Wednesday, September 16, 2026

786. ఉత్తమ శిల

 

ఉత్తమ శిల 



ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు . అతడు ఒక రోజు పక్క ఊరికి పని మీద వెళ్ళి తిరిగి వస్తుంటే , ఊరి పొలిమేర లో ఒక నిర్మానుష్య ప్రదేశం లో అద్భుతంగా మెరుస్తున్న అరుదైన శిల దొరికింది . 

శిల్పి ముఖం లో అమితమైన ఆనందం వికసించింది , మనసులో అనుకుంటున్నాడు …. ఆహా నా అదృష్టం ఇంత ధృఢమైన మేలిమి జాతి రాయిని నా జన్మ లో ఇప్పటి వరకూ చూడలేదు . దీనిని అధ్బుతమైన కళాఖండం గా తీర్చిదిద్దాలి అనుకుని ఆ శిలను ఇంటికి తీసుకు వెళ్ళాడు . 

మంచి రోజు చూసుకుని పని ప్రారంభించాడు . ఆ శిలను పగలు రాత్రి శ్రమ పడుతూ అందమైన శిల్పం గా చెక్కడం ఆరంభించాడు . కొన్ని రోజుల తర్వాత , శిల్పి చెక్కడం లో వేస్తున్న ఉలి దెబ్బలు తట్టుకోలేక , ఆ రాయి లబో దిబో మంటూ మనసు లో ఏడ్చేది . ఇదంతా ఏమీ తెలియని శిల్పి , తన శైలిలో చెక్కుతూ రూపు దిద్దేవాడు . 

ఆఖరికి ఒకరోజు , ఉలి దెబ్బలు తట్టుకోలేని ఆ శిల రెండు ముక్కలు గా పగిలిపోయింది . అప్పటి వరకు పడిన శ్రమ వృధా అయింది అని శిల్పి నిరాశ చెందాడు , చేసేది ఏమి లేక , ఆ రాయి ని ఊరి చివర పారేశాడు . 


శిల్పి అక్కడి నుంచి తిరిగి వస్తుంటే ఒక సాధారణ మైన నల్లరాయి కనిపించింది. తన జీవన భృతి కోసం, ఏదో ఒక శిల్పం చెక్కి తీరాలి కదా అని మనసు లో అనుకొని ఆ రాయి ని ఇంటికి తీసుకు వెళ్ళాడు. 

మరుసటిరోజు నుంచే , ఆ రాయి ని ఒక శిల్పం గా చెక్కడం ఆరంభించాడు . శిల్పి చెక్కే సమయం లో కొడుతున్న ఉలి దెబ్బలను , ఆ రాయి ఆనందం గా భరించేది. కొన్ని రోజుల కి అది ఒక దేవతా శిల్పం గా తయారైంది . 

పొరుగూరు నుంచి ఒక ఆసామి వచ్చి ఆ శిల్పం నచ్చి , శిల్పికి  ధనం ఇచ్చి తన ఊరికి తీసుకెళ్ళి అందం గా ఉంటుందని ,  ఊరి మధ్యలో ఉన్న రావి చెట్టు కింద పెట్టాడు . 

ఊరిలోని వారు , ఆ దారిలో పోతూ ఉన్నప్పుడు , ఆ శిల్పం వైపు తదేకంగా చూసి వెళుతూ ఉండేవారు . వారికి శిల్పంలో ఏదో ఆకర్షణ కనిపించేది. వారు వెళ్ళిన ప్రతి పని సఫలం అయ్యేది. అది క్రమేపీ అందరికీ ఒక నమ్మకం గా ఏర్పడి , ఆ శిల్పాన్ని పూజించడం ఆరంభించారు . ఇది. చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకి జనం తండోపతండాలుగా వచ్చేవారు . వారు తెచ్చిన కొబ్బరికాయలు కొట్టడానికి శిల్పం ముందు ఎవరో ఒక రాయిని తెచ్చి పెట్టారు .  

ఇంతకీ ఆ రాయి ఉలి దెబ్బలను తట్టుకోలేక శిల్పి చేతిలో పగలిపోయిన  మొదటి శిల . ఆ రాయి దెబ్బలు తప్పించు కుందాము అనుకున్నా సరే, తిరిగి కొబ్బరి చెక్కల దెబ్బలు తప్పడం లేదు . 

శిల్పి చేతిలో ఆనందం గా ఉలి దెబ్బలను తట్టుకుని నిలబడిన రెండవ రాయి అద్భుతమైన కళాఖండం అయి  , నేడు నిత్యం పూజలందుకుంటుంది .


మనిషి జీవితం కూడా ఇంతే . . . 


ఒక మనిషి ఉత్తముడు గా , మేలిమి గా తీర్చిదిద్దబడాలి  అంటే , ఎన్నో ఆటుపోట్లు, కష్టాలు కన్నీళ్లు , నిందలు , అవమానాలు , ఆకలి పస్తులు చిత్ర హింసలు అన్నీ భరించవలసిందే . వాటికి భయపడి దాక్కుందాం తప్పించుకుందాం  అనుకుంటే  ఒకటి అసంపూర్ణంగా మిగిలి పోవల్సివస్తుంది  . . .  రెండవది ఎప్పటికైనా సరే , ఎన్ని జన్మల తర్వాత అయినా సరే అనుభవించ వలసిన కర్మ ఏదొక రూపం లో అనుభవించ తప్పదు . అపటి వరకు కర్మ వెంటాడుతూనే ఉంటుంది . 

అదే విధంగా  భగవంతుని స్మృతి లో ఉంటూ ఆ బాధలను  ఆనందం గా భరిస్తే , వికర్మలు  తీరిపోయి . భవిష్యత్ ఊహించని ఉత్తమ స్థితి కి చేరుకుంటుంది . 


నిన్ను నన్ను శిల్పం వలే  చెక్కేది . . .  తీర్చిదిద్దే   ఆ శిల్పి   పరమాత్మ  శివుడే .


ఓం శాంతి  (నేను ఆత్మను, నా స్వధర్మం శాంతి)

ఓం నమఃశివాయ (ఆత్మ నైన నేను పరమాత్మ శివుని నమస్కరించుచున్నాను)

శివబాబా  (శివుడు తండ్రి).


