Friday, January 16, 2026

715. బలహీనతలే - లోపాలు - శాపాలు

 

బలహీనతలే - లోపాలు - శాపాలు



• మనిషికి తన బలహీనతలే లోపాలు శాపాలా ?

  అవును ముమ్మాటికీ . . . మనిషి కి  తన  లోలోని  బలహీనతలే  లోపాలు గా   అయి  శాపాలు గా మారుతాయి . ఇందులో  ఏ  సందేహమూ లేదు.


• మనిషి  బలహీనతలను   తన  స్పృహ కి (Continuousness) తెలియకుండా నే  బయటకు ఏదో రూపంలో  ప్రదర్శిస్తూ నే  తన   ప్రవర్తనను నిత్యం  కొనసాగిస్తూ  ఉంటాడు .  వాస్తవానికి ఈ బలహీనతలకు  మూలం  మనసు మరియు ఆలోచన . మానసిక పరిపక్వత (Maturity) లేనపుడు, మనసు పై  నియంత్రణ (Controlling) కోల్పోయి  మనిషి లో  బలహీనతలు దృఢం గా బీజం వేసుకుంటాయి. ఇందుకు ప్రధాన కారణం ఆలోచనల లో సమతుల్యం  లోపించడం .

 • మనిషి తన బలహీనతలను  తాను  అంత సులభంగా  ఆది లో  గుర్తించలేడు .  ఎందుకంటే  జనన మరణ చక్రంలో  తిరుగాడే  మనిషి కి , అనేక జన్మలు గా   అలవాటు పడి చేసిన కర్మలు , సంస్కార భూతమై  వారసత్వంగా సంక్రమించినవే ఈ బలహీనతలు .

  పైగా మనిషి ఆ బలహీనతలనే  తన బలం గా భావిస్తూ , జీవనం సాగిస్తాడు . చివరికి ఏదో రోజు తన బలహీనతల వలన విపరీతమైన నష్టం జరిగినపుడు మాత్రమే మేల్కొంటాడు . అప్పటికి జీవితకాలం గడిచిపోతుంది .

• బలహీనతలు అనేవి పూర్తిగా మానసికమైనవి . అవి శరీరం ద్వారా ప్రభావం చూపిస్తాయి . బలహీనతలు జీవన వికాసానికి అత్యంత అవరోధాలు.

బలహీనతలే మనిషి ఎదుగుదలకు నిరోధకాలు , అందుకే  తలపెట్టిన కార్యాలకు  విఘ్నాలు గా అవుతాయి  .


అసలు ఒక మనిషి యొక్క బలహీనతలు , తన ఎదుగుదలకు మరియు తాను తలపెట్టే కార్యాల పై  ప్రభావం ఉంటుందా ?  అంటే . . .

సమాధానం . . . ముమ్మాటికీ ఉంది.

మానసిక బలహీనతలు అనేవి మనిషి ఆలోచనల  ద్వారా  బుద్ధి లో  శక్తి లోపించడం వలన  ప్రేరేపిత మైన  నెగెటివ్ భావాలు . ఇంకా చెప్పాలంటే  ఇవి మనిషి లో   అంతర్భాగంగా విచ్చలవిడితనం తో   చలామణి  అవుతున్న నెగెటివ్ శక్తులు.


ఇద్దరు  మనుషుల  మధ్య  . . .  లేదా   ఒక మనిషి  ద్వారా  బాహ్య  ప్రపంచం లో జరుగుతున్న  ఏదైనా  ఒక సంఘటన కి  మధ్య కంటికి కనిపించని సూక్ష్మమైన అంశాలు రెండు ఉంటాయి. 

అది ఒకటి భగవంతుడు (దైవం, పాజిటివ్ నెస్) రెండవది మాయ (మిధ్య , నెగెటివ్ నెస్).  

ఈ రెండు కూడా మనిషి కంటికి ఏనాడూ కనపడవు. కానీ మనిషి కి ఆత్మానందం , దుఃఖం    . . .  ఆత్మ తృప్తి , అసంతృప్తి  అనే అనుభవాలను ఇస్తూ ఉంటాయి .

☘️ ☘️ ☘️ ☘️ ☘️

• ఎలా అంటే ఉదాహరణకు మొదటి అంశం అయిన దైవం  తీసుకుంటే . . . 

  ఒక మనిషి  దైవాన్ని , ధర్మాన్ని అనుసరించి హేతుబద్ధమైన  ఆలోచనలతో  జీవనం సాగించినపుడు  తన లోని బలహీనతలను సహజ సిద్ధంగా సునాయాసంగా అధిగమించి, ఎటువంటి పరిస్థితుల నైనా ఎదుర్కొని , తనకు ఎదురైన సమస్యలను తానే  పరిష్కరించుకుంటాడు . ఇక్కడ దైవబలం ఒక శక్తి గా , సహాయకారిగా  మనిషి కి తోడు అయి విజయునిగా  చేస్తుంది . 

 ఈ దశలో మనిషి  తన బలహీనతలను తాను స్వయంగా గ్రహించి, పరివర్తన చెంది అధిగమిస్తాడు . అందుకే బలహీనతలు లోపాలు గా అయి శాపాలు గా మారే విషయం ఈ దశలో ఉండదు.

☘️ ☘️ ☘️ ☘️ ☘️

• ఇక రెండవ అంశం తీసుకుంటే మిధ్య అనగా మాయ.  మాయ భౌతిక ఆకర్షణలకు , మానసిక మోహలకు , వికారాలకు , హద్దు లేని కోరికలకు , వ్యర్థ మైన విషయాల పట్ల ఆసక్తి , అసత్యమైన మాటల జీవనం , మోసపూరిత చేతలతో కూడిన జీవిత  విధానానికి దాసోహం అయినపుడు . . . ఇవన్నీ కలిసి  బలహీనతలు గా అయి  లోపాలు గా మారి ,  నెగెటివ్ శక్తి ని తనలో వృద్ధి చేసుకుంటాడు.   

