Thursday, January 29, 2026

718. శివ గణం అంటే . . .


శివ గణం


• శివుని గురించి రాయడానికి , మాట్లాడటానికి , ఆలోచించడానికి , తెలుసుకోవడానికి శివ తత్వం బోధ పడక్కర్లేదు శివుని పై అనురక్తి కలిగితే చాలు.

ఆయన్ను  మనసులో స్మృతి చేస్తూ ఉంటే చాలు ,  శివుని తో మొదలవుతుంది శివ బంధం .  ఆ పరిచయం , ప్రయాణం , ఆయన తోడు ఉన్నాడు అనే అనుభూతి నీకు కైలాస శిఖరాల వెండి కొండలపై నడయాడు  వేల వేల మధుర స్మృతులను తలపిస్తుంది. ఇది అనుభవించిన వాడికి మాత్రమే ఎరుక.

• నువ్వు పరమ జ్ఞానివా   లేక  అక్షరం ముక్క తెలియని అవివేకివా  అన్న భేదం  శివ సాధనలో అణువంత  కూడా  లేదు . ఇక్కడ అందరూ సమానులే . ఒక్క సారి శివుడితో నీ నడక మొదలు అయితే , నీ జీవితపు నడవడిక దిశ దశ మారిపోతుంది.

• నువ్వు  ఏనాడైనా  ప్రేమతో నో , కోపంతో నో నాకు  దేవుడితో  పని లేదు అనే పరిస్థితి లోకి  వెళ్ళవా , అదికూడా అలకతో కూడిన సరియైన స్థితితో  మాత్రమే సుమా !  . . . నీ వెంట భగవంతుడు  పరుగెడుతూ వస్తాడు.  ఒక స్వచ్చమైన  అమాయకత్వ  మనసు కలిగి  సన్మార్గంలో  నడిచే భక్తుని  కొరకు భగవంతుడు  తనంతట తాను గా వెతికి  వెతికి  వస్తాడు. ఎందుకంటే , ఏ తండ్రి తన పిల్లల కు  దూరంగా  ఉండలేడు . . . ఉండాలని అనుకోడు . . .  ఉండడు  కూడా .

 పంచభూతాలను నియంత్రించేవాడికి  , నీ పంచ కర్మేంద్రియాలను  ,  నీ భావోద్వేగాలను  కట్టడి చేయడం  అంత కష్టం  ఏమీ కాదుకదా ! . . . కానీ నిన్ను నిన్నుగా ఆలోచింప చేసే పరిస్థితులు కలిగిస్తాడు  ,  నీ లోని చైతన్యం  మేల్కొనే లా  చేస్తాడు . నీ  అవశేష కర్మలను (Pending Karmas) ఆధార భరితంగా  ప్రత్యక్షం గా  చూపించి   అనుభవించేలా  చేస్తాడు . వాటిని మరల బేరీజు వేసి  , అప్పుడు వాటికి ఫలితాలు నిర్ణయిస్తాడు. ఇది శివ గణం లక్షణం . అందుకే  అంటున్నా , ఒక మానవ కణం ( అంటే నీ పుట్టుకలో నువ్వు ఒక కణం మాత్రమే ) శివ గణం గా మారటానికి బుద్ధి కుశలతే  ప్రధానం . మంచి చెడుల విచక్షణ శోధన సాధన ఇవన్నీ ఆచరణ మార్గాలే .

నిన్ను సర్వ శక్తి వంతుని గా  చేయడానికే శివుడు  ఉన్నది . అందుకు ఆయన శక్తి ని  నీకు ధారణ చేస్తూ నే ఉంటాడు . అందుకు నువ్వు చేయవలసినది ఒక్కటే ,  అది   మనసున  "శివయ్య" అనే  ప్రేమ పూర్వక పిలుపు తో కూడిన స్మృతి.


ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 .

యడ్ల శ్రీనివాసరావు 29 JAN 2026 10:30 AM.


Wednesday, January 28, 2026

717. నీ తలరాతలో నీ మర్మం

 

నీ తలరాతలో ‌ నీ మర్మం



• దైవం తన ఉనికిని తెలియజేయడానికి అను నిత్యం నీతో మమేకమై ఉంటుంది ఇందులో అతిశయోక్తి లేదు , సందేహం అంతకంటే లేదు.

 కానీ  కాలగమనంలో  నీ ప్రయాణం , సమయాసమయాలు  సందర్భాలు  సరిచూసుకుని మాత్రమే దైవం యొక్క అనుభవాలు నీకు ప్రస్పుటం అవడం ఆరంభమౌతాయి . నీ లోని ,  లో లోని అహాన్ని  కాస్త  ప్రక్కన పెట్టి ,  నీ మనస్సులో వాటి (అనుభవాల)  జాడను  గమనించే  కుతూహలం రవ్వంత  ఉంటే  చాలు .   అవి  నీకు  కష్టమో , నష్టమో ,  లాభమో ,  ప్రకోపమో  (Emotional Excitements)  ,  ప్రేమో ,  వేటిలోనైనా   ఏ రూపంలోనైనా ఉండి ఉండచ్చు . కానీ నువ్వు దైవాన్ని అంగీకరించగలిగే శక్తి , నీకు ఆ సమయానికి కలిగితే  చాలు   నీ జన్మ  ధన్యం  అయినట్లే .