యడ్ల శ్రీనివాసరావు 16 Sep 2026 8:00 PM .

Tuesday, September 15, 2026

785 . జ్ఞాని బలహీనుడు గా కనిపిస్తాడా ?

 

జ్ఞాని బలహీనుడు గా కనిపిస్తాడా ? 


నేటి కలియుగ ప్రపంచంలో జ్ఞానం కలిగి ఉన్న వారు బలహీనులు గా కనిపిస్తారా  ? అనిపిస్తారా ?

అవును . . . ఎందుకంటే జ్ఞానులు మాయలో ఉండరు , మాయ చేయలేరు , సత్యాన్ని ఆచరిస్తారు కాబట్టి . 


జ్ఞాని  నిశ్చలమైన  బుద్ధి తో ఉంటాడు , మనో స్థితి లో శక్తి శాలుడు . కానీ, తన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ , మానవులకు దశా దిశా నిర్దేశం చేసే క్రమంలో బలహీనుడు గా , విగత జీవుడు గా నే నేటి కలియుగ కాలం వారికి కనిపిస్తాడు . 


దీనికి ఎన్నో ఉదంతాలు ఇటీవలి కాలంలో సమాజం లో చూడవచ్చు . ఉదాహరణకు  నేడు ,  ఎంతో వాగ్ధాటి ఉన్న  జ్ఞాన ప్రవచన కర్తలు  విలువైన  జ్ఞానాన్ని   ప్రవచనాల తో   సభల్లో  వినిపిస్తూ ఉంటారు . కానీ వాటికి హాజరు అయ్యేవారు చాలా పరిమితంగా వందల్లో ఉంటున్నారు. వారి ఉపన్యాసం లోని  ఆధ్యాత్మిక  విషయాలు , ఛలోక్తులు వినేవారంతా కాసేపు తమ మనసును ఆహ్లాద పరచుకొని వెళతుండడం గమనార్హం . కానీ , ఆ సభలో చెప్పిన విషయాలను గ్రహించి ఆచరించాలి అనుకునే వారు మాత్రం కనిపించరు.  

ఎందుకంటే జ్ఞానులు సత్యం చెపుతారు . సత్యం వినడానికి చాలా బావుంటుంది. ఆచరించడానికి మానవుని బుద్ధి సహకరించదు. (ఎందుకంటే సత్యం ఆచరిస్తే  ముందు మనిషి కి తనలోని లోపాలు స్పష్టం గా  కనిపిస్తాయి . అవి మనిషి అంగీకరించ లేడు. ఆ లోపాలను సవరించు కోకుండా  సత్యం ఆచరించడం అసాధ్యం.)


అదే , ఇటీవల తరచూ జరిగే  సినిమా విడుదల ఫంక్షన్ వేడుక కి చూడండి , వేలల్లో జనం ఎగబడి  ఉంటారు . ధనం వెచ్చించి పాస్ లు తీసుకొని వెళ్తారు. అక్కడ వేదిక పై ఉన్న , సినిమా వారు చెప్పే విషయాలు ఎవరికీ  వ్యక్తిగత ప్రయోజనం చేకూర్చక పోయినా సరే , వెళ్లిన వారు ఆసక్తి గా వింటారు . పదే పదే మననం చేసుకుంటారు , తిరిగి పది మంది కి అక్కడి విషయాలు గొప్ప గా చెపుతారు. ఏదో సాధించిన అనుభూతి తో అక్కడి వీడియోలు షేర్ చేస్తారు . దీనినే మనిషి , ఆకర్షిత మైన మాయా ప్రభావానికి లోను కావడం అంటారు . విచిత్రం ఏమిటంటే ఇందులో స్త్రీ పురుషులు చిన్న పెద్ద ముసలి అన్ని వయసుల వారు ఉంటారు . 

ఇదీ నేటి కలి సమాజంలో మనిషి స్థితి , పరిస్థితి . 


కొన్ని సందర్భాల్లో, ఆధ్యాత్మిక ప్రసంగాలకు వెళ్లి వినిన వారి అభిప్రాయం చాలా విచిత్రంగా ఉంటుంది. . . ప్రవచన కర్తలు చెప్పే జ్ఞాన విషయాలు, సూక్తులు వినడానికి చాలా బాగుంటాయి కానీ ఆచరించడం కష్టం అంటారు . ఇదంతా గమనించినప్పుడు , అంత సమయం ప్రవచనం వినిపించిన ఆ జ్ఞానులు చివరికి బలహీనులు గానే నేటి కాలంలో మిగులు తున్నారు అని అనిపిస్తుంది . అందుకే నేటి కాలంలో, ఎంతో మంది ఉత్తములు , జ్ఞానం కలిగి ఉన్న వారు, క్రమశిక్షణ తో జీవించే వారు , అభ్యుదయ భావాలు కలిగిన వారు నిరుపయోగం గా మిగిలి పోతున్నారా అనిపిస్తుంది . పోనీ  వీరు ఆశించేది గౌరవం , ధనం, కీర్తి , పేరు ప్రతిష్టలు కాదు . . . భగవంతుడు తమకు ఇచ్చిన జ్ఞానం , శక్తి ద్వారా ఎంత మంది జీవితాలలో మంచి మార్పు కలిగింది  అనేదే ఆలోచిస్తారు . అదే వారి జీవితానికి సఫలత .


జ్ఞానులు సూక్ష్మ బుద్ధి శాలులు . సాధన తపో బలం తో ధ్యాని గా , భగవంతుని శక్తి తో ప్రకృతి కి పంచభూతాలకు సహయోగి గా అనుసంధానం అవుతారు . సృష్టి , విశ్వ పరివర్తన లో భాగస్వాములు అవుతారు . భగవంతుడు , లోక కళ్యాణార్దం కోసం జ్ఞానులను తయారు చేసుకుంటాడు . 



భారతదేశం నేటికీ సుభిక్షంగా ఉంది అంటే దానికి కారణం , ఆది నుంచి ఉన్న మునుల జ్ఞానుల యోగుల తపో బలం . అందుకే భగవంతుడు కూడా కలియుగాంతం లో భారతదేశం లోనే అవతరిస్తాడు (అవతరించి ఉన్నాడు). 