ఇవి మనిషి మనసు లో అంతర్లీనంగా కలిసిపోయి  ఉండడం వలన , ఇవన్నీ తన ప్రవర్తన లో  బలహీనతలు  లోపాలు అని గ్రహించలేడు . ఎందుకంటే  మాయ  చాలా  శక్తివంతమైనది . మాయా వలన పోందే  మైకం మనిషి ని మానసిక అంధుడిగా  చేసేస్తుంది. క్రమేపీ  కొంత కాలానికి మనిషి లోని ఈ లోపాలే శాపాలు గా అయి  ఏదొక సమస్యలు , విఘ్నాలు  తరచూ కలగడం, తద్వారా దుఃఖం అనుభవించడం జరుగుతుంది. వీటినే మనిషి అనుకుంటాడు తనకు మాత్రమే అవరోధాలు , విఘ్నాలు కలుగుతున్నాయి అని , తలపెట్టిన ఏ పని సజావుగా సాగడం లేదని చింతిస్తాడు . వాస్తవానికి అది తన బలహీనతల లోని  నెగెటివ్ శక్తి  తిరగబడి తనకు  అవరోధం కలిగిస్తుంది  అని గ్రహించ లేడు .

మనిషి లోని మానసిక బలహీనతలను ఈ సృష్టి లోని భగవంతుడు , ప్రకృతి , పంచభూతాలు అంగీకరించవు . అందుకే అవి లోపాలు గా అయి తిరిగి మనిషి కి శాపాలు గా తయారవుతాయి. ఇందులో ఏ సందేహమూ లేదు.


☘️ ☘️ ☘️ ☘️ ☘️

మరి  బలహీనతలను అధిగమించడం ఎలా ?

• భగవద్గీత  జ్ఞానం  నిత్యం  వినడం ద్వారా మనిషికి  తనలోని బలహీనతలను  తాను  గుర్తించగలడు మరియు అద్దం లో తన ముఖం వలే తన అంతరంగం యొక్క యదార్ధ స్థితి మనిషి కి కనిపించగలదు .

  భగవంతుని తో కలిసి నిత్యం ధ్యానం చేయడం వలన  బలహీనతలను అధిగమించగలడు . ఈ పరివర్తన కేవలం జ్ఞాన మార్గంలో మాత్రమే సాధ్యం అవుతుంది,  భక్తి మార్గం లో  సాధ్యపడదు . ఎందుకంటే భగవద్గీత జ్ఞానం , మనిషి కి తానెవరో తన మూలం ఏమిటో  తెలియచేస్తుంది . దైవ ధ్యానం మనిషి  పరివర్తన కి  కావలసిన  శక్తిని సమకూరుస్తుంది.  

భక్తి మార్గం భగవంతుడిని కేవలం విగ్రహాలు, పూజలు , కోరికలు , అవసరాలు వరకే మనిషిని   పరిమితం చేసి అల్ప కాలిక ప్రాప్తి నిస్తుంది . భక్తి లో భగవంతుని యదార్ధ స్థితి కి  , భక్తుని మధ్య  అనంతమైన దూరం ఉంటుంది. 

జ్ఞాన మార్గం  సదా కాలిక  ప్రాప్తి నిస్తుంది . జ్ఞానంలో భగవంతుని తో కలిసి అడుగులు వేసే స్థితి  కలుగుతుంది. 


• భగవంతుడు మనిషికి  ఉన్నతిని సమకూర్చి పైపైకి ఎదుగుదలతో  తీసుకు వెళతాడు. ఎందుకంటే పరమాత్ముడు పైన ఉంటాడు . అందుకు నిదర్శనం భగవంతుని తలుచుకునేటప్పుడు  మనం తరచూ పైకి చూడడమే .

• మనిషి, మాయ కి దాసోహం అయి వశమైనపుడు అధఃపాతాళానికి   దిగజారిపోవడం  జరుగుతుంది. అందుకు నిదర్శనం తల దించుకుని  దుఃఖం తో  సమస్యలతో   దిగులు తో  నేలను చూస్తుండడమే.


• మనిషిని పాతాళానికి తీసుకు వెళ్లేది మాయ .     మనిషి ని  ఉన్నతంగా చేయగలిగే  వాడు   భగవంతుడు . 

• భగవంతుడు ఒక్కడే . అతడే శివ పరమాత్ముడు. శివుని యధార్థం రూపం ప్రకాశవంతమైన  జ్యోతి బిందు స్వరూపం .  

మాయ బహురూపి.  అనగా  అనేక  రూపాల వికారాల  ఆలోచనల తో  మనిషి ని  మైకం లో ముంచి కబళిస్తుంది . అందుకు నిదర్శనం గానే  శాస్త్రాలలో రావణాసురుడికి పది తలలతో  రాక్షసుడి గా చూపించారు . 

మాయ వలన బలహీనతలను పొంది ఉన్న మనిషిని  తిరిగి బలవంతుడి గా చేయ గలిగేది  గీతా  జ్ఞానం మాత్రమే .

• బలహీనతలు లోపాలు గా అయి, శాపాలు గా కాకముందే మేల్కోవడం  ప్రతి మనిషికి ఉత్తమం .


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 16 Jan 2026. 9:00 PM.



Sunday, January 4, 2026

714 . మనసు మాయ

 

మనసు మాయ 



• భ్రమ లలో    బ్రతుకు    భారము

  మనసా   ఓ   మనసా

  భ్రమ లలో    బ్రతుకు    భారము .


• భ్రమ చుట్టూ    భ్రమణమే   మాయ

  అది యే

  ఆనందపు   అల్లకల్లోలాల    లోయ .