• దేవుడు భక్తి లోనే , భక్తి  ఆరాధన తోనే ఇమిడి ఉంటాడు అన్నదానికి ప్రమాణాలు ఎన్ని ఉన్నాయో , దానికి అతీతంగా  నీకు సంబంధించిన మరికొన్ని విషయాలలో కూడా నీ వెంట ఉంటాడు అన్నది కుడా అంతే సత్యం . ఆ ఒక్క నీ నమ్మకం నిన్ను గెలిపిస్తుంది  అదే నిను దేవుని వైపు నడిపిస్తుంది .

ఇదంతా నువ్వు దేవుని నమ్మినపుడు మాత్రమే , లేదంటే  నీ వెంటే ఉన్న వాడు నిరాకారిగా నిర్గుణుడిగా  నిర్వికారిగా  నిశ్చలంగా  నీ వెనుక మౌనం గా నిలిచిపోతాడు .

 ఆట వాడిది , ఆడేది నువ్వు . . . 

 మాట వాడిది , పలికేది నువ్వు . . . 

నడిపించేది వాడు , నడిచేది నువ్వు , 

ఇదే సత్యం . ఇవి చాలు నీ జత యై  తోడు గా పరమాత్మ  శివుడు ఉన్నాడు  అని నీకు తెలియడానికి . . . ఇదంతా  తెలిసి బ్రతుకు సార్ధకం చేసుకుంటావో  ,  తెలియనట్టు ఉండి నీ జన్మ వ్యర్థ పరచుకుంటావో  నీ  ఇష్టం .

• ఎందుకంటే , గత జన్మలో చేసిన కర్మల ద్వారా ఎప్పటికప్పుడు  నీ తలరాతను కాలం సాక్షి గా  , తదుపరి జన్మ కోసం నువ్వు రాసుకున్న దే . అదే ప్రస్తుతం ఈ కాలంలో  నువ్వు  అనుభవిస్తున్న నీ జీవితం .

• బ్రహ్మ  పని అందరి తల రాతలు రాయడం , మార్చడం కానే  కాదు . బ్రహ్మ  కేవలం జ్ఞాన సాగరుడైన శివుని యొక్క జ్ఞానాన్ని  రచించడం . అదే బ్రహ్మ జ్ఞానం అంటారు. దీనినే శ్రీకృష్ణుడు భగవద్గీతగా వినిపించాడు .

• నువ్వు రాసుకున్న , రాసుకుంటూ ఉన్న తలరాతను ,  తిరిగి  నువ్వే   మార్చుకోవాలి .  అందుకు చేయవలసింది . . . 

ఒకటి  శ్రేష్టమైన ఆలోచన తో కూడిన కర్మలు (పనులు) .  రెండవది అన్ని కార్యకలాపాలు  నిర్వర్తిస్తూ , మనసు లో నిరంతర శివ స్మృతి కలిగి ఉండడం .


కర్మ అంటే శిక్ష కాదు  . . . ప్రతిబింబం .  

ఏది చేస్తే అదే  తిరిగి ఫలితంగా అనుభవించడం. 



ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 28 January 9:00 PM.


Friday, January 23, 2026

716. నీ దైవం ఎక్కడ ?

 

నీ దైవం ఎక్కడ ?



అక్షరాలకు అలసట లేనేలేదు పదాలకు పొంతన తెలియదు. అది రాసే వాడికి వాటిని పొందు పరచే వాడికే ఇది ఎరుక.

నువ్వు  నేర్చిన కూర్పు   నీకు  తోచిన మార్పు . అదే పద సంకలనముగా  మారి  ప్రకంపనల  ప్రభంజనం అవుతుంది.

మాట మనిషిని బ్రతికిస్తుంది , అదే మాట మానవ సమూహాన్ని చంపేస్తుంది . మంచితనం మాటలోనే కాదు వాటి అమరికలులో  కూడా  ఉంటుంది.

ప్రతి మనసుకు మాటలు చెప్పాలని , ఇంకో మనసు మాటలు వినాలని ఉంటుంది. కానీ అది అక్షర రూపం దాల్చడం దాన్ని ఎదుటివారికి నచ్చేలా ప్రతిసారి రాయటం  కష్టమేమో. అందుకే నా మనసు మాటలు  ఇంకా  ఎన్నో  మూటలు గా  మిగిలి పోతూనే  ఉన్నాయి.


నాకే కాదు మీలో చాలామందికి ఇదే ప్రశ్న.