నేడు మాయ వలన పూర్తి పతితంగా అయిపోయిన ఈ మానవ ప్రపంచం , వినాశనపు అడుగు జాడల్లో నడవడం ఆరంభం అయి గత 6 సంవత్సరాలు అయింది. ఇది క్రమబద్ధం గా పెరుగుతూ వస్తుంది . చివరికి ఒక్క భరత ఖండం మినహ , ఈ ప్రపంచంలో ఏ దేశాలు భవిష్యత్తులో ఉండనే ఉండవు . ప్రపంచం అణు యుద్ధాలతో నిండి పోతుంది . ఇది కాలజ్ఞానం లో రాసి ఉన్నదే . నేడు ప్రత్యక్షం గా జరుగుతున్నది అదే . 



జ్ఞానం వినినంతలో ఆచరించడం కష్టం . జ్ఞానం చాలా సూక్ష్మమైన అర్దం తో ఉంటుంది , ప్రతి అంశం లోను సత్యం ప్రతిబింబిస్తుంది . కానీ , బుద్ధిని భగవంతుని పై లగ్నం చేయడం ద్వారా జ్ఞానం క్రమేపీ జీర్ణం అవుతుంది . జ్ఞానం తో పాటు నిరంతరం ధ్యాన యోగ సాధన ఉండాలి .  జ్ఞానం మనిషి ని వివేకవంతునిగా   మారుస్తుంది . జ్ఞానం పంచే కొద్ది పెరుగుతుంది . జ్ఞానం అంటే సత్యం.


దురదృష్టవశాత్తూ మాయా ప్రభావం లో మనిషి చిక్కుకు పోయి ఉండడం వలన , నేడు మంచిని శ్రద్ద గా వినడం లోపిస్తుంది , ఆచరించడం అరుదుగా అయిపోయింది. విచిత్రం ఏమిటంటే, ఇదే మనుషులు  , జ్ఞానం  తమ మంచి కోసం , మానవత్వం కోసం అని తెలిసినా సరే  దృష్టి పెట్టలేరు .  




నేడు మనిషి బాహ్యంగా సమాజం లో జీవించడమే జీవనం అని అనుకుంటున్నాడు కానీ తనకంటూ ఒక అంతరంగ జీవనం (Inner life journey) అనేది ఒకటి ఉంది , అదే తనను గత జన్మల నుండి ఈ ప్రస్తుత జన్మ కి తీసుకు వచ్చింది మరల భవిష్యత్తు లో మరొక జన్మకి తీసుకు వెళ్తుంది , ఇదంతా  నేటి, నా అంతరంగ జీవనం మీదే ఆధారపడి ఉంది , అందుకోసం నేను ఏం సంపాదించుకుంటున్నాను  అనే  రహస్యం తెలుసుకోలేక   జీవిస్తున్నాడు . ఇది చాలా విచారకరం .


ఉదయం లేచిన నుంచి మనిషి లో విషయ వికారాలను , సమయం వృధా చేస్తూ  చెడు ను పెంచి పోషించే కార్యక్రమాలు టి.వి లో యూట్యూబ్ లో విరివిగా చూస్తుంటారు . కానీ స్వయం తమ జీవిత వృద్ధి కి అవసరమైన ఆధ్యాత్మిక విషయాల పై శ్రద్ద , కొంత సమయం కూడా కేటాయించ లేక పోతుంటారు . ఇది నేటి మనిషి యొక్క మనో స్థితి . 


బహిరంగ వేదికలపై ఆధ్యాత్మిక ప్రవచన కర్తలను , గురువులను చూసి పరవశించి పోవడం, నా జన్మ ధన్యం అయింది అనుకుంటూ వారికి ఎదురెళ్లి నమస్కరించడం కంటే , వారు చెప్పే జ్ఞాన విషయాలను విని , సత్ప్రవర్తనతో ఆచరించి నపుడే జ్ఞానుల ప్రభావం ఈ సమాజానికి దశ దిశ నిర్దేశం జరుగుతుంది . అప్పుడే జ్ఞానుల లక్ష్యం సిద్దించి , బలమైన వారుగా ఈ సమాజానికి అనిపిస్తారు . 

లేదంటే . . . జ్ఞానులు వ్యక్తి పరంగా స్థితిమంతులు , బలవంతులు అయినప్పటికీ నేటి కాలమానం లోని సమాజ పోకడల ప్రకారం వారు బలహీనమయినట్లే అనిపిస్తారు . అందుకే అన్నాను జ్ఞానులు బలహీనులు గా కనిపిస్తారా ? అని . 



నిజమైన జ్ఞాని ఆడంబరాలకు , లౌకిక కోరికలకు అతీతంగా ఉంటాడు . తన లోని జ్ఞానం , వెలుగై . ‌ . . దుఃఖం అజ్ఞానపు చీకటిలో ఉన్నవారందరికీ ఆసరా కావాలని, వారు జ్ఞానయుక్తులై మరికొందరికి వెలుగు చూపించాలని ఆశిస్తాడు. వాస్తవానికి పరమ శివుడు కోరుకునేది , ఆశించేది ఇదే.

జ్ఞాని అంటే ఢాంభికాలు ప్రదర్శిస్తూ, శ్లోకాలు వల్లె వేయడం, నమకం చమకం తిప్పుతూ, పాండిత్యాన్ని ప్రదర్శించు వారే అనుకుంటే పొరపాటు . 

జ్ఞాని అంటే ప్రతి విషయం లోనూ భగవత్ సత్యం గ్రహించి , సత్యం మాట్లాడుతూ , సత్యం అర్దం చేయిస్తూ, సత్య ప్రవర్తన తో అతి సాధారణ జీవనం గడిపే వాడు . ఉదాహరణకు యోగి వేమన , రమణ మహర్షులు , ముమ్మిడివరం బాలయోగి , స్వామి వివేకానంద, స్వామి యోగానంద  వంటి అనేకులు ఈ భరతభూమి పై జన్మించి విలువైన తత్వాలను విడిచి పెట్టి వెళ్లారు . వీరి తత్వాలు నేటి కాలంలో ఎందరికి ఆదర్శమో , ఆచరణో  ఈశ్వరుడి కే తెలియాలి .


