Wednesday, June 3, 2026

752. అంధులు అదృష్టవంతులా ?

 


  అంధులు అదృష్టవంతులా ?




• అంధులు అదృష్టవంతులా ?  ఆశ్చర్యం గా అనిపిస్తుంది కదా , ఇంకొక అడుగు ముందుకు వేస్తే మతి  సరిగా లేని  వాడికే  ఇలా  అనిపిస్తుందేమో కదా !   . . . అవును ,  నిజమే   అంధులు అదృష్టవంతులు .

 వారు ఈ భౌతిక లోకాన్ని చూడలేరు . చూడలేనప్పుడు ఈ లోకానికి సంబంధించిన అంశాలను ,  ఏదో సాధనాల రూపంలో వినినా వాటిని  మనసు కి ఆకళింపు చేసుకోరు . సరికదా ఇక ప్రాపంచిక విషయాల గురించి ఎవరితోనూ చర్చించరు  ముఖ్యం గా వ్యర్థాల గురించి మాట్లాడ లేరు .

 ఒక్క మాటలో చెప్పాలంటే, వారు ఈ ప్రాపంచిక దృశ్యాలను చూడలేరు  కాబట్టి లౌకికం లో జరిగే విషయాల పట్ల  కళ్లు ఉన్న వారి వలే సంబంధాన్ని కలిగి ఉండరు . కానీ వారి  సూక్ష్మమైన మనో దృష్టి  మరోలా ఉంటుంది .


• వాస్తవానికి  నేడు   ఈ లౌకిక ప్రపంచంలో, జరుగుతున్నది ఏమిటి ? అంటే . . . మనిషి , తాను ఆచరించ వలసిన ధర్మాన్ని సత్యమైన రీతిలో ఆచరించక పోవడం వలన పాప ఖాతా జమ చేసు కోవడం , ఆ పాపం వలన దుఃఖం అనుభవించ వలసి వచ్చినపుడు భగవంతుని చెంతకు చేరి , ప్రార్థించడం . సూక్ష్మ స్థితి లో ఇదే నేటి మానవాళి అనుభవిస్తున్న యదార్ధం .  విచారకర విషయం ఏమిటంటే , అజ్ఞానం వలన చేస్తున్న కర్మలు పాపమో పుణ్యమో అనే విషయం కూడా గ్రహించలేని స్థితి లో ఎన్నో పాప కర్మలు చేయడం . సమస్త దుఃఖాలకు మూలం ఇదే .


• నేటి సమాజం పూర్తి భ్రష్టు మయం . అవినీతి , అసత్యపు జీవనం , కల్తీ ఆహారం, అడుగడుగునా స్వార్దం , ఒకరిని  వంచించి మరొకరు  బ్రతకడం, కామం తో విచ్చలవిడితనం , హింస . . .   ఆఖరికి ఇవన్నీ సహజం అని సంతోషం గా సరిపెట్టుకునే స్థితి లో   నేటి  సగటు  మనిషి మనసు యొక్క దుస్థితి .

  అవసరానికి మించిన  జీవన విధాన శైలిని అనుకరిస్తూ  అనుభవించడానికి అలవాటు పడిన విలాసాలే , నేడు మానవుని మూలాలు పెకలించుకు పోవడానికి కారణం . దురదృష్టం ఏమిటంటే ఇదే అభివృద్ధి అనుకోవడం. ఈ ప్రయాణం లో అధిక సంపాదన కోసం యువత ఎదుర్కొనే ఒత్తిడి , ఆకస్మిక మరణాలు (గుండెపోటు) , పిల్లలు కలగక పోవడం వంటివి కొన్ని మచ్చు తునకలు మాత్రమే.

• ఇది ముందుగా నే గ్రహించిన జ్ఞానులు మానవుని మనసు , బుద్ధి స్థిరత్వం కోసం మూడు కోతి బొమ్మలు తయారు చేసి చూపించారు , . . . చెడు చూడక,  చెడు వినకు, చెడు మాట్లాడకు . కానీ ఇవి ఆచరణకు నోచుకోలేని  స్థితిలో మనిషి ఉన్నాడు  .

 నేడు మనిషి  ఆలోచనలలో ఉన్న స్థితి కి , తన కర్మేంద్రియాలతో (కళ్లు , చెవులు , నోరు ముక్కు , శరీరం ) చేసే పనులకు సంబంధం లేని దిశ లో జీవనం సాగిస్తున్నాడు అనేది పరమ సత్యం . దీనినే కర్మేంద్రియాల పై నియంత్రణ కోల్పోవడం అంటారు. Loosing control on five senses .


• ఉదయం లేచిన నుంచి . . . విద్యాలయాలు, ఆసుపత్రులు , ఆఫీసు కార్యాలయాలు , మార్కెట్లు , ఆఖరికి దేవాలయాలు ఎటు చూసినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం . . . ఈ వ్యాపారం  ముసుగులో జరిగేది  దోపిడీ , మోసం , అవినీతి, కల్తీ , లంచగొండితనం , రాజకీయ కుట్రలు, ఇదంతా బహిరంగంగా అందరికీ  తెలిసినా సరే , అంతా సహజం సర్వ సాధారణం అనుకునే అష్టదిగ్బంధన స్థితి కి సగటు మనిషి దిగజారి పోయాడు .

 మనిషి ఇదంతా తన చుట్టూ ఉన్న సమాజం లో జరుగుతుంది అనే భ్రమ లో ఉన్నాడు . కానీ అదంతా చేస్తున్నది నేనే, అందుకు కారణం నేను , ‌ నేను కూడా ఒక భాగస్వామిని అని తెలుసుకో లేక ఉంటున్నాడు .


• మనిషిని తన కర్మేద్రియాలే మోసం చేస్తున్నాయి . ఇందులో   ప్రధానం గా కళ్లు . కళ్లు మోసం చేసినంతగా ఏ ఇతర కర్మేంద్రియాలు మోసం చేయవు . దేని పట్ల అయినా  మొదట ఆకర్షణకు వశం అయ్యేది , దాసోహం అయ్యేది కళ్ళతోనే . మాయా ప్రపంచం లో మార్కెట్లలో లభించే హద్దు అదుపు లేని రకరకాల తినుబండారాలు , విలాస వస్తువుల పట్ల ఆకర్షణలకు బానిస మయం మానవ జీవితం .

• అంతకు మించి , బంధాలను అతిక్రమించి భయం లేకుండా విచ్చలవిడితనం తో స్త్రీ పురుషుల కామ వికార సాంగత్యాలు , ఈ ముసుగుకు రకరకాల ఆధునిక నాగరికత పేర్లు , అవి వికటించిన తరువాత ఉత్పన్నమయ్యే నేరాలు ఘోరాలు , హత్యలు , ఆత్మహత్యలు … ఇలాంటి వాటన్నింటికి ప్రధాన కారణం కళ్లు . . . కళ్ల యొక్క ఆకర్షణలతో నే సమస్తం  ఆరంభం అవుతాయి . వయసు తో ప్రమేయం లేని ఈ చాపల్యం అంతటా విస్తరించుకు పోయింది. దౌర్భాగ్యం ఏమిటంటే ఇదంతా చాలా సహజం అని సరిపెట్టుకోవడం , ఎందుకంటే నేడు మనిషి కి తన కళ్ళ పై , అంతకు మించి మనసు పై నియంత్రణ లేక పోవడం .


