జ్ఞాని బలహీనుడు గా కనిపిస్తాడా ?
నేటి కలియుగ ప్రపంచంలో జ్ఞానం కలిగి ఉన్న వారు బలహీనులు గా కనిపిస్తారా ? అనిపిస్తారా ?
అవును . . . ఎందుకంటే జ్ఞానులు మాయలో ఉండరు , మాయ చేయలేరు , సత్యాన్ని ఆచరిస్తారు కాబట్టి .
జ్ఞాని నిశ్చలమైన బుద్ధి తో ఉంటాడు , మనో స్థితి లో శక్తి శాలుడు . కానీ, తన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ , మానవులకు దశా దిశా నిర్దేశం చేసే క్రమంలో బలహీనుడు గా , విగత జీవుడు గా నే నేటి కలియుగ కాలం వారికి కనిపిస్తాడు .
దీనికి ఎన్నో ఉదంతాలు ఇటీవలి కాలంలో సమాజం లో చూడవచ్చు . ఉదాహరణకు నేడు , ఎంతో వాగ్ధాటి ఉన్న జ్ఞాన ప్రవచన కర్తలు విలువైన జ్ఞానాన్ని ప్రవచనాల తో సభల్లో వినిపిస్తూ ఉంటారు . కానీ వాటికి హాజరు అయ్యేవారు చాలా పరిమితంగా వందల్లో ఉంటున్నారు. వారి ఉపన్యాసం లోని ఆధ్యాత్మిక విషయాలు , ఛలోక్తులు వినేవారంతా కాసేపు తమ మనసును ఆహ్లాద పరచుకొని వెళతుండడం గమనార్హం . కానీ , ఆ సభలో చెప్పిన విషయాలను గ్రహించి ఆచరించాలి అనుకునే వారు మాత్రం కనిపించరు.
ఎందుకంటే జ్ఞానులు సత్యం చెపుతారు . సత్యం వినడానికి చాలా బావుంటుంది. ఆచరించడానికి మానవుని బుద్ధి సహకరించదు. (ఎందుకంటే సత్యం ఆచరిస్తే ముందు మనిషి కి తనలోని లోపాలు స్పష్టం గా కనిపిస్తాయి . అవి మనిషి అంగీకరించ లేడు. ఆ లోపాలను సవరించు కోకుండా సత్యం ఆచరించడం అసాధ్యం.)
అదే , ఇటీవల తరచూ జరిగే సినిమా విడుదల ఫంక్షన్ వేడుక కి చూడండి , వేలల్లో జనం ఎగబడి ఉంటారు . ధనం వెచ్చించి పాస్ లు తీసుకొని వెళ్తారు. అక్కడ వేదిక పై ఉన్న , సినిమా వారు చెప్పే విషయాలు ఎవరికీ వ్యక్తిగత ప్రయోజనం చేకూర్చక పోయినా సరే , వెళ్లిన వారు ఆసక్తి గా వింటారు . పదే పదే మననం చేసుకుంటారు , తిరిగి పది మంది కి అక్కడి విషయాలు గొప్ప గా చెపుతారు. ఏదో సాధించిన అనుభూతి తో అక్కడి వీడియోలు షేర్ చేస్తారు . దీనినే మనిషి , ఆకర్షిత మైన మాయా ప్రభావానికి లోను కావడం అంటారు . విచిత్రం ఏమిటంటే ఇందులో స్త్రీ పురుషులు చిన్న పెద్ద ముసలి అన్ని వయసుల వారు ఉంటారు .
ఇదీ నేటి కలి సమాజంలో మనిషి స్థితి , పరిస్థితి .
కొన్ని సందర్భాల్లో, ఆధ్యాత్మిక ప్రసంగాలకు వెళ్లి వినిన వారి అభిప్రాయం చాలా విచిత్రంగా ఉంటుంది. . . ప్రవచన కర్తలు చెప్పే జ్ఞాన విషయాలు, సూక్తులు వినడానికి చాలా బాగుంటాయి కానీ ఆచరించడం కష్టం అంటారు . ఇదంతా గమనించినప్పుడు , అంత సమయం ప్రవచనం వినిపించిన ఆ జ్ఞానులు చివరికి బలహీనులు గానే నేటి కాలంలో మిగులు తున్నారు అని అనిపిస్తుంది . అందుకే నేటి కాలంలో, ఎంతో మంది ఉత్తములు , జ్ఞానం కలిగి ఉన్న వారు, క్రమశిక్షణ తో జీవించే వారు , అభ్యుదయ భావాలు కలిగిన వారు నిరుపయోగం గా మిగిలి పోతున్నారా అనిపిస్తుంది . పోనీ వీరు ఆశించేది గౌరవం , ధనం, కీర్తి , పేరు ప్రతిష్టలు కాదు . . . భగవంతుడు తమకు ఇచ్చిన జ్ఞానం , శక్తి ద్వారా ఎంత మంది జీవితాలలో మంచి మార్పు కలిగింది అనేదే ఆలోచిస్తారు . అదే వారి జీవితానికి సఫలత .