నేటి మాయా లోకం లో ఆధ్యాత్మిక త అంటూ విలాసాలు అనుభవిస్తూ మహిమలు, మాయలు, గారడీలు , ఆడంబరాలు ప్రదర్శించే వారిని ఏమనాలో కూడా అర్దం కాని పరిస్థితి.


తమ మనసు తో , మాట తో , కర్మ తో ,  శుభ సంకల్పాలు చేస్తూ భగవంతుని శక్తి ద్వారా  లోక కల్యాణం కోసం నిమిత్తులైన నిరాడంబర నిర్వికార , నిరహంకారు లే సత్యమైన జ్ఞానులు.

🙏


చివరి మాట :  ఈ మధ్య కాలంలో. కొన్ని సందర్భాలు , పరిస్థితులు  గమనించినప్పుడు  నా లో జనియించిన ఆలోచనలు ఇవి . ‌వీటితో అందరూ ఏకీభవించాలని అనుకోవడం లేదు . ఎవరిని విమర్శించేందుకు కాదు . కేవలం ఒక ఆవేదన మాత్రమే .



ఓం శాంతి (నేను ఆత్మను. నా స్వధర్మం శాంతి)

ఓం నమఃశివాయ (ఆత్మ నైన నేను పరమాత్మ శివుని నమస్కరించుచున్నాను)

శివ బాబా (శివుడు తండ్రి) .


యడ్ల శ్రీనివాసరావు 15 Sep 2026 8:10 PM .

Sunday, September 13, 2026

784 . రాజయోగ ఫలాలు -5

 


ఈ ప్రపంచం ,  మనలో మనం మోసుకెళ్లే  శక్తికి నిరంతరం  స్పందిస్తూనే  ఉంటుంది.

మన ఆలోచనలు తరంగాలుగా (Waves) మారతాయి. మన భావాలు (Feelings) ఆ తరంగాలకు బలాన్ని ఇస్తాయి. మన వైఖరి , ప్రవర్తన (Attitude, Behaviour)  వాటికి  దిశను (Direction) ఇస్తుంది.

ఆ తర్వాత మనం కలుసుకునే వ్యక్తులు, మనం అనుభవించే పరిస్థితుల ద్వారా జీవితం వాటిని నిశ్శబ్దంగా మనకే తిరిగి ప్రతిబింబిస్తుంది. 

మీ ప్రపంచాన్ని మార్చుకోవాలని కోరుకుంటే, ముందుగా మీ అంతర (Internal) ప్రపంచాన్ని మార్చడం ప్రారంభించండి. 🌿


మీ మనసును స్వచ్ఛమైన ఆలోచనలతో ,

మీ హృదయాన్ని మంచి భావాలతో ,

మీ వైఖరిని ఆత్మ చైతన్యంతో నింపుకోండి. 

క్రమంగా బయట కనిపించే ప్రతిబింబం కూడా మారడం ప్రారంభిస్తుంది. 🌺


మీ గొప్ప ప్రభావం మీరు చెప్పే మాటల్లో లేదు.

మీరు ప్రసరించే ప్రకంపనల్లో  ఉంది. ✨


🌹🌹🌹🌹🌹




❤️ స్వచ్ఛమైన ప్రేమ అంటే స్వాధీనం చేసుకోవడం,  అనుభవించడం  లేదా ఎదురు చూడడం కాదు. అది ఆత్మ యొక్క నిస్వార్థమైన స్థితి .

ఏదీ ఆశించకుండా ఇవ్వడం,

ఎటువంటి షరతులు లేకుండా శ్రద్ధ చూపించడం,

సహజంగానే దయను, మంచితనాన్ని ప్రసరించడం. 


🌸 నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు...

ఆశ ఉండదు...

అది కేవలం ఇవ్వడంలోనే  ఆనందాన్ని అనుభవిస్తుంది. ❤️


🌹🌹🌹🌹🌹




ప్రపంచం గొప్ప గొప్ప కార్యాల వల్ల మాత్రమే స్వస్థత పొందదు. చాలా సందర్భాల్లో, మనం ఇతరులను ఎలా అనుభూతి చెందేలా చేస్తామో, ఆ విధంగానే ప్రపంచం స్వస్థత పొందుతుంది.


🌿 ఒక  సున్నితమైన  మాట , ఆందోళనతో ఉన్న  మనసును  ప్రశాంతపరచగలదు .

😊 ఒక   ఆప్యాయమైన   చిరునవ్వు , ఎవరిలోనైనా  కోల్పోయిన  ఆశను  తిరిగి  కలిగించగలదు .

❤️ స్వచ్ఛమైన  ప్రేమతో  నిండిన  హృదయం , మాటలు  చేరుకోలేని  విధంగా  ఆత్మలను తాకగలదు.

ఇదే ఆధ్యాత్మిక జీవనం యొక్క నిశ్శబ్దమైన శక్తి.


🌸 మీరు కలుసుకునే ప్రతి వ్యక్తి జీవితంలో

ఒత్తిడికి   బదులుగా   శాంతిని ,

తీర్పునకు  బదులుగా   ప్రేమను ,

గాయానికి   బదులుగా   ఆశను ,

వదిలివెళ్లే   . . .  ఒక  అవకాశమే  ఆధ్యాత్మికత .


 మీ మాటలు ఆశీర్వాదాలుగా  మారనివ్వండి .

😊 మీ చిరునవ్వు  ఓదార్పుగా  మారనివ్వండి.

❤️ మీ ప్రేమ , ఇతరుల  స్వస్థతకు  భగవంతుని సాధనంగా   మారనివ్వండి.


🌹🌹🌹🌹


అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు 🙏


ఓం శాంతి (ఆత్మ యొక్క స్వధర్మం శాంతి )

ఓం నమఃశివాయ (ఆత్మ నైన నేను పరమాత్మ శివుని కి నమస్కరిస్తున్నాను)

శివబాబా  (శివుడే  తండ్రి)

# బ్రహ్మా కుమారీస్ డెస్క్ 


యడ్ల శ్రీనివాసరావు  13 Sep 2026 9:00PM.