• భగవంతుడు మనిషి కి కళ్లు ఇచ్చింది అందమైన ప్రకృతిని , పచ్చదనాన్ని, జలపాతాలు , పక్షులు , అన్నింటినీ ఆస్వాదిస్తూ వాటితో మానవుని జీవితాన్ని మమేకం చేసుకుంటూ సంతోషంగా ఆరోగ్యంగా ప్రకృతి సిద్ధంగా ధర్మం ఆచరిస్తూ బ్రతకమని . కానీ నేడు ఆ కళ్ళు మాయకు లోనై అదుపు తప్పి నియంత్రణ లేక , చూడకూడనివి చూస్తూ దాసోహం అవుతూ , చేయకూడనివి చేస్తూ మనిషి దుఃఖానికి, పతనానికి కారణం అవుతున్నాయి. ఇదంతా మితి మీరిన స్వేఛ్ఛ ను మనిషి పొందడమే కారణం .

• ఇదంతా , కాస్త అటుఇటుగా నేడు ప్రపంచంలో కళ్లు ఉన్న మానవుల పరిస్థితి.


🌹 🌹 🌹 🌹 🌹


• ఇక  అంధుల గురించి చెప్పాలంటే వారు నిజం గానే అదృష్టవంతులు. ఆకర్షణలకు లోను కాలేరు . తద్వారా పాపాలను చేసే , చూసే అవకాశం లేదు . సరికదా . . . వారి మనో దృష్టి ప్రత్యక్షం గా చూడగలిగేది , సూక్ష్మ లోకం . దానినే దైవీ లోకం లేదా Third Dimension world అనవచ్చు. 

అంధులు  ఆత్మ విశ్వాసం తో జీవిస్తారు . వారు తమ ఆత్మ ను గుర్తిస్తారు .  వారికి కనిపించేది కూడా కేవలం  ఆత్మ మాత్రమే . వారికి తమ దేహం తో పాటు ,  ఇతరుల దేహ రూపం ఎలా ఉంటుందో కనీసం  తెలియదు . వారు తమను మరియు ఇతరులను  ఆత్మ స్థితమై  చూస్తారు. వారి ఆత్మ శక్తి అపారం . 

• గమనిస్తే , అంధులు ఒక విశేషమైన అసాధారణ దివ్య శక్తి కలిగి ఉంటారు . అందుకే వారు తమ మనో నేత్రం ఉపయోగించి , ఈ భౌతిక ప్రపంచంలో నడుస్తారు తిరుగుతారు ప్రయాణాలు చేస్తారు , బ్రెయిలీ లిపి లో చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తారు , పాటలు పాడుతారు , సాహిత్యం రచిస్తారు , రంగులు ఏమిటో తెలియక పోయినా చిత్రాలు గీస్తారు . వీరు చేసే ప్రతి కర్మ శ్రేష్టం గా , దైవీకంగా ఉంటుంది . 

 వారిని  బాగా గమనిస్తే , ఎప్పుడూ నవ్వుతూ నే ఉంటారు ,  కోపం చిరాకు విసుగు వంటి లక్షణాలు  వారిలో కనిపించవు . విచిత్రం ఏమిటంటే కళ్లు ఉన్న మనుషులు జీవితంలో అన్ని అనుభవిస్తూ , అసంతృప్తులతో రగిలి పోతూ ఉంటారు . కానీ అంధులు ఏనాడూ తమ జీవితం పట్ల నిరాశ ను వ్యక్తం చేయరు . ఎందుకంటే వారు అరిషడ్వర్గాలకు అతీతంగా జీవిస్తారు . వారికి కావలసింది ఈ భౌతిక ప్రపంచంలోని  ఐహిక సుఖాలు కాదు , అంతకు మించి . చెప్పాలంటే వారు లోక కళ్యాణార్దం జీవిస్తారు,  వారి నుంచి వెలువడే మంచి పవిత్రమైన ఆలోచనల శక్తి తరంగాలు , సృష్టి లో కొందరి ద్వారా జరిగే అకృత్యాలకు కారణమైన నెగెటివ్ తరంగాలను తటస్థీకరణ (neutralize) చేస్తాయి అనడం లో ఏ సందేహం లేదు .


• కొందరు అంటారు , గత జన్మల పాప కర్మల ఫలితం గా  వారు కళ్లు లేకుండా  పుడతారు అని . ఇది నిజమే అయితే కనుక , వారు నిజం గానే అదృష్టవంతులు . ఎందుకంటే ఈ జన్మలో వారు పాపాలు చేయలేరు కాబట్టి . . .   

మరి నేడు కళ్లు ఉన్న వారంతా  చేస్తున్నవి  పుణ్యా లేనా  ?   

నేను పుణ్యం  చేసాను  , చేస్తున్నాను  అని అనుకునే   ప్రతి మనిషి కూడా ,  ఎందుకని ఏదో  ఒక  రూపంలో  దుఃఖం అనుభవిస్తున్నాడు ?  

ఇక  కళ్లు  ఉండి   పాపాలు చేసే వారు భవిష్యత్తులో   అనుభవించ వలసిన  శిక్ష ఏమిటి ?  

ఈ ప్రశ్నలకు  మనిషే  ,  సాక్షి గా అయి  తన  అంతరాత్మను   ప్రశ్నించుకోవాలి.


ఆలోచించండి . . .అంధుల పై జాలి చూపించాలా ? లేక  వారిని  గౌరవించాలా ?

అసలు జాలి అనేది కళ్లు ఉన్న మనిషి తనపై తాను చూపించుకోవాలేమో అనిపిస్తుంది . ఎందుకంటే కళ్లు ఉండడం వలన మూడవ నేత్రాన్ని మనో నేత్రాన్ని తెరవక ,  అజ్ఞానం లో మునిగి ఉండడమే కలియుగ మానవుని జీవన దుస్థితి .


• సత్యం వాస్తవం చాలా ఖచ్చితత్వం తో ఉంటాయి . అవి మనిషి తాను  ఆచరిస్తున్నపుడు ఆనందంగా ఉంటాడు  ,  అవి ఆచరించ లేనప్పుడు ఆచరించే వారిని  నిందిస్తాడు , దూషిస్తాడు  లేదా సత్యాన్ని అంగీకరించడు.


అంధులు  అనేక  విషయాలలో ,  కళ్లు ఉన్న వారికి  మార్గదర్శకులు అనడం లో ఏ సందేహం లేదు . కళ్లు లేక పోయినా ప్రకృతి తో మమేకమై ఆనందం గా జీవిస్తారు .  మరి ఆ ఆనందం కళ్లు ఉన్న మానవుడు జీవిత కాలం శాశ్వతంగా పొందగలుగు తున్నాడా ?   


