Wednesday, September 17, 2025

690. భగవంతుడు నీ కోరికలు తీరుస్తాడా ?

 

 భగవంతుడు నీ కోరికలు తీరుస్తాడా ?


కర్మ సిద్ధాంతం 


• భరత భూమి కర్మ భూమి. అనగా ఈ నేల మీద మనిషి తాను చేసే కర్మల అనుసారం ఫలితం లభిస్తుంది అనే శివుని సత్య జ్ఞానం , శ్రీకృష్ణుని చే భగవద్గీత లో చెప్పబడింది.  మనిషి కర్మ జీవి , ఏ కర్మను అయితే ఆచరిస్తాడో  దానిని బట్టి ఫలితం జన్మాంతరాల పయనం లో తప్పని సరిగా తిరిగి పొందుతాడు. అది మంచి కి మంచి, చెడు కి చెడు ఏదైనా కావచ్చు. ఇదే కర్మ సిద్ధాంతం .


• సోము తన అవసరార్థం, తన మిత్రుడు రాము వద్ద 1000 రూపాయలు అప్పుగా అడిగి తీసుకున్నాడు . నెల గడిచింది, సంవత్సరం గడిచింది సోము తిరిగి ఇవ్వలేదు సరికదా . . .  సోము ఈ విషయం లో చాలా నిర్లక్ష్యం గా వ్యవహరించే వాడు . తన వద్ద డబ్బు ఉన్నా, ఎందుకు తిరిగి రాముకి ఇవ్వాలి ? అనే ధోరణి తో ఉండేవాడు.  ఇది గమనించి  రాము పలుమార్లు సోము ని అడిగి , చేసేది ఏమీ లేక ఊరుకున్నాడు .

ఒకరోజు సోము ఆకస్మికంగా మరణించాడు .  రాము తన ధనం పోయినందుకు చింతించాడు. కొన్నాళ్ళ   అనంతరం రాము  కూడా చనిపోయాడు . కానీ ఆ ఆలోచన రాము మనసులో ఉండి పోయింది . 


• కాలాంతరాలలో  జన్మలు గడుస్తున్నాయి . సోము అప్పు తీసుకున్న కర్మ ,  కాలం లో  సాక్షి గా  అలాగే నిలిచి ఉంది. 

సోము నుంచి తిరిగి , తాను ధనం పొందలేదు అనే రాము ఆలోచన తో నిండిన కర్మ కూడా కాలంలో  సాక్షి గా అలాగే నిలిచి ఉంది .


• కొన్ని సంవత్సరాల కాలం తరువాత. . .

 ఒక ఊరిలో గీత అనే అనాధ అమ్మాయి అనాధ శరణాలయం లో పెరిగి, యుక్త వయసు వచ్చిన తరువాత శరీర పోషణార్దం ఒక సంస్థ యజమాని వద్ద ఆఫీసులో ఉద్యోగం చేసేది. ఆ యజమాని పేరు రాజారాం . గీత  ప్రతిభ , పనితనం వలన ప్రతీ సంవత్సరం అందరి కంటే కొంచెం ఎక్కువ జీతం పెంచేవాడు రాజారాం .   జీతం తన అవసరాలకు మించి పెరగడం తో ,  ప్రతి నెల కొంత  డబ్బు  రాజారాం వద్ద  గీత దాచుకుంటూ ఉండేది . 

ఒకనాడు  రాజారాం ,  గీతను పిలిచి దాదాపు పది సంవత్సరాలు నుంచి దాచిన  జీతం డబ్బు అయిదు లక్షల వరకు అయిందని,  చెప్పాడు. అప్పుడు గీత,  తాను ఇంకొక రెండు నెలల తర్వాత తీసుకుంటాను అని  రాజారాం తో చెప్పింది. 

ఇంతలో ఒక రోజు గీత తన ఆఫీసు కి వస్తుండగా యాక్సిడెంట్  అయి చనిపోయింది . గీత అనాధ, ఎవరూ లేక పోవడం తో ఆఫీస్ వారే దహనకాండ జరిపించారు. గీత దాచిన ధనం మొత్తం రాజారాం  ఆశించకుండా నే  తన  సొంతం అయింది.

• గీత ఎవరో కాదు గత జన్మలో ధనం ఎగవేసిన సోము .   సోము మరణం తర్వాత తన ఆత్మ తిరిగి  స్త్రీ శరీరం ధరించి  గీత అనే పేరుతో జీవినం సాగిస్తుంది . . . రాజారాం కూడా ఎవరో కాదు ,   రాము మరణించిన తరువాత తిరిగి జన్మించి  రాజారాం  అనే పేరు తో జీవనం సాగిస్తున్నాడు . ఆ రోజు సోము చేసిన అప్పు 1000 రూపాయలు నేడు గీత రూపం లో వడ్డీ తో కలిపి 5 లక్షలు రాము కి (రాజారాం కి ) చెల్లించి వెళ్లిపోయాడు . సోము అప్పు తీరిపోయింది. కర్మ కరిగిపోయింది. ఇదే కర్మ సిద్ధాంతం .


