నిజం మాట్లాడితే చనిపోతారా ?
• చిన్న పిల్లలకి బడిలో ఎల్లప్పుడు సత్యం మాటాడవలెను అని పదే పదే కాపీ రైటింగ్ బుక్స్ లోను, నోటితోను కొన్ని వందల సార్లు ప్రతి రోజూ చెప్పిస్తూ , రాయిస్తూ ఉంటారు. అసలు ఈ విషయం పై ఎందుకు ఇంతగా చెపుతారో ఆ వయసు కి అర్థంకాదు.
ఏదైతే మనిషి ధర్మానుసారం చేయవలసిది చేయడో, చేయలేడో …. అదే గురువులు, భగవంతుడు కలిసి నేర్పిస్తారు.
• అంటే ఈ కలికాలంలో పుట్టిన ఏ మనిషి కూడా, నిజం మాట్లాడ లేడు, మాట్లాడడు. ఒకవేళ మాట్లాడితే చనిపోతాడేమో ?
ఎందుకంటే మనిషి జీవితం మొదలైన నాటి నుండి నిజాలు కంటే అబద్ధాలు మాట్లాడుతూ ఉంటేనే బ్రతకగలను అనే స్థితి సర్వ సాధారణంగా భావిస్తూ వచ్చాడు . అబద్ధం మాట్లాడడం అనేది ఏమంత తప్పు కాదు, చాలా చాలా సహజం అనేది నేటి మనిషి స్థాయి కి అలవాటు పడ్డాడు . ఒకవేళ నిజం మాట్లాడితే ఇంటా బయటా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది అనే భయం .
• ఎప్పుడైతే అబద్ధాలు సునాయాసంగా మాట్లాడడం అలవాటు అయిందో, చేస్తున్న ప్రతి పని కూడా దొంగ భరితం గా అవుతుంది. అదే ఒక పెద్ద పాప కర్మ గా తయారవుతుంది.
నిజాలు మాట్లాడితే నేను ఈ భూమిపై బ్రతకలేను అనే విషయం ఎంతో కొంత ప్రతి మనిషి కి మారుమూల బుద్ధి లో ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ నిజం మాట్లాడితే మన చుట్టూ ఉన్న అనేక అబద్ధపు మనుషుల తో యుద్ధం మొదలవుతుంది అనే భయం.
అందుకే అడుగడుగునా, మనిషి తన ఆలోచనల కంటే కూడా తన చుట్టూ ఉన్న వారి ఆలోచనలను ఊహిస్తూ లేదా అంచనా వేసుకుంటూ తాను జీవించడం మొదలు పెడుతున్నాడు అన్నది నేడు మనసు ఎరిగిన సత్యం. ఇది అవునన్నా కాదన్నా నిజం. ఇదే మనిషి తనకున్న తెలివి తేటలు గా భావిస్తున్నాడు .
• ఒక్క మాటలో చెప్పాలంటే, మనిషి తాను సత్యం గా భూమి పై జీవించాలి అని అనుకుంటే అందుకు తగిన నిర్ణయం తీసుకునే శక్తి కూడా తన బుద్ధి లో నేడు లేదు . ఇదే మాయా ప్రభావం. మాయా అంటే బలహీనత. తన బలహీనతలను జయించ లేని మనిషి , బ్రతికి జీవించి ఈ జన్మ కి ఏం లాభం పొందుతాడు.
• ఈ క్షణం , ఈ సమయంలో ఇది ఇలా అబద్ధం మాట్లాడెస్తే తన సమస్య తీరిపోతుంది, తన అవసరం గట్టెక్కెస్తుంది, అని మనిషి అనుకుంటాడు. కానీ అదే తిరిగి కొన్నాళ్ల తర్వాత వడ్డీ తో పాప భారం గా తయారవుతుంది అని గమనించలేడు.
• సత్యం అనేది భగవంతుని శబ్దం, సృష్టి సంకేతం . దానితో అనుసంధానం కాకుండా మనిషి జీవిస్తే చివరికి అధోగతే . నిజం , సత్యం మాట్లాడడం వలన మనిషి తాత్కాలికంగా ఇతరులతో సమస్యలు రావచ్చు, ఇబ్బంది కలగవచ్చు . కానీ చివరికి సత్యమే విజయం సాధిస్తుంది . మానవుని ఆత్మకు శుద్ధి , సంతృప్తి సత్యం వలన లభిస్తాయి .
• మాట్లాడే విధానం :
ఎవరైనా ఒక అబద్ధం మాట్లాడితే, చాలా కమ్మగా, అది అసలు అబద్ధమే కాదు అనేంత మధురం గా మాట్లాడుతారు. ఎందుకంటే ఇలా మాట్లాడితే నే ఇతరులకు నమ్మకం కలిగించడం సులభం. ఇలా మాట్లాడే విధానం అందరికీ నచ్చుతుంది .
• అదే , ఎవరైనా ఒక సత్యం, నిజం మాట్లాడినప్పుడు గమనిస్తే కాస్త కఠినం గా, ముక్కు సూటి తనం గా అనిపిస్తుంది . అది వింటున్న వారు చెపుతున్న వారిని అహం కారులు గా భావిస్తారు . కానీ, అలా మాట్లాడటం నిజానికి ఉన్న శక్తి అని గమనించ లేరు.
• కానీ నిజం , సత్యం మాట్లాడే వారు కూడా మరింత మధురంగా మాట్లాడ వలసిన అవసరం నేటి కాలంలో ఉంది. కటువుగా మాట్లాడితేనే ఇతరులు నిజాన్ని గ్రహిస్తారు, అర్దం చేసుకుంటారు అనేది అన్ని వేళలా పనిచేయక పోవచ్చు. …. ఇకపోతే , ఒకరు మాట్లాడే సత్యాన్ని, నిజాన్ని ఇతరులు అర్దం చేసుకోక పోయినా సరే నష్టం, అనేది మాట్లాడే వారికి కలగదు .
• నేడు ప్రపంచం పూర్తిగా అశాంతి, దుఃఖం తో నిండి ఉంది. దీని నుంచి మానవుడు తప్పించుకోవడం అసాధ్యం. ఇది మనిషి స్వయం కృతాపరాధం. మనిషి తనకు తాను గా తనలో మార్పు తెచ్ఛుకోనంత వరకు అశాంతి దుఃఖం అనుభవించ వలసిందే .
• అబద్ధం , అసత్యం అనేవి మనిషి శరీరంలో నుంచి వచ్చే ఆలోచనల ప్రకంపనల శబ్దం . ఈ నెగెటివ్ శబ్దం produce చేయడం వలన శరీరం మరింత నెగెటివ్ గా కలుషితం అయి అనారోగ్యం తో పెద్ధ garbage container లా అవుతుంది. దీని వలన చుట్టూ ఉన్న వారి కంటే తమకే నష్టం.
• నిజం మాట్లాడినంతలో ఎవరూ చనిపోరు …. సరికదా చనిపోయే ముందు అత్యంత ఆనందాన్ని కూడా మోసుకెళతారు మరు జన్మలకు.
• మార్పు ఎప్పుడూ మన చుట్టూ కాదు … మనలోనే చిన్న గా మొదలై తే చాలు. అందుకు భగవంతుడు, సద్గురువు మార్గదర్శకం తప్పనిసరి గా కావాలి .
యడ్ల శ్రీనివాసరావు 18 APR 2025 , 10:30 AM.
No comments:
Post a Comment