గమనించాలి 🙏 . . . 

ఈ రచన  మనుషులు మరియు సమాజం పట్ల  విముఖత తో కాదు. అంతర్ముఖతను  జాగృతం చేయాలనే  సముఖత మరియు చైతన్యం కోసం . 


  ఓం శాంతి 🙏

  ఓం నమఃశివాయ 🙏

  యడ్ల శ్రీనివాసరావు  3 JUNE 2026 10:00 PM.


Tuesday, June 2, 2026

751. మనసా అలసట మానుకో

 

మనసా అలసట మానుకో



• ఓ  మనసా  తెలుసుకో

  అలసట  మానుకో .

• ఏది  నీదని  వెదికావు

  ఎంతని  అలసి  తిరిగావు .


• ఓ  మనసా  తెలుసుకో

  అలసట    మానుకో .

• ఉన్న  దానితో    ఉండలేవు

  లేని   దానికై    పరిగెడతావు .

  ఎందుకు   నీకీ   అవస్త .

• కోరికలే       గుర్రాలై

  కోమలమే   కఠోరమై

  ఏమిటి   నీకీ   యాతన .


• ఓ  మనసా  తెలుసుకో

  అలసట    మానుకో .


• తెరిచావు    నీ లోని   మాయ ని

  మరిచావు   నీ లోని    శాంతి ని .

• దేహము   తొడిగి

  దేహి దేహి   అంటున్నావు .

• దివ్యత్వం   వదిలి

  దిక్కులు   చూస్తున్నావు.


• నీ   మూలం లోని     శక్తి కి

   సాటి  ఏది  ఉంది .

• నీ   సంకల్పం లోని   యుక్తి కి 

   కాని  దేది   ఉంది .


• ఓ  మనసా  తెలుసుకో

  అలసట    మానుకో .

• ఏది   నీదని   వెదికావు

  ఎంతని  అలసి  తిరిగావు .


• నిర్మలమై   శివుని  చెంత

  నిశ్చలంగా   ఉన్నావు   ఒకనాడు .

• అలజడి  తో   అలమటిస్తు

  గందర  “గోళం” లో   మిగిలావు   నేడు .


• మాయా   మోహలు  నువు

  పూసుకున్న    రంగులు .

• నీ  తనువు   పలచబడ్డాక

  అవి  గేళి చేసి  పోయె   జోరీగ లు .


• ఓ మనసా   తెలుసుకో

  అలసట   మానుకో .

• ఓ మనసా   తెలుసుకో

  అలసట   మానుకో .


యడ్ల శ్రీనివాసరావు 2 June 2026 10:00 AM


Sunday, May 31, 2026

750. తాడు ను తెంపకండి “సాగ” దీయండి

 

తాడు ను  తెంపకండి   “సాగ” దీయండి



• మానవ సంబంధాలలో అభిప్రాయ భేధాలు కలగడం సహజం , కలహాలు సంభవించిడం సర్వ సాధారణం. ఇవి ఒకోసారి తారాస్థాయికి చేరుకుంటాయి. ఒకరితో మరొకరు కలిసి ఉండలేనంతగా , ఒకరిని మరొకరు భరించలేనంత పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది .

 ఈ సమస్య ప్రతి మనిషి తన జీవితంలో ఏదో సమయం లో ఎవరో ఒకరితో ఏదో ఒక సందర్భంలో అనుభవించ వలసి వస్తుంది . ఆ సమయంలో వ్యక్తుల మధ్య కలహాలు , దూషణలు పెరుగుతాయి . ఓర్పు సన్నగిల్లి ఆ బంధాన్ని  తుంచి వేయాలి , కట్ చేసుకోవాలి  అనిపిస్తుంది .


• బంధాలు  ఎటువంటివి అయినా సరే బలవంతంగా తెంపకండి , కట్ చేయకండి . ఎందుకంటే ఆ బంధం వేసుకున్నది , కలుపుకున్నది మనమే కాబట్టి . ఆ బంధం లో సమస్య ఉంటే , అది సరియైన బంధం కాకపోతే , ఆ బంధాలలో వ్యక్తుల మధ్య పొంతన కుదరకపోతే కనుక ఆ బంధాన్ని  కొన  “సాగ” నివ్వండి .


• బంధం అంటే మనకు మనం గా , కోరుకొని పెన వేసుకున్న, లేదా ముడి పెట్టుకున్న తాడు. దానిని బలవంతంగా తెంపకూడదు, ఆ బంధం లోని వ్యక్తులతో సమస్యలు వచ్చి నప్పుడు మనకు మనం కట్ చేయకుండా , కాస్త ఓర్పు వహిస్తే . . . ఆ బంధం సాగి సాగి అనగా పలచబడి దానంతట అదే సహజం గా తెగిపోతుంది  , లేదంటే బంధం లోని సమస్య పరిష్కారం అవుతుంది. 

• అంతవరకు ఆ బంధాన్ని కాస్త భరించే గలిగితే ఏదో రూపంలో ఏదో విధంగా ఎవరో ఒకరి సహాయం వలన సహజంగా తెగిపోతుంది . అంతే కానీ బలవంతంగా మాటలతో చేతలతో ఆ బంధాన్ని తెంపకూడదు .


• బంధాలు అనేవి చేసిన కర్మల అనుసారం మనిషికి ఏర్పడతాయి . మనిషి  తనకు తాను కోరుకొని కలుపుకొని  ఏర్పరుచుకున్నవి . ఇందులో భగవంతుని ప్రమేయం ఉండదు . ఎందుకంటే ఏ మనిషి కూడా భగవంతుని ఆమోదం తీసుకొని బంధాన్ని కలుపుకోడు . మనిషి  తన అవసరం కోసమే బంధాలను సృష్టించుకుంటాడు .


• ఈ బంధాలు అనేవి కర్మ బుణాలు. ఒకవేళ మనకు ఒకరితో ఇబ్బంది ఉంది అని బంధాన్ని కట్ చేస్తే , అదే  ఇబ్బంది కర స్థితి తో  కూడిన కర్మ మరొకరితో తప్పకుండా  ఆరంభం అవుతుంది. ఇది పరమ సత్యం . 

బంధాలలో ఉన్న కర్మ బుణం అనేది  మనిషి కి ఎవరితో  ఏ విధంగా ఉన్నా  ఆ  వ్యక్తులతో తీరి పోవలసిందే . బంధాల లోని వ్యక్తులు ఇబ్బంది పెట్టే స్థితి ఉంటే ఓర్పు  వహించి  సహించి  కాలానికి  వదిలెయ్యండి , భగవంతుడుని  స్మరించండి . ఎందుకంటే కాలంలో కాలుడు (శివుడు) ఉంటాడు. ఆ సమస్యాత్మక బంధాలను ఎలా పలుచగా (dilute) చేయాలో కాలుడికి తెలుసు . అప్పుడు ఆ బంధం అనే తాడు సాగి సాగి  సన్నగిల్లి  సహజంగా తెగిపోతుంది లేదా పరిష్కారం అవుతుంది .