జ్ఞానులు సూక్ష్మ బుద్ధి శాలులు . సాధన తపో బలం తో ధ్యాని గా , భగవంతుని శక్తి తో ప్రకృతి కి పంచభూతాలకు సహయోగి గా అనుసంధానం అవుతారు . సృష్టి , విశ్వ పరివర్తన లో భాగస్వాములు అవుతారు . భగవంతుడు , లోక కళ్యాణార్దం కోసం జ్ఞానులను తయారు చేసుకుంటాడు .
భారతదేశం నేటికీ సుభిక్షంగా ఉంది అంటే దానికి కారణం , ఆది నుంచి ఉన్న మునుల జ్ఞానుల యోగుల తపో బలం . అందుకే భగవంతుడు కూడా కలియుగాంతం లో భారతదేశం లోనే అవతరిస్తాడు (అవతరించి ఉన్నాడు).
నేడు మాయ వలన పూర్తి పతితంగా అయిపోయిన ఈ మానవ ప్రపంచం , వినాశనపు అడుగు జాడల్లో నడవడం ఆరంభం అయి గత 6 సంవత్సరాలు అయింది. ఇది క్రమబద్ధం గా పెరుగుతూ వస్తుంది . చివరికి ఒక్క భరత ఖండం మినహ , ఈ ప్రపంచంలో ఏ దేశాలు భవిష్యత్తులో ఉండనే ఉండవు . ప్రపంచం అణు యుద్ధాలతో నిండి పోతుంది . ఇది కాలజ్ఞానం లో రాసి ఉన్నదే . నేడు ప్రత్యక్షం గా జరుగుతున్నది అదే .
జ్ఞానం వినినంతలో ఆచరించడం కష్టం . జ్ఞానం చాలా సూక్ష్మమైన అర్దం తో ఉంటుంది , ప్రతి అంశం లోను సత్యం ప్రతిబింబిస్తుంది . కానీ , బుద్ధిని భగవంతుని పై లగ్నం చేయడం ద్వారా జ్ఞానం క్రమేపీ జీర్ణం అవుతుంది . జ్ఞానం తో పాటు నిరంతరం ధ్యాన యోగ సాధన ఉండాలి . జ్ఞానం మనిషి ని వివేకవంతునిగా మారుస్తుంది . జ్ఞానం పంచే కొద్ది పెరుగుతుంది . జ్ఞానం అంటే సత్యం.
దురదృష్టవశాత్తూ మాయా ప్రభావం లో మనిషి చిక్కుకు పోయి ఉండడం వలన , నేడు మంచిని శ్రద్ద గా వినడం లోపిస్తుంది , ఆచరించడం అరుదుగా అయిపోయింది. విచిత్రం ఏమిటంటే, ఇదే మనుషులు , జ్ఞానం తమ మంచి కోసం , మానవత్వం కోసం అని తెలిసినా సరే దృష్టి పెట్టలేరు .
నేడు మనిషి బాహ్యంగా సమాజం లో జీవించడమే జీవనం అని అనుకుంటున్నాడు కానీ తనకంటూ ఒక అంతరంగ జీవనం (Inner life journey) అనేది ఒకటి ఉంది , అదే తనను గత జన్మల నుండి ఈ ప్రస్తుత జన్మ కి తీసుకు వచ్చింది మరల భవిష్యత్తు లో మరొక జన్మకి తీసుకు వెళ్తుంది , ఇదంతా నేటి, నా అంతరంగ జీవనం మీదే ఆధారపడి ఉంది , అందుకోసం నేను ఏం సంపాదించుకుంటున్నాను అనే రహస్యం తెలుసుకోలేక జీవిస్తున్నాడు . ఇది చాలా విచారకరం .
