే గురువులు గా కాలేరు. 

  గురువు అంటే  జీవితానికి  సంపూర్ణ  మార్గదర్శి . పైన ఉదాహరించిన వారు  కేవలం చదువు లోను , వృత్తి లోను , వారికి తెలిసిన ఒక పరిమితి తో కూడిన విద్య ను  మాత్రమే బోధిస్తారు . వారు హద్దు లోని గురువులే కానీ జీవితానికి సంపూర్ణ  అనంతమైన మార్గదర్శకులు కారు. 


• మనిషి  జీవిత అంతిమ దశ  వరకు కావలసిన జ్ఞానాన్ని మార్గాన్ని  దిశను పైన ఉదహరించిన వారెవరూ చూపలేరు , అది కొంతవరకు ఆధ్యాత్మిక గురువు కి  సాధ్యం . . . అంతకు మించి సంపూర్ణ జ్ఞానం ఇవ్వగలిగిన వారు ఒక్క సద్గురువు మాత్రమే  . సద్గురువు అంటే  పరమాత్మ శివుడు , గీతా జ్ఞాన రచయిత . అందుకే  శివుడు ని జ్ఞాన సాగరుడు అంటారు .

శరీరం ధరించి  ఉన్న , ఏ మానవమాత్రుడైనా గురువుగా అయి ఉండవచ్చు కానీ, అతడు సద్గురువు కాడు , కాలేడు .  సద్గురువు జనన మరణాలకు అతీతుడు. అతడే శివుడు.


• కలియుగం పూర్తి  పతిత ప్రపంచం, కలియుగం లో మానవ జన్మ తీసుకున్న ఏ మనిషి పవిత్రుడు కాడు   . ఎందుకంటే మానవుడు జన్మ తీసుకున్న విధి విధానం లోనే   విషయ వికారాల కర్మ  దాగి ఉంది .  అందుకనే ఓ పతిత పావన రండి అని భగవంతుడిని అందరూ పిలుస్తారు. దీని అర్థం పతితులు గా ఉన్న మమ్ము పావనం గా తయారు చేయండి అని. 

పవిత్రంగా పావనం గా కావలసింది దేహం ధరించిన వారి ఆత్మ .  ఆత్మ లోని  మనసు,  బుద్ధి , ఆలోచన , కర్మలు , సంస్కారాలు . అంతే కానీ శరీరం కాదు, మానవుని గా  జన్మించిన ఏ మనిషి శరీరం కూడా పవిత్రం కాదు, కాలేదు. 

కానీ శివుడు పరమ పవిత్రుడు , జనన మరణాలు కు  అతీతుడు . శివుడు జన్మించడు , అవతరిస్తాడు . పరమ పవిత్రుడైన  శివుడే  సద్గురువు . భక్తి మార్గం లో శివుని సద్గురువు గా  దక్షిణా మూర్తి గా కీర్తిస్తారు .

ఇదంతా  మానవ రూపంలో ఉన్న గురువు కి  , దైవ రూపం లో ఉన్న  సద్గురువు కి  మధ్య ఉన్న వ్యత్యాసం తెలియ చేయుట  కోసం మాత్రమే 


🌹🌹🌹🌹🌹


• ఒక మనిషి కుండలి లో బృహస్పతి, గురు బలం తక్కువ ఉన్న వారు తప్పని సరిగా గురువారం రోజున శివాలయం సందర్శించాలి . శివుని గురువు గా తలచి శివ స్మృతి  , శివ ధ్యానం చేయాలి . దక్షిణామూర్తి స్తోత్రం ఉదయం సాయంత్రం జపిస్తే గురు బలం (శక్తి) పెరుగుతుంది. దాన ధర్మాలు , హోమాలు జపాలు వలన ధనం వృధా చేసుకోవడం  మినహా ఏమీ ఉండదు . కొందరు తమ జీవన భృతి కోసం అవి చేయమని అనాదిగా చెపుతూ ఉంటారు ,  వీలైతే ఉడికించిన కేజీ శెనగలు, పావు కేజీ బెల్లం కలిపి ఆవుకి గురువారం రోజున తినిపించండి . 

కొందరు మనుషుల కి  ఉన్న  గ్రహల  బలం, శక్తి లోపం వలన కలిగే  ఈతిబాధలు  , సమస్యలు , బలహీనతలు, అనారోగ్యాలు , అజ్ఞానం వంటివి . . .  ఈ లోకంలో  మరికొంత మంది కి  జీవన ఆధారం . ఇదే కలియుగం లోని మాయా దౌర్భాగ్యం .  