• బంధం అంటే ఏదైనా కావచ్చు . . . స్నేహబంధం , ప్రేమ బంధం, దాంపత్య బంధం, రక్త(సం)బంధం, అక్రమ(సం)బంధం , వ్యాపార బంధం . ఇలా ఎన్నో ఎన్నెన్నో  మానవుడికి దుఃఖం, అశాంతి కలిగించేవి ఈ బంధాల లోని పాత్ర లే .

కర్మ ఏ రూపంలో ఎవరితో ఎలా ఉన్నా అనుభవించ వలసినపుడు అనుభవించ వలసిందే. ఆ కర్మ ను బలవంతంగా తుంచకూడదు . శివుని స్మృతి లో ఆ కర్మ ఆచరించడం వలన తేలికగా తొలగిపోతుంది.


గమనించాలి . . .

 ఈ రచన యొక్క అర్దం ఎవరూ కూడా బంధాలను ఏర్పరచుకోవద్దు  అని కాదు , బంధాలకు  దూరంగా ఉండమని అసలే కాదు .   బంధాల ద్వారా వ్యక్తులను  భరించ లేని స్థితి కలిగినపుడు , సమస్యలు వచ్చినప్పుడు , కట్ చేయకండి . ఓర్పుతో ఉండండి. 

భార్య భర్తలు  విడాకులు వంటివి తీసుకోకండి . రక్త (సం)బంధీకులు ఆస్తుల కోసం హింసకు పాల్పడకండి .  స్నేహితులు  మాటలతో  ఈర్ష్య ద్వేషాలు తో  దూషించుకోకండి .  ప్రేమికులు  నమ్మించి  మోసం చేసేలా  జిత్తులమారి  నటన వేషాలు అవలంభించకండి . 

వీటన్నింటి బదులు భగవంతుని స్మృతి చేయండి . మీకు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే బంధాలలోని వ్యక్తులతో  శాశ్వత విముక్తి లభిస్తుంది లేదంటే కనీసం వారిలో మార్పు వస్తుంది . మీ సమస్య తీరి సంతోషంగా ఉంటారు . ఇది పరమ సత్యం .


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 31 May 2026 , 10:00 AM.


Saturday, May 30, 2026

749. విదేశీయుల శివ సాన్నిధ్యం

 

విదేశీయుల  శివ సాన్నిధ్యం


Arunachalam 

•  2017 వ సంవత్సరంలో ,  నేను , నా భార్య    మా అబ్బాయి  కలిసి అరుణాచలం వెళ్ళాం . ఆ సమయంలో మా అబ్బాయి 8 వ తరగతి చదువుతున్నాడు .


• ఆ రోజు ఆలయం లో  శివుని దర్శనం అయిన తరువాత చూస్తే  చాలా మంది విదేశీయులు కనిపించారు.  అక్కడ నుంచి రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాము . అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది . ఎటు చూసినా నెమళ్లు కనిపిస్తున్నాయి. ఆశ్రమ ప్రాంగణం లోపల , రమణుల సమాధి వద్ద కొందరు , ఆ ప్రక్కనే ఉన్న శివలింగం ఎదుట అనేక మంది విదేశీ స్ర్తీ లు చీర లో , విదేశీ పురుషులు పైజామా లాల్చీ లో వస్త్రాలు ధరించి లో శివ ధ్యానం చేయడం కనిపించింది. వారిలో ప్రతి ఒక్కరికీ నుదుట కుంకుమ బొట్టు ఉంది . ప్రత్యక్షం గా అదంతా చూస్తున్న నాకు చాలా ఆశ్చర్యం గా అనిపించింది .


• భారతదేశం లో ఉన్న మనం శివుని ఆరాధించడం అనేది మన హిందూ సాంప్రదాయం లో భాగం గా , భక్తి సంస్కృతుల పరంపరలో మనకు సహజంగా అలవడతాయి.

 కానీ విదేశీయులు, వివిధ పాశ్చాత్య దేశాల్లో పుట్టి , భిన్న సంస్కృతి సంప్రదాయాల్లో పెరిగిన వారు, అసలు దైవ భక్తి , మన ధర్మం తెలియని వారు , ఇంకా చెప్పాలంటే భారతదేశ మూలాలకు ఏ సంబంధం లేని వారు శివుని పూజించడం , ధ్యానించడం ఏమిటి ?  పైగా ఎన్నో సముద్రాలు దాటి ఇంత దూరం అసలు శివుని ఆలయానికి , రమణుల ఆశ్రమానికి ఎలా వస్తారు?. విలాసాల జీవనానికి మొగ్గు చూపించే విదేశీయులు ఇంత నిరాడంబరంగా ఎలా ఉంటున్నారు ? అని ఎన్నో ప్రశ్నలు మనసు లో వచ్చాయి . కానీ సమాధానం దొరకలేదు.


• రమణాశ్రమం లో కాసేపు నేను, నా కుటుంబం తో ధ్యానం చేసుకున్న తర్వాత బయటకు వచ్చాం . మేము బస చేసిన  శివ సన్నిధి సత్రం  వద్దకు వెళుతూ ఉండగా , అరుణాచలం రోడ్ మీద సైకిళ్ళు తొక్కుతూ కొందరు విదేశీ స్త్రీ పురుషులు చీర, లాల్చీ పైజామా లో కనిపించారు . అలానే మేము నడుస్తూ కొంచెం ముందుకు  వస్తుంటే మరి కొందరు విదేశీయులు చెప్పలు లేకుండా నడుచు కుంటూ మాకు ఎదురయ్యారు . వాళ్లు మమ్మల్ని , ఇంకా రోడ్ పై వెళ్లే మరి కొందరిని చాలా ప్రశాంతంగా కళ్లలో కి కళ్లు పెట్టి చూస్తూ , ఓం నమఃశివాయ అంటూ చిరు నవ్వుతో పలకరిస్తూ వెళ్తున్నారు .


• అది చూసిన నాకు, మా అబ్బాయి కి కూడా చాలా వింతగా అనిపించింది. వెంటనే మా అబ్బాయి అడిగాడు, నాన్నా ఫారినర్స్ అంతా లగ్జరీ ఎంజాయ్ మెంట్ , డిఫరెంట్ కల్చర్ లో ఉంటారు కదా, వీళ్లు ఏంటి ఇక్కడ ఇలా మన ఏన్షియంంట్ సేజ్ స్ (పూర్వ కాలం మునులు) వలే జుట్టు పొడవుగా పెంచుకుని ఉన్నారు , అని అడిగాడు. అప్పటికే అవే ఆలోచనలు ప్రశ్నలు నా మనసు లో తిరుగుతూ ఉండడం, వాటికి సమాధానాలు నా వద్ద లేక పోవడం వలన మౌనం గా ఉండి పోయాను .