• ఆత్మ ,  జన్మలు  మారినప్పుడు ఏ శరీరం ధరించినా సరే , అనగా  రూపం, లింగం, పేరు, పోషించే పాత్ర ఏదైనా సరే . . . తప్పనిసరిగా గత జన్మల లో చేసిన  కర్మలను  అనుసరించి‌  ప్రస్తుతం జీవించడం జరుగుతుంది . అవే నేటి బుణాను బందాలు . కాకపోతే , మనిషి కి అనుభవపూర్వకంగా ఈ  సూక్ష్మ జ్ఞాన విషయం తెలుసుకోవడానికి  అనేక జన్మలు పట్టవచ్చు . అందుకు శివుని యదార్థం తెలుసుకుని  అనుసంధానం  కావాలి . 

ఇది ఒక కల్పిత కథ అనుకుంటే అమాయకత్వం . ఇందులో వాస్తవిక సూక్ష్మం అర్దం చేసుకుంటే గుప్తమైన  శివుని సత్య జ్ఞానం ఉందని తెలుస్తుంది.  

కర్మల  గతి  అతి రహస్యం 

చేసిన  వికర్మలను తప్పించుకోవడం సాధారణ స్థితితో  ఉన్న  మానవుని కి  సాధ్యం కాదు.  అందుకే దుఃఖం రూపేణా అనుభవిస్తూ ఉంటాడు.

కానీ దానికీ ఒక విధానం ఉంది. 

అదే  స్వయం పరమాత్మ చెప్పిన రాజయోగం.  యోగాగ్ని ద్వారా వికర్మలను దగ్దం చేసుకోవడం . పరమాత్మ అయిన శివుని తో  కలిసి  ధ్యాన యోగం  అమృత వేళలో (తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల వరకు)  ప్రతిరోజూ  చేయడం వలన  ఆత్మ లో అగ్ని  చైతన్యం ఉత్పన్నం  అవుతుంది.  ఎన్నో జన్మల నుండి ఆత్మ లో పేరుకుపోయి ఉన్న వికారాలు , దుఃఖం , పాప కర్మల లెక్కాచారం అంతా క్రమేపీ  యోగాగ్నిలో    దహించుకు పోయి, చేసిన వికర్మలు భస్మం అవుతాయి .  ఆత్మ లో దుఃఖం తొలగి  ,  త్రికాల దర్శనం జరిగి  పతితమై ఉన్న ఆత్మ  పావనం గా  అవుతుంది.  

అంతే గానీ  దాన ధర్మాలు చేయడం వలన ఇంతవరకు చేసిన పాపాలు  తొలగి పోవు.  దాన ధర్మాలు వలన పుణ్యం జమ అవుతుంది.  పుణ్యం వలన పుణ్య ఖాతా  ప్రారబ్దం గా తదుపరి జన్మ కు భాగ్యం తయారవుతుంది . కానీ ఈపాటికే  చేసిన పాపాల వలన దుఃఖం  అనుభవించక  తప్పదు .   

కొందరు మనుషులు అనుకుంటారు , నేను పుట్టిన దగ్గర నుంచి ఏనాడూ పాపం చేయలేదు అని, ఈ జన్మ లో చేసి ఉండకపోవచ్చు కానీ గత జన్మల ఖాతా అనేది  ఒకటి ఉంది కదా.

అందుకే  మంచి బుద్ధి తో  శ్రేష్టమైన కర్మలు చేయాలి .  ఎవరికీ దుఃఖం ఇవ్వకూడదు. ఎవరినైనా వ్యంగ్య మాటలతో , దూషణతో,  మనసు బాధ పెట్టేలా ప్రవర్తిస్తే  , ఊహించని నరకం అనుభవించ వలసి వస్తుంది. ఇది గరుడ పురాణం లో  కూడా చెప్పబడి ఉంది.  

కానీ , ఈ కలియుగంలో ప్రతి మనిషి  అత్యంత మహ పాపం నోటి తోనే  చేస్తాడు . 

అందుకు  నిదర్శనం . . . తపస్సు ద్వారా అభయం  పొందిన  కలిపురుషుడు ,  బ్రహ్మ  సభలో కి  వస్తూ  తన నోరు తెరిచి నాలుక బయటకు చాచి ,  తన మర్మాంగాన్ని  బహిరంగంగా  సభలో  ప్రదర్శిస్తూ ,   విచ్చల విడి వికారితనంతో   ఈ కలియుగ కాలాన్నీ ఇలాగే పాలిస్తాను అంటాడు  .  అనగా కలియుగం లో  మానవులు (ఆత్మలు) అంతా కామ వికారాలు తో  బహిరంగ  భ్రష్టు లై , పూర్తి అపవిత్రం గా తయారై ,   అసత్యాలు మాట్లాడుతూ తమను తాము మోసం చేసుకుంటూ,  ఆహర నియమం లేకుండా తినకూడనివి   తింటూ అనారోగ్యాల పాలై ,  సాటి మనిషి ని  నోటి  దూషణ లతో హింసిస్తూ  చివరికి తమను తాము నాశనం చేసుకుంటారు ,  అని కలిపురుషుడు అంటాడు. 

ఇదంతా నిజమా కాదా  అనే విషయం , నేటి  ప్రపంచం తీరు  బట్టి  ఒకసారి ఆలోచించండి .


☘️ ☘️ ☘️ ☘️ ☘️


భగవంతుడు నీ కోరికలు తీరుస్తాడా ?