భావానికి బాధ్యతకు ప్రేమకు రూపం ఎక్కడని ఎలా అని వెతకగలం  చెప్పండి. బహుశా దైవం కూడా ఇదే కోవలోకి వస్తుంది అనిపిస్తుంది . దేవుడు ఉన్నాడు నన్ను నిన్ను రక్షిస్తూ ఉన్నాడు . . . రక్షిస్తాడు అన్నది నిజమనే మన భావనలకు రూపం ఎక్కడా వెతకలేం . అది  కేవలం అనుభూతి , అనుభవాలతో నే సాధ్యం.

అక్షరాలలో  చిత్రాలలో  శిల్పాలలో  ప్రకృతిలో  దైవ భావనను నింపుకుని జీవించే మనకు , మనసును అంగీకరించిన ప్రతి మనిషి  కూడా  దైవం ఉనికిని అంగీకరించి తీరాలి. అది  బ్రహ్మ , విష్ణు , శంకరుడు , వినాయకుడు , హనుమంతుడు, దేవతలు లేదా మరో రూపం ఏదైనా సరే నీ మనసుకు నచ్చి , నిను మెప్పించిన రూపమే నీ  దైవం యొక్క బీజం . ఇది కాదని నీ మనసుని చంపుకొని నీకు దైవం ఉనికి తెలియదు అని ఉండటం అంటే అది అజ్ఞానం తో నిండిన , వృధా జీవ ప్రయాణమే.

తీపి లేని మకరందం, సువాసన లేని మల్లెలు ప్రకృతి విరుద్ధం , ఇది ఊహకు అందని విషయం. అందుకే అంటున్నా . . . బతికి ఉన్నంత కాలం మనిషిగా బ్రతుకు , మనసున్న మనిషిగా బ్రతుకు , దైవ చింతనతో కూడిన మనిషిగా బ్రతుకు , మంచి మనసులతో కూడిన మానవ సమాజమే మనందరి కోరిక అదే దైవ కాంక్ష.

నచ్చిన దైవాన్ని , రూపాన్ని  అనుసరిస్తూ ఉన్నప్పుడు , ఏదో నాడు . . .

మనిషి ఎవరు  ?  . . .  మతం అంటే  ఏమిటి ?

గురువు ఎవరు ?  . . .  సద్గురువు ఎవరు ?

ధర్మ పితలు ఎవరు ? . . .  దైవం అంటే ఏమిటి ? 

ఆత్మ  ఎవరు ? . . . పరమాత్మ ఎవరు ?  

అనే  ప్రతీ  విషయానికి అనుభవాల  స్వాగతం లభిస్తుంది.


ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 23 Jan 2026 , 1:00 PM.








Friday, January 16, 2026

715. బలహీనతలే - లోపాలు - శాపాలు

 

బలహీనతలే - లోపాలు - శాపాలు



• మనిషికి తన బలహీనతలే లోపాలు శాపాలా ?

  అవును ముమ్మాటికీ . . . మనిషి కి  తన  లోలోని  బలహీనతలే  లోపాలు గా   అయి  శాపాలు గా మారుతాయి . ఇందులో  ఏ  సందేహమూ లేదు.


• మనిషి  బలహీనతలను   తన  స్పృహ కి (Continuousness) తెలియకుండా నే  బయటకు ఏదో రూపంలో  ప్రదర్శిస్తూ నే  తన   ప్రవర్తనను నిత్యం  కొనసాగిస్తూ  ఉంటాడు .  వాస్తవానికి ఈ బలహీనతలకు  మూలం  మనసు మరియు ఆలోచన . మానసిక పరిపక్వత (Maturity) లోపించినప్పుడు , మనసు పై  నియంత్రణ (Controlling) కోల్పోయి  మనిషి లో  బలహీనతలు దృఢం గా బీజం వేసుకుంటాయి. ఇందుకు ప్రధాన కారణం ఆలోచనల లో సమతుల్యం  లోపించడం .

 • మనిషి తన బలహీనతలను  తాను  అంత సులభంగా  ఆది లో  గుర్తించలేడు .  ఎందుకంటే  జనన మరణ చక్రంలో  తిరుగాడే  మనిషి కి , అనేక జన్మలు గా   అలవాటు పడి చేసిన కర్మలు , సంస్కార భూతమై  వారసత్వంగా సంక్రమించినవే ఈ బలహీనతలు .

  పైగా మనిషి ఆ బలహీనతలనే  తన బలం గా భావిస్తూ , జీవనం సాగిస్తాడు . చివరికి ఏదో రోజు తన బలహీనతల వలన విపరీతమైన నష్టం జరిగినపుడు మాత్రమే మేల్కొంటాడు . అప్పటికి జీవితకాలం గడిచిపోతుంది .

• బలహీనతలు అనేవి పూర్తిగా మానసికమైనవి . అవి శరీరం ద్వారా ప్రభావం చూపిస్తాయి . బలహీనతలు జీవన వికాసానికి అత్యంత అవరోధాలు.

బలహీనతలే మనిషి ఎదుగుదలకు నిరోధకాలు , అందుకే  తలపెట్టిన కార్యాలకు  విఘ్నాలు గా అవుతాయి  .


అసలు ఒక మనిషి యొక్క బలహీనతలు , తన ఎదుగుదలకు మరియు తాను తలపెట్టే కార్యాల పై  ప్రభావం ఉంటుందా ?  అంటే . . .