• ఎవరినైనా ఈ విషయం గురించి అడిగితే సంతృప్తి కరమైన సమాధానం చెప్పలేదు . కానీ అక్కడ ఉన్న కొందరు ఇలా చెప్పారు , విదేశీయులు అనేక మంది ప్రతి సంవత్సరం లో ఆరు లేదా మూడు నెలలు పాటు అరుణాచలం వచ్చి ఆ సమయం అంతా శివాలయం లోను మరియు, రమణాశ్రమం లోనూ ధ్యానం చేస్తూ ఉంటారు , అని చెప్పారు.


• కానీ , మనం భగవంతుని పై సత్యమైన నమ్మకం విశ్వాసం ఉంచినప్పుడు కాస్త ఆలస్యమైనా మనకు తప్పక మనకు కావలసిన సమాధానం , లేదా మనం పొందవలసినవి తప్పక పొందుతాం. ఎందుకంటే ఇది భగవంతుని బాధ్యత. 

ఇది నాకు అనేక సందర్భాల్లో, అనేక విషయాలలో నిరూపణ అయింది, ఇంకా నేటికీ అవుతూనే ఉంది, అవసరం లేనివి నా నుంచి  ఏదో రూపంలో  దూరం అవడం , అవసరం అయ్యేవి మాత్రమే దగ్గరగా ఉండడం శివలీల అనిపిస్తుంది .

• అరుణాచలం లో  విదేశీయుల గురించి తలెత్తిన సందేహం మనసులో అలాగే అప్పటి నుంచి మిగిలి పోయింది.


🌹🌹🌹🌹



North Carolina , USA

• 2025 లో సంవత్సరం లో నేను, మా అబ్బాయి కలిసి శివరాత్రి సమయం లో రాజస్థాన్ లో , మౌంట్ అబూ, బ్రహమకుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయానికి వెళ్లాము . పది రోజులు అక్కడే ఉన్నాము . శివరాత్రి సమయం లో తండ్రి అయిన పరమాత్మ శివుని తో  మిలనం (కలయిక) అత్యంత మనో  వైభవంగా   మౌంట్ అబూ లో  జరుగుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా పోర్చుగీసు, డచ్ , రష్యా , అమెరికా , ఆస్ర్టేలియా , ఇండొనేషియా , జపాన్ , ఇరాన్ , ఇలా ఎన్నో వివిధ దేశాల నుంచి వేలాది మంది విదేశీయులు వచ్చి ఉన్నారు . నాకు మరలా అదే ఆశ్చర్యం, అసలు విదేశీయులు ఏంటి , ఇంత దూరం రావడం,  వీరంతా  శివుని గురించి తెలుసుకోవడం,  శివధ్యానం చేయడం వెనుక ఏదో బలమైన  సూక్ష్మ రహస్యం ఉంటుంది అని మనసులో అనిపించింది .


• నా ఈ సందేహానికి మౌంట్ అబూ లో ఉండగానే  ఆ మరుసటి రోజు నే ,  శివ పరమాత్ముని గీతా జ్ఞానం  క్లాస్  (మురళి)  ద్వారా  సమాధానం లభించింది . ఆ సమాధానం చాలా అద్భుతంగా ,  ఆధార భరితంగా  , ఈ విధంగా ఉంది .

ఈ సంగమ యుగం లో   (కలియుగం అంతం అవుతూ, సత్య యుగం ఆరంభం అయ్యే కాలం) . . . నేను (శివ పరమాత్మ) తిరిగి సత్య యుగ స్థాపన కు భరత భూమి పై వృద్ధ మానవ తనువు లో అవతరిస్తాను .

• ఈ విశ్వం   ఆది లో  అనగా కల్పం (5000 సంవత్సరాల) క్రితం సత్య యుగం లో ఎవరైతే నా పిల్లలు (ఆత్మలు) , ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన  వారు  ఎవరైతే  ఉన్నారో , . . వారంతా జనన మరణ చక్రంలో తిరుగుతూ కాల క్రమేణా వేరు వేరు ధర్మాలలో కి  వెళ్లి పోయారు .

బౌద్ధ , క్రిష్టియన్ , ముస్లిం , జైన్ , సిక్కు , ఇలా ప్రపంచ వ్యాప్తంగా  వందకు పైగా అనేక ధర్మాలలో కి వెళ్లి ఉన్నారు . 

 నేను (శివ పరమాత్మ) భూమి పై అవతరించిన ఈ కలియుగాంత సమయం లో , ఈ విశ్వం అంతా నిండి ఉన్న  నా పిల్లలు (ఆత్మలు) ఎవరు ఏ ధర్మానికి చెందిన వారైనా సరే . . . ఆదిలో  సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన  నా పిల్లలు (ఆత్మలు) నన్ను వెతుక్కుంటూ  వారి మూల స్థానం అయిన ఈ భరత భూమి కి చేరుతారు . తిరిగి నన్ను కలిసి నా ద్వారా  రాజయోగం పొందుతారు . అని స్పష్టం గా గీతా జ్ఞానం ద్వారా ఆ రోజు సమాధానం లభించింది . . . 


• అప్పుడు నాకు అర్దం అయింది ఒకటే … అరుణాచలం లో  నేను చూసిన విదేశీయులు , ఎక్కడో విదేశాలలో క్రిష్టియన్, జోరాస్ట్రియన్ , ఇస్లాం , బౌద్ద ధర్మాలలో నేడు పుట్టినవారు . . . కొన్ని యుగాల క్రితం భారతదేశ సంతతి కి చెందిన వారు . వారు అప్పటిలో శివుని ఆరాధించే వారు . వారు (ఆ ఆత్మలు) జననం మరణం పొందుతూ తమ మూలాలను మరచి , కలియుగం లో వేరు వేరు ధర్మాలలో వివిధ దేశాల లో జన్మించారు .

తిరిగి  ఈ కలియుగాంత సమయం లో , శివుడు అవతరించిన ఈ సంగమ యుగం లో , వారంతా తాము పూర్వజులం అనగా ఎన్నో జన్మలు ఎత్తిన వారం అనే విషయాన్ని శివ శక్తి ద్వారా అనేక ఆధారభరిత అనుభవాలను వారు స్వయం గా పొంది , ఒకప్పుడు తాము ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన వారము అని తెలుసుకుని నేడు , భారత దేశం లో ఉన్న ఉన్న శివుని ఆలయాలకు , ఆశ్రమాలకు చేరుకుంటారు . . . చేరు కుంటున్నారు .


• శివుడే స్వయంగా గీతా జ్ఞానం ద్వారా,  నా మనసు లోని  ఈ సందేహానికి సత్యమైన సమాధానం ఆధారంతో చూపిస్తూ తెలియచేయడం జరిగింది .

 ఇలాంటి అనుభవాలు ఎన్నో. . . అందుకే శివుని తో ప్రయాణం అత్యద్భుతం. అది అనేక భవిష్య జన్మలకు కావలసిన భోగ భాగ్యం.