• ఇక అసలు విషయానికి వస్తే . . . నేడు మనుషుల లో చాలామంది భగవంతుడిని  ఇల్లు ,  కారు , బంగారం ,  వృత్తి  ఉద్యోగ వ్యాపార వృద్ధి , ఆరోగ్యం, సుఖం ,  వివాహం  వంటివి కావాలని పెద్ద పెద్ద కోరికలు కోరుతారు . ఈ కోరికల కి హద్దు అంటూ ఉండదు. మనిషి తనకు ఉన్న సమస్యల చిట్టా ,  నిత్యం భగవంతుని ముందు ఏకరువు పెడుతూనే ఉంటాడు. తన కోరికలు తీరితే భగవంతుని కి ముడుపు ఇస్తాను అని  అంటాడు  . ఈ కలికాలం లో ఇది నిత్యం జరుగుతూనే ఉంటుంది .


ఇప్పుడు చెప్పండి . . . 

మరి కర్మ సిద్ధాంతం ప్రకారం ,  ఒకరికి మనం ఏదైనా ఇస్తేనే , తిరిగి అది పొందే నైతిక హక్కు కలిగి ఉంటాం . 

మరి నువ్వు,  నేడు గాని గత జన్మలలో గాని . . . 

భగవంతుని కి  ఏనాడైనా  ఒక మందిరం , ఒక ఆశ్రమం (ఇల్లు) కట్టించి ఇచ్చావా  ?  

భగవంతుని ఊరేగింపు కి ఏనాడైనా  రధం గాని , పల్లకి  గాని  (కారు)   ఇచ్చావా ?

భగవంతుని అలంకరణ కి  ఏనాడైనా స్వర్ణం వెండి ఆభరణాలు (బంగారం, సిరులు)  చేయించి ఇచ్చావా ?

భగవంతునికి  ధనం (వృత్తి ఉద్యోగ వ్యాపార వృద్ధి) వెచ్చించి సేవా కార్యక్రమాలు గాని , లోక కళ్యాణార్దం గాని భగవంతుని గురించి తెలియని వారికి  ప్రచారం చేశావా ?

నీవు ఏనాడైనా అనారోగ్యంతో ఉన్న వారికి  సేవ సహాయం చేశావా ?  ఔవధ సేవ చేశావా ? (ఆరోగ్యం).

నీవు ఏనాడైనా  నీ మనసారా  ఇతరులకు మనో ధైర్యం , మంచి  మాటతో  సుఖం శాంతి కలుగ చేశావా ? (సుఖం, శాంతి) .

ఒకసారి ఇదంతా ఆలోచించు . . .

ఈ , నీ  కోరికలు  అన్నింటినీ  తీర్చడానికి  భగవంతుడు   నేడు , నీకు బుణపడి ఉన్నాడా ? ఒకసారి  ప్రశ్నించు కో ?

• నువ్వు కోరుకుంటున్న  అన్ని వస్తువుల నిల్వల గొడౌన్ భగవంతుని దగ్గర ఏమైనా  ఉందా ? అడిగిన వెంటనే  తీసి  నీకు  ఇవ్వడానికి . . .

• నువ్వు అసలు భగవంతుని  కి   ఏమి ఇచ్చావని . . . నేడు నీ అవసరం కోసం  కోరికలతో  భగవంతుడుని  అడుగ గలుగు తున్నావు  ? 

నీది  అన్నది  ఏదైనా  ఒకరికి ఇస్తే నే , కదా  తిరిగి నీ అవసరానికి వారి నుండి  అడగడానికి  హక్కు అధికారం ఉంటుంది  .  ఈ చిన్న లాజిక్ మరచి పోతే ఎలా ? 

ముందు  ఏదైనా  ఇవ్వడం నేర్చుకుంటే . . .  తరువాత వాటంతట అవే  సహజంగా తిరిగి వస్తాయి. 

మనం మన ఇష్టానుసారానికి  ధర్మం, నీతి, నిజాయితీ,  సత్బుద్ధి,  సేవ , ధైర్యం , సహాయం , ప్రేమ వంటి గుణాలను  విస్మరించి  ఈర్ష్య స్వార్దం అసూయ, కామ వికారాలు,  అహం, క్రోధం ,హింస , మోసం  వంటి  రావణాసురుడి గుణాలతో జీవిస్తూ  ఉన్నప్పుడు ,  ఫలితం గా కలిగిన  దుఃఖం అనుభవించే  సమయం లో  లేదా  తీరని  కోరికలు కోసం మాత్రమే భగవంతుడి వైపు  దృష్టి సారించడం  ఎంత వరకు సబబు  . . . ఆలోచించండి.


