Saturday, February 28, 2026

726 . సత్యం

 

సత్యం



• భగవంతుని వైపు అడుగులు వేస్తూ పయనం సాగిస్తూ ఉంటే సత్యమే స్పష్టం గా  కనపడుతుంది. సత్యమే తెలుస్తుంది. సత్యమే మాట్లాడడం జరుగుతుంది . ఎందుకంటే భగవంతుడు అంటే నే సత్యం కాబట్టి.

  అదే  “సత్యం శివం సుందరం”.

  ఈ సత్యం తెలుస్తూ , అనుభవం అవుతూ , ఆచరిస్తూ ఉన్నప్పుడు , తొలి దశలో మన లో లోపల అనాది గా   దాగి  ఉన్న అసత్యాలు మనకు తెలియడం ప్రారంభం అవుతుంది , ఆ తరువాత వాటిని  నిర్మూలించడం ఆరంభిస్తుంది . దీనినే పరివర్తన దశ అంటారు. అనగా మనలో మార్పు సంభవించే  కాలం అని అర్థం. ఈ సమయంలో మన మనసు ఎన్నో ఆటుపోట్లకు గురి అవుతూ , ఇటు అంతరంగం లోను అటు బాహ్య ప్రపంచంతోను ఘర్షణ పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుంది.

• ఎందుకంటే ఎన్నో జన్మలు గా మన బుద్ధి అనేక అసత్యాలు కు  నెలవు గా  అయిపోయింది . మన ఆత్మ లో  పేరుకు పోయి ఉన్న అసత్యాలు , వాటితో కూడిన నమ్మకాలు మార్పు చెందుతూ ఉన్న దశలో మనసు లో అంతర్గతం గా  ఒక కురుక్షేత్రం జరుగుతుంది. ఈ దశలో  అంతర్గతంగా నే కాకుండా బాహ్య ప్రపంచం లో ముడిపడి ఉన్న వారితో కూడా తప్పని సరిగా అలజడులు తో కూడిన ఒక యుద్దం మనసు చేస్తుంది . ఎందుకంటే , బుద్ధి లో అలవాటు అయిపోయి ఉన్న అసత్యం బయటకు వెళ్లి , అందులో సత్యం ఆచరణ కోసం నిండాలి అంటే పోరాటం, ఘర్షణ అనేది మనసు కి సహజంగా ఎదుర్కొంటుంది .

• మనం  ఎప్పుడైతే   సత్యం తో  మెలగడం ఆరంభిస్తామో  , అప్పటి వరకూ  మనతో కలిసి మెలిసి ఉన్న ప్రతీ ఒక్కరూ ఇంటా బయటా మనల్ని ఒక శత్రువు గా భావించడం మొదలు పెడతారు . చెప్పాలంటే ఇది వారి యొక్క తప్పు కూడా కాదు. వారికి లేని అవగాహన, అతీతమైన మార్పు నీ లో సంభవిస్తుంది అంటే అది చూసిన వారు మొదట నిన్ను  అర్దం చేసుకోలేరు , గ్రహించ లేరు . అలా అని వారి వలే ప్రవర్తించడం నీకు  సాధ్యం కాదు .

• దీనికి కారణం, ఏనాడైతే నీవు భగవంతుడి ధ్యాస లో ఉంటూ సత్యం మాట్లాడుతూ ఉంటావో , అది నీ చుట్టూ దగ్గర గా  ఉన్న వారికి కొన్ని సందర్భాల్లో తమను కించ పరస్తున్నట్లు  భావిస్తారు. దానికి కారణం  వారిలో  కొలువై ఉన్న  అసత్యం . 

కానీ కాలక్రమేణా , నీ లోని సత్యతను ,   సత్యం యొక్క శక్తిని అందరికీ  అర్దం అవుతుంది . ఎందుకంటే సత్యం ఒక నిప్పు , నీ లో మలిన గుణాలను దహిస్తూ భగవంతుని వైపు తీసుకెళ్తూనే, ఆ నిప్పు జ్యోతి వలే ప్రకాశిస్తూ నీ చుట్టూ ఉన్న అందరికీ  వెలుగు అవుతుంది .

 సత్యాన్ని చెప్పడం , రాయడం కంటే, ఆచరించడం లోనే అద్భుతమైన అనుభవం జరుగుతుంది .

అదే  " సత్యమేవ జయతే "  .


• వాస్తవానికి సత్యం , సత్యమైన విషయాలు , నిజాలు అనేవి ప్రతి మనిషి కి తెలిసినవే . బాల్యం లో పాఠశాల  విద్యాభ్యాసం లో  ఎన్నో సత్య వాక్యాలు   కాపీ రైటింగ్ పుస్తకాల లో  నిత్యం పలుమార్లు  రాయడం ,  చదవడం జరిగేది . ఉదాహరణకు . . . తల్లి తండ్రులను ప్రేమించవలెను , గురువులను గౌరవించవలెను, ఈర్ష్య ద్వేషాలు ఉండరాదు , కామ క్రోధాలు మహా శత్రువులు , అబద్ధం మాట్లాడ రాదు , ఐకమత్యమే మహా బలం , అందరితో సఖ్యతగా ఉండుము , కలిసి ఉంటే కలదు సుఖం , భగవంతుని యందు భక్తి కలిగి ఉండుము , శత్రువులను ప్రేమించుము , సొంత లాభం కొంత మానుకో , ఆరోగ్యమే మహా భాగ్యం , పొరుగు వారికి సహాయం చేయుము , మంచి అలవాట్లు పాటించుము ….. ఇలా ఎన్నో, ఎన్నెన్నో లెక్కలేనన్ని నేర్చుకోవడం జరిగింది. కానీ , నేడు అవి గుర్తు ఉన్నాయా ? అంటే అవును గుర్తు ఉన్నాయి .  కానీ , వాటిని ఆచరిస్తున్నామా ? అనేది  ఒక ప్రశ్నార్ధకం .