Saturday, September 12, 2026

783. శంకరుడు సంసార తపస్వి

 

శంకరుడు సంసార తపస్వి 


శంకరుడు సంసార తపస్వి . భార్య సతీదేవి పై అపారమైన ప్రేమ కలవాడు . సతీదేవి తండ్రి అయిన దక్షుడు చేసిన అవమానం భరించలేక సతీదేవి మరణిస్తుంది. కోపోద్రిక్తుడైన శంకరుడు తలపెట్టిన వినాశనాన్ని శాంతింప చేయడానికి విష్ణువు, దేవతలు ఎంతో ప్రయత్నిస్తారు .  ఇది మనందరికీ తెలిసిన శాస్త్ర విషయం .


సహజంగా నే తపస్వి , వైరాగి అయిన శంకరుడు ఆ తర్వాత సంపూర్ణ బైరాగి గా మారుతాడు . సర్వం త్యజిస్తాడు . ఒక కమండలం, పీతాంబరంతో శివ ధ్యానం లోనే లీనం అయి ఉంటాడు . తన శక్తి తో సృష్టి ని భూత ప్రేత పిశాచాల నుంచి సంరక్షణ చేస్తూ ఉంటాడు. దుష్టశిక్షణ (వినాశనం) చేస్తాడు . ప్రేమను పంచుతాడు. సర్వుల లో ఉన్న వికారాలను దానం గా స్వీకరిస్తూ గరళం గా తన గొంతు లోనే దాచుకొని ఉంటాడు .

ఇందులో మనం గ్రహించవలసిన సూక్ష్మం చాలా ఉంది . 


శంకరుడు సంసారి అయినా కూడా  , ఆది నుంచి శివుని తపస్సు చేస్తూనే ఉండేవాడు . (ఈ విషయం  శంకరుని ఫోటో లో గమనించవచ్చు  ఎదుట శివ లింగం ఉండడం) . గృహస్థుడు , సంసారి అయిన శంకరుడు గృహస్థాశ్రమం లో ఉంటూనే తపస్సు చేసేవాడు . తన ధర్మం ఆచరించే వాడు . 


వాస్తవానికి బ్రహ్మ విష్ణు శంకరుడు ముగ్గురు శివుని యొక్క సృష్టి స్థితి లయం కోసం రూపొందించిన రూపాలు . 

ఇందులో ….. బ్రహ్మ , విష్ణువు యొక్క కర్తవ్యాలు బ్రహ్మ శివుని జ్ఞానాన్ని విస్తరించడానికి ఆధారమవుతాడు , విష్ణు సృష్టి పాలన చేయడానికి నియమితుడవుతాడు . కానీ శంకరుడు మాత్రం శివుని లక్షణాలను (నిరాడంబరం , వైరాగ్యం, ధ్యానం , ప్రేమ , కరుణ , సృష్టి సంరక్షణ) వంటి వాటిని ప్రతిబంబిస్తాడు.  అందుకే  శాస్త్రాలలో శివుడు శంకరుడు ఒకరే అని రాసేశారు. కానీ వాస్తవానికి శివుడు వేరు , శంకరుడు వేరు .


నేడు ఈ విషయానికి ఆధారం గమనిస్తే … భూమి పై భక్తి ప్రారంభం అయిన ద్వాపర యుగం నుంచి కూడా శివాలయాలు (శివలింగం) ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా శంకరుడికి ఆలయం లేదు . అనగా శంకరుడి విగ్రహం తో ఆలయం లేదు . కొన్ని చోట్ల మాత్రం ఆలయం పైన శంకరుడి రూపం పెడతారు కానీ గర్బగుడి లో మాత్రం శివుడు (శివలింగమే) ఉంటుంది . 

శంకరుడు దేవత , సూక్ష్మ దేహము ధరించి ఉన్న వాడు. 

శివుడు భగవంతుడు , దేహము లేని జ్యోతి శక్తి స్వరూపం.  శివుడు పరమాత్ముడు ( శాస్త్రాలలో ఈ స్పష్టత ఇవ్వక పోవడంతో , తెలియని తనంతో శివుడు శంకరుడు ఒకటే అని కలిపి కధలలో చెప్పడం వలన అదే ఒరవడి నడుస్తుంది .)


మనం గమనిస్తే ... మనకు విశేషంగా  భరత భూమి పై ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి . ఇవి ఎంతో విశేషత కలిగి ఉంటాయి. కానీ ఏ ఆలయం లోనూ కూడా శంకరుడి విగ్రహం కానీ , రూపం కానీ ఉండదు .  శివ లింగం మాత్రమే ఉంటుంది.


శంకరుడు గురించి ఇంత వివరణ ఎందుకు అంటే …. గృహస్థ ధర్మము ఆచరించి  , సంసారం లో యోగి గా అయి  ,  మనసున అతీతమైన వైరాగ్యం తో నెలవు అయినాడు  శంకరుడు . 

ఈ విధంగా నేడు గృహస్థ ధర్మం లో , సంసారం లో ఉన్న మానవ స్త్రీ పురుషులు కూడా భగవంతుని పై(శివ పరమాత్మ పై) భక్తి , జ్ఞానం , ధ్యానం వైరాగ్యం  , త్యాగం  స్థితులతో   ధ్యాని గా యోగి గా , లోక సంరక్షకునిగా , దుష్ట వికారాలను శిక్షిస్తూ  ,  శంకరుని లక్షణాలతో జీవించాలి అనేందుకు శంకరుడే ఆదర్శం .


భగవంతుని కోసం , దుఖ విముక్తి కోసం సంసారం విడిచి పెట్టి అడవులకు, ఆశ్రమాలకు , వెళ్ళి తపస్సు చేయనవసరం  లేదు.  సంసారం లో ఉంటూనే మనసు ను పవిత్రంగా చేసుకునే విధానమే భగవంతుని సహజ రాజయోగం  అనే విద్య ద్వారా తెలుస్తుంది . ఈ విషయం శివుడు రచించిన భగవద్గీత జ్ఞానం లో కూడ రచించబడి  ఉన్నది.


శంకరుడు వైరాగ్యానికి ప్రతీక . వైరాగ్యం అంటే అందరినీ విడిచి పెట్టడం కాదు. అందరిలో అన్నింటా ఉంటూనే మనసు ను ఎవరి పట్ల , ఏ వస్తు వైభవాల పైన మోహం లేకుండా అతీతంగా ఉంచుకోవడం.