☘️ ☘️ ☘️ ☘️ ☘️ 


• ఓ మనిషి . . . నువ్వు  పాప  కర్మలు చేసేటప్పుడు ఎవరూ చూడడం లేదని అనుకొని సంతోషంగా, ఆనందం గా చేస్తావు .   తరువాత హాయిగా  ఆ  కర్మ ను  మరచి పోతావు . కొన్నాళ్ళ తరువాత ఆ పాప కర్మ ఫలితం దుఃఖం , విఘ్నం , నష్టం , సమస్య  రూపం లో   నిన్ను వెంటాడుతూ ఉంటే  ,  తట్టుకోలేక  భగవంతుని చుట్టూ తిరుగుతావు .  అప్పుడు కూడా , భగవంతుడా !  నేను అమాయకుడిని , నాకు ఏ పాపం తెలియదు  అంటావు . అంతే కానీ చేసిన పాపం అంగీకరించవు  . . . ఎందుకంటే మరచి పోయి ఉంటావు కదా .  ఇదే విధంగా నేటి  కలి మాయా కాలం లో  ప్రతి మనిషి తలపైన ,  అనేక జన్మల  పాప కర్మల భారం చాలా  ఉంది  అనేది పరమ సత్యం .


• మనిషి చేసిన పాపాన్ని , భగవంతుడు ఏనాడూ డైరెక్ట్ గా తొలగించడు . ఎందుకంటే ఇది కర్మ సిద్ధాంతానికి విరుద్ధం. కాకపోతే భగవంతుని ప్రార్ధించి  , శివుని జ్ఞానం తెలుసు కోవడం వలన పాపాన్ని  తేలికదనం తో  నీకు నీవుగా  తొలగించుకొనే మార్గం చూపిస్తాడు . ఎందుకంటే భగవంతుని కి తన పిల్లల పై  కరుణ ఉంటుంది కాబట్టి.


• భగవంతుని కి  సత్యమైన  ప్రేమ కావాలి. అది ఏనాడైనా నీ మనసు తో ఆయనకు ఇచ్చావా ? 

• భగవంతునికి    విశాలమైన సత్బుద్ధి కావాలి .  అది  నీలో సమృద్ధిగా ఉందా ? 

• భగవంతుని కి   సేవ , సహాయం , నిజాయితీ , ధర్మాచరణ వంటి లక్షణాలు, గుణాలు కావాలి . అవి నీలో పుష్కలంగా ఉన్నాయా ?

• భగవంతుని కి   సత్కర్మలు మాత్రమే ఆచరించడం కావాలి ? . . . మరి నీ యొక్క కర్మలు అన్ని వేళలా మంచివి గానే ఉంటున్నాయా ?


• ఒకవేళ నువ్వు భగవంతుడుని సత్యమైన ప్రేమ తో కొలిచి , నీ లో సత్బుద్ధి ఉండి  , మంచి కర్మలు చేస్తున్న   యెడల ,      భగవంతుని యొక్క అనంతమైన ప్రేమ , భగవంతుని లో ఉండే దివ్య గుణాలు, శక్తులు అనేకం పొందుతావు.  వాటి ద్వారా  నీ శక్తి పెరిగి, ఈ భౌతిక ప్రపంచంలో  నీకు నువ్వు గా  ధర్మ యుక్తంగా ధనార్జన చేసుకునే మార్గం  ఏర్పడుతుంది .  పిదప నీవు కోరుకున్న భౌతిక సాధనాలతో ఆనందం గా ఉండ గలవు . . . 

అంతే గానీ భగవంతుడు నీకు అడిగిందల్లా డైరెక్ట్ గా ఇవ్వడు. ఒక వేళ పూర్వ జన్మ లో నీ పుణ్య కర్మల భాగ్యం మిగిలి ఉంటే దాని ఫలితం ద్వారా కొన్ని లభిస్తాయి . 


మనిషి  ఎప్పుడైనా , ఎంతటి  వాడైనా కేవలం  నిమిత్తమాత్రుడు  మాత్రమే .  మనిషి కి సర్వం ఇచ్చేది భగవంతుడు మాత్రమే  .

భగవంతుడు మనిషి కి  ఇచ్చేది  శక్తి రూపం లో అందుతుంది. దానిని మనిషి , తనకు కావలసిన విధంగా మార్చుకుంటాడు . 


• భగవంతుడు దగ్గర  ఉండేవి , సత్యమైన ప్రేమ , అనంతమైన జ్ఞానం , మానసిక సుఖం, విశ్వ శాంతి, దివ్య గుణాలు , దివ్య శక్తులు, సత్కర్మల జ్ఞానం  ,  దయ , కరుణ , నిజాయితీ . 

వీటిని  మనిషి  భగవంతుని స్మృతి తో అనుక్షణం ఆచరిస్తూ జీవిస్తే  రెట్టింపు స్థాయిలో తిరిగి పొందడం జరుగుతుంది. తద్వారా  మనిషి తన భౌతిక ప్రపంచంలో వ్యాపారం, సాధనాలు, ఉద్యోగం వంటివి సహజంగా తన  బుద్ధి ని ఉపయోగించి సమకూర్చుకుంటాడు .

భగవంతుడు  శక్తి శాలి . ఆ శక్తి పొందాలి అంటే ధ్యానం , యోగం , జ్ఞానం , సేవ , పవిత్రత వంటి ఎన్నో అంశాలపై  సాధన  చేయాలి .


భగవంతుడు ఒక్కడే అతడే శివుడు . 

శివుడే పరమాత్ముడు . 

కర్మ సిద్ధాంతానికి  లోబడే  శివుడు తన కర్తవ్యం ఈ సృష్టిలో  నిర్వర్తిస్తాడు . 