సమాధానం . . . ముమ్మాటికీ ఉంది.

మానసిక బలహీనతలు అనేవి మనిషి ఆలోచనల  ద్వారా  బుద్ధి లో  శక్తి లోపించడం వలన  ప్రేరేపిత మైన  నెగెటివ్ భావాలు . ఇంకా చెప్పాలంటే  ఇవి మనిషి లో   అంతర్భాగంగా విచ్చలవిడితనం తో   చలామణి  అవుతున్న నెగెటివ్ శక్తులు.


ఇద్దరు  మనుషుల  మధ్య  . . .  లేదా   ఒక మనిషి  ద్వారా  బాహ్య  ప్రపంచం లో జరుగుతున్న  ఏదైనా  ఒక సంఘటన కి  మధ్య కంటికి కనిపించని సూక్ష్మమైన అంశాలు రెండు ఉంటాయి. 

అది ఒకటి భగవంతుడు (దైవం, పాజిటివ్ నెస్) రెండవది మాయ (మిధ్య , నెగెటివ్ నెస్).  

ఈ రెండు కూడా మనిషి కంటికి ఏనాడూ కనపడవు. కానీ మనిషి కి ఆత్మానందం , దుఃఖం    . . .  ఆత్మ తృప్తి , అసంతృప్తి  అనే అనుభవాలను ఇస్తూ ఉంటాయి .

☘️ ☘️ ☘️ ☘️ ☘️

• ఎలా అంటే ఉదాహరణకు మొదటి అంశం అయిన దైవం  తీసుకుంటే . . . 

  ఒక మనిషి  దైవాన్ని , ధర్మాన్ని అనుసరించి హేతుబద్ధమైన  ఆలోచనలతో  జీవనం సాగించినపుడు  తన లోని బలహీనతలను సహజ సిద్ధంగా సునాయాసంగా అధిగమించి, ఎటువంటి పరిస్థితుల నైనా ఎదుర్కొని , తనకు ఎదురైన సమస్యలను తానే  పరిష్కరించుకుంటాడు . ఇక్కడ దైవబలం ఒక శక్తి గా , సహాయకారిగా  మనిషి కి తోడు అయి విజయునిగా  చేస్తుంది . 

 ఈ దశలో మనిషి  తన బలహీనతలను తాను స్వయంగా గ్రహించి, పరివర్తన చెంది అధిగమిస్తాడు . అందుకే బలహీనతలు లోపాలు గా అయి శాపాలు గా మారే విషయం ఈ దశలో ఉండదు.

☘️ ☘️ ☘️ ☘️ ☘️

• ఇక రెండవ అంశం తీసుకుంటే మిధ్య అనగా మాయ.  మాయ భౌతిక ఆకర్షణలకు , మానసిక మోహలకు , వికారాలకు , హద్దు లేని కోరికలకు , వ్యర్థ మైన విషయాల పట్ల ఆసక్తి , అసత్యమైన మాటల జీవనం , మోసపూరిత చేతలతో కూడిన జీవిత  విధానానికి దాసోహం అయినపుడు . . . ఇవన్నీ కలిసి  బలహీనతలు గా అయి  లోపాలు గా మారి ,  నెగెటివ్ శక్తి ని తనలో వృద్ధి చేసుకుంటాడు.   

ఇవి మనిషి మనసు లో అంతర్లీనంగా కలిసిపోయి  ఉండడం వలన , ఇవన్నీ తన ప్రవర్తన లో  బలహీనతలు  లోపాలు అని గ్రహించలేడు . ఎందుకంటే  మాయ  చాలా  శక్తివంతమైనది . మాయా వలన పోందే  మైకం మనిషి ని మానసిక అంధుడిగా  చేసేస్తుంది. క్రమేపీ  కొంత కాలానికి మనిషి లోని ఈ లోపాలే శాపాలు గా అయి  ఏదొక సమస్యలు , విఘ్నాలు  తరచూ కలగడం, తద్వారా దుఃఖం అనుభవించడం జరుగుతుంది. వీటినే మనిషి అనుకుంటాడు తనకు మాత్రమే అవరోధాలు , విఘ్నాలు కలుగుతున్నాయి అని , తలపెట్టిన ఏ పని సజావుగా సాగడం లేదని చింతిస్తాడు . వాస్తవానికి అది తన బలహీనతల లోని  నెగెటివ్ శక్తి  తిరగబడి తనకు  అవరోధం కలిగిస్తుంది  అని గ్రహించ లేడు .

మనిషి లోని మానసిక బలహీనతలను ఈ సృష్టి లోని భగవంతుడు , ప్రకృతి , పంచభూతాలు అంగీకరించవు . అందుకే అవి లోపాలు గా అయి తిరిగి మనిషి కి శాపాలు గా తయారవుతాయి. ఇందులో ఏ సందేహమూ లేదు.


☘️ ☘️ ☘️ ☘️ ☘️

మరి  బలహీనతలను అధిగమించడం ఎలా ?