 ఎందుకంటే నేడు మనం బాల్యం లో లేము కదా అనేది సమాధానం కావచ్చు . లేదా ఇవి వ్రాయడానికి చదవడానికి మాత్రమే బాగుంటాయి కాని జీవితం లో  ఆచరించడం కష్టం అనిపించవచ్చు .

కానీ , ఆనాటి  బాల్యం లో నేర్చుకున్న పాఠాలు మనసు లో  దృఢం గా  ఉంటేనే , వాటిని సజావుగా అంగీకరిస్తూ ఆచరిస్తే నే  కౌమారం , యవనం  , వృద్ధాప్యం  ఉన్నతంగా ఆనందం గా , ఏ  సమస్యలు  కొని  తెచ్చు కోకుండా   నడుస్తాయి  అనే విషయం బహుశా మన బుద్ధి ఏనాడో మరచి పోయింది .

• ఎందుకంటే నేటి మాయా ప్రపంచం లో మనం చాలా బిజీ . . .  గజిబిజి . మనకు మనం మన ఆధీనంలోనే (కంట్రోల్) లేని విచిత్రమైన స్థితులతో జీవితం జీవనం సాగిస్తున్నాము . భౌతిక పరిస్థితులు మనపైనే ఆధిపత్యం (డామినేట్) చేస్తున్నాయి . అందుకే అన్నీ సమృద్ధిగా ఉన్నా కూడా  , తెలియని ఆందోళనలతో , సమస్యలను నెమరు వేసుకుంటూ జీవించ వలసి  వస్తుంది.

 ఇది మన అభివృద్ధా ? లేక పతనమా ? అని ఆత్మ విమర్శ చేసుకునే సమయం కూడా నేడు లేదు .

• మనం పుట్టినప్పుడు భగవంతుని తోడు తో నే పుట్టాం , అందుకే పసి వయసులో నిద్రలో నవ్వుతూ ఆయనతో ఆడుకుంటూ ఉంటాం . ఊహా వస్తూ ఎదుగుతూ , మనలో మాయ ప్రవేశిస్తూ ఉండడం తోనే ఆయన్ను ఒక రాతి విగ్రహం గానే చూడడం ఆరంభించాం . మన మనసు లో నుంచి ఆయన్ను బయటకు పంపించి, మాయకు పెద్ద సింహాసనం వేశాం . అందుకే , మన లో లో ఉండవలసిన భగవంతుడు నేడు ఎక్కడో కొండలపైన ఉన్నాడు . అదే విధంగా మన, లో లో ఉండవలసిన సత్యం మనల్ని విడిచి ఎక్కడికో పోయింది .


నిజానంద స్వరూపం శివోహం శివోహం 


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 28 Feb 2026 , 11:00 PM .


Thursday, February 26, 2026

725 . మనశ్శుద్ధి – మనశ్శాంతి

 

మనశ్శుద్ధి – మనశ్శాంతి



• మనసు శుద్ధి గా ఉన్నప్పుడు మనస్సాక్షి అనేది జాగృతం (activate) అయి నిరంతరం మన ఆలోచనలను చర్యలను సరియైన దిశగా విశ్లేషణ చేస్తుంది . ముఖ్యంగా మానవ సంబంధాలలో , బంధుత్వాల లో , ప్రేమికులలో , ఒకరికి ఒకరు సత్సంబంధం కొనసాగాలి అంటే మనశ్శుద్ధి ప్రధానం . అప్పుడే మన మనసు సాక్షి భూతమై జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని యధాతథంగా రికార్డ్ చేసి పొందుపరచి , అవసరమైన సమయంలో మన మనసు కి గా సాక్ష్యం గా చూపిస్తుంది. దీని వలన మన బుద్ధి ద్వారా చేసి మరచి పోయిన పొరపాట్లు గాని , సంఘటనలను కానీ తిరిగి సరి చేసుకునేందుకు దోహదం అవుతుంది.

• మనసు లో శుద్ది లేనిదే , శుద్ధి జరగనిదే ఒక మనసు మరొక మనసు తో కలవదు  కలవలేదు . ఒకవేళ కలిసినట్లు పైకి అనిపించినా , అది కేవలం మాటల వరకు లేదా శరీరం వరకు లేదా అవసరాల వరకు పరిమితం అవుతుంది . మానసిక మైత్రి అనేది ఇరువైపులా ఉండక పోవడం వలన ఎన్నో మానవ బంధాలకు పునాది వంటి ప్రేమ కేవలం మాటలకు , ఆకర్షణలకు పరిమితం అయి సుధీర్ఘంగా ఉండలేక , తక్కువ కాలంలోనే ఆ బంధం సమసిపోతుంది .