శివుని యధార్థం , మూలం  తెలుసుకోనంత  వరకు  మనిషి కి  అన్నీ ఉన్నా  వంద శాతం  అశాంతి , అంధకారమే . ‌

అసలు  నీవు ఎవరు  అనే నీ మూలాన్ని, నీకు అర్థం చేయించేది కూడా భగవంతుడే .

• భగవంతుడు చెప్పేది ఒక్కటే . . . నువ్వు నన్ను యధార్థ రీతిలో గుర్తించి, నేను చెప్పిన విధంగా ధర్మాచరణ చేస్తూ జీవించిన నాడు , నీ పూర్తి బాధ్యత నాది .


మనిషి కి  భగవంతుని కి మధ్యలో మాయ ఉంది అనే సత్యం గ్రహించాలి. మాయ అంటే బలహీనతలు మరియు భ్రమ . ఇది  మనిషి మస్తిష్కం లోనే  చాలా శక్తి వంతంగా ఉంటుంది. ఇది మనిషి ని అంత సహజంగా విడిచి పెట్టదు .  అందుకే, అన్ని కార్యక్రమాలు యధావిధిగా చేసుకుంటూనే  భగవంతుని నిరంతర స్మృతి, సాధన అనేది మనసు లో ప్రతి క్షణం ఉండాలి. 


• భగవంతుని  భక్తి శ్రద్ధలతో  పూజించాలి , పూజించడం అవసరం కూడా . కానీ  అది  తుచ్ఛమైన  కోరికలు తీర్చు కునేందుకు  కాకూడదు.   

నిస్వార్థంగా భగవంతుడిని , తల్లి తండ్రి వలే మనసు తో  ప్రేమించిన నాడు, భగవంతుని నుంచి లభించేది కనీసం  మన ఊహకు కూడా అందదు . ఇది పరమ సత్యం . 


 ఓం శాంతి 🙏

 ఓం నమఃశివాయ 🙏 .

యడ్ల శ్రీనివాసరావు 17 Sep 2025 9:30 PM.



Sunday, September 14, 2025

689. క్రమశిక్షణ

 

క్రమశిక్షణ


• ఈ పదం , అర్దం నేటి తరం పిల్లలు కి తెలుసా?

  అంటే . . .  సమాధానం 

 మనం అందరం కూడా చాలా చాలా ఆలోచించ   వలసిన  విషయం.

  ఎందుకంటే . . .

 నేటి తరానికి తల్లి తండ్రుల మైన మనమే బహుశా ఈ పదాన్ని పూర్తిగా మరచి పోయాం. ఎప్పడో  మన చిన్నతనం లో మనకు మరియు మన ముందు తరాలు వారికి మాత్రమే బాగా అర్దం తెలిసిన పదం ఈ క్రమశిక్షణ . అవునన్నా కాదన్నా ఇదే నిజం .


• నేడు తల్లి తండ్రులం అయిన మనం, మన పిల్లలను ఎన్నో సందర్భాల్లో తిడుతూ ఉంటాం, వారి చేష్టల వలన బాధ పడుతూ ఉంటాం.

  వీడికి పద్దతి లేదు, నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నాడు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రవర్తిస్తున్నాడు. గౌరవం ఇవ్వడం లేదు. క్రమశిక్షణ లేదు, వంటి మాటలు తరచూ నిత్యం ప్రతి ఇంటి లో సర్వసాధారణంగా చూస్తున్నాం, వింటున్నాం, అనుభవిస్తున్నాం. 

 కాదనగలమా ? . . ‌. ఆలోచించండి .


• దీనికి కారణం మనమే , మన పెంపకం లో లోపం  అనే విషయం ఏనాడైనా మనం గమనించామా ?  ఆలోచించామా ? . . . 

లేదు . . ‌. 

ఎందుకంటే నేడు మనకు అంత తీరిక  సమయం లేదు కాబట్టి , ఈ విషయం అసలు మన స్పృహ లో లేదు .


• మనం క్రమశిక్షణ తో  పిల్లలను పెంచలేనపుడు , సందర్భాల అనుసారంగా  కనీసం  చిన్న తనం నుంచే  అలవాటు చేయునపుడు పిల్లల నుంచి క్రమశిక్షణ  ఎలా  ఆశించగలం . 

 మనకు కావలసింది దక్కలేదు అని పిల్లలను నిందిస్తాం . కానీ అసలు పిల్లల వ్యక్తిత్వానికి , మనో వికాసానికి కావలసినది మనం ఇవ్వలేదని గ్రహించం . ఫీజులు కడుతున్నాం , చదివిస్తున్నాం ఇంతకు మించి ఏం చేయగలం అనే స్థితికి నేడు తల్లి తండ్రులం ఉన్నారు .  చెప్పాలంటే ఇదొక మాయావి  లక్షణం .


• పూర్వం, మన తల్లిదండ్రులు భయభక్తులతో క్రమశిక్షణ తో పెరిగారు కాబట్టి అవే మనకు మన చిన్నతనం నుంచి అలవాటు చేసి పెంచారు . కానీ నేడు మన ఆర్థిక స్వేచ్ఛ పెరిగి, స్థితి గతులు , సౌఖ్యాలు పెరిగే టప్పటికి మనం అన్నింటినీ సడలించుకుంటూ ఉండడం వలన , ముందు మనలోనే  క్రమశిక్షణ పూర్తిగా కనుమరుగు అయింది అనే విషయం వాస్తవం. 