• భ్రమ     కలిగించు     మోహము

  అది యే

  బుద్ధి లో    నిలిచేటి    వ్యామోహము.


• భ్రమ లలో     బ్రతుకు     భారము

  మనసా   ఓ    మనసా

  భ్రమ లలో   బ్రతుకు    భారము .


• నాది    నాదనుకొంటు

  నిమిషమైన   నిలువవు    మనసా .

• నేలను   విడిచిన   నాడు

  నీతోడు   నడిచేది    ఏదో   తెలుసా .


• మిధ్య లో    మునిగి   ఉన్న   మనసా

  భ్రాంతి లో    తేలుతున్నావు    తెలుసా.


• భ్రమ లలో    బ్రతుకు    భారము

  మనసా    ఓ    మనసా

  భ్రమ లలో    బ్రతుకు    భారము .


• నేత్రములు  చూసేవన్ని    నిజము  కాదు .

  మనో నేత్రం    తెరచిన  నాడు

  అది    నీకు    తెలియును .

• వీనులు   వినేవన్నీ    నిజము   కాదు .

  మౌనం తో    మెలిగిన  నాడు

  అది    నీకు   తెలియును .


భ్రమ లలో    బ్రతుకు    భారము

  మనసా   ఓ    మనసా

  భ్రమ లలో    బ్రతుకు    భారము .


వీనులు  = చెవులు 


యడ్ల శ్రీనివాసరావు 4 Jan 2026 1:30 PM.

Sunday, December 28, 2025

713 . శివానుభవం

 

శివానుభవం



• శివుని   మది

  సింహాసనం . . . సింహాసనం

• నా శివుని  ఒడి

  ప్రేమామృతం . . . ప్రేమామృతం


•  ప్రేమ లోని   మధువు తో    

   నవ వధువు గా   చేసేను   

   విభుడు . . .  నా  విభుడు .

•  ఒడి లోని    లాలన తో   

   పసి పాప గా   ఆడించె 

   హరుడు . . . నా  హరుడు .


• శివుని   మది

  సింహాసనం  . . .  సింహాసనం

• నా  శివుని  ఒడి

  ప్రేమామృతం  . . .  ప్రేమామృతం .


• ఆలన   పాలన తో

  భవబంధాల  ఆటవిడుపులు   ఇస్తున్నాడు .

• ఆదమరచిన  నన్ను

  ఆనంద సాగరంలో   తేలుస్తూ  

  ఉన్నాడు  శివుడు  . . .  నా శివుడు .


• శివుని మది

  సింహాసనం . . . సింహాసనం

• నా శివుని ఒడి

  ప్రేమామృతం . . . ప్రేమామృతం .


• పసి వాడి  నని   తలచి

  తన మది ని    సింహాసనం  చేసి

  కూర్చుండ   బెట్టాడు  .

• తోడు గా   నీడ యై   

 తన జత లోని  రాత లతో     

  విశ్వమంతా   విహరింప  

  చేస్తున్నాడు   శివుడు  . . .  నా శివుడు.


• శివుని    మది

  సింహాసనం   . . .   సింహాసనం

• నా శివుని   ఒడి

  ప్రేమామృతం  . . .  ప్రేమామృతం


• మాటలాడడు    కానీ

  మనసు కి    ప్రేరణ    ఇస్తాడు .

• కనపడడు     కానీ

  కనుల లో   కాంతి యై    ఉంటాడు.

• అనుభవాల   నిచ్చు  వాడు

  శివుడు.  . . .   నా శివుడు .

• అనుభూతి లో   ముంచు వాడు

  హరుడు   . . .   నా హరుడు .


• శివుని  మది

  సింహాసనం  . . .  సింహాసనం

• నా శివుని  ఒడి

  ప్రేమామృతం   . . .   ప్రేమామృతం .



ఓం శాంతి

ఓం నమఃశివాయ


యడ్ల శ్రీనివాసరావు 28 Dec 2025 9:20 PM.


Wednesday, December 24, 2025

712 . ఏది ధర్మం ?

 

 ఏది ధర్మం ?


• ధర్మం అనే మాట ఈ ప్రపంచంలో నిత్యం వినిపిస్తూనే ఉంటుంది . అసలు ధర్మం అంటే మనిషి తన సహేతుకత తో ఆచరించవలసిన విధానం అని అర్థం . ఈ ధర్మం అనేది వృత్తి ప్రవృత్తి ని బట్టి మారుతూ ఉంటుంది .

• పరమాత్ముడు చెప్పిన ధర్మం గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చక్కగా వివరించాడు . మరియు ఈ భూమి పై “ధర్మ గ్లాని” జరిగినపుడు అంటే భూమి పై ధర్మం పూర్తిగా నశించినపుడు , అనగా మనిషి తాను ఆచరించివలసిన  విధానం తప్పినపుడు , అధర్మం విచ్చలవిడిగా పెచ్చురిల్లినపుడు  తాను తప్పకుండా ఈ భూమి పై ధర్మ స్థాపన కి అవతరిస్తానని  భగవంతుడు చెప్పాడు.


• ధర్మం గురించి కురుక్షేత్ర సంగ్రామం లో ఒక అద్భుతమైన సంఘటన కర్ణుడు మరియు శ్రీకృష్ణుడు మధ్య జరిగింది. కురుక్షేత్ర యుద్ధం రసవత్తరంగా జరుగుతున్న సమయంలో, కర్ణుడి రధ చక్రం ఊడి పక్కకు ఒరగగా అప్పుడు కర్ణుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు.

  “హే కృష్ణా! …. నా రధ చక్రం సరి చేసుకునేంత వరకు అర్జునుడిని విల్లు సంధించడం ఆపమని చెప్పు “ అంటాడు.