• భగవద్గీత  జ్ఞానం  నిత్యం  వినడం ద్వారా మనిషికి  తనలోని బలహీనతలను  తాను  గుర్తించగలడు మరియు అద్దం లో తన ముఖం వలే తన అంతరంగం యొక్క యదార్ధ స్థితి మనిషి కి కనిపించగలదు .

  భగవంతుని తో కలిసి నిత్యం ధ్యానం చేయడం వలన  బలహీనతలను అధిగమించగలడు . ఈ పరివర్తన కేవలం జ్ఞాన మార్గంలో మాత్రమే సాధ్యం అవుతుంది,  భక్తి మార్గం లో  సాధ్యపడదు . ఎందుకంటే భగవద్గీత జ్ఞానం , మనిషి కి తానెవరో తన మూలం ఏమిటో  తెలియచేస్తుంది . దైవ ధ్యానం మనిషి  పరివర్తన కి  కావలసిన  శక్తిని సమకూరుస్తుంది.  

భక్తి మార్గం భగవంతుడిని కేవలం విగ్రహాలు, పూజలు , కోరికలు , అవసరాలు వరకే మనిషిని   పరిమితం చేసి అల్ప కాలిక ప్రాప్తి నిస్తుంది . భక్తి లో భగవంతుని యదార్ధ స్థితి కి  , భక్తుని మధ్య  అనంతమైన దూరం ఉంటుంది. 

జ్ఞాన మార్గం  సదా కాలిక  ప్రాప్తి నిస్తుంది . జ్ఞానంలో భగవంతుని తో కలిసి అడుగులు వేసే స్థితి  కలుగుతుంది. 


• భగవంతుడు మనిషికి  ఉన్నతిని సమకూర్చి పైపైకి ఎదుగుదలతో  తీసుకు వెళతాడు. ఎందుకంటే పరమాత్ముడు పైన ఉంటాడు . అందుకు నిదర్శనం భగవంతుని తలుచుకునేటప్పుడు  మనం తరచూ పైకి చూడడమే .

• మనిషి, మాయ కి దాసోహం అయి వశమైనపుడు అధఃపాతాళానికి   దిగజారిపోవడం  జరుగుతుంది. అందుకు నిదర్శనం తల దించుకుని  దుఃఖం తో  సమస్యలతో   దిగులు తో  నేలను చూస్తుండడమే.


• మనిషిని పాతాళానికి తీసుకు వెళ్లేది మాయ .     మనిషి ని  ఉన్నతంగా చేయగలిగే  వాడు   భగవంతుడు . 

• భగవంతుడు ఒక్కడే . అతడే శివ పరమాత్ముడు. శివుని యధార్థం రూపం ప్రకాశవంతమైన  జ్యోతి బిందు స్వరూపం .  

మాయ బహురూపి.  అనగా  అనేక  రూపాల వికారాల  ఆలోచనల తో  మనిషి ని  మైకం లో ముంచి కబళిస్తుంది . అందుకు నిదర్శనం గానే  శాస్త్రాలలో రావణాసురుడికి పది తలలతో  రాక్షసుడి గా చూపించారు . 

మాయ వలన బలహీనతలను పొంది ఉన్న మనిషిని  తిరిగి బలవంతుడి గా చేయ గలిగేది  గీతా  జ్ఞానం మాత్రమే .

• బలహీనతలు లోపాలు గా అయి, శాపాలు గా కాకముందే మేల్కోవడం  ప్రతి మనిషికి ఉత్తమం .

మన బలహీనతలో   "హీనత"  లోపించి నపుడు , ఇక మిగిలేది  మనలో  "బలమే". 



ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 16 Jan 2026. 9:00 PM.



Sunday, January 4, 2026

714 . మనసు మాయ

 

మనసు మాయ 



• భ్రమ లలో    బ్రతుకు    భారము

  మనసా   ఓ   మనసా

  భ్రమ లలో    బ్రతుకు    భారము .


• భ్రమ చుట్టూ    భ్రమణమే   మాయ

  అది యే

  ఆనందపు   అల్లకల్లోలాల    లోయ .

• భ్రమ     కలిగించు     మోహము

  అది యే

  బుద్ధి లో    నిలిచేటి    వ్యామోహము.


• భ్రమ లలో     బ్రతుకు     భారము

  మనసా   ఓ    మనసా

  భ్రమ లలో   బ్రతుకు    భారము .


• నాది    నాదనుకొంటు

  నిమిషమైన   నిలువవు    మనసా .

• నేలను   విడిచిన   నాడు

  నీతోడు   నడిచేది    ఏదో   తెలుసా .


• మిధ్య లో    మునిగి   ఉన్న   మనసా

  భ్రాంతి లో    తేలుతున్నావు    తెలుసా.


• భ్రమ లలో    బ్రతుకు    భారము

  మనసా    ఓ    మనసా

  భ్రమ లలో    బ్రతుకు    భారము .


• నేత్రములు  చూసేవన్ని    నిజము  కాదు .