• ఈ ప్రపంచంలో అనేకులు మాటలతో ఉంటారు , మాటలకు పరిమితం అవుతారు అంతకు మించిన సహయ సహకారాలు ఇతరుల అవసరార్థం పంచవలసి నపుడు మాత్రం చేయలేరు . ఎందుకంటే తమ ఆలోచన లలో స్వార్దం, భయం, అంతర్గత గుణాలకు సంబంధించిన సమస్యల వలన మనసు సహకరించక కేవలం పై పై మాటల వరకే పరిమితం అవుతారు , కానీ చేతల వరకు చేయలేరు . కనీసం మానసిక  ప్రేమ ను  కూడా ఇతరులకు పంచలేరు సరికదా తిరిగి తమకు కావాలని ఆశిస్తారు . శుద్ధి గా మనసు ఉంటే ప్రేమను ఎన్ని మనసుల కైనా పంచవచ్చు .(ప్రేమ అంటే  కామం శృంగారం కాదు.) ప్రేమ అంటే  సంతోషం , స్వచ్చత , త్యాగం .


• మనసు ఎటువంటి అలజడులు లేకుండా శాంతిని పొందాలంటే ఏకాంతం లో  ఒంటరిగా  ఉన్నంతలో సాధ్యం కాదు. ఉన్న సంభంద బాంధవ్యాల పట్ల మన బాధ్యత ను నిర్వర్తిస్తూ , ఆ సమయంలో చేసే కర్మల పట్ల  యోగి గా  ఉండాలి . అంటే నేను నా ధర్మం  నిర్వర్తించాను అనే  భావన, స్పృహ ఉండాలి తప్ప, మన  మనసు ను ఆ బాధ్యతలతో కూడిన కర్మలతో పాటు విలీనం కానివ్వు కూడదు. ఇది మన ఆలోచనలను అలజడులకు గురి చేస్తుంది. అలజడుల తో కూడిన ఆలోచనలు వస్తూ ఉంటే ఎప్పటికప్పుడు క్రమబద్దీకరణ చేసుకోవాలి .


• మనసు కి శాంతి లభించాలంటే కర్మయోగ స్థితి అభ్యాసం ముఖ్యం. అన్ని కర్మలు చేస్తూ మనసు ను దేనికి వశం కానివ్వకుండా, అతీతంగా ఉంచుకోవడం. ఇదే మనసు శుద్ధి కి , శాంతి కి తారక మంత్రం.

• మనసు శుద్ధి ఉంటే , చేసిన చేస్తున్న, చేయబోతున్న ప్రతీ కర్మ సత్కర్మ అవుతుంది. తద్వారా కాలం ఎటువంటి విఘ్నాలను మనకు కలుగ చేయదు. దీని వలన నిత్యం మనసు కి శాంతి లభిస్తుంది.

• మనశ్శుద్ధి లేనిదే మనశ్శాంతి లభించదు. శుద్ధి లోనే శాంతి ఉంటుంది.


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 26 Feb 2026 10:00 PM.


Sunday, February 22, 2026

724. వృషభం - శివం

 

వృషభం - శివం



• శివుని ధ్యానించడం లో అత్యంత ప్రీతికరమైన విషయం ఏమిటంటే   ప్రకృతి మరియు పశు పక్షాదుల సమజీవన సమతుల్యత నిండి ఉండటం. మనం శివుని గురించి తెలుసుకోగలిగితే  ఆయన ప్రకృతిలో ప్రతి జీవితో  తన అనుబంధం ఎంతగా ముడిపడి ఉంటుందో  అర్థం అవుతుంది .

• శివ గణములలో  ప్రప్రథమైనది  ప్రమథ గణము అయినటువంటిది  "నంది". నంది అంటే వృషభం . వృషభం అంటే ఎద్దు .  ఎద్దు పరమశివుడి వాహనంగా  అభివర్ణిస్తాం . 

ఒక్క సారి ఊహించుకోండి ఒంగోలు జాతి ఎద్దులను, పెద్ద పెద్ద శరీరాలతో పొడువాటి కొమ్ములతో బలమైన కాళ్ళతో నిండుగా ఉండే మోపురాలతో నెమ్మదిగా నడుస్తూ ఉంటే ఆ గిట్టలు  నుండి వచ్చే లయబద్దమైన శబ్దాలు , ప్రశాంతమైన చూపు ఇవన్నీ కలబోసి ఒక చిన్నపాటి కొండ కదులుతున్నట్టుగా  అనిపిస్తుంది కదూ ! . ఎంతో శక్తి ఉన్నప్పటికీ  ఓర్పు నేర్పు  సహనం   మౌనం లో   ధృడ శాలి  వృషభం .

 మహా దేవుడుకి  రక్షణ వలయం లాగ నందులు చుట్టూ కాపలాకాస్తూ  ఆయనకు వాహనమై  శివుని సేవలో తరించిపోతూ  ఉంటాయి.

  శివాలయములో  లింగ దర్శనానంతరం  నందిని ముట్టనిదే  మనసుకు ఆనందం ఎక్కడిది. చూసారో లేదో ఆయన శివుడి ముందే కూర్చొని నిత్యం శివుని చూస్తూ కాపలా కాస్తూ ఉంటాడు.


• ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే నంది శివుని చూడటం కాదు , శివుడే నందిని చూస్తూ తనను నమ్మిన  అమాయకమైన  ప్రాణిని  చూస్తూ పరవశించిపోతుంటాడు .

• నంది శివుని వాహనం అయితే , నంది మరియు శివుడు మనవైపు చూస్తున్నట్లుగా ఉండాలి కదా ! . మిగతా అందరు దేవుళ్ళకు అందరూ తాము ఆసీనలైన వాహకాల తో  మనల్ని చూస్తున్నట్లు దర్శనం ఇస్తుంటాయి .  కానీ నంది విషయంలో శివుడు , నంది పరస్పరం  ఎదురెదురు ముఖాముఖిగా  ఉండడం లోని ప్రత్యేకత ఏమిటి ? అని మనం ఏ రోజైనా ఆలోచించామా ?