  అది వినిన శ్రీకృష్ణుడు , తాను భగవంతుని ధర్మ ప్రతినిధిగా ఉన్నప్పటికీ కూడా , అది విని మౌనం గా ఉంటాడు .

  ఇంతలో అర్జునుడు వైపు నుంచి బాణాలు మరింత వేగంగా కర్ణుడి మీద కు వస్తూ ఉంటాయి.

• మరలా రెండవ సారి కర్ణుడు శ్రీకృష్ణుడితో … హే కృష్ణా! ఇది నీకు ధర్మమా …. ఇది యుద్ధనీతి కాదు . దయచేసి అర్జునుడి తో చెప్పు, నా రధ చక్రం సరి చేసుకునేంత వరకు యుద్ధం ఆపమని. అని తీవ్ర స్వరం తో వేడు కుంటాడు.

  అయినప్పటికీ శ్రీకృష్ణుడు కర్ణుడిని చూస్తూ చిరునవ్వు తో మౌనం గా ఉంటాడు.

  అప్పుడు కర్ణుడు . . . శ్రీకృష్ణుడిని ఉద్ధేశించి ఉద్వేగం తో ఇలా అంటాడు. నువ్వు ధర్మాత్ముడి వేనా, పాండవుల పక్షపాతి . . . యుద్ధ ధర్మం ఆచరించమని చెప్పవలసిన నువ్వు మౌనం గా ఉండడం నీకు సబబు కాదు అని అంటాడు.

‌  అప్పుడు శ్రీకృష్ణుడు …. తన నోరు విప్పి కర్ణుడి తో ఇలా అంటాడు.

• అహో! కర్ణా … బాగుంది, చాలా బాగుంది . నేడు నీవు ఆపద లో ఉన్నావు  కాబట్టి , నీ వరకూ వచ్చే సరికి ధర్మం, నీతి, న్యాయం గురించి మాట్లాడుతున్నావు.

• నాడు నిండు కౌరవ సభలో , ధుర్యోధనుడు ద్రౌపదిని వివస్త్ర చేసినప్పుడు , ద్రౌపది రక్షించండి . . . రక్షించండి . . . అని నిండు సభ లోని వారిని వేసుకున్నప్పుడు , నీ ధర్మం ఏమైంది. ఆనాడు సభలో జరుగుతున్నది అధర్మం అని తెలిసినా కూడా యోధుడి వైన నీవు మౌనం గా ఉన్నావు. కనీసం ధుర్యోధనుడిని  ఆపే కనీస ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు. అధర్మం నీ ఎదురుగా జరుగుతున్నపుడు , నాడు నీవు చేయనిది, నేడు నీవు నన్ను ధర్మం గురించి ప్రశ్నించుచున్నావు. ఇది నీకు ధర్మమే నా అని తిరిగి శ్రీకృష్ణుడు అంటాడు.

• కర్మ ఫలం అనుభవించు . . . నీవు ఏది చేశావో అదే నీకు నేడు తిరిగి వస్తుంది. నేను ధర్మ మార్గం చూపగలను , చెప్పగలను అంతవరకే  నా విధి . బుద్ధి వివేకం తో ధర్మాన్ని ఆచరించవలసింది నీవు అంటాడు .

  ధర్మో రక్షతి రక్షితః . . . ధర్మాన్ని ఆచరించడమే కాదు, రక్షించిన నాడు అది తిరిగి కాపాడుతుంది అని శ్రీకృష్ణుడు కర్ణుడి తో చెపుతాడు.

• అది వినిన కర్ణుడు పశ్చాత్తాపం చెందుతాడు.


  🌹🌹🌹🌹🌹🌹



• ఇకపోతే …. ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం అని కలియుగ దైవం గా భావించే వేంకటేశ్వర స్వామి ఆలయాలలో ముఖ్యం గా తిరుమలలో మనం చూస్తాం, చదువుతాం. కానీ ఈ ధర్మం అనే విషయం గురించి ఎంత వరకు మనసు లో చింతన చేస్తాం ?, ధర్మాన్ని మనం ఎంత వరకు ఎలా ఆచరిస్తూ ఉంటాం  ?  అనేది మనమే సద్విమర్శ చేసుకోగలగాలి . ఎదుటి వారు ఆచరించ వలసిన ధర్మాలు చక్కగా చెపుతాం. కానీ మనం ఆచరించ వలసిన ధర్మం వరకు వచ్చేసరికి  అహం లో మునిగి ఉంటాం . ఇది నేటి మానవ నైజం .

  ఇక్కడ గమనించ వలసిన అంశం

• వేం = పాపాలు

• కట = హరించే

• ఈశ్వరుడు = శివుడు , పరమాత్ముడు.

• వేంకటేశ్వరుడు అనగా కలియుగం లో పాపాలను హరించే శివుడు అని అర్థం.


• భగవంతుని దర్శనం కోసం ఆలయానికి వెళ్లిన మనకు భగవంతుడే చెపుతున్నాడు , నీ ధర్మం ఏమిటో తెలుసుకొని ఆచరించమని .

• ధర్మాన్ని ఆచరించడం అనేది దైవ దర్శనం కంటే మహోన్నతమైనది . దైవ దర్శనం వలన పొందేది అల్ప కాలిక సంతోషం. భగవంతుడు ని ఆనందం గా భక్తి పారవశ్యంతో  దర్శిస్తాం , కానీ భగవంతుడు చెప్పిన విధానాలను మన లోని  మాయా బలహీనతల వలన ఆచరించ లేక పోతూ ఉంటాం.

• స్వయం భగవంతుడు చెప్పిన విధంగా ధర్మం ఆచరించరించ  గలిగిన నాడు , అది భగవంతుడి జత తో కలిసి అడుగులు వేస్తున్న ప్రయాణం గా మన జీవితం అవుతుంది .

