గురువు . . . జ్ఞానం మనిషి కి అవసరమా?
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
• భగవంతుడు సృష్టించిన విశ్వంలో ఖగోళం అత్యంత అద్బుతం . నక్షత్రాలు , ఉల్కలు, తోకచుక్కలు , పాలపుంతలు , నవ గ్రహాలు వాటి తో పాటు అనేక చిన్న చిన్న గ్రహాలు వేటికవే ఒక విలక్షణమైన మహా శక్తిని సంతరించుకుని ఉన్నాయి . ఈ శక్తి ప్రభావం ఒకదాని నుంచి మరొక దానిపై పడుతూ విశ్వం అంతా వ్యాపించి ఉంటుంది .
• ఇక గ్రహాల విషయానికి వస్తే భూమి ఒక గ్రహం . ఈ భూమి పై పడే విశ్వం యొక్క (గురుత్వాకర్షణ) శక్తి ప్రభావం వలన భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే , ఒక నిర్దిష్ట కక్ష్యలో తిరుగుతూ సూర్యుడు చంద్రుడు మరియు మిగిలిన గ్రహల చుట్టూ తిరుగుతుంది. ఇది సైన్స్ ద్వారా నేటి తరాలకు తెలిసిన వాస్తవం .
• భూమి విద్యుదయస్కాంత శక్తి కలిగి ఉండడం వలన భూమి పై నివసించే ప్రతి జీవి , నిర్జీవి , చెట్టు పుట్ట పక్షులు జంతువులు ఇవన్నీయు కూడా విశ్వ శక్తి ఆధారంగానే జీవిస్తాయి .
మనం విశ్వం లో ఒక భాగం. అంతే కానీ మనమే సమస్త విశ్వం కాదు . ఇదంతా ఎందుకు అంటే , గ్రహాల యొక్క శక్తి ప్రభావం తప్పకుండా ఈ భూమి పై ఉన్న ప్రతి మానవుని పై ఉంటుంది . ఈ గుప్త విజ్ఞానాన్ని జ్యోతిష శాస్త్రం లో వేల సంవత్సరాల క్రితమే పరాశర మహర్షి పొందుపరిచారు .
జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి , బృహస్పతి Jupiter ఒక ప్రత్యేక గ్రహం . దీనిని గురు గ్రహం అంటారు . నవ గ్రహాలలో గురు గ్రహాం అత్యంత ప్రాముఖ్యమైనది . అందుకే మనకు ఉన్న రోజులలో గురు వారం (లక్ష్మి వారం) ఒక విశిష్టత సంతరించుకున్నది .
• ఒక ఆత్మ , భూమి పైకి వచ్చి శరీరం ధరించి జన్మించినపుడు అది జీవాత్మ అవుతుంది . మనం జీవాత్మలం . జీవాత్మ (మనిషి) నివసించడానికి . . . జీవించడానికి అవసరమైన జీవన విధాన శక్తి ని ఇచ్చేది గురు గ్రహం అయిన బృహస్పతి . బృహస్పతి ని దేవతలకే గురువు అంటారు . బృహస్పతి జ్ఞానం మేధస్సుకు ప్రతీక .
• ఒక మనిషి , జీవించడానికి కావలసిన అనుకూల జ్ఞాన శక్తి, గురు గ్రహం బృహస్పతి ద్వారా విశ్వం నుంచి లభిస్తుంది . జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనిషి కుండలినీ లో బృహస్పతి , గురుగ్రహ బలం ఎలా ఉందో గమనించి , ఆ మనిషి జీవిత నడవడిక జ్ఞాన సంస్కార విధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనిషి కి బృహస్పతి శక్తి బలం గా ఉంటే , ఏ విఘ్నాన్ని అయినా ధైర్యం గా ఎదుర్కొని , సమస్య ను పరిష్కరించుకునే జ్ఞానం , సామర్థ్యం వ్యక్తి కలిగి ఉంటాడు . గురు శక్తి బలహీనంగా ఉంటే అజ్ఞానంతో సమస్యలు సృష్టించుకుంటూ , పాప కర్మలు చేస్తుంటాడు . గురు శక్తి తక్కువగా ఉన్న వారికి జీర్ణ కోశ సమస్యలు తరచూ వేధిస్తూ అధికంగా ఉంటాయి .
