Friday, January 16, 2026

715. బలహీనతలే - లోపాలు - శాపాలు

 

బలహీనతలే - లోపాలు - శాపాలు



• మనిషికి తన బలహీనతలే లోపాలు శాపాలా ?

  అవును ముమ్మాటికీ . . . మనిషి కి  తన  లోలోని  బలహీనతలే  లోపాలు గా   అయి  శాపాలు గా మారుతాయి . ఇందులో  ఏ  సందేహమూ లేదు.


• మనిషి  బలహీనతలను   తన  స్పృహ కి (Continuousness) తెలియకుండా నే  బయటకు ఏదో రూపంలో  ప్రదర్శిస్తూ నే  తన   ప్రవర్తనను నిత్యం  కొనసాగిస్తూ  ఉంటాడు .  వాస్తవానికి ఈ బలహీనతలకు  మూలం  మనసు మరియు ఆలోచన . మానసిక పరిపక్వత (Maturity) లేనపుడు, మనసు పై  నియంత్రణ (Controlling) కోల్పోయి  మనిషి లో  బలహీనతలు దృఢం గా బీజం వేసుకుంటాయి. ఇందుకు ప్రధాన కారణం ఆలోచనల లో సమతుల్యం  లోపించడం .

 • మనిషి తన బలహీనతలను  తాను  అంత సులభంగా  ఆది లో  గుర్తించలేడు .  ఎందుకంటే  జనన మరణ చక్రంలో  తిరుగాడే  మనిషి కి , అనేక జన్మలు గా   అలవాటు పడి చేసిన కర్మలు , సంస్కార భూతమై  వారసత్వంగా సంక్రమించినవే ఈ బలహీనతలు .

  పైగా మనిషి ఆ బలహీనతలనే  తన బలం గా భావిస్తూ , జీవనం సాగిస్తాడు . చివరికి ఏదో రోజు తన బలహీనతల వలన విపరీతమైన నష్టం జరిగినపుడు మాత్రమే మేల్కొంటాడు . అప్పటికి జీవితకాలం గడిచిపోతుంది .

• బలహీనతలు అనేవి పూర్తిగా మానసికమైనవి . అవి శరీరం ద్వారా ప్రభావం చూపిస్తాయి . బలహీనతలు జీవన వికాసానికి అత్యంత అవరోధాలు.

బలహీనతలే మనిషి ఎదుగుదలకు నిరోధకాలు , అందుకే  తలపెట్టిన కార్యాలకు  విఘ్నాలు గా అవుతాయి  .


అసలు ఒక మనిషి యొక్క బలహీనతలు , తన ఎదుగుదలకు మరియు తాను తలపెట్టే కార్యాల పై  ప్రభావం ఉంటుందా ?  అంటే . . .

సమాధానం . . . ముమ్మాటికీ ఉంది.

మానసిక బలహీనతలు అనేవి మనిషి ఆలోచనల  ద్వారా  బుద్ధి లో  శక్తి లోపించడం వలన  ప్రేరేపిత మైన  నెగెటివ్ భావాలు . ఇంకా చెప్పాలంటే  ఇవి మనిషి లో   అంతర్భాగంగా విచ్చలవిడితనం తో   చలామణి  అవుతున్న నెగెటివ్ శక్తులు.


ఇద్దరు  మనుషుల  మధ్య  . . .  లేదా   ఒక మనిషి  ద్వారా  బాహ్య  ప్రపంచం లో జరుగుతున్న  ఏదైనా  ఒక సంఘటన కి  మధ్య కంటికి కనిపించని సూక్ష్మమైన అంశాలు రెండు ఉంటాయి. 

అది ఒకటి భగవంతుడు (దైవం, పాజిటివ్ నెస్) రెండవది మాయ (మిధ్య , నెగెటివ్ నెస్).  

ఈ రెండు కూడా మనిషి కంటికి ఏనాడూ కనపడవు. కానీ మనిషి కి ఆత్మానందం , దుఃఖం    . . .  ఆత్మ తృప్తి , అసంతృప్తి  అనే అనుభవాలను ఇస్తూ ఉంటాయి .

☘️ ☘️ ☘️ ☘️ ☘️

• ఎలా అంటే ఉదాహరణకు మొదటి అంశం అయిన దైవం  తీసుకుంటే . . . 

  ఒక మనిషి  దైవాన్ని , ధర్మాన్ని అనుసరించి హేతుబద్ధమైన  ఆలోచనలతో  జీవనం సాగించినపుడు  తన లోని బలహీనతలను సహజ సిద్ధంగా సునాయాసంగా అధిగమించి, ఎటువంటి పరిస్థితుల నైనా ఎదుర్కొని , తనకు ఎదురైన సమస్యలను తానే  పరిష్కరించుకుంటాడు . ఇక్కడ దైవబలం ఒక శక్తి గా , సహాయకారిగా  మనిషి కి తోడు అయి విజయునిగా  చేస్తుంది . 

 ఈ దశలో మనిషి  తన బలహీనతలను తాను స్వయంగా గ్రహించి, పరివర్తన చెంది అధిగమిస్తాడు . అందుకే బలహీనతలు లోపాలు గా అయి శాపాలు గా మారే విషయం ఈ దశలో ఉండదు.

☘️ ☘️ ☘️ ☘️ ☘️

• ఇక రెండవ అంశం తీసుకుంటే మిధ్య అనగా మాయ.  మాయ భౌతిక ఆకర్షణలకు , మానసిక మోహలకు , వికారాలకు , హద్దు లేని కోరికలకు , వ్యర్థ మైన విషయాల పట్ల ఆసక్తి , అసత్యమైన మాటల జీవనం , మోసపూరిత చేతలతో కూడిన జీవిత  విధానానికి దాసోహం అయినపుడు . . . ఇవన్నీ కలిసి  బలహీనతలు గా అయి  లోపాలు గా మారి ,  నెగెటివ్ శక్తి ని తనలో వృద్ధి చేసుకుంటాడు.   