• నేటి మనిషి జీవనం లో పాటించ వలసిన ఎన్నో ధర్మాలు ఉన్నాయి. వృత్తి ధర్మం, గృహస్థ ధర్మం వీటిలో అత్యంత ప్రాముఖ్యత కలిగినవి. వృత్తి ధర్మాన్ని నిజాయితీ తో ఆచరించగలడం అనేది మనిషి జీవన పురోగతి కి అత్యంత అవసరం. నేటి కలుషిత ప్రపంచంలో కార్యాలయాలలో అవినీతి, లంచగొండితనం, వ్యాపారాలలో మోసం చేయడం అతి సహజం , సర్వ సాధారణం . దీనిని అరికట్టడం స్వయం పరివర్తన తో నే మనిషి కి సాధ్యం.

• రెండవది గృహస్త ధర్మం  . నేటి కలియుగంలో ఇది అత్యంత ముఖ్యమైన అంశం. మనిషి యొక్క కర్మలు, బుణానుబంధాలు అధిక శాతం ముడిపడి ఉన్నది గృహస్థం ధర్మం లోనే .  ధర్మం తెలుసుకొని ఇవి ఆచరించిన నాడు మానవ జన్మ కు దుఃఖం నుంచి ముక్తి లభిస్తుంది. నేటి కుటుంబ వ్యవస్థలో పిల్లలు తల్లి తండ్రులు ఒకరి పట్ల మరొకరు వ్యవహారించ వలసిన విధానం, . . .  కుటుంబ స్థితి గతులు  మనుషుల మానసిక  పరిస్థితులు ఎలా ఉన్నా సరే భార్య భర్తలు ఒకరి పట్ల మరొకరు అనుసరించ వలసిన విధానం ,  ధర్మ యుక్తం గా బాధ్యత నెరిగి  ఆచరించ వలసిన అవసరం నేటి కాలంలో ఎంతైనా ఉంది.

• ఎందుకంటే …. నేటి కలికాలం పూర్తి మాయా ప్రపంచం. మనిషి కి ఏది మంచో ఏది చెడో కూడా సూక్ష్మంగా తెలుసుకో  లేని స్థితిలో మాయ కమ్మేసి జీవనం సాగిస్తున్నాడు మనిషి . అందుకు నిదర్శనం ….. ఈర్ష్య ద్వేషాలు , పగ ప్రతీకారాలు , కామ క్రోధాలు , అహంకారం,  స్వార్దం ,  నాకే సర్వస్వం తెలుసు - నేను నాది  అనే మాయ ,  ఏది సక్రమమో ఏది అక్రమమో తెలియని మానవ సంబంధాలు (లివింగ్ రిలేషన్ షిప్స్) ,  అవసరాలకు మించిన ధనం కోసం  దుర అలవాట్ల కు బానిస కావడం. 

ఇలాంటివన్నీ    కలిసి మనిషి జీవన విధానాన్ని అంధకారంలోకి తోసి , విచ్చలవిడి తనం , స్వేచ్ఛ అనే పేరుతో మానవ జన్మ పూర్తిగా వినాశనానం వైపు  అడుగులు వేస్తోంది. 

వీటన్నిటికి అతీతంగా కావాలంటే  , ఆది సనాతన దేవి దేవతా ధర్మం గురించి  బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం వారి సెంటర్స్ లో ఉచితం గా  నేర్పించే  సహజ రాజయోగ శిక్షణ ద్వారా తెలుసుకొని , మలచుకొని, పరిశీలించి పరివర్తన చేసుకోవడం ద్వారా  ప్రతి మనిషికి సాధ్యం అవుతుంది. 


మన మూలాల లోనే మన రహస్యాలు స్పష్టం గా పొందు పరిచబడి ఉన్నాయి.  అవి తెలుసుకునే ప్రయత్నం చేయక పోవడమే మన అజ్ఞానానికి దుఃఖానికి కారణం.


  ధర్మో రక్షతి రక్షితః



  ఓం శాంతి 🙏

  ఓం నమఃశివాయ 🙏.

  యడ్ల శ్రీనివాసరావు 24 Dec 2025 10:00 PM.


Sunday, December 21, 2025

711. మనసు వీ క్షణం

 

మనసు వీ క్షణం



• చూస్తుంది . . . నా మనసు చూస్తుంది

  చూస్తుంది . . . నా మనసు చూస్తుంది


• కనులు మూసుకున్న నాడే

  నా మనసు చూస్తుంది .

• కనులకు తెలియని లోకమే దో

  నాకు పరిచయం చేస్తుంది .


• చూస్తుంది . . . నా మనసు చూస్తుంది

 చూస్తుంది . . . నా మనసు చూస్తుంది


• మనసు   లోని    నిశ్శబ్దం

  పరవళ్ళు   తొక్కుతోంది  ప్రకృతి లో .

• మనసు   లోని   *వీక్షణలు

  దాటి   పోతున్నాయి   విశ్వాన్ని .


• ఇదే   నా  తరంగం

  ఇదే   నా  అంతరంగం .


• చూస్తుంది . . . నా మనసు చూస్తుంది

  చూస్తుంది . . . నా మనసు చూస్తుంది


• కనులు  మూసుకున్న  నాడే

  నా మనసు చూస్తుంది .

• కనులకు  తెలియని  లోకమే దో

  నాకు పరిచయం చేస్తుంది .


• తేలుతున్న  మనసు కి  తనువు

  భారమే     లేదు .

• సాగుతున్న  మనసు కి  సంతోషం 

  హద్ధు లే   లేవు .


• ఇదే  నా  ధ్యానం

  ఇదే  నా  *పరధ్యానం .


• చూస్తుంది . . . నా మనసు చూస్తుంది

  చూస్తుంది . . . నా మనసు చూస్తుంది .