మానవుడు గత జన్మల లో చేసిన పాప పుణ్య కర్మలు, సంస్కారాల ఆధారం గా నేటి జన్మలో గురు గ్రహ బలం, జీవన స్థితి ఆధారపడి ఉంటాయి . గ్రహాలు అన్ని కూడా ఒకో విశిష్టత కలిగి ఉంటాయి . వాటి శక్తి , బలం బలహీనతల ప్రభావం వలనే మనిషి స్థితి గతి ఉంటుంది . ఇందు ముఖ్యమైనది గురు గ్రహం , తద్వారా పొందే జీవన జ్ఞానం , మేధస్సు .
🌹🌹🌹🌹🌹
• సాధారణంగా , ఈ భౌతిక ప్రపంచంలో గురువు అంటే పాఠాలు చెప్పే టీచరు అని , కాలేజిలో లెక్చరర్ అని , పి.హెచ్.డి. లో ప్రొఫెసర్ అని భావిస్తారు . కొందరు అయితే తమకు జీవనోపాధి వృత్తిని నేర్పించిన వారిని గురువు గా భావిస్తారు. ఈ విధంగా గౌరవించడం మంచిదే . కానీ వాస్తవానికి వీరెవరూ పరిపూర్ణత నిచ్చే గురువులు గా కాలేరు.
గురువు అంటే జీవితానికి సంపూర్ణ మార్గదర్శి . పైన ఉదాహరించిన వారు కేవలం చదువు లోను , వృత్తి లోను , వారికి తెలిసిన ఒక పరిమితి తో కూడిన విద్య ను మాత్రమే బోధిస్తారు . వారు హద్దు లోని గురువులే కానీ జీవితానికి సంపూర్ణ అనంతమైన మార్గదర్శకులు కారు.
• మనిషి జీవిత అంతిమ దశ వరకు కావలసిన జ్ఞానాన్ని మార్గాన్ని దిశను పైన ఉదహరించిన వారెవరూ చూపలేరు , అది కొంతవరకు ఆధ్యాత్మిక గురువు కి సాధ్యం . . . అంతకు మించి సంపూర్ణ జ్ఞానం ఇవ్వగలిగిన వారు ఒక్క సద్గురువు మాత్రమే . సద్గురువు అంటే పరమాత్మ శివుడు , గీతా జ్ఞాన రచయిత . అందుకే శివుని నుంచి జ్ఞాన సాగరుడు అంటారు .
శరీరం ధరించి ఉన్న , ఏ మానవమాత్రుడైనా గురువుగా అయి ఉండవచ్చు కానీ, అతడు సద్గురువు కాడు , కాలేడు . సద్గురువు జనన మరణాలకు అతీతుడు. అతడే శివుడు.
• కలియుగం పూర్తి పతిత ప్రపంచం, కలియుగం లో మానవ జన్మ తీసుకున్న ఏ మనిషి పవిత్రుడు కాడు . ఎందుకంటే మానవుడు జన్మ తీసుకున్న విధి విధానం లోనే విషయ వికారాల కర్మ దాగి ఉంది . అందుకనే ఓ పతిత పావన రండి అని భగవంతుడిని అందరూ పిలుస్తారు. దీని అర్థం పతితులు గా ఉన్న మమ్ము పావనం గా తయారు చేయండి అని.
పవిత్రంగా పావనం గా కావలసింది దేహం ధరించిన వారి ఆత్మ . ఆత్మ లోని మనసు, బుద్ధి , ఆలోచన , కర్మలు , సంస్కారాలు . అంతే కానీ శరీరం కాదు, మానవుని గా జన్మించిన ఏ మనిషి శరీరం కూడా పవిత్రం కాదు, కాలేదు.
కానీ శివుడు పరమ పవిత్రుడు , జనన మరణాలు కు అతీతుడు . శివుడు జన్మించడు , అవతరిస్తాడు . పరమ పవిత్రుడైన శివుడే సద్గురువు . భక్తి మార్గం లో శివుని సద్గురువు గా దక్షిణా మూర్తి గా కీర్తిస్తారు .
ఇదంతా మానవ రూపంలో ఉన్న గురువు కి , దైవ రూపం లో ఉన్న సద్గురువు కి మధ్య ఉన్న వ్యత్యాసం తెలియ చేయుట కోసం మాత్రమే
🌹🌹🌹🌹🌹
• ఒక మనిషి కుండలి లో బృహస్పతి, గురు బలం తక్కువ ఉన్న వారు తప్పని సరిగా గురువారం రోజున శివాలయం సందర్శించాలి . శివుని గురువు గా తలచి శివ స్మృతి , శివ ధ్యానం చేయాలి . దక్షిణామూర్తి స్తోత్రం ఉదయం సాయంత్రం జపిస్తే గురు బలం (శక్తి) పెరుగుతుంది. దాన ధర్మాలు , హోమాలు జపాలు వలన ధనం వృధా చేసుకోవడం మినహా ఏమీ ఉండదు . కొందరు తమ జీవన భృతి కోసం అవి చేయమని అనాదిగా చెపుతూ ఉంటారు , వీలైతే ఉడికించిన కేజీ శెనగలు, పావు కేజీ బెల్లం కలిపి ఆవుకి గురువారం రోజున తినిపించండి .
