నీకు మేలు చేసే వారు ఎవరు ?
• నీకు మేలు చేసే వారు ఎవరు ? . . . కరెక్ట్ గా నిజాయితీగా సూక్ష్మంగా పరిశీలిస్తే, ఎవరైతే నిన్ను ఏదొక విషయం లో అంటే ధనం, బంధాలు, ఉద్యోగం , వృత్తి వ్యాపారాల లో మోసం చేస్తారో , నమ్మకద్రోహం చేస్తారో, మరియు ఎవరైతే నిన్ను , చేయని తప్పులకు నిందలు పాలు చేస్తారో , మరియు ఎవరైతే నీ ప్రమేయం లేకుండా నిన్ను ఇబ్బందులు పెడుతూ క్షోభ కలుగ చేస్తు ఉంటారో , వారే నీకు ఈ భూమి పై అత్యంత మేలు చేసే వారు . . . ఇది పరమ సత్యం .
• ఈ విషయం మరింత గా అర్దం చేసుకోవాలంటే ఈ సూక్ష్మంగా అవగాహన తప్పనిసరి . . .
1. గత జన్మలలో ఒకరి పట్ల నీవు చేసిన ప్రవర్తన కి ఇప్పుడు వారు తిరిగి బదులుగా అదే నీకు చేశారు. దీనినే కర్మ రిటర్న్స్ అంటారు . ఇందులో ఇతరుల తప్పు ఏమీలేదు, అంతా నీ గత జన్మలలో వారిపట్ల చేసిన పాపం కాబట్టి సంతోషంగా తిరిగి నీవు నేడు అనుభవించి , నీ తలపై ఉన్న పాపం తొలగించుకోవాలి .
లేదా . . .
2. ఈ జన్మలో తెలిసీ తెలియక , బుద్ధి లో సరియైన స్పృహ లేక చేసిన అనేక పాపాలను నేడు, నీకు నువ్వు గా తెలుసు కొని , భగవంతుని ఎదుట విపరీతమైన పశ్చాతాపం పొందినపుడు , నీలో నువ్వు విపరీతంగా మదనపడుతున్న సమయం లో ….
అప్పటికే దరిద్రం, దుఃఖం, చెడు సంస్కారాలు అనుభవిస్తూ , నీ చుట్టూ ఉన్న వారు ముఖ్యంగా నీతో ఏదొక బంధం లో ఉన్న వారు ఏదోక విధంగా , నీకు క్షోభ కలిగించి . . . నీ పై ఉన్న పాపాభారం వారు స్వీకరించి నీకు విముక్తి కలిగిస్తారు . . . ఇది నిజం గా నీ అదృష్టం గా భావించాలి . ఇంకా అటువంటి వారి పట్ల నీవు మనసు లో కృతజ్ఞత తో ఉండాలి. ఎందుకంటే నీ పాపాభారం వారు స్వీకరిస్తున్నందులకు . . . నేను వారికి ఏ అపకారం చేయకపోయినా సరే నాకు బాధ కలిగించారు అనే భావన , వారి పట్ల నీకు కనీసం ఉండకూడదు.
లేదా . . .
3. నీ జీవితంలో నీవు ఏదైతే పొంది ప్రస్తుతం అనుభవిస్తూ ఉన్నావో , అవి నీకు ఇక అవసరం లేదు (అంటే ధనం , పేరు, కీర్తి, బంధాలు, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం) . . . అంతకు మించి నువ్వు పొందవలసింది ఏదో నీ కోసం సిద్ధం గా ఉన్నప్పుడు . . . ఉన్న పరిస్థితులు వదిలి పెట్టేసే లా , నీ చుట్టూ ఉన్న మనుషులు లేదా బంధాలు బలవంతంగా నిన్ను అక్కడినుంచి విడదీసి పంపే ఆశీర్వాదం విశ్వం నీకు వారి ద్వారా కలిగిస్తుంది.
కొన్ని సంవత్సరాలు దాటిన తరువాత అనిపిస్తుంది, నాకు దుఃఖం ఇచ్చిన వారు నా ఉన్నతి కి బాట వేసారు , లేదంటే వారి లాగే నేను కూడా ఇంకా అక్కడే వారి స్థాయిలో ఉండిపోయేవాడిని అని.
నీ తల పై ఉన్న పాపాభారం తొలగితే , ప్రకృతి పంచభూతాలు నిన్ను ఫరిస్తా గా చేస్తాయి. అంటే అనుక్షణం గాలిలొ తేలియాడే స్థితి తో జీవించే లా అవకాశం కల్పిస్తాయి. ఇది వాస్తవం.
లేదా . . .
4. గత జన్మలలో నీవు చేసిన పుణ్య ఫలం మిగిలి ఉంటే , ఈ జన్మలో నేడు అది అనుభవించ వలసిన సమయం వచ్చింది అంటే . . . కర్మ ఫలం వలన నీకు ఎటువంటి విఘ్నాలు లేకుండా ప్రకృతి సహకరిస్తుంది . ఈ ప్రత్యేక స్థితిలో నువ్వు గుర్తించినా, గుర్తించక పోయినా , ఆ భగవంతుడే నీకు సహాయకారి .
ఇప్పుడు అన్ని కోణాలలో ఆలోచిస్తే తెలుస్తుంది, నీకు మేలు చేసే వారు ఎవరెవరు అని . . .