ఒక గొప్ప భక్తుడు తాను పూజించే దైవానికి అనునిత్యం  కాపలాగా  ఉంటూ  కన్ను రెప్ప ఆర్పకుండా కాపాడుకుంటూ ఉండే సంకేతమే దీనికి అర్థం .

ఇక్కడ అర్థమయ్యే విషయం భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న అనుబంధం  ఈ చూపుల కలియక . 

భక్తులు తమ కోరికలను నంది చెవులో చెబితే ఆయన శివునికి చేరవేస్తాడు  అనేది నానుడి. ఒకరకంగా చెప్పాలంటే నంది తన భక్తితో శివునిలో సగమైపోయాడా  అనిపిస్తుంది . ఆయనకు అంతటి విలువనిచ్చాడు  శివుడు .

వాస్తవానికి  ఇందులో  జ్ఞాన యుక్తు  సూక్ష్మం గ్రహిస్తే , శివుని ని పారవశ్యంతో  పూజించే  ప్రతి భక్తుడు  ఒక  నంది . ఇదే సత్యం. 

  

• ఇదంతా రాయించేది శివుడు అయినప్పటికీ రాస్తున్నది వృషభరాశి లోని చంద్ర కాంత రోహిణి లో జన్మించిన ఒక వృషభం.


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 22 Feb 2026 9:00 PM.


Saturday, February 21, 2026

723. శివుని పై సందేహమా ?

 

శివుని పై సందేహమా ?


• ఈశ్వరుడు ఉన్నది నిజం , అది కూడా తన పిల్లల (భక్తుల) కోసం నిత్యం పరితపిస్తూ ఉంటాడు అన్నది మరింత నిజం . 

ఈ సృష్టి లో మానవ నైజాలు మూడు రకాలు. ఒకడు భగవంతుడు ఉన్నాడు అని గట్టిగా నమ్మేవాడు. ఇంకొకడు అసలు భగవంతుడు అన్నవాడు లేడు అనేవాడు. మూడవవాడు భగవంతుడు ఉన్నాడా లేదా అని మిధ్య లో కొట్టుకునేవాడు . చిత్రం ఏమిటంటే ఈ ముగ్గురినీ సృష్టించినవాడు  భగవంతుడే . కానీ వారి వారి కర్మానుసారం  వారి పోకడలు ఉంటాయి. అలాగని వారిని ఎవ్వరినీ వదిలిపెట్టి ఉండడు విశ్వమూర్తి .

 నీకు కనిపించినా కనిపించక పోయినా నీ చుట్టూ ప్రాణవాయువు నిన్ను ఎలాగ బ్రతికిస్తుందో  అలాగే అమరేశ్వరుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు.

• భగవంతుడు లేడు అనే వాడికి శివుడు తెలియదు అన్నది నిజం కానే కాదు. కానీ, వాడు మాయ లో మునిగి ఉండడం వలన తానే అంతా అనే అహం లో ఉంటూ ,  తన మనసుని చంపుకొని పైకి బింకంగా దేవుడు లేడు లేడు అని చెబుతూనే మనసులో ఏదో తెలియని సందిగ్ధంలో  మదనం తో ఉంటాడు. ఇది సత్యం.

• ఇక మధ్యస్తంగా ఉండి దేవుడు ఉన్నాడా లేడా? ఉంటే , మరి ఎందుకు కనబడడు ? అసలు సత్యం (దేవుడు) అనేది నిజమా కాదా? అనే మీమాంస లో ఉంటూనే , కష్టం వస్తే మాత్రం కనపడని దేవుడు కి మొక్కుకోవడం , ఇతరత్రా సమయాలలో సందేహపడడం ఇవన్నీ ఈ కోవకు చెందిన మనుషులవి .

• నీ సమస్త సందేహాలకు నీకుగా  సమాధానం దొరికేలా చేసేవాడే మేధో దక్షిణామూర్తి. నీకు ఆలోచన ఇచ్చి నీ మనసును సన్మార్గంలో ప్రేరేపించి నడవడిక నేర్పు మహా జ్ఞాన రూపం దక్షిణామూర్తి గా కనబడే ఈశ్వరుడి రూపం. ఈ రూపంలో శివుడు సద్గురువు .

• ఉన్నాడు అన్నవాడికి  ఉండి మోక్ష మార్గాన్ని చూపడం , లేడు అన్న వాడికి లేనట్లు గా ఉండి నిరూపణ చేయడం , మధ్యస్తంగా ఉన్నవాడికి సందేహ నివృత్తి చేయడం ఇవన్నీ భగవంతునికి అవసరమా ? అంటే , ముమ్మాటికీ అవసరమే ఎందుకంటే తాను సృష్టించిన తన బిడ్డలే కదా ! వీరందరూ.  ఆయనకు ఓర్పు నేర్పు కూర్పు అన్నీ సహజసిద్ధం . అవి శక్తి స్వరూపం లో పుష్కలంగా ఆయనలో పొంచి ఉన్నాయి.

• ఏనాడైతే , ఓ సద్గురువారం (గురువారం) రోజు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం , చిత్ర రూపంతో నీ ఇంట ఆరాధన అన్నది మొదలు పెడతావో , ఆనాటి నుండి నీ బుద్ధి లోని అజ్ఞానం అనే చీకటి గది తలుపులు తెరవబడి క్రమేపీ ధ్యాన యోగాల దిశగా అడుగులు పడి ప్రకాశవంతమైన జ్ఞాన వెలుగు నీలో నిండుతుంది. నీ గత జన్మల నుంచి పెండింగ్ గా మిగిలి పోయి ఉన్న అవశేష కర్మలు ఆధార భరితంగా పూర్తి అవుతాయి. అదే నిన్ను ముక్తి జీవన్ముక్తి దిశగా తీసుకువెళుతుంది .