కొందరు మనుషుల కి ఉన్న గ్రహల బలం, శక్తి లోపం వలన కలిగే ఈతిబాధలు , సమస్యలు , బలహీనతలు, అనారోగ్యాలు , అజ్ఞానం . . . ఈ లోకంలో మరికొంత మంది కి జీవన ఆధారం . ఇదే కలియుగం లోని మాయా దౌర్భాగ్యం .
ఈ గ్రహల బలం, శక్తి లోపం మన లో ఏర్పడి ఉండడానికి కారణం, గత జన్మల లో కానీ , నేటి జన్మలో కానీ తెలిసీ తెలియక చేసిన పాప కర్మలు.
• బృహస్పతి గురు బలం(శక్తి) నిండుగా ఉన్న వారి జీవితం మంచి నడవడిక ద్వారా సంపూర్ణత సాధిస్తుంది. వారు నిస్వార్థం గా తమకు తోచిన రీతిలో ఇతరులకు మేలు చేసే వారుగా ఉంటారు . వృత్తి రీత్యా కొందరు , సేవ రీత్యా కొందరు గురువులు గా అయి ఉంటారు .
జ్ఞానం సూక్ష్మ ధనం . కంటికి కనపించదు.
కరెన్సీ స్థూల ధనం . కంటికి కనిపిస్తుంది.
స్థూల ధనం (కరెన్సీ) కలిగి ఉన్నంతలో జీవుడికి పరిపక్వత సంపూర్ణత మోక్ష సిద్ది కలుగదు . జ్ఞానం ఉన్న వారికి , స్థూల ధనం ధర్మం యుక్తంగా దానంతట అదే చేరుతుంది .
ఈ జన్మలో సంపాదించిన స్థూల ధనం (కరెన్సీ) మరు జన్మకు పనికిరాదు .
కానీ, ఈ జన్మలో సంపాదించుకున్న జ్ఞాన ధనం అనేక జన్మల వరకు నీ ఆత్మతో కలిసి ఉంటుంది.
• నీ లోని సత్యాన్ని కొనుక్కొని , ఆ సత్యం తో పాపపుణ్యాలను మరియు నీవు నిర్వర్తించ వలసిన బాధ్యత ధర్మం తెలుసుకొని ఎలా జీవించాలి అనేదే జ్ఞానం యొక్క పరమార్థం . అంతే కానీ, జ్ఞానం అంటే శ్లోకాలు, పద్యాలు , కీర్తనలు , ఢాంభికాలు , ఆడంబరాలతో కూడిన గంఢపేరుండాల వేషధారణ ప్రదర్శించడం కాదు .
సత్యమైన జ్ఞాని ఎన్నడూ గుర్తింపు ఆశించడు. గుర్తింపే వెతుక్కుంటూ జ్ఞాని యొక్క పాదాల చెంతకు చేరుతుంది . గుర్తింపు అనేది మాయా ఆడంబరం, అదే జ్ఞాని పతనానికి మూలం.
జ్ఞాని నిరాడంబర జీవనం తో తన మనసు యొక్క శిఖరాన్ని అధిరోహించగలడు . ఆ శిఖరం పైనే పరమాత్మ శివుడు కొలువై ఉంటాడు .
జ్ఞానం , మానవుని జీవిత నావను పెను తుఫానుల నుంచి అత్యంత సులభంగా తీరం దాటిస్తుంది . జ్ఞానం తెలుసుకోవడమే కాకుండా ఆచరించడం ప్రధానం, ఆ జ్ఞానాన్ని ఇతరులకి పంచడమే ఉత్తమ పురుషార్థి లక్షణం .
గురు బలం సమృద్ధిగా ఉన్నవారు (knowledge) జ్ఞానం అర్జించగలరు. అనగా తెలుసుకోగలరు .
జ్ఞానం మానవుని లోని బుధ (Mercury బుద్ధి , తెలివి) గ్రహ శక్తి ని వృద్ధి చేస్తుంది . తద్వారా వివేకం (wisdom) పెరుగుతుంది . వివేకవంతుడు ఏ సమయం లో ఎలా ప్రవర్తించాలో , ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో గురు జ్ఞానం తో పొందిన విషయాలను అనుభవాలు గా మార్చుకుంటాడు.