అసలు సిసలైన వైరాగి శంకరుడు . 

శివుని యొక్క గీతా జ్ఞాన రచన ద్వారా  అర్దం చేసుకోవలసింది ఒకటే ,  శివుని ని చేరుకునేందుకు శంకరుడి జీవించిన విధానం మార్గదర్శకం అవుతుంది . అందుకే శివుడిని శంకరుడిని ఒకటే అని భావించిన కొందరు అనాది కాలంలో  శివుడు శంకరుడు ఒకటే అనేశారు .


మూలాలను  స్పృశిస్తే నే  సత్యం తెలుసుకోవచ్చు.

 

ఓం శాంతి ( నేను ఆత్మను. నా స్వధర్మం శాంతి)

శివ బాబా (శివుడే తండ్రి)

ఓం నమఃశివాయ ( ఆత్మ నైన నేను పరమాత్మ శివుని కి నమస్కరిస్తున్నాను)


యడ్ల శ్రీనివాసరావు 13 Sep 2026 , 9:30 AM.

Tuesday, September 8, 2026

782. గుడిలో రహస్యాలు

 

గుడిలో రహస్యాలు 


మనం గుడి కి వెళ్ళినప్పుడు ముందుగా ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేస్తాం . అలా తప్పని సరిగా చేయాలి అని పూజారులు, పూర్వీకులు చెపుతూ వచ్చారు . కారణం అడిగితే , 3 ప్రదక్షిణలు చేస్తే ముల్లోకాలు తిరిగి నట్టు, చేసిన పాపాలు తొలగుతాయి అని అంటారు. ఆ నమ్మకం తో ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది .  మరి కొందరికి ఈ ప్రదక్షిణలు ఎందుకు చేయాలో కూడా అర్దం తెలియదు . 

నిజం గా అలా చేయడం వలన చేసిన పాపాలు తొలగుతాయా ? అంటే ముమ్మాటికీ కాదు. 


కానీ ఇందులో దాగి ఉన్న వాస్తవం వేరే ఉంది.

గుడికి వెళ్ళే వరకు కూడా , మనం అనేక ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాం . అవి నిత్య కార్య వ్యవహారాలు , గృహస్థ వ్యాపకాలు , ఇంకొక అడుగు ముందుకు వేస్తే జీవితంలోని ఆందోళనలు అలజడులు తో ప్రతి క్షణం మనసు కొట్టుమిట్టాడు తుంది. ఈ స్థితి లో మనం కొంత నెగెటివ్ వైబ్రేషన్స్ ని కలిగి ఉంటాం . 

ఆలయం లోని భగవంతుడి దగ్గరకు ప్రశాంతత కోసం, దుఖ విముక్తి కోసం లేదా కోరిక నెరవేర్చమని అడగడానికి వెళ్తాం . 

భగవంతుని దర్శనం చేసుకొనే ముందు మనం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్న సమయంలో , మన బుద్ధి బయట ప్రాపంచిక ఆలోచనల నుంచి క్రమేపీ మారుతూ భగవంతుని పై దృష్టి సారించడం జరుగుతుంది . ఆలయం లోని గోడలు, శిల్పాలు చూస్తూ ప్రదక్షిణ చేయడం వలన అంతరంగం లో ఆలోచనల అలజడి తగ్గి మనసు సాధారణ స్థితికి వస్తుంది. ఆ పిదప మనం భగవంతుని దర్శనం చేసుకొనే సమయం లో ఏకాగ్రత తో మన సంకల్పాలు నివేదించడానికి మనో స్థితి సిద్దం అయి ఉంటుంది. ఇదే ప్రదక్షిణ లోని దాగి ఉన్న సూక్ష్మం. 

అలా కాకుండా, మనసు యొక్క దృష్టి ఎక్కడో పెట్టి గుడిలోని కి వెళ్లి రావడం వలన పొందే ఫలితం శూన్యం. 


🌹🌹🌹🌹🌹🌹



గుడిలో గంట కొడితే భగవంతుని కి వినిపిస్తుంది, మనం గుడికి వచ్చిన సంకేతం భగవంతుని కి చేరుతుంది అని , అందుకే గంట కొట్టాలి అని అనేకులు  అనుకుంటారు . 

కానీ ఈ అంశం లో ఇమిడి ఉన్న  సూక్ష్మం వేరు . 

గుడిలో గంట పంచ లోహల తో తయారు చేయబడుతుంది . అది మ్రోగించడం వలన వెలువడే శబ్ద తరంగాలు  హెచ్చు స్థాయి  ఫ్రీక్వెన్సీ తో వెలువడుతుంటాయి . అవి  మన  శరీరం పై  పడి    ఆ ప్రభావం చేత  మెదడుని  ఆలోచనలను  ఉత్తేజం గా చేస్తాయి . 

ఆ గంట ద్వారా వచ్చే లోహల యొక్క శబ్ద తరంగాలు , అప్పటి వరకు మనలో ఉన్న ఒత్తిడి ని తొలగించి మనసు ను పరవశింప చేస్తాయి . 


🌹🌹🌹🌹🌹



గుడిలోని జడవిగ్రహ మూర్తి ని అంగ రంగ వైభవంగా అలంకరిస్తారు . అదే భగవంతుడి యధార్థ రూపం అని మనసు లో ముద్రించుకుంటాం . కానీ అంతలోనే భగవంతుని కి హరతి ఇస్తారు . ఆ హరతి ని కళ్ళకు అద్దుకుంటాం , వచ్చెస్తాం . కానీ అసలు హరతి ఎందుకోసం అనేది ఆలోచించం .

ఈ విషయం లో దాగి ఉన్న సూక్ష్మం . . .

 భగవంతుడు  చైతన్యమైన  వెలుగు , జ్యోతి ప్రకాశం . మనిషి లోని అజ్ఞానం , దుఃఖం అనే చీకటిని పారద్రోలే వాడు భగవంతుడు.  అంతే కానీ జడవిగ్రహ రూపం కాదు. 

ఆ హరతి జ్యోతి  బిందు రూపుమే పరమాత్మ స్వరూపం . 