• కనులు  మూసుకున్న  నాడే

  నా మనసు  చూస్తుంది .

• కనులకు  తెలియని  లోకమే దో

  నాకు పరిచయం చేస్తుంది .

 

వీక్షణలు = చూపులు

పరధ్యానం = శివ పరమాత్ముని స్మృతి యానం.


యడ్ల శ్రీనివాసరావు 21 Dec 2025 7:00 PM .


Sunday, December 14, 2025

710. మనిషి అన్వేషణ

 

మనిషి అన్వేషణ



ఈ భూమిపై మనిషి , మొదట తాను బ్రతకడానికి అన్వేషణ మొదలుపెట్టాడు. తర్వాత తన అవసరాలు తీర్చుకోవడానికి అన్వేషణ మొదలుపెట్టాడు . తర్వాత తాను సుఖపడడానికి అన్వేషణ మొదలు పెట్టాడు. తర్వాత అందరికంటే నేనే  గొప్పవాడిని  అని  నిరూపించుకునేందుకు అన్వేషణ  మొదలు పెట్టాడు . తర్వాత అందరిని శాసించడానికి  ప్రయత్నం చేశాడు . ఇలా మనిషి అన్వేషిస్తూనే  ఉన్నాడు .


జీవితాంతం సుఖాల కొరకు , ఆధిపత్యం కొరకు అన్వేషణ సాగుతుంది . ఇలా ఎప్పటి వరకు అంటే తన అంతిమ శ్వాస వరకు . ఇలాంటి అన్వేషణలో చివరికి మనిషి  మనశ్శాంతి  సుఖం  ప్రశాంతత  తృప్తి  కలగకుండానే  వెళ్ళిపోతాడు.


*మరి ఈ అన్వేషణకు ముగింపు ఎక్కడ ?  దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం .

మనిషి అన్వేషణ  అంతం  లేని యాత్ర.  

మనిషి జీవితం  ఒక నిరంతర అన్వేషణ.

మనిషి  మొదట  బ్రతకడానికి  ప్రయత్నించాడు.  భోజనం కోసం , నీటి కోసం , ఆశ్రయం కోసం పరుగులు పెట్టాడు. అది జీవనానికి పునాది. 

కానీ, మనిషికి  అది సరిపోలేదు  తర్వాత అవసరాలను తీర్చుకోవడం మొదలుపెట్టాడు. వస్త్రం, ఇల్లు,  సౌకర్యాలు,  భద్రత   ఇవన్నీ  పొందడం మొదలుపెట్టాడు. అవి సాధించిన తరువాత కూడా మనసు సంతృప్తి చెందలేదు.

సుఖం కోసం పరిగెత్తాడు . ఆ సుఖం వస్తే ఆనందం కావాలి .  ఆనందం  వచ్చిన  తర్వాత ఆధిపత్యం కావాలి.  ఆధిపత్యం వచ్చిన తర్వాత అధికారం కావాలి .  అధికారం  వస్తే  గర్వం కావాలి . ఇలా మనిషి  "బ్రతకడం" నుండి  "శాసించడం"  వరకు ప్రయాణం  చేశాడు.

కానీ  ఈ మొత్తం  ప్రయాణంలో  మనిషి ఒక ముఖ్యమైన  విషయాన్ని  కోల్పోయాడు  అది ఏమిటంటే   “తనను తాను ”.


ఆధిపత్యం  చివరలో  ఒంటరితనం  .  తాను అనుకున్నవన్ని  సాధించాడు.  మనిషికి   అన్నీ దొరికినట్లు  కనిపిస్తుంది . కానీ మనశ్శాంతి  మాత్రం దొరకదు.

కామం తో శారీరక సుఖం,  కోరికలతో భౌతిక సుఖం కోసం పరిగెత్తే  మనిషి  చివరికి  తెలుసుకుంటాడు,  సుఖం అనేది బయట దొరికేది కాదు , అది  తనలో దాగి ఉన్న ప్రశాంతతే  నిజమైన సుఖం అని .


*అన్వేషణ యొక్క చివరి ఘట్టం :

జీవితాంతం అన్వేషించిన  తర్వాత, మనిషి చివరగా ఆగి వెనక్కి చూస్తాడు .

“ఇంతకాలం నేను ఏమి వెతికాను?” అని.


*అప్పుడు తెలిసేది  ఒకటే : 

తాను  వెతికిన సుఖం డబ్బులో లేదు , తాను కోరిన గౌరవం లభించిన  పదవిలో  లేదు,  తాను వెతికిన శాంతి ఇతరులపై  ఆధిపత్యం చేయడం లో  లేదు.

అంతా  తనలోనే ఉంది ,

అయితే తాను ఎప్పుడూ  తన లోనికి . . . లో లోనికి చూడలేదు .

అయినా , అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది . . .

ఒక దశలో జీవితం ముగిసిపోతుంది , కానీ అన్వేషణ మాత్రం శేషం గానే  మిగిలిపోతుంది అనే సత్యాన్ని తెలుసుకోని మనిషి ,  తనలోని శాంతిని  గుర్తించని  మనిషి , ఎప్పటికీ తృప్తి పొందడు . 

అందుకే జ్ఞానులు చెప్పారు . . .  “సుఖం బయట వెతకకు , అది  నీ  అంతరంలో  దాగి  ఉందని.


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 15 Dec 2025 , 10:00 AM.

Friday, November 28, 2025

709. భగవంతుని జ్ఞానం - మనిషి భక్తి

 


భగవంతుని జ్ఞానం - మనిషి భక్తి



• భగవంతుని జ్ఞానం ఆధారంగా శాస్త్రాలలో ఎన్నో విషయాలు పొందుపరచబడ్డాయి. భక్తి మార్గం లో ఈ విషయాలను కధల రూపం లో భగవంతుడు , దేవతలు , మానవులు రాక్షసుల గురించి అనేక విధములుగా  వివరించారు .