• ఇంతకంటే నీ ఈ జన్మకు ఏం కావాలి .  తాపత్రయం గా సంపాదించిన స్థూలధనం , ఆస్తి సదుపాయాలు సౌకర్యాలు అనుభవించు, కానీ అవి నీతో పాటు పైసా కూడ మరుసటి జన్మ వరకు రావని  తెలుసుకో . నీతో పాటు శాశ్వతంగా వచ్చేవి సుక్ష్మ సంపాదన అయిన జ్ఞానం ,  జీవిత పాఠాల ద్వారా రూపు దిద్దుకున్న నీ స్వభావం, అనుభవాల ద్వారా మార్పు చేసుకున్న నీ సంస్కారం , మనసు లో నింపుకున్న ప్రేమ , తెలుసుకొని  ఆచరించే జ్ఞానం పవిత్రత ,  అనుభవం పొందుతున్న  శాంతి ,  సుఖం , ఆనందం , శక్తి  ఇవి మాత్రమే నీతో మరుసటి జన్మ కు వస్తాయని తెలుసుకో . 

మంచి తనం , మంచి మార్గం అనేవి ఎవరికోసమో కాదు నీ కోసం , నీ ఉన్నతి కోసం మాత్రమే .


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 22 Feb 2026 . 4:00 AM.


Friday, February 20, 2026

722. మన ప్రభావం ఇతరుల పై ఎలా ఉంది?

 

  మన ప్రభావం ఇతరుల పై ఎలా ఉంది?


• మన జీవిత ప్రయాణంలో నిత్యం ఎంతో మంది తో సహగమనం చేస్తూ ఉంటాం. ఇందులో కుటుంబీకులు, రక్త సంబంధీకులు, మిత్రులు, వృత్తి లో సహచరులు, సమాజం లో అపరిచుతులు ఇలా అనేకుల తో మన కర్మ (పని) ఏదో రూపంలో ముడిపడి ఉంటుంది. దీని వలన నిత్యం మన యొక్క ఆలోచన , మాట , ప్రవర్తన తీరుల తో వారితో నడుస్తూ ఉంటాం . ఇటువంటి సమయంలో తప్పకుండా ఇతరుల ప్రభావం మనపై , మన ప్రభావం ఇతరుల పై తప్పకుండా ఎంతో కొంత ఉంటుంది అనేది వాస్తవం .

• ఇతరుల తీరును మనం చక్కగా గమనిస్తూ ఉంటాం , తెలియకుండానే గ్రహిస్తూ ఉంటాం. దీనినే ప్రభావం అంటారు. ఇదే చర్య మన నుంచి కూడా జరుగుతుంది. అంటే మన ప్రభావం కూడా ఇతరుల పడుతుంది . ఈ ప్రభావం లో మంచి చెడు ఏదైనా ఉండొచ్చు , అది బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది.

• అయితే మన ప్రభావం ఇతరుల పై ఏ విధంగా ఉంటుంది అనే విషయం ఏ నాడైనా స్వయం పరిశీలించు కుంటున్నామా ? అందులో భాగంగా మనం ఇతరులకు ఇచ్చేది సంతోషమా ? దుఃఖమా ? రంజనమా ? . . . లేక , నా ధోరణి నాదే అన్నట్లు ఉంటున్నామా ? ఎందుకంటే మానవ సంబంధాలలో నిత్యం మనల్ని మనం పరిశీలించుకోవడం సవ్యమైన తీరును అవలంభించడం అనేది చాలా ముఖ్యమైన అంశం.

• ఇతరుల తో మన ప్రవర్తన ఆకర్షణ లతో నిండి ఉంటే , ఆ బంధం లో సఖ్యత అనేది కేవలం తాత్కాలికం మాత్రమే . మన  ప్రవర్తన   తీరు తెన్నులలో   కల్మషం లేని నాడే  సహజసిద్ధంగా సఖ్యత  దృఢం అవుతుంది. ప్రవర్తన లో సహజ సిద్ధమైన అమాయకత్వం , తెలియని తనం అనేవి సఖ్యత కు ఆధారంగా ఉంటాయి .

• మనకు ఉన్న అన్ని రకాల బంధాలలోని వ్యక్తుల వలన మన బుద్ధి కి నిత్యం ఎన్నో పరీక్షలు ఉంటాయి. ఇందులో మనకు ఆశలు , నిరాశలు , మభ్య పడడం , నిందలు , పొగడ్తలు , వ్యంగ్యాస్త్రాలు ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి . ఈ పరిక్షలలో ఉత్తీర్ణత సాధించాలి అంటే బుద్ధి కి సూక్ష్మమైన పరిశీలన కావాలి . బుద్ధి బలోపేతం కావాలంటే అవగాహన తో కూడిన జ్ఞాన విషయాలు బుద్ధి లో నిరంతరం ధారణ జరగాలి. లేదంటే మన బుద్ధి విఫలమై , విషయ వికారాల ప్రభావాలకు లోనై మనసు అతలాకుతలమై చివరికి నైతికంగా పతనం ఆరంభం అవుతుంది .

• అందుకే మన ప్రవర్తన ను తప్పనిసరిగా నిరంతరం పరిశీలిన (check) చేసుకుంటూ ఉండాలి .