  మనో నేత్రం    తెరచిన  నాడు

  అది    నీకు    తెలియును .

• వీనులు   వినేవన్నీ    నిజము   కాదు .

  మౌనం తో    మెలిగిన  నాడు

  అది    నీకు   తెలియును .


భ్రమ లలో    బ్రతుకు    భారము

  మనసా   ఓ    మనసా

  భ్రమ లలో    బ్రతుకు    భారము .


వీనులు  = చెవులు 


యడ్ల శ్రీనివాసరావు 4 Jan 2026 1:30 PM.

Sunday, December 28, 2025

713 . శివానుభవం

 

శివానుభవం



• శివుని   మది

  సింహాసనం . . . సింహాసనం

• నా శివుని  ఒడి

  ప్రేమామృతం . . . ప్రేమామృతం


•  ప్రేమ లోని   మధువు తో    

   నవ వధువు గా   చేసేను   

   విభుడు . . .  నా  విభుడు .

•  ఒడి లోని    లాలన తో   

   పసి పాప గా   ఆడించె 

   హరుడు . . . నా  హరుడు .


• శివుని   మది

  సింహాసనం  . . .  సింహాసనం

• నా  శివుని  ఒడి

  ప్రేమామృతం  . . .  ప్రేమామృతం .


• ఆలన   పాలన తో

  భవబంధాల  ఆటవిడుపులు   ఇస్తున్నాడు .

• ఆదమరచిన  నన్ను

  ఆనంద సాగరంలో   తేలుస్తూ  

  ఉన్నాడు  శివుడు  . . .  నా శివుడు .


• శివుని మది

  సింహాసనం . . . సింహాసనం

• నా శివుని ఒడి

  ప్రేమామృతం . . . ప్రేమామృతం .


• పసి వాడి  నని   తలచి

  తన మది ని    సింహాసనం  చేసి

  కూర్చుండ   బెట్టాడు  .

• తోడు గా   నీడ యై   

 తన జత లోని  రాత లతో     

  విశ్వమంతా   విహరింప  

  చేస్తున్నాడు   శివుడు  . . .  నా శివుడు.


• శివుని    మది

  సింహాసనం   . . .   సింహాసనం

• నా శివుని   ఒడి

  ప్రేమామృతం  . . .  ప్రేమామృతం


• మాటలాడడు    కానీ

  మనసు కి    ప్రేరణ    ఇస్తాడు .

• కనపడడు     కానీ

  కనుల లో   కాంతి యై    ఉంటాడు.

• అనుభవాల   నిచ్చు  వాడు

  శివుడు.  . . .   నా శివుడు .

• అనుభూతి లో   ముంచు వాడు

  హరుడు   . . .   నా హరుడు .


• శివుని  మది

  సింహాసనం  . . .  సింహాసనం

• నా శివుని  ఒడి

  ప్రేమామృతం   . . .   ప్రేమామృతం .



ఓం శాంతి

ఓం నమఃశివాయ


యడ్ల శ్రీనివాసరావు 28 Dec 2025 9:20 PM.


Wednesday, December 24, 2025

712 . ఏది ధర్మం ?

 

 ఏది ధర్మం ?


• ధర్మం అనే మాట ఈ ప్రపంచంలో నిత్యం వినిపిస్తూనే ఉంటుంది . అసలు ధర్మం అంటే మనిషి తన సహేతుకత తో ఆచరించవలసిన విధానం అని అర్థం . ఈ ధర్మం అనేది వృత్తి ప్రవృత్తి ని బట్టి మారుతూ ఉంటుంది .

• పరమాత్ముడు చెప్పిన ధర్మం గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చక్కగా వివరించాడు . మరియు ఈ భూమి పై “ధర్మ గ్లాని” జరిగినపుడు అంటే భూమి పై ధర్మం పూర్తిగా నశించినపుడు , అనగా మనిషి తాను ఆచరించివలసిన  విధానం తప్పినపుడు , అధర్మం విచ్చలవిడిగా పెచ్చురిల్లినపుడు  తాను తప్పకుండా ఈ భూమి పై ధర్మ స్థాపన కి అవతరిస్తానని  భగవంతుడు చెప్పాడు.


• ధర్మం గురించి కురుక్షేత్ర సంగ్రామం లో ఒక అద్భుతమైన సంఘటన కర్ణుడు మరియు శ్రీకృష్ణుడు మధ్య జరిగింది. కురుక్షేత్ర యుద్ధం రసవత్తరంగా జరుగుతున్న సమయంలో, కర్ణుడి రధ చక్రం ఊడి పక్కకు ఒరగగా అప్పుడు కర్ణుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు.

  “హే కృష్ణా! …. నా రధ చక్రం సరి చేసుకునేంత వరకు అర్జునుడిని విల్లు సంధించడం ఆపమని చెప్పు “ అంటాడు.

  అది వినిన శ్రీకృష్ణుడు , తాను భగవంతుని ధర్మ ప్రతినిధిగా ఉన్నప్పటికీ కూడా , అది విని మౌనం గా ఉంటాడు .