ఉదయం లేచిన నుంచి మనిషి లో విషయ వికారాలను , సమయం వృధా చేస్తూ చెడు ను పెంచి పోషించే కార్యక్రమాలు టి.వి లో యూట్యూబ్ లో విరివిగా చూస్తుంటారు . కానీ స్వయం తమ జీవిత వృద్ధి కి అవసరమైన ఆధ్యాత్మిక విషయాల పై శ్రద్ద , కొంత సమయం కూడా కేటాయించ లేక పోతుంటారు . ఇది నేటి మనిషి యొక్క మనో స్థితి .
బహిరంగ వేదికలపై ఆధ్యాత్మిక ప్రవచన కర్తలను , గురువులను చూసి పరవశించి పోవడం, నా జన్మ ధన్యం అయింది అనుకుంటూ వారికి ఎదురెళ్లి నమస్కరించడం కంటే , వారు చెప్పే జ్ఞాన విషయాలను విని , సత్ప్రవర్తనతో ఆచరించి నపుడే జ్ఞానుల ప్రభావం ఈ సమాజానికి దశ దిశ నిర్దేశం జరుగుతుంది . అప్పుడే జ్ఞానుల లక్ష్యం సిద్దించి , బలమైన వారుగా ఈ సమాజానికి అనిపిస్తారు .
లేదంటే . . . జ్ఞానులు వ్యక్తి పరంగా స్థితిమంతులు , బలవంతులు అయినప్పటికీ నేటి కాలమానం లోని సమాజ పోకడల ప్రకారం వారు బలహీనమయినట్లే అనిపిస్తారు . అందుకే అన్నాను జ్ఞానులు బలహీనులు గా కనిపిస్తారా ? అని .
నిజమైన జ్ఞాని ఆడంబరాలకు , లౌకిక కోరికలకు అతీతంగా ఉంటాడు . తన లోని జ్ఞానం , వెలుగై . . . దుఃఖం అజ్ఞానపు చీకటిలో ఉన్నవారందరికీ ఆసరా కావాలని, వారు జ్ఞానయుక్తులై మరికొందరికి వెలుగు చూపించాలని ఆశిస్తాడు. వాస్తవానికి పరమ శివుడు కోరుకునేది , ఆశించేది ఇదే.
జ్ఞాని అంటే ఢాంభికాలు ప్రదర్శిస్తూ, శ్లోకాలు వల్లె వేయడం, నమకం చమకం తిప్పుతూ, పాండిత్యాన్ని ప్రదర్శించు వారే అనుకుంటే పొరపాటు .
జ్ఞాని అంటే ప్రతి విషయం లోనూ భగవత్ సత్యం గ్రహించి , సత్యం మాట్లాడుతూ , సత్యం అర్దం చేయిస్తూ, సత్య ప్రవర్తన తో అతి సాధారణ జీవనం గడిపే వాడు . ఉదాహరణకు యోగి వేమన , రమణ మహర్షులు , ముమ్మిడివరం బాలయోగి , స్వామి వివేకానంద, స్వామి యోగానంద వంటి అనేకులు ఈ భరతభూమి పై జన్మించి విలువైన తత్వాలను విడిచి పెట్టి వెళ్లారు . వీరి తత్వాలు నేటి కాలంలో ఎందరికి ఆదర్శమో , ఆచరణో ఈశ్వరుడి కే తెలియాలి .
నేటి మాయా లోకం లో ఆధ్యాత్మిక త అంటూ విలాసాలు అనుభవిస్తూ మహిమలు, మాయలు, గారడీలు , ఆడంబరాలు ప్రదర్శించే వారిని ఏమనాలో కూడా అర్దం కాని పరిస్థితి.
తమ మనసు తో , మాట తో , కర్మ తో , శుభ సంకల్పాలు చేస్తూ భగవంతుని శక్తి ద్వారా లోక కల్యాణం కోసం నిమిత్తులైన నిరాడంబర నిర్వికార , నిరహంకారు లే సత్యమైన జ్ఞానులు.
🙏
చివరి మాట : ఈ మధ్య కాలంలో. కొన్ని సందర్భాలు , పరిస్థితులు గమనించినప్పుడు నా లో జనియించిన ఆలోచనలు ఇవి . వీటితో అందరూ ఏకీభవించాలని అనుకోవడం లేదు . ఎవరిని విమర్శించేందుకు కాదు . కేవలం ఒక ఆవేదన మాత్రమే .
ఓం శాంతి (నేను ఆత్మను. నా స్వధర్మం శాంతి)
ఓం నమఃశివాయ (ఆత్మ నైన నేను పరమాత్మ శివుని నమస్కరించుచున్నాను)
శివ బాబా (శివుడు తండ్రి) .
యడ్ల శ్రీనివాసరావు 15 Sep 2026 8:10 PM .