• కానీ మనిషి జన్మ జన్మలు గా, తర తరాలుగా వాటిని కధలలాగే  చూడడానికి , వినడానికి అలవాటు పడి పోయాడు. అంతే కానీ ఆ కధలలో ఇమిడి ఉన్న గూఢ మైన జ్ఞాన అర్థాలు,  సూక్ష్మం తెలుసుకోలేక ,  పరిశీలించ లేక వాటిని కేవలం కధల లాగే చూస్తున్నాడు. ఒకవేళ ఏదైనా ఆ కధలో ఏదైనా సందేహం మానవుడికి తలెత్తినా , మూలాల్లో ఉన్న  వాస్తవాన్ని  యధాతధంగా   వివరించే వారు కూడా  నేడు అరుదు లేదా కరువు అనే చెప్పాలి.

ఉదాహరణకు ఈ కధ …. వివరణ.


శివపార్వతులకు కుమారస్వామి(సుబ్రహ్మణ్యేశ్వర స్వామి) , వినాయకుడు ఇద్దరు పుత్రులు.

• కుమారస్వామి అందం గా ఉంటాడు , అందమైన నెమలిని వాహనం గా కలిగి ఉండేవాడు . అందుకే ఆయనను ఆకర్షణీయమైన బాలుడి రూపంలో విగ్రహాలలో చూపించారు . కుమారస్వామికి బాల్యం నుంచి కోపం గర్వం ఎక్కువ గా కలిగి ఉండేవాడు . ఆ స్వభావానికి  నిదర్శనం గా ఆయనను పడగ ఎత్తి ఉన్న పాము  రూపం గా  కూడా  ఆరాధించడం అది  కోపం చల్లారడం కోసం పాలు పోయాలని భక్తి ద్వారా చూపించారు . 

• మరో వైపు వినాయకుడు ఏనుగు తలతో, పెద్ద బొజ్జ తో , లావు గా అందం లేని వాడిగా ఉంటాడు . చిన్న ఎలుక వాహనం కలిగి ఉంటాడు . కానీ వినాయకుడు బుద్ధి శాలి. విశాలమైన బుద్ధి , ఆలోచన , పెద్ధల యెడల వినమ్రత కలిగి ఉండేవాడు.

ఒకసారి వినాయకుడు, కుమారస్వామి కి తండ్రి శివుడు, తన పుత్రులు ఇద్దరిలో ఎవరు గొప్ప వారు అని తేల్చేందుకు ఒక పరీక్ష పెడతాడు. ముల్లోకాలను ఎవరు ముందు చుట్టి వస్తారో వారే గొప్ప వారు గా నిర్ణయించ బడతారు అని చెపుతాడు.

దేవతలు అందరూ వినాయకుడు ని చూసి నవ్వుతారు . అంత శరీరం తో, ఎలుక వాహనం తో ముల్లోకాలు చుట్టడం అసాధ్యం అని వారికి తెలుసు, ఇదే విషయం వినాయకుడు కి కూడా అర్దం అవుతుంది. మరోవైపు కుమారస్వామి నెమలి వాహనంపై సునాయాసంగా ఎగిరి ముల్లోకాలను చుట్టి రాగలడు అని దేవతలందరూ అందరూ అనుకుంటారు. కుమారస్వామిదే విజయం అనుకుంటారు. కుమారస్వామి కూడా అదేవిధంగా భావిస్తాడు.

సృష్టి కర్త అయిన తండ్రి శివుని కి  ఈ పోటీ లోని మర్మం తెలిసినా మౌనం గా మనసు లో నవ్వుకుంటాడు. ఎందుకంటే శివుని కి తెలియనిది అంటూ ఏమీ ఉండదు .

వినాయకుడు మాత్రం ఇంత పెద్ద శరీరం తో , చిన్న ఎలుక తో తాను ముల్లోకాలను ఎలా తిరగగలను అని మనసు లో చాలా చింతిస్తాడు.

• పరీక్షా సమయం ఆసన్నమైనపుడు ఇద్దరూ తల్లి తండ్రులు అయిన శివపార్వతుల ఆశీర్వాదం తీసుకుని బయలుదేరారు. కుమారస్వామి చాలా సంతోషంగా, గర్వంతో నెమలి పై చాలా వేగంగా ముల్లోకాలు చుట్టడం కోసం బయలు దేరుతాడు.

  వినాయకుడికి తన శరీరం సహకరించదు అని తెలిసి , తనకు ఉన్న జ్ఞానం చేత తన బుద్ధి ని ఉపయోగించి ముల్లోకాలను సృష్టించిన వాడు, విశ్వానికి అధిపతి అయిన వాడు తన తండ్రి శివుడే కదా అని శివుని చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తూ శివుని తో ఇలా అంటాడు. తండ్రి నేను ఇంత పెద్ద శరీరం తో, చిన్న ఎలుక వాహనం తో నేను ఎలా  ముల్లోకాలు తిరుగగలను . ఈ విశ్వానికి సృష్టికర్త అయిన మీరే సమస్త లోకములకు అధిపతి , అన్నింటికీ కర్త కర్మ క్రియ మీరే , నేను నిమిత్త మాత్రుడిని , మీ యందు ప్రదక్షిణ చేసినా ముల్లోకాలు చుట్టి వచ్చినట్లే అని తండ్రి పాదాల చెంత ప్రణమిల్లుతాడు.