అందుకే  హరతి ని మన రెండు కనుల మధ్య ఉన్న భృకుటి స్థానం లో విరాజమానమై ఉన్న మన ఆత్మ కోసం , చేతులతో అద్దుకుంటాం . ఆ హరతి మన కళ్ళ కోసం కాదు , మన ఆత్మ కోసం . 

మన ఆత్మ కి తెలుసు పరమాత్మ ఎవరు అనేది .  కానీ మన బుద్ధి . ‌. .  దేహ భావం తో   అజ్ఞానం  మాయ లో పూర్తిగా కూరుకుపోయి ఉండడం వలన మన శరీర స్పృహ  ఈ సత్యం గ్రహించదు . అసలు మనలో ఆత్మ ఉంది అనే విషయమే గ్రహించకుండా అనేక జన్మలు గడిపెస్తాం .

హరతి తీసుకున్న తరువాత 3 సార్లు మీ చుట్టూ మీరు ప్రదక్షిణ చేయమని పూజారి చెపుతారు. దాని అర్థం , మన లో ఉన్న ఆత్మ చుట్టూ మన శరీరం ప్రదక్షిణ చేయడం. దీనినే ఆత్మ ప్రదక్షిణం సమర్పయామి అని పూజారి అంటారు . మన శరీరాన్ని నడిపించే చైతన్య శక్తి మన ఆత్మ . 


ఓం శాంతి  (ఆత్మ యొక్క స్వధర్మం శాంతి)

శివ బాబా (శివుడు తల్లి తండ్రి)

ఓం నమఃశివాయ (ఆత్మ నైన నేను పరమాత్మ శివుని కి నమస్కరిస్తున్నాను 🙏)


యడ్ల శ్రీనివాసరావు 9 Sep 2026 6:00 AM.

Friday, September 4, 2026

781. రాజయోగ ఫలాలు - 4

 


🌸 వైరాగ్యం అంటే అందరికీ దూరం కావడం కాదు . . . 

అది  అంతర్గత స్వేచ్ఛ. 🌸


నేను ఇతరుల ఆలోచనలను వారు చేసే చర్యలను నియంత్రించలేను , కానీ వాటికి నేను ఎలా స్పందించాలో ఎంచుకోగలను . ప్రతి ఒక్కరినీ స్వచ్ఛమైన హృదయంతో ప్రేమిస్తాను , అయితే ఆత్మస్మృతిలో  స్థిరంగా ఉంటాను . 

ఇతరుల ప్రవర్తన  ఇకపై  నా ఆలోచనలను నియంత్రించనప్పుడు  , శాంతి నా సహజ స్వభావంగా  మారుతుంది.


🌹🌹🌹🌹🌹



జీవితంలో తుఫానులు ( ఇబ్బందులు , కష్టాలు , అవమానాలు , నిందలు , నమ్మక ద్రోహలు ) రావడం సహజం. కానీ వాటి  తాలూకు బాధను  మనసులో స్థిరపడనివ్వడం  తప్పనిసరి  కాదు.


గొప్ప సిద్ధత (సాధించడం)  అంటే  మన పరిస్థితులను  బలపరచడం  కాదు . మన చైతన్యాన్ని శక్తివంతం చేసుకోవడం . ప్రతిరోజూ మన స్వీయ గౌరవం తో ,  శివుని స్మృతి తో  మన మనసును శాంతితో నింపుకుందాం . 


శాంతియుతమైన మనస్సు  సవాళ్లు (ఛాలెంజెస్) రాకుండా  ఆపలేదు , కానీ వాటిని మన అంతరంగంలో  స్థిరపడనివ్వదు . 


ఆత్మ ఇప్పటికే శాంతితో నిండిపోయి ఉంటే, తుఫానులు  దానిని  కదిలించే శక్తిని కోల్పోతాయి. తుఫానులు  మన జీవితంలోకి వచ్చి వెళ్లవచ్చు, కానీ మన మనసులో శాశ్వత నివాసం ఏర్పరచుకోలేవు .


ముందుగా  మన  అంతరంగిక   ప్రపంచాన్ని రక్షించు కుందాము . అప్పుడు బయట ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని ఎదుర్కోవడం మరింత సులభమవుతుంది.


🌹🌹🌹🌹🌹



ప్రతి పరివర్తనకు (మార్పు) ఆరంభం ఒక పవిత్రమైన ఆలోచన  సంకల్పంతోనే  జరుగుతుంది.

ధైర్యం యొక్క ఒక అడుగు అంటే . . . 

*సౌకర్యాన్ని కాదు , సత్యాన్ని ఎంచుకోవడం.

 *క్రోధాన్ని కాదు ,   శాంతిని ఎంచుకోవడం .

 *అహంకారాన్ని కాదు , క్షమను  ఎంచుకోవడం.

 *ఆకర్షణను కాదు , పవిత్రతను ఎంచుకోవడం . 

  *భయాన్ని కాదు ,  పరమాత్మ  స్మృతిని ఎంచుకోవడం . 

అంతే . . . ఆ ఒక్క అడుగు మనది. మిగిలినదంతా పరమాత్మదే .


మన సంకల్పం సత్యమైనదిగా , పవిత్రమైనదిగా ఉన్నప్పుడు  , పరమాత్మ . . .  

మౌనంలో మనసుకు శక్తిని ,  బుద్ధికి  స్పష్టతను , హృదయానికి  ధైర్యాన్ని , జీవితానికి సరైన దిశను ఇవ్వడం ప్రారంభిస్తారు. అసాధ్యంగా అనిపించినదే  క్రమంగా సులభంగా మారడం ప్రారంభమవుతుంది.


ఈ రోజు పరమాత్మ వైపు ఒక సత్యమైన అడుగు వేయండి. అప్పుడు చూడండి, వారి వేలాది అడుగుల సహాయం మీ జీవితాన్ని ఎలా మార్చివేస్తుందో !


🌹🌹🌹🌹🌹



నిజమైన స్వ గౌరవం (స్వమానం) అనేది ఇతరుల ప్రశంసలు, ఆమోదం , మన వేషధారణ లేదా తాత్కాలిక అభిప్రాయాల మేళవింపు పై ఆధారపడి ఏర్పడదు.


