భగవంతుని మించిన భక్తులు
• భక్తుడు (మానవుడు) భగవంతుడు ని మించిపోయాడా ?
భగవంతుని కంటే భక్తుడు తెలివైన వాడా ?
అంటే . . . అవును అనిపిస్తుంది .
సృష్టి మూలాల్లో పొందుపరిచిన కొన్ని సత్యాలు గ్రహిస్తూ ఉంటే , . . ఇది పరమ సత్యం అనిపిస్తుంది . వాస్తవానికి భగవంతుడు ఏ మాత్రం తెలివైన వాడు కాదు, అమాయకుడు, భోళా నాధుడు . కానీ మానవుడే భగవంతుని మించి తెలివైన వాడు.
భగవంతుడి పై మనిషి కి ఉన్న భక్తి చాలా చాలా గొప్పది . ఈ చాలా చాలా లో ఏం దాగి ఉంది అంటే, మనిషి తన స్వప్రయోజనం కోసం భగవంతుడిని కూడా ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోలడు . ఇందులో ఏ సందేహం లేదు .
• ఈ అంశం లో సూక్ష్మం లోకి వెళితే . . .
• భగవంతుడు , మనిషిని తన సమానం గా ఉన్నతుడుగా దేవతగా చేసేందుకు , మనిషి లో ని “నేను” అనే అహంకారాన్ని , తనకు బలి ఇమ్మని కోరుతాడు .
“నేను” అంటే సంస్కృతం హిందీ లో “ में “ “మే” అని అంటారు. అంటే భగవంతుని కి “ में ” “మే” (నేను) అనేది మానవుడి నుండి కోరుకున్నాడు కాబట్టి , బాగా ఆలోచించిన మనిషి తన అహంకారాన్ని వదులుకోలేక , తన తెలివి తో వెతికి వెతికి “మే” అని అరిచే మేక ను తీసుకు వచ్చి బలి ఇవ్వడం మొదలుపెట్టాడు .
అందుకే అనేక మతాల ధర్మాల వారు కేవలం మేకను ఎంపిక చేసుకొని బలి ఇవ్వడం ఆరంభించారు . ఆ బలి పేరు తో నైవేద్యంగా ప్రసాదం గా భావించి మేక మాంసం భుజించడం ఆరంభించారు . . .
• మాంసాహారం ఒక్కటే తన కడుపు కి వెలితి గా అనిపించిన మానవుడు , మరొక అడుగు ముందుకు వేసి . . .
కొందరు దేవతలకు మరియు శివుని యొక్క ఆస్థాన పాలకుడిగా చెప్పే కాలభైరవుడు కి సురాపానం (సారాయి , మద్యం) నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం మొదలు పెట్టాడు. కొన్నిచోట్ల గ్రామదేవతలకు జంతుబలి తో పాటు కల్లు, సారాయి నైవేద్యంగా నేటికీ సమర్పించడం విశేషం.
మద్యం తాగి , మాంసం భుజించిన మనిషి మనసు యొక్క అంతరంగం తమోగుణం తో ఏ స్థితి లో ఉంటుందో , ఏం కోరుకుంటంందో . . . పాపం మనిషికే తెలియని అమాయకుడు కదా ! . ఇదీ కలియుగం లో దైవ భక్తి .
ఈ విధంగా భక్తి శ్రద్ధలతో భగవంతుడిని , దేవతలను పూజించే మానవుడు నిజం గా ఎంతో మేధావి అనిపిస్తుంది ! . . .
శివుడు సృష్టి కర్త. తాను సృష్టించిన సమస్త జీవుల సంరక్షణ కోరి , జీవహింస మహా పాపం అని తెలియ చేశాడు . అదే విధంగా మద్యపానం అనారోగ్యం తెలియజేసిన వైద్యనాథుడు(శివుడు) కి . . . మానవుడు తన తెలివితో అవి నైవేద్యంగా సమర్పించడం, తన కడుపు నిండా భుజించడం అమోఘం . గొప్ప విషయం కదా !
• ఆది మానవుడు మాంసాహారం భుజించే వాడు . ఆహారం కోసం జీవహింస చేసేవాడు . ఆ సమయంలో మానవుడు అజ్ఞాని , నాగరికత తెలియని వాడు . కాలం మారుతూ వచ్చింది. మానవుడు నాగరికత , బట్ట కట్టడం నేర్పాడు . దైవాన్ని గుర్తించాడు . భక్తి చేయడం ఆరంభించాడు. కానీ ఆది నుంచి అలవాటు పడి , ఆత్మ లో పేరుకు పోయిన కొన్ని మూల సంస్కారాలను నేటికి కూడా విడవ లేక , అవి భగవంతుని కి నైవేద్యంగా అర్పించి తినడం మొదలు పెట్టాడు . దీనినే అనాదిగా వస్తున్న ఆచారం అని అంటాడు మనిషి . ఇందులో మనిషి కి ఏ స్వప్రయోజనం లేదని ఎలా అనుకోగలం .