• మనం చేసే కర్మల గతి (direction) చాలా సూక్ష్మం మరియు అతి రహస్యం (hidden). కొన్ని సార్లు కర్మలు చేసేటప్పుడు ఆనందం గా చేస్తుంటాం . కానీ అనతి  కాలంలోనే   శిక్షలు అనుభవించే సమయంలో కూడా మనం చేసిన పాప కర్మలు మనకు గుర్తుకు రావు . దీనికి కారణం మన బుద్ధి , సూక్ష్మం ఎరుగక పోవడం .

 అందుకనే మన ఆలోచనలకు పదును పెడదాం , సూక్ష్మతను బుద్ధి కి అలవాటు చేద్దాం.

• మనం జన్మతః ఉన్నతులం కాదు. కానీ జీవిస్తూ ఎదుగుతూ ఉన్నతి సాధించడం కోసం జన్మ తీసుకున్నాం . ఈ విషయాన్నే మన పుట్టడం కంటే ముందు ఆత్మ  రూపులు మైన  మనం  పరమాత్మ కి వాగ్దానం చేసి ఆ తరువాతే జన్మ తీసుకున్నాం. కానీ జన్మించిన అనంతరం మాయా ప్రభావం వలన ఈ విషయం పూర్తిగా మరచి పోయాం. ఇదే సత్యం. అందుకు నిదర్శనం , నేడు ఇదంతా చదివి అర్దం చేసుకోవడం .


ఓం శాంతి .

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 21 Feb 2026 , 10:00 AM.


Friday, February 13, 2026

721. దేవుడిని ఎందుకు నమ్మాలి ?

 

దేవుడిని ఎందుకు నమ్మాలి ?



• నేను దేవుడిని నమ్ముతాను . అవును దేవుడిని మాత్రమే నమ్ముతాను . నా దేవుడు నా కంటికి కనపడడు అయినా నేను నమ్ముతాను. నాకు నమ్మికయే  ప్రధానం.  నా శివుడు ఉన్నాడు నన్ను వింటున్నాడు , నాతో నే నడుస్తున్నాడు అనేది నా నమ్మకం . ఇది నాకే కాదు నాలాగ ఈ విశ్వం లో  కోటాను కోట్లమంది వారి మనసులలో ఇష్టపడి స్మరించే  దైవం అంటూ ఒకటుంది . అది ఎప్పుడూ తమను రక్షిస్తూ  ఉంటుంది  అనే  నమ్మకం  వారిని నడిపిస్తుంది .

• ఈ కలియుగంలో   దేవుడిని  కాకుండా  మానవమాత్రులను   గుడ్డిగా విపరీతంగా  ఆధారపడి  నమ్మినా చివరికి క్షోభే మిగులుతుంది.  ఇది సత్యం .  ఎందుకంటే మనం నమ్మిన ప్రతి ఒక్కరూ తిరిగి మనల్ని అదే విధంగా ముమ్మాటికీ  నమ్మరు . . . . ఎందుకంటే , ఒకరి  పట్ల   నమ్మకం  ఉంచుకోవడం, పెంచుకోవడం  అనేది  నీకు స్వభావ రీత్యా ఒక  అవసరం  అయితే  . . . .  వారికి మాత్రం  నీ పట్ల నమ్మకం  అనేది    లేకుండా  వేరే అవసరాలతో  నీతో ఉండొచ్చు .  కానీ భగవంతుడు అలా ఉండడు . నువ్వు ఎలా నమ్ముతావో , భగవంతుడు కూడా నిన్ను అలాగే  , లేదా అంతకు మించిన శ్రేయస్సు తో  నమ్ముతాడు . కారణం , మనుషుల మాదిరిగా భగవంతుని కి  స్వార్థపూరిత అవసరాలు ఉండవు . 

ఈ విషయాలను స్వయం గా నీకు దేవుడు మాత్రమే అర్దం చేయిస్తాడు , ఎందుకంటే నీవు ఎందరి పైనో   ఎన్నో విధాలుగా  నమ్మకం ఉంచుకొని మోసపోయావు కాబట్టి. 

నువ్వు భగవంతుడిని   ఏ నాడైతే   సత్యత తో  విశ్వసిస్తూ  నమ్ముతావో , అప్పుడు  మాత్రమే ,  ఇతరులకు  నీ పట్ల అంతులేని నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే ఇందులో భగవంతుడే నమ్మకం అనే పాత్రలో  ఇమిడి  ఉంటాడు  కాబట్టి .


• ఒక్క మాట చెప్పండి మనలోని రక్తం పైనుండి కిందకి లేదా కింద నుండి పైకి మన శరీరం లో ప్రవహిస్తుందా  లేదా?

• మన గుండె తనంతట తానుగా ఊపిరి లేదా ప్రాణవాయువు అందుతున్నంత  వరకు కొట్టు కుంటూ  ఉందా లేదా?

 ఇవన్నీ నీకు నాకు సహజ లక్షణాలు అయితే మన జననం మరణం మన చేతులలో ఎందుకని  లేదు ఇప్పటి కీ  ?

• నీ ఆకారం , నీ  పొడుగు , నీ పొట్టి  , నీ రూపం నీ చేతులలో ఎందుకు లేదు ?

• నీ  ఆస్తి ,  నీ డబ్బు ,  నీ కుటుంబం ఎందుకు నిత్య సుఖసంతోషాలు  నీకు ఇవ్వట్లేదు ? 

• ఆరు బయట  అరుగుపై  పడుకున్న వాడు ఆనందహేళి  లో   ఎందుకు  ఉంటున్నాడు ?