ఇవి మనిషి మనసు లో అంతర్లీనంగా కలిసిపోయి  ఉండడం వలన , ఇవన్నీ తన ప్రవర్తన లో  బలహీనతలు  లోపాలు అని గ్రహించలేడు . ఎందుకంటే  మాయ  చాలా  శక్తివంతమైనది . మాయా వలన పోందే  మైకం మనిషి ని మానసిక అంధుడిగా  చేసేస్తుంది. క్రమేపీ  కొంత కాలానికి మనిషి లోని ఈ లోపాలే శాపాలు గా అయి  ఏదొక సమస్యలు , విఘ్నాలు  తరచూ కలగడం, తద్వారా దుఃఖం అనుభవించడం జరుగుతుంది. వీటినే మనిషి అనుకుంటాడు తనకు మాత్రమే అవరోధాలు , విఘ్నాలు కలుగుతున్నాయి అని , తలపెట్టిన ఏ పని సజావుగా సాగడం లేదని చింతిస్తాడు . వాస్తవానికి అది తన బలహీనతల లోని  నెగెటివ్ శక్తి  తిరగబడి తనకు  అవరోధం కలిగిస్తుంది  అని గ్రహించ లేడు .

మనిషి లోని మానసిక బలహీనతలను ఈ సృష్టి లోని భగవంతుడు , ప్రకృతి , పంచభూతాలు అంగీకరించవు . అందుకే అవి లోపాలు గా అయి తిరిగి మనిషి కి శాపాలు గా తయారవుతాయి. ఇందులో ఏ సందేహమూ లేదు.


☘️ ☘️ ☘️ ☘️ ☘️

మరి  బలహీనతలను అధిగమించడం ఎలా ?

• భగవద్గీత  జ్ఞానం  నిత్యం  వినడం ద్వారా మనిషికి  తనలోని బలహీనతలను  తాను  గుర్తించగలడు మరియు అద్దం లో తన ముఖం వలే తన అంతరంగం యొక్క యదార్ధ స్థితి మనిషి కి కనిపించగలదు .

  భగవంతుని తో కలిసి నిత్యం ధ్యానం చేయడం వలన  బలహీనతలను అధిగమించగలడు . ఈ పరివర్తన కేవలం జ్ఞాన మార్గంలో మాత్రమే సాధ్యం అవుతుంది,  భక్తి మార్గం లో  సాధ్యపడదు . ఎందుకంటే భగవద్గీత జ్ఞానం , మనిషి కి తానెవరో తన మూలం ఏమిటో  తెలియచేస్తుంది . దైవ ధ్యానం మనిషి  పరివర్తన కి  కావలసిన  శక్తిని సమకూరుస్తుంది.  భక్తి మార్గం భగవంతుడిని కేవలం విగ్రహాలు, పూజలు , కోరికలు , అవసరాలు  వరకే మనిషి ని పరిమితం చేసి అల్ప కాలిక ప్రాప్తి నిస్తుంది . జ్ఞాన మార్గం  సదా కాలిక  ప్రాప్తి నిస్తుంది 


• భగవంతుడు మనిషికి  ఉన్నతిని సమకూర్చి పైపైకి ఎదుగుదలతో  తీసుకు వెళతాడు. ఎందుకంటే పరమాత్ముడు పైన ఉంటాడు . అందుకు నిదర్శనం భగవంతుని తలుచుకునేటప్పుడు  మనం పైకి చూడడమే .

• మనిషి, మాయ కి దాసోహం అయి వశమైనపుడు అధఃపాతాళానికి   దిగజారిపోవడం  జరుగుతుంది. అందుకు నిదర్శనం తల దించుకుని  దుఃఖం తో  సమస్యలతో   దిగులు తో  నేలను చూస్తుండడమే  .


• మనిషిని పాతాళానికి తీసుకు వెళ్లేది మాయ .     మనిషి ని  ఉన్నతంగా చేయగలిగే  వాడు   భగవంతుడు . 

• భగవంతుడు ఒక్కడే . అతడే శివ పరమాత్ముడు. శివుని యధార్థం రూపం ప్రకాశవంతమైన  జ్యోతి బిందు స్వరూపం .  

మాయ బహురూపి. అనేక వికారాల ఆలోచనల రూపాలలో మనిషి ని మైకం లో ముంచి కబళిస్తుంది . అందుకు నిదర్శనం గా  శాస్త్రాలలో రావణాసురుడికి పది తలలతో  రాక్షసుడి గా చూపించారు . 

మాయ వలన బలహీనతలను పొంది ఉన్న మనిషిని  తిరిగి బలవంతుడి గా చేయు వాడు భగవంతుడి  జ్ఞానం మాత్రమే .

• బలహీనతలు లోపాలు గా అయి, శాపాలు గా కాకముందే మేల్కోవడం  ప్రతి మనిషికి ఉత్తమం .


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 16 Jan 2026. 9:00 PM.



No comments:

Post a Comment

715. బలహీనతలే - లోపాలు - శాపాలు

  బలహీనతలే - లోపాలు - శాపాలు • మనిషికి తన బలహీనతలే లోపాలు శాపాలా ?   అవును ముమ్మాటికీ . . .  మనిషి కి  తన  లోలోని  బలహీనతలే  లోపాలు గా   ...