శివుడు అంటే ఒక విశ్వ మహ శక్తి .   అంతే కానీ ప్రత్యేకంగా ఒక మతానికి పరిమితం అయిన వాడు కాదు .  ఇటీవల ఇరాన్, అమెరికా యుద్ధం జరుగుతున్న సమయంలో , ఇరాన్ ప్రజలు  శివుని పూజించడం, ప్రార్థనలు చేయడం ప్రపంచ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో లింక్ 👇👇 . వేల సంవత్సరాల క్రితం , ఆ యా దేశాలలో  వారు ఉపయోగించిన నాణేల పై  శివలింగం ఉండడం గమనించవచ్చు. 


1. 

https://youtu.be/av-_Ivs6FmY?si=N7JkOD4Fm6ggqmKA



2. 

https://youtu.be/y2OAJlCjBGY?si=3qtJxnXrHrwD-nN5




ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 30 May 2026 . 9:00 PM .


Friday, May 29, 2026

748 . నేను ఒంటరిని కాను

 


నేను ఒంటరిని కాను



• నేను  “ఒంటరిని” కాను  అని  ఈ సమాజానికి ఎలా చెప్పాలి అని నేను “ఒంటరిగా” కూర్చొని ఆలోచిస్తున్నాను . బాల్యం లో ఒంటరితనం అనే బీజం బాధించేందుకే అనిపించినా, అది బ్రతుకు బంగారు బాట కోసం అని శివుని తత్వం తో అనుభవం అయింది . భగవంతుని రచన (script) అమోఘం . ఆ మూలాన్ని అర్దం చేసుకోవడం అసాధారణం . స్వయం భగవంతుడే  వచ్చి అర్దం చేయించినపుడే అది తెలుస్తుంది .


• నేను ఒంటరిని కాను . అనేక జన్మల కొరకు నాకంటూ ఒక శాశ్వతమైన తోడు నీడ కలిగి ఉన్నాను . ఆ తోడు తోనే జీవిస్తున్నాను , ఆ నీడలోనే నడుస్తున్నాను . . .  ఒకోసారి , నువ్వు భగవంతుడు అనే భ్రమ లో (లోకం భాష లో పిచ్చి) ఉన్నావు , అని  నా చుట్టూ ఉన్న మాయ నాకు గుర్తు చేసిన క్షణం లోనే , ఏదో అసాధారణమైన శక్తి తో అద్భుతాలను నాకు అందిస్తూ ,  ఆ మాయా భ్రమ లకు తెర దించుతూ,  చీకటిని  మరింత తొలగించి స్పష్టం గా చూపిస్తూ , వాటిని చవిచూసేలా చేస్తూ , నేను నీతో ఉన్నాను అంటాడు శివుడు . ఇంతకు మించి ఏం కావాలి.


• కాలం లో కలం ఒకోసారి కలకలం సృష్టిస్తోందా అనిపిస్తుంది. జీవితం లో ముగింపు లేని కథలకు , వాటి పాత్రలతో నాకు పని ఏంటి ? అలాగని నన్ను నేను తీరం చేరని కెరటం అనుకోలేను కదా? నా ప్రయాణం సంద్రమైనా తీరం చేరడం నాకు ముఖ్యం కదా!


• నేను మనసుతో నవ్వితే సమాజం నన్ను వెర్రి అనుకుంటుంది , మౌనం గా ఉంటే బ్రతకడం చాత కాదు అంటుంది , కానీ నా ఆనందం  నాలోనే నాతోనే .   

నేను నలుగురిలో ఉంటే ఇబ్బంది పడుతున్నాను అని సమాజం ఈ మధ్య అంటుంది . అవును , ఇబ్బంది పెడితే ఎవరైనా ఇబ్బంది పడతారు కదా ! ఆ మాత్రం కనీస ఇంగిత జ్ఞానం లేకుండా , ఆ నలుగురి తో ఉన్న  ఈ సమాజం ఎలా  ఎదిగింది ?  అజ్ఞానం  కాకపోతే . అందుకే ఒకోసారి సమాజాన్ని చూసి జాలేస్తుంది , పాపం సత్యాన్ని ఎదుర్కొ లేక మాయ తో  కలిసి  వంకర గా నడుస్తుంది అని.

  ఇది నిజం , ఇదే నా నైజం . . .


• నాకు కనబడదని గాలిని , నేను చూడలేదని అదృష్టాన్ని నమ్మను అంటే కుదురుతుందా ? కలానికి కాలానికీ తలవంచని మనిషి లేడు కదా ! ఒక్కోసారి ఆలస్యం అమృతంగా మారుగాక. . అయినా గరళాన్ని మింగేవాడికి రంగు రుచి వాసనలతో పని ఏంటి ?


అప్పుడప్పుడు పదాలకు దూరమయ్యేనేమో గానీ , నా శివుని పాదాలకు మాత్రం కాదు.

 ఒక్కోసారి వాంఛితములు వంచనలకు గురికావలసిందే. నాకు వద్దూ అంటే చెవిలో దూరిన జోరీగ నిశ్శబ్దంగా ఉంటుందా ? అదే విధంగా కొన్ని మాయా సాంగత్యాలను కర్మ బుణానుసారం భరించవలసి వచ్చేది . బుణాలు తీరాయి . శాశ్వత విముక్తి లభించింది .


• నాలోని ప్రతి భావము పదరూపము పొందాలంటే అది శివానుగ్రహానికి నోచుకోవాలి కదా ! . . . . . . లేదు లేదు, నాకు ఆ అధికారం ఉంది కదా అని , అడిగిన వారి కోసం విర్రవీగితే పద సోపానాలు తుల్యమై చివరకు శల్యమై పోవుగా .


• “నా” అన్న భావన “నమః శివాయః” లోని “” నుండి వచ్చినదైతే నా లోని “” నన్ను ఎప్పుడూ ఉచ్చ స్థితిలో నిలబెడుతుంది. కారణం అది నిర్వికారి నిగర్వి నిరాకార నిర్గుణ తత్వాలని కలిగి ఉంటుంది కాబట్టి . లేదంటే , “ నా “   నాలోని సర్వ గుణముల కలయికయై నన్ను అహంకార భూషితుడను చేస్తుంది. 

ప్రణవ నాదమైన ఓంకార శబ్దం శరీరం లో అణువణువునా ప్రతిధ్వనిస్తే ఆ తరంగ “అంతరంగ” మధురానుభూతులు వెల్లువలా పొంగి పద ప్రాసలుగా మారి పరవళ్ళు తొక్కు ప్రవాహాలుగా పొర్లుతాయి. ఇదే శివలీల. శివ కణములు లేని శివ గణములు ఉండునా ?

• నేను ఇంతకు ముందు విన్నవించినట్లు , మండినా మారనది , తుదకు మిగిలేది వెలకట్టలేనిది “విభూది” అదే ఐశ్వర్యం . నువ్వు విభూదిగా మారక మునుపే దాని విలువ తెలుసుకో తరువాత తెలుసుకోవడానికి ఏమీ మిగలదు , మరల విభూది తప్ప.

విరక్తి లోని రక్తి అద్బుతం . వైరాగ్యం లోని రాగం సమ్మోహనం .