నేడు క్రమశిక్షణ కోల్పోయాం కాబట్టి , ఆ దిశలో పిల్లలను శిక్షణాత్మకంగా  పెంచలేదు. వారు అడిగినది  ప్రతీదీ  ఇస్తూ ఉన్నాం . వాళ్లు ముద్దుగా  ఫ్యాషన్ వస్త్రాలు ధరిస్తూ , ఇంగ్లీష్ మీడియం చదువుతూ పెరగడం చూసి, అందులో మనల్ని చూసుకుంటూ మనలో మనం మురిసి పోయాం. ఎందుకంటే మన బాల్యం ముమ్మాటికీ వారి లా జరగలేదు కాబట్టి .


• వాస్తవానికి నేటి తరం పిల్లలు చాలా తెలివైన వారు, సుకుమారులు . వారికి పుట్టినప్పటి నుంచి అన్నీ అందుబాటులో ఉన్నాయి . విద్యా బోధన లోని పెను మార్పుల వలన సౌఖ్యం గా ఉన్నత చదువులు చదువుతున్నారు . 

కానీ వారు వ్యక్తిత్వ విలువల లోను , మానసిక దృఢత్వం , పరిపక్వత లోను   క్రమశిక్షణా రాహిత్యం వలన  చాలా  బలహీనంగా ఉంటున్నారు . ఇదే భవిష్యత్తులో  వారి కుటుంబ జీవన  వ్యవస్థలకు , మానవ సంబంధాల కు అతి పెద్ద ముప్పు .


• మనం తరచూ అనేక మంది తల్లి తండ్రుల నుంచి ఒక మాట  వింటుంటాం, “మా వాడు నా మాట వినడు” అని .


• నేటి కాలంలో, పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఎన్నో  విషయాలలో   స్వేచ్చ  స్వాతంత్ర్యం సమృద్ధిగా లభిస్తుంది . లభించడం అనేదాని కంటే స్వయంగా  తీసుకుంటున్నాం అని అనడం సబబు . ఇది మితిమీరడం  వలన ,  ప్రభావం సమాజం లో  ప్రతిబింబిస్తుంది అనడానికి నిదర్శనం,  నేడు నిత్యం జరుగుతున్న ఘోరాతి ఘోరమైన దారుణాలను టి వి, మాధ్యమాల వార్తల లో   నిత్యం చూస్తూ ఉన్నాం . 

ఇందులో  ప్రధానంగా  పిల్లలు పెద్దలు అనే భేదం లేకుండా ఉంది.  మరి దీనంతటికీ పెంపకాల లో  , క్రమశిక్షణా రాహిత్యం ఒక కారణం అయితే . స్వేచ్ఛ స్వాతంత్ర్యాల విచ్చల విడి తనం మరో కారణం .

కాదని అనగలమా ?  . . . ఆలోచించండి.


• మంచి బుద్ధి , విలువలు అనేవి ఇంటర్నెట్ లో , మార్కెట్లో దొరకవు . మనం పెరుగుతున్న కుటుంబం లోని తల్లి తండ్రుల ద్వారా  విలువలు ఆచరించడం , పెద్ద వారిని గౌరవించడం మరియు చదువుకుంటున్న  స్కూలు ఉపాధ్యాయుల ద్వారా క్రమశిక్షణ లభిస్తుంది .

  పూర్వం పాఠశాల ఉపాధ్యాయులు  భయం, క్రమశిక్షణ  నేర్పించే వారు. ఎందుకంటే భయం ఉండడం వలన కోతి లాంటి మనసు , కుక్క తోక లాంటి బుద్ధి ఆధీనంలో ఉంటాయి అని ,తద్వారా వికృత చేష్టలకు అలవాటు పడరు అని . 

 కానీ నేటి తరం పిల్లలకు ఈ భయం, క్రమశిక్షణ లేవు. ఒకవేళ టీచర్స్ మంచి కోరి అలా చేస్తే , తల్లి తండ్రులే  టీచర్స్ పై తిరగబడే దుస్థితి దాపురించింది. అందుకే నేటి తరం పిల్లలు ముఖ్యం గా తల్లి తండ్రుల మాట వినరు సరికదా ఒక వయసు వచ్చాక తిరగబడినా ఆశ్చర్యం లేదు. 

అన్నింటికీ మనమే సిద్దం అయి ఉండాలి.


• మొక్కై వంగనిది మ్రానై వంగునా అంటారు. క్రమశిక్షణ బాల్యం నుంచి లేనిది తరువాత రాదు. క్రమశిక్షణ వలన జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడ వచ్చు అనే విషయం పిల్లలకు బాల్యం లోనే తెలియచేయాలి . పిల్లల పాలన లో (పెంపకం లో) క్రమశిక్షణ ఒక భాగం అయినట్లయితే, వారి జీవితానికి సద్గతి లభిస్తుంది. ఇది పిల్లల కే కాదు మనిషి అనే ప్రతీ ఒక్కరికీ అవసరం.


• నేటి కాలంలో  మనిషి తరచూ  చెప్పే సమాధానం ఒక్కటే, కాలం మారింది, కాలానికి అనుగుణంగా మారాలి అని. ఇది తనను తాను సంతృప్తి పరచుకోవడం కోసం చెప్పే సమాధానం .