నిజమైన  ఆత్మ విలువ   మనం  ఈ భౌతిక ప్రపంచంలో  నిత్యం పోషించే  జీవిత పాత్రల నుండి అతీతంగా అయి . . .  స్వచ్ఛమైన , ప్రశాంతమైన ఆత్మగా,  దివ్య కాంతి   యొక్క  ఒక కిరణంగా  మన శాశ్వతమైన  స్వరూపాన్ని  మేల్కొలిపినప్పుడు  ప్రారంభమవుతుంది.


అపరిశుభ్రమైన కొలను నీటిలో ఉన్నప్పటికీ  హంస ఎలా పరిశుభ్రంగా , ప్రశాంతంగా ఉంటుందో  . . . అలాగే ఈ కలుషిత భౌతిక మాయా ప్రపంచంలో ఉంటూనే . . .  సత్యాన్ని అసత్యం నుండి వేరు చేస్తూ , మనం శాశ్వత ఆధ్యాత్మిక స్వరూపంతో శివ పరమాత్మ తో అనుసంధానమై ఉండటం వలన  మనలో ఎవరూ కదిలించలేని  అంతర్గత శాంతి  సుస్థిరపడుతుంది . 


🌹🌹🌹🌹🌹

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యాబుద్దులు నేర్పించిన నా ఉపాధ్యాయులకు మరియు  విద్యాబోధన చేసే ఉపాధ్యాయులు అందరికీ నా నమస్కారములు 🙏 


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 

బ్రహ్మ కుమారీస్ డెస్క్ 

యడ్ల శ్రీనివాసరావు. 5 Sep 2026  9:00 AM.


Monday, August 31, 2026

780 . రాజయోగ ఫలాలు - 3



గతంలో మనకు ఎదురైన అనుభవాలు జీవితానికి లోతైన పాఠాలను నేర్పుతాయి . అయితే వాటిని పదేపదే గుర్తుచేసుకుంటూ మనసుపై భారంగా మోసుకెళ్లాల్సిన  అవసరం లేదు. పొందిన పాఠాన్ని జీవితంలో తప్పనిసరిగా ఆచరిద్దాం, మనల్ని మనం క్షమించుకుందాం . 

గతం లోని  అనుభవానికి , సూక్ష్మం లో  గ్రహిస్తే దాని కర్త  కర్మ  క్రియ మనమే . అది ప్రస్తుత లేదా గత జన్మలలో చేసిన కర్మల ఫలితం . 

ప్రస్తుతాన్ని  శాంతి, అవగాహన మరియు సానుకూలత తో  జీవించడం ఉత్తముల లక్షణం.


🌹🌹🌹🌹🌹




మీ విలువను నిరూపించుకోవడానికి ప్రపంచం వెంట పరుగెత్తాల్సిన  అవసరం ఎప్పుడూ లేదు. 

మీ అసలైన విలువను . . ‌ శాంతిమయమైన , శక్తివంతమైన ఆత్మగా . . . మీరు గుర్తుంచుకోవడం మాత్రమే అవసరం. 


మీరు ఆత్మిక అవగాహనతో (నేను ఆత్మను) జీవించినప్పుడు , మీ ఆలోచనలు ఉన్నతంగా , మీ చర్యలు శక్తివంతంగా మారతాయి. 

మీ ఉనికి  మీ విధినే  మార్చడం ప్రారంభిస్తుంది.

అప్పుడు జీవితం కూడా భిన్నంగా స్పందిస్తుంది.

సరైన వ్యక్తులు , సరైన అవకాశాలు , సరైన పరిస్థితులు  సరైన సమయంలో  మీ జీవితంలోకి రావడం  ప్రారంభిస్తాయి .  అవసరం లేని వాటన్నింటి  నుండి  విముక్తి లభిస్తుంది . 


వెంటపడాల్సిన  అవసరం లేదు.

ఆత్మన్యూనత  అవసరం లేదు.

పోరాటం   అవసరం  లేదు.

కేవలం ఆత్మగౌరవం , భగవంతుని తోడు మరియు మీ నిజమైన స్వరూపంలో  ఉండే నిశ్శబ్దమైన శక్తి  మాత్రమే  మీ సంపూర్ణ బలం .

ఇది అదృష్టం వలన ఏర్పడేది కాదు. 

ఇది ఆత్మ యొక్క చైతన్యం మరియు సహజ సిద్ధమైన మైన నియమం. 


🌹🌹🌹🌹🌹



ప్రతి రోజు చివరిలో మీ సంపాదన మీ జేబులోని లెక్కను మాత్రమే తెలియజేస్తుంది.

కానీ మీ కర్మలు మీ జీవితానికి నిజమైన విలువను తెలియజేస్తాయి.

ఈ రాత్రి నిద్రపోయే ముందు మీతో మీరు ప్రశ్నించుకోండి.

“ఈ రోజు నేను ఎవరి మనసును తేలికపరిచాను?”

“ఎవరి ముఖంపై చిరునవ్వు తీసుకువచ్చాను?”

“నా వల్ల ఈ రోజు ఎవరు ఆప్యాయతను అనుభవించారు?”

ఒక మధురమైన మాట...

కొంచెం సహనంతో ఉండటం...

ఎవరైనా చెప్పేది శ్రద్ధగా వినడం...

లేదా ఎవరికైనా చిన్న సహాయం చేయడం...

ఇలాంటి చిన్న చిన్న మంచి కర్మలే జీవితంలో అతి పెద్ద సంపాదనగా మారుతాయి.

పదవి, ధనం , పరిచయాలు - కాలంతో పాటు కనుమరుగైపోతాయి.

కానీ, నిస్వార్థమైన ప్రేమతో చేసిన మంచి కర్మలు మాత్రం ఆత్మతో పాటు ప్రయాణిస్తాయి.



ఓం శాంతి 

ఓం నమఃశివాయ 

# బ్రహ్మకుమారీస్ డెస్క్

యడ్ల శ్రీనివాసరావు 30 Aug 2026 10:30 AM


786. ఉత్తమ శిల

  ఉత్తమ శిల  ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు . అతడు ఒక రోజు పక్క ఊరికి పని మీద వెళ్ళి తిరిగి వస్తుంటే , ఊరి పొలిమేర లో ఒక నిర్మానుష్య ప్రదేశం...