జ్ఞాని మాత్రమే వివేకి గా మారగలడు . గమనించ వలసిన విషయం జ్ఞానం (knowledge) వేరు , వివేకం (wisdom) వేరు .
నేటి కాలం మానవుడు అజ్ఞానం తో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాడు . దీనికి ప్రధాన కారణం మనసు . మనసు స్థిరత్వం లేకపోవడం వలన భయం ఆందోళన అలజడి అభధ్రత పెరిగి మానసిక రోగిగా జీవించడం జరుగుతుంది. దీనికి కారణం సత్యం వాస్తవం తెలుసుకో లేకపోవడం . ఇదే అజ్ఞాన బీజం .
ఒక నిస్వార్థమైన ఆధ్యాత్మిక గురువుని (ధనం ఆశించని , సేవా తత్పరుడు) ఆశ్రయించడం వలన మనిషి కి జ్ఞాన మార్గం , జీవన మార్గదర్శకం లభిస్తుంది . కానీ ఈ మాయా లోకం లో అటువంటి సత్యమైన గురువులు అరుదు గా ఉంటారు . గురువు లభించక పోతే , మంచి ఆధ్యాత్మిక పుస్తకాల పఠనం ద్వారా కొంత జీవన జ్ఞానాన్ని ఆర్జించ వచ్చు .
ప్రపంచ వ్యాప్తంగా 175 దేశాలలో బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయానికి సంబంధించిన సహజ రాజయోగ మెడిటేషన్ సెంటర్లు అనేక వందలు ఉన్నాయి . పరమాత్మ శివుని యొక్క సంపూర్ణ గీతా జ్ఞానం ఈ సెంటర్లలో పూర్తి ఉచితంగా , ఆయా భాషలలో ప్రతీ రోజూ ఒక గంట సమయం చెపుతారు . శివుని జ్ఞానం తో పాటు ధ్యానం నేర్పిస్తారు . సమీపం లో ఉన్న వారు , గురు బలం పెంచుకోవాలి అనుకునే వారు, సద్గురువు అయిన శివుని తో ప్రత్యక్ష బంధం ఏర్పరచు కోవాలి అనుకునే వారు , జీవితం లో మంచి మార్పు కోరుకునే వారు తప్పకుండా సహజ రాజయోగ మెడిటేషన్ వినియోగించుకోవచ్చు . ఇది పూర్తిగా ఉచితం .
ప్రతి మనిషి ఆనందంగా సంతోషంగా జీవించాలి అంటే , ముందు గా తన గురించి తాను తెలుసుకోవాలి. అందుకు తప్పని సరిగా సత్యమైన నిస్వార్థమైన ఆధ్యాత్మిక గురువు అవసరం . దేహదారి గురువు లేకుండా , సద్గురువు అయిన శివ పరమాత్మ ను చేరలేము.
శివుని నిత్యం స్మృతి చేస్తూ ఉంటే , ఏదో నాడు తప్పక సత్యమైన దేహదారీ గురువు లభిస్తాడు .
గురువులను కీర్తించక పోయినా , గౌరవించక పోయినా పర్వాలేదు కానీ పొరపాటు న కూడా నిందించకూడదు . అలా చేస్తే మహా పాపం తయారవుతుంది .
ఓ మనిషి . . . ఈ భౌతిక ప్రపంచంలో, నీవు సంతృప్తుడుగా అయి , నీ జీవిత నావ సజావుగా తీరం దాటాలి అంటే తప్పని సరిగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న సత్యమైన , నిస్వార్థమైన , నిరాడంబరమైన గురువు యొక్క జ్ఞానం అవసరం . లేదంటే, ఈ లోకం అంతా విస్తరించి ఉన్న మాయ వలలో చిక్కుకుని మరెన్నో జన్మలు నిరాశ నిస్పృహ ల మధ్య కొట్టాడు తూ జీవించ వలసి వస్తుంది .
• ఉన్నాడా ఉన్నాడా
నీ కంటూ ఓ గురువున్నాడా
మనిషి ఓ మనిషి . . .
• గురువు అంటే దైవం
గురువు అంటే సన్మార్గం.
• గురువు లేని జీవితం
చుక్కాని లేని నావ పయనం .
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
ఓం శాంతి
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 20 July 2026 , 10:15 PM.