• చివరిగా ! శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా ,   ఆ “చీమ” నన్ను ఎప్పుడు కుడుతుందా అని శూన్యం  లోకి  ఎదురు చూస్తూ  ...


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు  30 May 2026 5:00 AM.


Thursday, May 21, 2026

747. కది లే కలం

 

కది లే  కలం



• కది లే   కది లే

  కది లే   ఈ  కలము .

• కాలము తో   చేసెను    స్నేహం .

  చిర కాలముగా   పంచెను    తన భావం .


• సిరా   లేని    ఈ అక్షరాలు

  సిరులొలికే    సంపదలు .

• అవి పలికే   కంఠ  స్వరాలు

  వెతలు   తరించే   తారలు.


• భారం దించే   ఈ  భావాలు

  విశ్వసేవ కై   వెలసిన   చిరు  దివిటీలు.

• దారిని   చూపే   ఈ రాతలు

  భావి  మనసు లకు   సంపదలు .


• కది లే     కది లే

  కది లే     ఈ కలము

• కాలము తో   చేసెను    స్నేహం 

  చిర కాలముగా   పంచెను   తన భావం .


• కాలం   తెలిపిన   మౌనం తో

  ఈ కలం   చేస్తుంది   తాండవం .

• కాలుడు  చూపిన   సత్యం తో

  ఈ కరం  రాస్తుంది   మైమరచి .


• తాళ   పత్రాలు  కావివి . . . 

  కానీ

  మనసు  తాళం   తెరిచే  సూత్రాలు .

• తెలుగు లోని  తెల్లదనంతో 

  తేటతెల్లం  మవుతున్న

  ఈ తామరలు   శివార్పితాలు  .


• కది లే    కది లే

  కది లే    ఈ కలము

• కాలము తో    చేసెను   స్నేహం .

  చిర కాలముగా   పంచెను    తన భావం .



వెతలు = దుఃఖాలు

తరించు = దాటు, అతిక్రమించు

తారలు = ప్రకాశించు నక్షత్రాలు.

తేటతెల్లం = మిక్కిలి స్పష్టం.


యడ్ల శ్రీనివాసరావు 22 May 2026 10:30 AM.


Tuesday, May 19, 2026

746. శ్రీకృష్ణోపదేశం - కలియుగాంతం

 

 శ్రీకృష్ణోపదేశం  - కలియుగాంతం


• ఒకసారి శ్రీకృష్ణుడు , పాండవుల కు సృష్టి మరియ యుగాల గురించి ఉపదేశిస్తూ కలియుగం ఆరంభం గురించి వివరించగా , పాండవులు కలియుగ అంతం గురించి తెలియ చేయమని అడగడం జరిగింది .

  వెంటనే , శ్రీ కృష్ణుడు కలియుగ అంత్య సమయం ఎలా ఉంటుందో వివరించడం కంటే ముందు , తన శక్తి తో  అది స్వయం గా   వారికి  చూపించాలని నిర్ణయించుకొని , పాండవులకు  ఒక  పరీక్ష పెడతాడు .  ఆ పరీక్ష లో   ధర్మరాజు ను మినహాయించి . . . తన వద్ద ఉన్న నాలుగు బాణాలు తీసి , నాలుగు దిక్కుల వైపుకు వేసి అవి తీసుకుని రమ్మని అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు కి  చెపుతాడు .


వారు నలుగురు  తలో దిక్కు కు వెళతారు . 


• అర్జునుడు తాను వెళ్లిన దిక్కు లో దొరికిన బాణం తీసుకుని వస్తుండగా , ఒకచోట ఒక విచిత్రం చూస్తాడు. అప్పుడే దూడకు జన్మనిచ్చిన ఆవు, అదే పనిగా దూడను విపరీతంగా నాకుతూ ఉంటుంది. ఆ దూడను ఎంతకూ వదిలి పెట్టదు . అక్కడ ఉన్న వారు, ఆవు ను బలవంతంగా దూరం గా ఉంచినా సరే పరిగెత్తుకుంటూ ఆవు , దూడ దగ్గర కు వెళ్లి నాకుతూ ఉంటుంది . ఇది అర్జునుడికి చాలా ఆశ్చర్యం గా అనిపిస్తుంది . అది చూసి అర్జునుడు బయలుదేరుతాడు.


• ఇక రెండవ దిక్కు నుండి భీముడు బాణం తీసుకుని వస్తూ ఉంటే , ఆ మార్గంలో ఒక కోకిల బ్రతికి ఉన్న కుందేలు ను పొడుచుకుని తింటూ ఉంటుంది . భీముడు ఆశ్చర్యపోతాడు కోకిల ఎంతో మృధువైనది. ఎంతో మృదువుగా రాగం ఆలపిస్తుంది . అటువంటిది , కుందేలు ను పొడుచుకుని ఆహారం గా తినడం ఏమిటి . ఏమిటి ఈ విపరీతం అని, సందేహం తో భీముడు అక్కడి నుంచి బయలుదేరుతాడు .


• ఇక మూడవ దిక్కు నుంచి నకులుడు బాణం తీసుకుని తిరిగి వస్తుండగా , ఒక చోట వింత చూస్తాడు . ఒక పెద్ద బావి , దాని సమీపంలో నాలుగు చిన్న బావులు ఉంటాయి . కేవలం పెద్ద బావి లో మాత్రమే నీళ్ళు ఉండడం వలన , అక్కడి ప్రజలు నీళ్ళు తోడి చుట్టూ ఉన్న నాలుగు చిన్న బావుల్లో సమానం గా నింపుతూ ఉంటారు . కొంత సమయానికి పెద్ద బావి లో నీళ్ళు పూర్తిగా నిండుకుంటాయి . వెంటనే అక్కడి ప్రజలు, అయ్యయ్యో పెద్ద బావి లో కొన్ని నీళ్ళు అయినా ఉండాలి కదా అని , చుట్టూ ఉన్న నాలుగు బావుల లో ఇది వరకు వేసిన కొన్ని నీళ్ళు కొంచెం కొంచెం తోడి పెద్ద బావి లో వెయ్యాలని ప్రయత్నిస్తే , ఆ నాలుగు చిన్న బావుల లోని నీళ్ళు తోడే సరికే , అవి ఆవిరి అయిపోతుంటాయి ‌. కానీ పెద్ద బావి కి ఒక్క నీటి చుక్క కూడా దొరకదు .

 అది చూసిన నకులుడు ఏంటి ఈ విచిత్రం కళ్ళ ముందే ఇలా జరుగుతుంది అని అనుకుని అక్కడి నుండి బయలుదేరుతాడు .