• కాలభైరవుని సారాయి నివేదన చేయడం అంటే, అది ఆయనకు దానం చేయడం. దానం చేస్తే తిరిగి స్వీకరించ కూడదు . కానీ మనిషి తెలివైన వాడు కదా! తనకు తోచిన విధంగా ప్రవర్తిస్తాడు. తనతో పాటు ఎవరినైనా , ఎందరినైనా ఏ మార్చ గలడు .
🌹🌹🌹🌹🌹🌹
• పరమాత్మ శివుడు తన సంతానం అయినటువంటి మనుషుల దుఃఖానికి అజ్ఞానానికి మూల కారణం అయిన కామం , క్రోధం , లోభం , మోహం , మాత్సర్యము అనే పంచ వికారీ గుణాలు అని , వాటిని తనకు అభిషేకించమని మనిషి ని కోరుతాడు . “ అభిషేకించడం ” అంటే , శివుని తలపై చేయి పెట్టి ఈ వికారీ గుణాలు మనసు తో ధారణ చేస్తూ ఆయనకు విడిచి పెట్టడం . తిరిగి ఆ గుణాలను ఆచరించను అని ప్రతిజ్ఞ చేయడం.
• కానీ, మనిషి మహా మేధావి కదా! . . . శివుడు అభిషేక ప్రియుడు అని బాగా ఆలోచించి తనలోని పంచవికారాలకు బదులుగా (substitute) పంచామృతాలు అయిన నీరు, పాలు, పెరుగు, తేనే , నెయ్యి కలిపి శివుని తలపై వేయడం ఆరంభించాడు .
• ఇది మానవుడు తన తెలివి తేటల తో , తనకు తోచిన రీతిలో వృద్ధి చేసుకున్న భక్తి . . .అభిషేకించిన ఈ విలువైన ఖరీదైన పోషకాలు కలిగిన పంచామృతాలు కళ్ళు ముందే నేలపాలు అవుతున్నా సరే మానవుని బుద్ధి సత్యం గ్రహించదు . ఎందుకంటే మానవుని కి శివుని పై అపారమైన భక్తి ప్రేమ . . . ఎంతగా అంటే శివుడు చెప్పేది విని ఆచరించ లేనంతగా .
అందుకే మానవుడు తెలివైన అమాయక మేధావి !
• అదే విధంగా శివుని కి పంచ వికారాలను అభిషేకించి దానం ఇస్తే , తిరిగి మనిషి వాటితో జీవించ రాదు . ప్రత్యేకించి కలియుగం లో పుట్టిన మనిషి ఇది ఆచరించలేక , పంచామృతాలు అభిషేకిస్తూ ఉంటాడు . అల్ప కాల ఫలితం తో సంతుష్టుడై ఉంటాడు .
• భక్తి, జ్ఞానం వేరు వేరు. భక్తి లో , భగవంతుని పొందడం కోసం ఏది ఎందుకు చేస్తున్నాం ? అనే ప్రశ్న కి ఆధారం తో కూడిన సమాధానం లభించదు . ఎందుకంటే భక్తి లో అనేక విషయాలు ఎవరికి తోచిన రీతిలో వారు కధలు గా చెప్పారు , నమ్మకాలు గా ఏర్పరిచారు . కొందరు తమ భుక్తి జీవన భృతి కోసం వారు చెప్పినట్లు చేయకపోతే అరిష్టం అని భగవంతుడి పట్ల సామాన్య మనిషి లో భయాలను , ఆందోళనలను సృష్టించారు. ఇదే భక్తి లో నేడు విచ్చలవిడిగా విరాజిల్లుతోంది. భగవంతుడు - భక్తి - వ్యాపారం , ఈ మూడు విడదీయలేనంతగా ఒకదానితో ఒకటి నేడు పెనవేసుకు పోయాయి.
• కానీ భగవత్ జ్ఞానం లో ప్రతీ విషయంలో దాగిన శ్రేష్టత సత్యంతో ఆధార భరితమైన సమాధానం లభిస్తుంది. ఎందుకంటే జ్ఞానానికి మూల స్వరూపం జ్ఞాన సాగరుడైన శివుడు . అతడినే దక్షిణామూర్తి అని కూడా పిలుస్తాము.
భగవంతుడు అందరివాడు .
భగవంతుని కి భక్తుని కి మధ్య ఉండవలసింది జ్ఞానం అర్దం చేయించే సద్గురువు , అంతేకానీ దళారులు కాదు .
• గమనించాలి . . . ఈ రచన కొన్ని అంధ విశ్వాసాలు మరియు మూఢ నమ్మకాల నుంచి మేల్కొలపడానికి మాత్రమే . అంధకారం విడిచి , జ్ఞాన యుక్తం గా భగవంతుడు చెప్పిన సత్యం తెలుసుకోని , ఆ రీతిలో భక్తి చేస్తే , కలి మాయా ప్రభావం నుంచి మనిషి కి విముక్తి లభిస్తుంది.
భగవంతుడు చెప్పింది ఒకటైతే మనిషి చేసేది మరొకటి. దీనినే అజ్ఞానం, మాయ అంటారు .
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 11 Aug 2026 11:00 AM.
