  కాలం ఏనాడూ మారలేదు. అదే భూమి, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, ఎండ వాన చలి, పగలు , రాత్రి , తిధులు, వారాలు, రోజులు అన్నీ అవే.  కానీ, మారిందల్లా  ఒకటే మనిషి వయసు , మనిషి బుద్ధి. అది పూర్తిగా మాయకు (బలహీనతలకు , విలాసాలకు, సుఖాలకు ) వశం అయిపోవడం వలన మనిషి తన అంతరంగాన్ని తాను మోసగించుకుంటూ జీవించడానికి అలవాటు పడి పోయాడు .


• మనం మన గతం యొక్క మూలాలను ,  భూత కాలాన్ని  (past life, pastence) గుర్తుంచుకొని   జీవిస్తే వర్తమానం, భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే భవిష్యత్తు తరువాత తిరిగి మనం భూత కాలం లోకే  తప్పకుండా వెళ్లాలి, వెళ్తాం.


 గమనిక :  ఈ రచన ,  నేడు  నానాటికీ దిగజారుతున్న కుటుంబ విలువల కోసం . మన గత మూలాల్లో  ఉన్న   జీవన విధానం , సమాజానికి మానవ మనుగడకు చాలా శ్రేష్టమైనదని   ఒకసారి గుర్తు చేయడం కోసం మాత్రమే . మరచి పోయిన మన మూలాలు తిరిగి ఏనాడైనా  జీవితాలను  మార్చవచ్చు.


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 14 Sep 2025  10:00 PM.


Friday, September 12, 2025

688 . ఇతరుల కోసం చింతించడం

 

ఇతరుల కోసం చింతించడం 


ఇతరుల కోసం చింతించడం వారి పట్ల శ్రద్ధ చూపడమేనా ?  . . . 

• బాల్యం నుండి ఆందోళన (Tension) చెందడం మరియు చింతించడం (Over Thinking) అంటే శ్రద్ధ చూపడం (Caring) అని తప్పుగా నమ్ముతూ వచ్చాం .  మనం  బాల్యం లో తల్లిదండ్రులతో   పెరుగుతాము . మనం పుట్టిన వెంటనే , నిజానికి మనం పుట్టకముందే , తల్లి కడుపులో ఉన్నప్పుటి  నుంచి  కూడా వారితో ఉన్నప్పుడు , వారు తమ ఆలోచనలు, పదాలు మరియు చర్యల ద్వారా ఈ నమ్మకాన్ని మనపై ప్రసరింప చేస్తారు .

ఆత్మలైన  మనం ,  తల్లి తండ్రుల భావాలను ప్రసరింప చేయటమే  కాకుండా వాటిని గ్రహిస్తాము .

మనం పెరిగేకొద్దీ , మన స్నేహితులు , తోబుట్టువులు , జీవిత భాగస్వామి మొదలైన వారితో సహా  మనం కలిసి ఉన్న  ప్రతి ఒక్కరి నుండి  ఈ తప్పుడు విశ్వాసం  సూక్ష్మంగా మరియు  శారీరక స్థాయిలో  మనకు చేరి నెమ్మదిగా  మనం దీనిని అంగీకరించడం ప్రారంభిస్తాము .

• ఇతరులపై ఆందోళన (Tension) మరియు చింతన (Over Thinking) చూపించడం అనేదే శ్రద్ధ వహించడం (Caring), అనే నమ్మకం పూర్తిగా నిజం అని భావించి మన జీవితాన్ని గడుపుతూ ఇతరులకు కూడా ప్రసారం చేస్తాం. అందుకే ఎంతో కొంత ఈ నమ్మకం ప్రకారం జీవించని వ్యక్తి ఒక్కరు కూడా ఉండరు.


• పైన పేర్కొన్న ఆందోళన (Tension)మరియు చింతన(Over Thinking) అంటే శ్రద్ద చూపడం(Caring) అనే ఈ నమ్మకం , సాధారణంగా మనం ఆఫీసు నుండి ఇంటికి తిరిగి రావడానికి కొన్ని నిమిషాలు ఆలస్యం అయినప్పుడు చూడవచ్చు . ఇంటికి చేరుకున్న తర్వాత, మన కుటుంబ సభ్యులు మనం ఎక్కడ ఉన్నాము మరియు ఎందుకు కాల్ చేయలేదని అనేక ప్రశ్నలు అడుగుతారు . వారు ఆ సమయంలో చేసిన అనేక ప్రతికూల ఆలోచనలు (Negative Thoughts) అంచనాల గురించి కూడా తెలియజేస్తారు . . . ఎందుకు? ఎందుకంటే వారు మన గురించి ఆందోళన (Tension ) చెందారు. వారు ఆవిధంగా ఆందోళన చెందారని వినిన  మనం ఆశ్చర్యపోతాము .

ఎందుకంటే వారు అంత గట్టిగా ఆలోచించడం వలన మనకి ఆలస్యం అయింది అని కాదు కాని,   మేము మీ పట్ల శ్రద్ధ వహిస్తున్నందున మేము మీ కోసం చింతిస్తున్నామని  మన కుటుంబ సభ్యులు వివరిస్తుంటారు .