  ఇంతలో అర్జునుడు వైపు నుంచి బాణాలు మరింత వేగంగా కర్ణుడి మీద కు వస్తూ ఉంటాయి.

• మరలా రెండవ సారి కర్ణుడు శ్రీకృష్ణుడితో … హే కృష్ణా! ఇది నీకు ధర్మమా …. ఇది యుద్ధనీతి కాదు . దయచేసి అర్జునుడి తో చెప్పు, నా రధ చక్రం సరి చేసుకునేంత వరకు యుద్ధం ఆపమని. అని తీవ్ర స్వరం తో వేడు కుంటాడు.

  అయినప్పటికీ శ్రీకృష్ణుడు కర్ణుడిని చూస్తూ చిరునవ్వు తో మౌనం గా ఉంటాడు.

  అప్పుడు కర్ణుడు . . . శ్రీకృష్ణుడిని ఉద్ధేశించి ఉద్వేగం తో ఇలా అంటాడు. నువ్వు ధర్మాత్ముడి వేనా, పాండవుల పక్షపాతి . . . యుద్ధ ధర్మం ఆచరించమని చెప్పవలసిన నువ్వు మౌనం గా ఉండడం నీకు సబబు కాదు అని అంటాడు.

‌  అప్పుడు శ్రీకృష్ణుడు …. తన నోరు విప్పి కర్ణుడి తో ఇలా అంటాడు.

• అహో! కర్ణా … బాగుంది, చాలా బాగుంది . నేడు నీవు ఆపద లో ఉన్నావు  కాబట్టి , నీ వరకూ వచ్చే సరికి ధర్మం, నీతి, న్యాయం గురించి మాట్లాడుతున్నావు.

• నాడు నిండు కౌరవ సభలో , ధుర్యోధనుడు ద్రౌపదిని వివస్త్ర చేసినప్పుడు , ద్రౌపది రక్షించండి . . . రక్షించండి . . . అని నిండు సభ లోని వారిని వేసుకున్నప్పుడు , నీ ధర్మం ఏమైంది. ఆనాడు సభలో జరుగుతున్నది అధర్మం అని తెలిసినా కూడా యోధుడి వైన నీవు మౌనం గా ఉన్నావు. కనీసం ధుర్యోధనుడిని  ఆపే కనీస ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు. అధర్మం నీ ఎదురుగా జరుగుతున్నపుడు , నాడు నీవు చేయనిది, నేడు నీవు నన్ను ధర్మం గురించి ప్రశ్నించుచున్నావు. ఇది నీకు ధర్మమే నా అని తిరిగి శ్రీకృష్ణుడు అంటాడు.

• కర్మ ఫలం అనుభవించు . . . నీవు ఏది చేశావో అదే నీకు నేడు తిరిగి వస్తుంది. నేను ధర్మ మార్గం చూపగలను , చెప్పగలను అంతవరకే  నా విధి . బుద్ధి వివేకం తో ధర్మాన్ని ఆచరించవలసింది నీవు అంటాడు .

  ధర్మో రక్షతి రక్షితః . . . ధర్మాన్ని ఆచరించడమే కాదు, రక్షించిన నాడు అది తిరిగి కాపాడుతుంది అని శ్రీకృష్ణుడు కర్ణుడి తో చెపుతాడు.

• అది వినిన కర్ణుడు పశ్చాత్తాపం చెందుతాడు.


  🌹🌹🌹🌹🌹🌹



• ఇకపోతే …. ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం అని కలియుగ దైవం గా భావించే వేంకటేశ్వర స్వామి ఆలయాలలో ముఖ్యం గా తిరుమలలో మనం చూస్తాం, చదువుతాం. కానీ ఈ ధర్మం అనే విషయం గురించి ఎంత వరకు మనసు లో చింతన చేస్తాం ?, ధర్మాన్ని మనం ఎంత వరకు ఎలా ఆచరిస్తూ ఉంటాం  ?  అనేది మనమే సద్విమర్శ చేసుకోగలగాలి . ఎదుటి వారు ఆచరించ వలసిన ధర్మాలు చక్కగా చెపుతాం. కానీ మనం ఆచరించ వలసిన ధర్మం వరకు వచ్చేసరికి  అహం లో మునిగి ఉంటాం . ఇది నేటి మానవ నైజం .

  ఇక్కడ గమనించ వలసిన అంశం

• వేం = పాపాలు

• కట = హరించే

• ఈశ్వరుడు = శివుడు , పరమాత్ముడు.

• వేంకటేశ్వరుడు అనగా కలియుగం లో పాపాలను హరించే శివుడు అని అర్థం.


• భగవంతుని దర్శనం కోసం ఆలయానికి వెళ్లిన మనకు భగవంతుడే చెపుతున్నాడు , నీ ధర్మం ఏమిటో తెలుసుకొని ఆచరించమని .