ఈ గ్రహల బలం, శక్తి లోపం మన లో ఏర్పడి ఉండడానికి కారణం,  గత జన్మల లో కానీ , నేటి జన్మలో కానీ తెలిసీ తెలియక  చేసిన పాప కర్మలు.  


• బృహస్పతి గురు బలం(శక్తి) నిండుగా ఉన్న వారి జీవితం మంచి నడవడిక ద్వారా సంపూర్ణత సాధిస్తుంది. వారు నిస్వార్థం గా తమకు తోచిన రీతిలో ఇతరులకు మేలు చేసే వారుగా ఉంటారు . వృత్తి రీత్యా  కొందరు , సేవ రీత్యా కొందరు గురువులు గా  అయి  ఉంటారు .

 జ్ఞానం  సూక్ష్మ  ధనం .  కంటికి కనపించదు.

 కరెన్సీ   స్థూల ధనం .   కంటికి కనిపిస్తుంది. 

స్థూల ధనం (కరెన్సీ) కలిగి  ఉన్నంతలో  జీవుడికి పరిపక్వత   సంపూర్ణత  మోక్ష సిద్ది  కలుగదు . జ్ఞానం  ఉన్న వారికి , స్థూల ధనం ధర్మం యుక్తంగా దానంతట అదే చేరుతుంది .


ఈ జన్మలో సంపాదించిన స్థూల ధనం (కరెన్సీ) మరు జన్మకు పనికిరాదు . 

కానీ, ఈ జన్మలో సంపాదించుకున్న జ్ఞాన ధనం అనేక జన్మల వరకు  నీ  ఆత్మతో కలిసి ఉంటుంది.


• నీ లోని సత్యాన్ని కొనుక్కొని , ఆ సత్యం తో పాపపుణ్యాలను  మరియు నీవు నిర్వర్తించ వలసిన బాధ్యత  ధర్మం తెలుసుకొని ఎలా జీవించాలి  అనేదే  జ్ఞానం యొక్క పరమార్థం . అంతే కానీ, జ్ఞానం అంటే శ్లోకాలు, పద్యాలు , కీర్తనలు , ఢాంభికాలు  , ఆడంబరాలతో కూడిన గంఢపేరుండాల వేషధారణ  ప్రదర్శించడం కాదు .

 సత్యమైన  జ్ఞాని ఎన్నడూ గుర్తింపు ఆశించడు. గుర్తింపే వెతుక్కుంటూ జ్ఞాని యొక్క పాదాల చెంతకు చేరుతుంది . గుర్తింపు అనేది మాయా ఆడంబరం, అదే జ్ఞాని పతనానికి మూలం. 

 జ్ఞాని నిరాడంబర జీవనం తో తన మనసు యొక్క శిఖరాన్ని అధిరోహించగలడు . ఆ శిఖరం పైనే పరమాత్మ శివుడు కొలువై ఉంటాడు . 

 జ్ఞానం , మానవుని  జీవిత నావను  పెను తుఫానుల నుంచి అత్యంత సులభంగా తీరం దాటిస్తుంది . జ్ఞానం తెలుసుకోవడమే కాకుండా ఆచరించడం ప్రధానం, ఆ జ్ఞానాన్ని ఇతరులకి పంచడమే  ఉత్తమ పురుషార్థి  లక్షణం  . 


గురు బలం ‌ సమృద్ధిగా ఉన్నవారు (knowledge) జ్ఞానం అర్జించగలరు.  అనగా తెలుసుకోగలరు .

జ్ఞానం మానవుని లోని  బుధ (Mercury బుద్ధి , తెలివి)  గ్రహ శక్తి ని  వృద్ధి చేస్తుంది .  తద్వారా   వివేకం  (wisdom)  పెరుగుతుంది . వివేకవంతుడు   ఏ సమయం లో ఎలా ప్రవర్తించాలో  , ఎలాంటి  నిర్ణయాలు తీసుకోవాలో  గురు జ్ఞానం తో   పొందిన విషయాలను  అనుభవాలు గా   మార్చుకుంటాడు. 

జ్ఞాని  మాత్రమే  వివేకి గా  మారగలడు .  గమనించ వలసిన విషయం జ్ఞానం (knowledge) వేరు , వివేకం (wisdom) వేరు .