• ఇక నాల్గవ దిక్కు న ఉన్న బాణం సేకరించిన సహదేవుడు తనకు దొరికిన బాణం తీసుకుని శ్రీకృష్ణుని వద్దకు బయలుదేరుతుండగా , ఒక విచిత్రం చూస్తాడు . ఒక పెద్ద బండరాయి , మహా పర్వతం పై నుంచి, దొర్లుకుంటూ వస్తుంది. అది అలా దొర్లుకుంటూ వచ్చేటప్పుడూ ఎంతో ఏపుగా ఆ పర్వతం పై పెరిగిన మహ వృక్షాలను కూలదోస్తూ , దొర్లుకుంటూ దొర్లుకుంటూ వచ్చి ఆఖరికి ఒక చిన్న గడ్డిపోచను అడ్డుకొని పర్వతం మధ్యలో ఆగి పోతుంది . సహదేవుడు కి చాలా ఆశ్చర్యం కలుగుతుంది అంత పెద్ద బండరాయి చిన్న గడ్డిపోచను ఆనుకొని ఆగిపోవడం ఏమిటి . ఏమిటి ఈ విచిత్రం అని అనుకుంటూ అక్కడ నుంచి బయలు దేరుతాడు .


• ఆ నలుగురు శ్రీకృష్ణుని చేరి , తాము చూసిన వింత అనుభవాలు వివరిస్తారు . అందుకు సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా చెపుతాడు . కలియుగం చివరిలో అంతం అవుతుంది అనడానికి అవే సంకేతాలు . . వాటిలోని సూక్ష్మం మీకు అర్దం చేయిస్తాను అని , శ్రీకృష్ణుడు ఇలా చెప్పడం ఆరంభిస్తాడు .

• మొదటి వృత్తాంతం ఆవు , దూడను నాకుతూ ఉండడం. . . కలియుగం అంత్య కాల సమయం లో జన్మ నిచ్చన తల్లి తండ్రులు తమ పిల్లలకు అతి గా ప్రేమ ను పంచుతూ , సాకుతూ ఉంటారు . పిల్లలకు కష్టం తెలియకుండా సమస్తం సమకూరుస్తూ , మమకారం అనే మైకంలో పిల్లలకు , తల్లిదండ్రులు బానిసలు లా ప్రవర్తిస్తూ ఉంటారు . కష్టం తెలియని పిల్లలు సోమరులై , అపసవ్య దిశలో జీవనం సాగిస్తారు . అందుకు నిదర్శనం ఆ ఆవు దూడ వృత్తాంతం అని శ్రీకృష్ణుడు చెపుతాడు. వాస్తవానికి దూడ ఆవు గర్భం నుంచి భూమిపై పడిన కొన్ని క్షణాలలో తనకు తాను లేచి పరిగెట్టాలి , ఇది సృష్టి ధర్మం. కానీ సృష్టి ధర్మం తప్పి నపుడు జీవులకు అదే వినాశన కాలం అని చెపుతాడు .

• ఇక రెండవ అంశం అయిన కోయిల కుందేలు వృత్తాంతం గురించి చెపుతూ. . . సృష్టి లో కోయిల స్వరం భగవంతుని ఆశీర్వాదం . ఆ విధంగా కోయిల వలే , దైవానుగ్రహం తో సంపాదించిన జ్ఞానాన్ని కలిగి ఉన్న పండిత పుంగవులు తమ గొంతు, స్వరం , మాటలతో , కుందేలు వంటి అమాయకులను ధనం కోసం పీల్చి పిప్పి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు . విద్య , వైద్య , దైవీ జ్ఞానం వంటివి అనుభవజ్ఞులు కు ,  పండితులకు , గురువులకు లోక కళ్యాణార్దం భగవంతుని అనుగ్రహం చేత లభిస్తుంది . కానీ , ధనం కోసం తమ జ్ఞానాన్ని భ్రష్టు పట్టించి అమాయకులను పీడిస్తారు. అందుకు ఉదంతమే కోయిల , కుందేలు పట్ల  ప్రవర్తన అని శ్రీకృష్ణుడు చెపుతాడు.


• ఇక ముడవ అంశం . . . అతి పెద్ద బావి వలే విశాల హృదయం ఉన్న తల్లి తండ్రులు ఉమ్మడి కుటుంబం లోని తమ పిల్లలందరికీ సమానంగా కావలసినంత ప్రేమ సహయ సహకారాలు అందిస్తారు . కలియుగ అంతం లో ఈ ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయి , వృద్ధాప్యం లో ఉన్న తల్లి తండ్రులకు తమ పిల్లలు కడివెడు ప్రేమను కూడా పంచరు సరికదా అనాధల వలే చూస్తారు. అందుకే చిన్న బావుల్లో నీరు పెద్ద బావి కి చేరలేదు .


ఇక నాల్గవ అంశం బండరాయి గడ్డిపోచ . . . కలియుగం లో భగవంతునికి కోసం  ఎన్నో  వ్యయ ప్రయాసలతో   ఆలయాలు నిర్మించి  , అంగరంగ వైభవంగా విగ్రహాలు తయారు చేయించి ఆలయాలకు  సమర్పించిన వారికి కూడా సర్వ శక్తివంతుడు అయిన భగవంతుడు , పరమాత్ముడు అనుభవం కాడు .  కారణం  ఆడంబరాలు అలంకారాలు , మాయా ఆకర్షణల తో చేసే  భక్తి   భగవంతుని కి  అణువంత కూడా ప్రీతి పాత్రం  కాదు . ఆ విధమైన వాటన్నింటినీ   దాటుకుని  . . .   భగవంతుని పై సత్యమైన ప్రేమ , మనసు కలిగి ఉన్న  గడ్డిపోచ  వంటి  అమాయకుని చెంతకు స్వయం గా పరమాత్ముడే  వెళతాడు .  నిష్కల్మషమంటి  నిరుపేదదైన  మనసు లోనే  భగవంతుడు ఆసీనుడు అవుతాడు . దాని ఉదంతమే బండరాయి వలే  శక్తి వంతమైన  పరమాత్మ  , గడ్డి పోచ ను ఆనుకొని ఉండడం అని శ్రీకృష్ణుడు పాండవుల కు చెపుతాడు.


సేకరణ :   గీతా జ్ఞానం - రాజయోగం .


• శ్రీకృష్ణుడు చెప్పిన ఈ సందర్భాలు నేడు జరుగుతున్నాయో లేదో , ఇది కలియుగ అంత్య సమయమో కాదో నేటి కాలంలో మనిషే గ్రహించాలి . . . లేదంటే ఇంకా కలియుగం ప్రధమ పాదే , జంబూ ద్వీపే , భరతఖండే , భరతవర్షే , అంటూ నామ గోత్రాలు జపిస్తూ , ఇంకా కలియుగం ప్రధమ పాదం లో ఉన్నాం అనుకుని అమాయకత్వం తో ఉండవలసి వస్తుంది.


• Written by the Energies Conjunction of KARMIC planet SATURN 🪐 and Past Lifes Spiritual Mastery experienced planet KETU .


ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 


ఆత్మ  ✍️ 19 May 2026 11:30 PM 

752. అంధులు అదృష్టవంతులా ?

    అంధులు అదృష్టవంతులా ? • అంధులు అదృష్టవంతులా ?  ఆశ్చర్యం గా అనిపిస్తుంది కదా , ఇంకొక అడుగు ముందుకు వేస్తే మతి  సరిగా లేని  వాడికే  ఇలా  అ...