• అంతెందుకు ఈ రోజు నువ్వు నేను ఇక్కడ , రేపు ఎక్కడో   ఏమిటో  మనకు  తెలుసా  ?


• దైవం మానవ కల్పితం అనుకుంటే ఆ ఆలోచన ఒక కల్పన మాత్రమే. ఈ సృష్టిని నడిపించే ఒక అతీంద్రియ శక్తి పరమాత్మ  . ఇది యదార్ధం , ఇదే సత్యం. సత్యాన్ని ఒప్పుకోవటం అంటే భగవంతుని అంగీకరించడమే , అదే శివం అదే సుందరం. నువ్వు సత్యాన్ని అంగీకరించిన నాడు  ఆ పరమేశ్వరుడు నిత్యమై నీకు నాకు సుందరమైన జీవితాన్ని జీవనాన్ని కలుగచేస్తాడు . భగవంతుడు నీ తో ఉన్నాడు అనడానికి నిదర్శనం,  మునుపెన్నడూ నీ లోని కానరాని  అద్వితీయ, అతీంద్రియ శక్తిని నీ లో నువ్వు  అనుభవించడం .

• నీ  నోటి వెంట సత్యం పలకని నాడు , శివుడు నీ వెంట ఉండడు. మాయ మాత్రమే నీకు తోడు నీడ గా ఉంటుంది. అది నిన్ను అందలం ఎక్కించినట్లు ఎక్కించి  అమాంతం గా  కింద పడేస్తుంది. ఇదే నీకు కోలుకోలేని దుఃఖం . మాయ అంటే నీ లోని అసత్యం  మరియు బలహీనత . 

అందుకే అంటాను . . . నువ్వు నేను అందరూ శివపరమాత్ముని  నమ్మాలి .  భగవంతుడిని సత్యతో   నమ్మిన నాడు , నువ్వు  ప్రతీ వ్యక్తి పై చూపించే నమ్మకం లో  నీకు భగవంతుడు కనిపిస్తూనే ఉంటాడు .  జరిగిన , జరుగుతున్న సంఘటనలు ద్వారా  నీకు  మంచి చెడులు  అర్దం చేయిస్తూ ఉంటాడు .  ఎందుకంటే భగవంతుడు నిన్ను శుద్ధి  గా , ముక్తుడు గా  చేసేందుకే ఉన్నాడు , నీకు సంబంధించిన అన్ని బంధనాలలో  అనేక  స్వభావ సంస్కారాలు కలిగిన  వ్యక్తులు నీ  చుట్టూ ఉంచాడు . స్వీయ పరివర్తన చెందడం , చెందక పోవడం అనేది  నీ బుద్ధి కి సంబంధించిన అంశం .


శివరాత్రి శుభాకాంక్షల తో 💐 . . .

ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 

Daimond Hall , Mount Abu ✍️ 

యడ్ల శ్రీనివాసరావు 13 Feb 2026 , 7:30 PM.


Wednesday, February 11, 2026

720 . చిత్రగుప్తుడు ఎవరు?

 

చిత్రగుప్తుడు ఎవరు ?




• మనం కొన్ని విషయాలు, కధలు గా వినినప్పుడు, చిత్రాల ద్వారా చూసినప్పుడు , సినిమాల లో సన్నివేశాలు గా  చూసినప్పుడు మనలో ఎంతగా ముద్రించబడతాయి  అంటే, వాటి ప్రభావం మనలో చాలా  బలంగా కనిపిస్తుంది . అందులో భయమో లేక ఇష్టమో ఏదైనా కావచ్చు . కారణం కనిపించక పోయినా మనం వాటిని దృఢం గా  నమ్ముతాం , ఆ నమ్మకం లోనే జీవిస్తూ ఉంటాం. ఈ నమ్మకం లో ముమ్మాటికీ కొన్ని సార్లు మంచి దాగి ఉండవచ్చు. కానీ అది సత్యమా, అసత్యమా  అని కూడా ఆలోచించే జ్ఞానం మన స్పృహ ఈనాడు  కోల్పోయింది . ఎందుకంటే ఎన్నో జన్మలు గా నమ్మకాల పైనే ఆధారపడి మన జీవితం గడుస్తుంది. ఈ నమ్మకాలను ఏనాడూ తర్కించి , అందులో వాస్తవాన్ని , మూలాన్ని తెలుసుకోవాలి అనే జిజ్ఞాస లేకపోవడం  వలన వాటిని గుడ్డిగా నమ్ముతాం, ఆచరిస్తూ ఉంటాం .


• మనం ఈ రచన లో చిత్రగుప్తుడు ఎవరు అనే విషయం గురించి విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం.

• మనిషి చేసే పాపపుణ్యాలు , కర్మలు అన్నీ యమధర్మరాజు వద్ద ఉండే చిత్రగుప్తుడు ప్రతి క్షణం భవిష్యవాణి అనే పుస్తకం లో రాస్తూనే ఉంటాడని మనుషులు నమ్ముతూ ఉంటారు . ఈ విషయం శాస్త్రాల కధలలో , సినిమాలలో , చిత్రాల ద్వారా చూపిస్తారు.

  అసలు ఇది వాస్తవమేనా ? ఈ చిత్రగుప్తుడు ఏ లోకం లో నివసిస్తాడు ? ప్రతీ సెకను , ప్రతీ నిమిషం ఈ విశ్వం లోని అందరి పాపపుణ్యాల ను చిత్ర గుప్తుడు ఎలా రాస్తుంటాడు ? ఇది ఎలా సాధ్యం ? ఈ చిత్రగుప్తుడు మానవ రూపంలో నే ఉంటాడా ? యమధర్మరాజు ఎవరు ? అని ఆలోచిస్తే , సందేహాలు ఎన్నో? . . . వెంటాడుతుంటాయి ,

  కానీ వీటికి ఆధార భరితమైన అనుభవం తో కూడిన వాస్తవిక నిదర్శనాలు ఎక్కడ లభిస్తాయి ?