నేటి కాలం  మానవుడు  అజ్ఞానం తో  ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాడు . దీనికి ప్రధాన కారణం  మనసు .  మనసు స్థిరత్వం లేకపోవడం వలన  భయం  ఆందోళన  అలజడి అభధ్రత పెరిగి  మానసిక రోగిగా  జీవించడం జరుగుతుంది. దీనికి కారణం సత్యం వాస్తవం తెలుసుకో లేకపోవడం .   ఇదే  అజ్ఞాన బీజం . 

ఒక నిస్వార్థమైన ఆధ్యాత్మిక గురువుని (ధనం ఆశించని , సేవా తత్పరుడు)   ఆశ్రయించడం వలన మనిషి కి  జ్ఞాన మార్గం   , జీవన మార్గదర్శకం లభిస్తుంది . కానీ ఈ మాయా లోకం లో అటువంటి సత్యమైన గురువులు  అరుదు గా ఉంటారు .  గురువు లభించక పోతే , మంచి  ఆధ్యాత్మిక పుస్తకాల పఠనం ద్వారా కొంత  జీవన జ్ఞానాన్ని ఆర్జించ వచ్చు .

 

ప్రపంచ వ్యాప్తంగా 175 దేశాలలో బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయానికి సంబంధించిన సహజ రాజయోగ మెడిటేషన్ సెంటర్లు  అనేక వందలు ఉన్నాయి . పరమాత్మ శివుని యొక్క సంపూర్ణ గీతా జ్ఞానం ఈ సెంటర్లలో పూర్తి ఉచితంగా  , ఆయా  భాషలలో ప్రతీ రోజూ ఒక గంట సమయం చెపుతారు . శివుని జ్ఞానం తో పాటు ధ్యానం నేర్పిస్తారు .  సమీపం లో ఉన్న వారు , గురు బలం పెంచుకోవాలి అనుకునే వారు, సద్గురువు అయిన శివుని తో  ప్రత్యక్ష బంధం ఏర్పరచు కోవాలి అనుకునే వారు  , జీవితం లో మంచి మార్పు కోరుకునే వారు  తప్పకుండా సహజ రాజయోగ మెడిటేషన్  వినియోగించుకోవచ్చు . ఇది పూర్తిగా ఉచితం . 


ప్రతి మనిషి ఆనందంగా సంతోషంగా జీవించాలి అంటే , ముందు గా  తన గురించి తాను  తెలుసుకోవాలి. అందుకు తప్పని సరిగా  సత్యమైన నిస్వార్థమైన ఆధ్యాత్మిక గురువు అవసరం .  దేహదారి గురువు లేకుండా , సద్గురువు అయిన శివ పరమాత్మ ను చేరలేము. 

శివుని నిత్యం స్మృతి చేస్తూ ఉంటే , ఏదో నాడు తప్పక  సత్యమైన దేహదారీ  గురువు లభిస్తాడు  .


గురువులను కీర్తించక పోయినా , గౌరవించక పోయినా పర్వాలేదు కానీ పొరపాటు న  కూడా నిందించకూడదు .  అలా చేస్తే మహా పాపం తయారవుతుంది .


ఓ మనిషి . . .  ఈ  భౌతిక ప్రపంచంలో, నీవు సంతృప్తుడుగా  అయి  ,  నీ జీవిత నావ సజావుగా తీరం దాటాలి  అంటే తప్పని సరిగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న సత్యమైన , నిస్వార్థమైన  , నిరాడంబరమైన  గురువు యొక్క  జ్ఞానం  అవసరం . లేదంటే, ఈ లోకం అంతా విస్తరించి ఉన్న మాయ వలలో చిక్కుకుని మరెన్నో జన్మలు నిరాశ నిస్పృహ ల మధ్య కొట్టాడు తూ  జీవించ వలసి వస్తుంది .


• ఉన్నాడా    ఉన్నాడా 

  నీ కంటూ   ఓ గురువున్నాడా 

  మనిషి   ఓ  మనిషి . . . 


• గురువు  అంటే  దైవం 

  గురువు  అంటే  సన్మార్గం.

• గురువు  లేని   జీవితం 

  చుక్కాని  లేని   నావ పయనం .


  ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

  ఓం శాంతి 

  ఓం నమఃశివాయ 🙏 

 యడ్ల శ్రీనివాసరావు 20 July 2026 , 10:15 PM.


767. ఇది మనం గమనిస్తున్నామా ?

    ఇది మనం గమనిస్తున్నామా ? • మనకు గుర్తు ఉందా ? 2000 సంవత్సరం కంటే ముందు పుట్టిన మనం మన చిన్న తనం , ఇంట్లో పెరుగుతూ ఉన్న సమయంలో తల్లి తండ...