• ధర్మాన్ని ఆచరించడం అనేది దైవ దర్శనం కంటే మహోన్నతమైనది . దైవ దర్శనం వలన పొందేది అల్ప కాలిక సంతోషం. భగవంతుడు ని ఆనందం గా భక్తి పారవశ్యంతో  దర్శిస్తాం , కానీ భగవంతుడు చెప్పిన విధానాలను మన లోని  మాయా బలహీనతల వలన ఆచరించ లేక పోతూ ఉంటాం.

• స్వయం భగవంతుడు చెప్పిన విధంగా ధర్మం ఆచరించరించ  గలిగిన నాడు , అది భగవంతుడి జత తో కలిసి అడుగులు వేస్తున్న ప్రయాణం గా మన జీవితం అవుతుంది .

• నేటి మనిషి జీవనం లో పాటించ వలసిన ఎన్నో ధర్మాలు ఉన్నాయి. వృత్తి ధర్మం, గృహస్థ ధర్మం వీటిలో అత్యంత ప్రాముఖ్యత కలిగినవి. వృత్తి ధర్మాన్ని నిజాయితీ తో ఆచరించగలడం అనేది మనిషి జీవన పురోగతి కి అత్యంత అవసరం. నేటి కలుషిత ప్రపంచంలో కార్యాలయాలలో అవినీతి, లంచగొండితనం, వ్యాపారాలలో మోసం చేయడం అతి సహజం , సర్వ సాధారణం . దీనిని అరికట్టడం స్వయం పరివర్తన తో నే మనిషి కి సాధ్యం.

• రెండవది గృహస్త ధర్మం  . నేటి కలియుగంలో ఇది అత్యంత ముఖ్యమైన అంశం. మనిషి యొక్క కర్మలు, బుణానుబంధాలు అధిక శాతం ముడిపడి ఉన్నది గృహస్థం ధర్మం లోనే .  ధర్మం తెలుసుకొని ఇవి ఆచరించిన నాడు మానవ జన్మ కు దుఃఖం నుంచి ముక్తి లభిస్తుంది. నేటి కుటుంబ వ్యవస్థలో పిల్లలు తల్లి తండ్రులు ఒకరి పట్ల మరొకరు వ్యవహారించ వలసిన విధానం, . . .  కుటుంబ స్థితి గతులు  మనుషుల మానసిక  పరిస్థితులు ఎలా ఉన్నా సరే భార్య భర్తలు ఒకరి పట్ల మరొకరు అనుసరించ వలసిన విధానం ,  ధర్మ యుక్తం గా బాధ్యత నెరిగి  ఆచరించ వలసిన అవసరం నేటి కాలంలో ఎంతైనా ఉంది.

• ఎందుకంటే …. నేటి కలికాలం పూర్తి మాయా ప్రపంచం. మనిషి కి ఏది మంచో ఏది చెడో కూడా సూక్ష్మంగా తెలుసుకో  లేని స్థితిలో మాయ కమ్మేసి జీవనం సాగిస్తున్నాడు మనిషి . అందుకు నిదర్శనం ….. ఈర్ష్య ద్వేషాలు , పగ ప్రతీకారాలు , కామ క్రోధాలు , అహంకారం,  స్వార్దం ,  నాకే సర్వస్వం తెలుసు - నేను నాది  అనే మాయ ,  ఏది సక్రమమో ఏది అక్రమమో తెలియని మానవ సంబంధాలు (లివింగ్ రిలేషన్ షిప్స్) ,  అవసరాలకు మించిన ధనం కోసం  దుర అలవాట్ల కు బానిస కావడం. 

ఇలాంటివన్నీ    కలిసి మనిషి జీవన విధానాన్ని అంధకారంలోకి తోసి , విచ్చలవిడి తనం , స్వేచ్ఛ అనే పేరుతో మానవ జన్మ పూర్తిగా వినాశనానం వైపు  అడుగులు వేస్తోంది. 

వీటన్నిటికి అతీతంగా కావాలంటే  , ఆది సనాతన దేవి దేవతా ధర్మం గురించి  బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం వారి సెంటర్స్ లో ఉచితం గా  నేర్పించే  సహజ రాజయోగ శిక్షణ ద్వారా తెలుసుకొని , మలచుకొని, పరిశీలించి పరివర్తన చేసుకోవడం ద్వారా  ప్రతి మనిషికి సాధ్యం అవుతుంది. 


మన మూలాల లోనే మన రహస్యాలు స్పష్టం గా పొందు పరిచబడి ఉన్నాయి.  అవి తెలుసుకునే ప్రయత్నం చేయక పోవడమే మన అజ్ఞానానికి దుఃఖానికి కారణం.


  ధర్మో రక్షతి రక్షితః



  ఓం శాంతి 🙏

  ఓం నమఃశివాయ 🙏.

  యడ్ల శ్రీనివాసరావు 24 Dec 2025 10:00 PM.


718. శివ గణం అంటే . . .

శివ గణం • శివుని గురించి రాయడానికి , మాట్లాడటానికి , ఆలోచించడానికి , తెలుసుకోవడానికి శివ తత్వం బోధ పడక్కర్లేదు శివుని పై అనురక్తి కలిగితే ...