చిత్ర అనగా సంస్కృతం లో నక్షత్రము , ప్రకాశం , ఆత్మ  అని  అర్దం. ఆత్మ  ఒక  నక్షత్ర ప్రకాశం.   

గుప్త అంటే కంటికి కనిపించనిది , రహస్యమైనది , దాగి ఉన్నది అని అర్థం .


• మనిషి శరీరంలో , ఆత్మ యొక్క స్థానం మన భృకుటి (బొట్టు పెట్టుకునే ప్రదేశం) . అనగా ఆత్మ మన రెండు కను బొమ్మల మధ్య ఉన్న Pineal gland  నుంచి మెదడు కి అనుసంధానం అయి (Attach) అయి సూక్ష్మంగా నక్షత్రం వలే గుప్తంగా ఉంటుంది. ప్రకాశవంతమైన ఈ ఆత్మే మన శక్తి కి ఆధారం . ఈ శక్తి తో మనం చేసే ప్రతి పని (కర్మ), మరియు ఆలోచనలు మెదడు ద్వారా నిరంతరం ఆత్మ లో శాశ్వతంగా  రికార్డు అవుతూనే ఉంటాయి. ఆత్మ నాశనం లేనిది. శరీరం నాశనం అవుతుంది.

• ఇది గమనిస్తే , మనము శరీరం తో చేసే ప్రతీ చర్య  మనకు మనమే మన ఆత్మ లో రికార్డ్ చేసుకుంటాం (రాసుకుంటాం) . మనకు మనమే చిత్రగుప్తులం. ప్రత్యేకించి చిత్రగుప్తుడు అంటూ  ఎవరూ లేరు .

• మనల్ని  సృష్టించిన  సృష్టికర్త ,  విశ్వ శక్తి అయినటువంటి భగవంతుడే ఈ విధి విధానాన్ని రూప కల్పన  చేసింది .

ఇక్కడ ఒక సందేహం రావచ్చు . . . అసలు భగవంతుడు కనిపించకుండా, ఇదంతా ఎలా చేస్తాడు , అని.   అందుకు మంచి ఉదాహరణ, ఒక సెల్ ఫోన్ ను  ఎవరో ఒక  మనిషి ద్వారా  ఎక్కడో ఒక దేశం లో  తయారై  ఆ ఫోన్ ప్రపంచ వ్యాప్తంగా చలామణి అవుతుంది.  అది మాట్లాడానికి , వినడానికి , వినోదానికి , ఫోటోలు తీయడానికి,  మెమోరీ లో రికార్డు చేయడానికి  ఉపయోగపడుతుంది .  అదే విధంగా   పరమాత్మ,  ఆత్మ ను   ఎన్నో విశేషాలతో సృష్టించాడు. అవే నేడు మన ఆత్మ చేస్తుంది.


• మన శక్తి తో చేసిన కర్మలను బట్టి ఫలితాలను , కాలగమనంలో కాస్త ముందు వెనుకగా విశ్వశక్తి మనకు తిరిగి ఫలం ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సార్లు జన్మల అనంతరం కూడా తిరిగి కర్మ ఫలితాలు పొందుతాం. అవి పాపం చేస్తే దుఃఖం, పుణ్యం చేస్తే సుఖం .

• ఈ విషయాన్ని  గమనిస్తే మనం శరీరం తో చేసే ప్రతీ పని, మనసుతో చేసే ప్రతి సూక్ష్మమైన ఆలోచన ,  ఆత్మ లో రికార్డు అవుతాయి. మన తలరాతను మనమే రాసుకుంటున్నాం . మనకు మనమే చిత్రగుప్తులం . . . చిత్ర విచిత్ర గుప్తులం .

  “చిత్రగుప్తుడు” అనే పదంలో ఇమిడి ఉన్న అర్దం ఆత్మ గుప్తం . ఇదే సత్యమైన చిత్రమైన చిత్రగుప్తుని జ్ఞాన యుక్త రహస్యం.

• ఎవరూ మనల్ని చూడడం లేదు కదా అని ధర్మ విరుద్ధమైన కర్మలు చేయడం, అసత్యాలు అలవోకగా ఆడడం, ఇతరుల గురించి వ్యర్థ విషయాలు చర్చించడం, రహస్యం గా కామవికారాలతో చెలరేగి పోవడం వంటి దుశ్చర్యలకు పాల్పడితే , ప్రతి ఫలంగా శిక్షలు మనకు మనమే వేసుకుంటాం. ఎందుకంటే త్రి నేత్రం అనే నిఘా కెమెరా లో మనం ఊపిరి తీసుకున్నప్పటి   నుంచి ఉన్నాం .

 

ఓం శాంతి 🙏

 ఓం నమఃశివాయ 🙏

 Mount Abu ✍️

 యడ్ల శ్రీనివాసరావు 11 Feb 2026 , 9:00 PM.


726 . సత్యం

  సత్యం • భగవంతుని వైపు అడుగులు వేస్తూ పయనం సాగిస్తూ ఉంటే సత్యమే స్పష్టం గా  కనపడుతుంది. సత్యమే తెలుస్తుంది. సత్యమే మాట్లాడడం జరుగుతుంది . ఎ...