ఈ విషయాలు సూక్ష్మం గా విపులంగా వివరించని జ్ఞానులు , ఒక్క మాటలో ఇలా అన్నారు .
“ అపకారికి ఉపకారం చేయుము” .
“ అపకారిని క్షమించుము “
“ పశ్చాతాపం మించిన ప్రాయశ్చిత్తం లేదు “
" పరమాత్మ యెడల సత్య ప్రీతి తో ఉండుము"
అని.
Hidden Facts :
కొందరు సహజంగా అనుకుంటూ ఉంటారు . . . ఫలానా వారు నాకు సహాయం చేయడం వలన నేను చాలా గొప్ప స్థితి లో ఉన్నాను అని . . . కానీ ఇక్కడ అర్దం చేసుకోవలసింది ఇందులో నీ స్వ శక్తి ఏమీ లేదని . తిరిగి ఏదో నాడు ఆ సహాయం వారికి చేసి బుణం తీర్చుకోవాల్సిందే . అదే విధంగా సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞత ఎప్పుడూ ఉండాలి .
• నీకు చెడు చేసిన వారి మంచి కోరుకో అని ఉత్తములు ఎపుడూ అంటుంటారు ఎందుకంటే, వాస్తవానికి వారు నీకు చెడు చేయలేదు కాబట్టి. నీవు పొందుతున్న బాధను బట్టి , వారు నీకు చెడు చేసినట్లు అనిపిస్తుంది , అంతే. నీవు ఆ స్థితి నుంచి దాటితే వారే నీ విజయానికి కారకులు .
సత్యం అనేది సూక్ష్మాతి సూక్ష్మం.
ఇలాగే ఉంటుంది.
అర్దం చేసుకోగలగాలి.
• నువ్వు బాధలు పడినపుడు, ఈర్ష్య ద్వేషాలు అసూయ కామం క్రోధం వంటి గుణాలకు అతీతం అవ్వాలి .
ఈ గుణాలకు అతీతం గా అయి , నువ్వు బాధ పడుతూ, తిరిగి నువ్వు ఇతరుల పట్ల ప్రతి చర్య చేయకుండా, మౌనం గా ఉన్నప్పుడు మాత్రమే నీ పాప భారం ఇతరులు స్వీకరిస్తారు . . . గమనించాలి.
చర్యకు ప్రతి చర్య ప్రకృతి చేస్తుంది కానీ, నువ్వు చేయకూడదు.
• ఇది కలియుగం పైగా అంతిమ సమయం , వినాశన కాలం. ఈ యుగంలో ధర్మం ఒక పాదము పై ఉంటుంది. పాపం చేయని మానవుడు అంటూ ఎవరూ ఉండడు. ప్రతి మనిషి సంతోషం అనే ముసుగులో బయటకు కనిపిస్తూ ఉన్నా సరే లోపలి అంతులేని దుఃఖం తప్పని సరిగా అనుభవించ వలసిందే. దీనికి ఏ మానవుడికి మినహాయింపు లేదు.
దీనంతటికీ ఒకటే పరిష్కారం శివుని స్మృతి.
అంటే నిత్యం యధావిధిగా ప్రతి పని చేసుకుంటూ, తిరుగుతూ, తింటూ కూడా మనసు లో శివుని తలుచుకుంటూ అనుసంధానం అవడం. ఇలా చేయడం వలన నీకు ముక్తి లభించే మార్గం లభిస్తుంది. అందుకు మరలా కార్యాచరణ మాత్రం నీవే చేయాలి. అది పరోపకార సేవ తో నిండి ఉంటుంది.
• నీకు బాధ కలిగించిన వారిని క్షమించి వదిలెయ్ అని ఉత్తములు అంటుంటారు. అంటే దీని అర్థం నీవు క్షమిస్తే వాళ్లు , నీ పట్ల చేసిన పాపం నశించి పోతుంది అని కాదు. వారు ఎలాగో వారి కర్మ ఫలం తప్పక అనుభవిస్తారు. కానీ, నువ్వు వారి పట్ల పగ ప్రతీకారం పెంచుకో కుండా క్షమించాను అనుకొని వదిలేస్తే , ముందు నీలో ఏ మానసిక సంఘర్షణ వారి పట్ల లేకుండా ప్రశాంతంగా ఉంటావు అని సూక్ష్మ అర్థం .
జీవన సత్యాలు మనో నేత్రం తో చూడ కలిగినప్పుడు మాత్రమే వాటిలో సత్యం కనపడుతుంది .
వేడి నీరు చల్లగా కావాలి అంటే, తప్పనిసరిగా చుట్టూ చల్లటి వాతావరణం ఉండాలి. ఎందుకంటే, అదే ఆ వేడిని స్వీకరిస్తుంది. అదే విధంగా, నీ తల పై పాపాభారం తొలగాలి అంటే అది స్వీకరించడానికి, కొన్ని సార్లు నీ చుట్టూ ఉన్న మనుషులు కారణం కావచ్చు లేదా ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు లేదా నీ కర్మ భోగం (అనారోగ్యం) కావచ్చు. ... అంతే కాని భగవంతుడు స్వయానా నీ పాపాభారం తొలగించడు, కానీ అది తొలగించుకునే మార్గం, ఆయన స్మృతి ద్వారా తెలియజేస్తాడు.
యడ్ల శ్రీనివాసరావు 21 APR 2025 , 10:00 PM.
No comments:
Post a Comment