• అది గ్రహించిన శివుడు , వినాయకుడి బుద్ధి , ఆలోచన కి సంతుష్టుడవుతాడు . శివుని మహిమ వలన ,  కుమారస్వామి ప్రతీ లోకం దర్శించడానికి వెళ్లే  సమయానికి , తన కంటే ముందుగా అక్కడి నుంచి వినాయకుడు వచ్చి వెళుతూ ఉండడం గమనిస్తాడు . చివరికి శివుని వద్దకు చేరే సరికి వినాయకుడు తన కంటే ముందుగా తండ్రి పాదాల చెంత ఉండడం చూసి , ఆశ్చర్యం తో అసహనానికి గురవుతాడు .

తరువాత విషయం తెలుసుకోని , తన కోపం, గర్వం వలన తాను పరాజయం పొందానాని , తన తండ్రి శివుడు ఈ విశ్వానికి సృష్టి కర్త అనే సత్యం తాను తెలుసుకో లేక పోయానని చింతించి తండ్రి పాదాల పై పడి క్షమించమని తనలోని కోపాన్ని గర్వాన్నీ పశ్చాత్తాపం తో  విడిచి పెడతాడు . మరియు వినాయకుని యొక్క బుద్ధి ఆలోచన కి నమస్కరిస్తాడు .

 అప్పుడు తండ్రి శివుడు , కుమారస్వామి యొక్క పరిపూర్ణత కి మెచ్చి , ఆశీర్వాదించిన  తరువాత కుమారస్వామి  సతోప్రధానం గా  అయి తండ్రి ద్వారా దివ్యత్వం పొంది  దేవత గా అవుతాడు .


• నేటికీ మనకు ఇది ఒక కధగా మాత్రమే తెలుసు. ఎందుకంటే అది విన్నంత సేపు లేదా చూస్తున్నంత సేపు దివ్యమైన భగవత్ రూపాలు శివపార్వతులు , అందమైన కుమారస్వామి , హాస్యం కలిగించే లా వినాయకుని స్వరూపం ఇవే మన కంటికి కనిపిస్తాయి.

కాసేపు , ఈ దైవీ అలంకార  ఆకర్షణా రూపాలను పక్కన పెట్టి , ఈ కధలో సూక్ష్మం, మూలం, రహస్యం ఏమిటో  పరిశీలించి  తెలుసు కొని ఆచరిస్తే మనిషి కి తన జన్మ ధన్యం అయినట్లే .


• సుబ్రహ్మణ్యుని వలే మనిషి తన లోని గర్వం, కోపం, అహం పూర్తిగా విడిచి పెట్టిన జీవించిన నాడు పరిపూర్ణుడై శివుని అనుగ్రహం పొందడమే కాకుండా , దైవీ గుణాలు , దైవీ శక్తుల తో దేవతా మూర్తుల వలే తేజోవంతుడు అవుతాడు అనేది ఇందులో సూక్ష్మం.


వినాయకుని వలే మనిషి తన దేహ స్వరూపం లో ఎన్ని అంగ వైకల్యాలు ఉన్నప్పటికీ , తాను చేస్తున్న కార్యాల లో  ఎన్ని వైఫల్యాలు ఉన్నప్పటికీ  , ఆటంకాలు ఎదురైనప్పటికి   ఆత్మ విశ్వాసం తో మంచి విశాలమైన బుద్ధి తో , కల్మషం లేని మనసుతో , నిర్మలత్వం తో భగవంతుని  యధార్థం తెలుసు కొని , తన సమస్య నివేదించినచో  తప్పకుండా పరిష్కారం పొందుతాడు. శివుని ఆశీస్సుల వలన దివ్య జ్ఞానము , వివేకము , అతీంద్రియ శక్తులు సహజ సిద్ధంగా పొందుతాడు .

 మనిషికి తన జన్మకు కారణం , తల్లి తండ్రులు అనే స్పృహ ఎరిగి , తాను జీవించి ఉన్నంత వరకూ తన తల్లి తండ్రుల ను గౌరవిస్తూ శిరసావహించిన వారికి తల్లి తండ్రుల ఆశీర్వాదం తో పాటు , సృష్టి కర్త శివుని ఆశీర్వాదం కూడా ఉంటుంది .


• చెప్పాలంటే ఈ కధ వినాయకుడు, కుమారస్వామి లకు సంబంధించిన విషయం గా చూడడం కంటే , కలికాలం లో మాయ వలన మనుషుల  గుణగణాలు  కోపం గర్వం అహం తో  నిండి  , వైకల్యాలు వైఫల్యాల ఆటంకాల తో మానవుని జీవన విధానం దుఃఖం తో నిండిపోతుందని  ముందే గ్రహించి, మనిషి శ్రేయస్సు కోసం భగవంతుడు తన జ్ఞానం లో  రచించిన  విధానాన్ని  పండితులు  కధలుగా  వినిపించారు .

 కానీ అది నేటి మానవుడి ఆచరణ కోసం దిక్సూచి అని , నేడు ఎవరికి  తెలియడం లేదు.  బహుశా  కధలను  మనసు కి  అన్వయించు కోవడం అలవాటు లేక పోవడం వలన అయి ఉంటుంది.  లేదా కధలను కలలు గానే ఊహించే అలవాటు అయిపోయి ఉండవచ్చు .  పురాణాలు, ఇతిహాస కధలలో ఉన్న పాత్రల జీవన విధానం,  సంఘటనల విషయాలు నేటి మన జీవితాల కోసమే  అని గ్రహించగలడం ఉత్తమం . 


యడ్ల శ్రీనివాసరావు 28 Nov 2025 ,7:30 PM.



715. బలహీనతలే - లోపాలు - శాపాలు

  బలహీనతలే - లోపాలు - శాపాలు • మనిషికి తన బలహీనతలే లోపాలు శాపాలా ?   అవును ముమ్మాటికీ . . .  మనిషి కి  తన  లోలోని  బలహీనతలే  లోపాలు గా   ...