 కానీ చింతించడం అంటే పట్టించుకోవడం కాదు. చింత అంటే భయం లేదా ఆందోళన . సంరక్షణ అంటే ప్రేమ లేదా పట్టించుకోవటం . ఈ రెండు కూడా పూర్తిగా వ్యతిరేక భావోద్వేగాలు .  అవి ఒకే  సమయంలో కలిసి ఉండజాలవు .


☘️☘️☘️☘️☘️☘️


• ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడటంలో చింతించడం కంటే నిజమైన ప్రేమ ఎలా ప్రయోజనకరంగా అవుతుందో  మనం చూద్దాం.

మనమంతా సూక్ష్మ స్థాయిలో, కనిపించని విధంగా ఒకరికొకరం అనుసంధానం (Attach) అయి ఉన్నాము,  ఈ అదృశ్య రీతిలోనే (Invisible) మన అందరి మధ్య నిరంతరం కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. మనం ఇతరులకు శక్తిని పంపడమే కాకుండా ఇతరులు ప్రసరించే శక్తిని కూడా తీసుకుంటాము . మన జీవితంలో ప్రతికూల పరిస్థితులలో ఇది సానుకూలంగా మరియు ప్రతికూలంగా ఎలా పని చేస్తుందో ఒక ఉదాహరణతో ఈ విధంగా చెప్పవచ్చు.

• మీ అబ్బాయి క్లాస్ టీచర్ , ఫోన్ చేసి స్కూల్  ప్లే గ్రౌండ్ లో  ఆడుకుంటుండగా , మీ బాబు గాయపడ్డాడని  చెప్పారనుకుందాం .  ఆందోళన తో చింతించాల్సిన పని లేదని ఆమె మీకు చెప్పి ,  వచ్చి మీ బాబు ను స్కూల్ నుండి తీసుకొని వెళ్ళమని చెప్పారు .

ఈ సమయంలో మీ బాబు బహుశా భయం , ఒత్తిడి, ఆందోళన మరియు దుఃఖం యొక్క ప్రతికూల శక్తిని తన నుంచి బయటకు ప్రసరింపజేస్తున్నాడు .

బాబు క్షేమంగా ఉన్నాడని టీచర్ ఫోన్ లో మీకు తెలియచేసినప్పటి నుంచి,  మీ బాబు మీలో ఉన్న ఆధ్యాత్మిక  లేదా   మానసిక శక్తిని సహజంగా పొందుతూ ఉంటాడు . ఎందుకంటే మీరు మీ బాబు గురించి, ఆ క్షణం నుండి ఆలోచించడం మొదలు పెట్టారు కాబట్టి .

మీరు బాబు ను తీసుకురావడానికి  తన స్కూల్ కు  డ్రైవింగ్  చేస్తున్నారు.  ఈ సమయంలో, మీరు తనకు దూరంగా ఉన్నందున అతను ఉన్న పరిస్థితి గురించి మీకు కొంత అవగాహన మాత్రమే ఉంటుంది. యదార్థ పరిస్థితి గురించి ఆలోచించడం ఊహించడమే అవుతుంది మరియు ఇది మీ మానసిక శక్తిని వృధా చేయడం అవుతుంది.

• మీరు ప్రతికూల ఊహలలో ఉండి, అంటే మీరు ఆందోళన చెంది భయపడుతూ ఉంటే, మీరు అతనికి అదే భయం యొక్క ప్రకంపనలను , ప్రతికూల శక్తిని పంపుతున్నారు, దానినే అతను తీసుకోబోతున్నాడు .

  మీ  నుంచి వెలువడుతున్న ఆందోళన అతనికి ఏవిధంగానూ శక్తిని ఇవ్వకపోగా  అతనిని బలహీనపరచి , అది  తిరిగి  డ్రైవింగ్‌ లో ఉన్న మిమల్ని భంగపరుస్తుంది .

 వాస్తవానికి  మీరు చింతించాల్సిన పని లేదని ఇది వరకే టీచర్ మీకు చెప్పింది , అయినా మీ బాబు కొంచెం కష్టమైన భావోద్వేగ పరిస్థితిలో ఉన్నాడని మీరే  అనుకుంటారు.


• అసలు ఇప్పుడు అతనికి ఏం కావాలి ? మీరు పాఠశాలకు చేరుకోవడానికి, అతనికి సహాయాన్ని అందించడానికి కొంత సమయం తీసుకుంటారు కనుక అతనికి ఇప్పుడు మీ సూక్ష్మమైన శక్తి చాలా  అవసరం.

 మీరు ఆందోళన లేదా సంరక్షణ అని తప్పుగా పిలవబడే భయం యొక్క మీ ప్రతికూల ప్రకంపనలా ? . . .  లేదా . . .   మీ నిస్వార్ధ  ప్రేమ, మీ శుభాశీస్సులా ?

దూరం గా  ఉన్న మీరు అతనికి సహాయాన్ని ఇవ్వడానికి ఏమి పంపుతారు ? చింతన తో కూడిన ప్రకంపనలా (Vibrations)  లేక అతనికి మీరిచ్చే శుభాశీస్సులుగా  ప్రేమ ప్రకంపనలా ? ఆలోచించండి .

మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ  యొక్క ప్రేమ ప్రకంపనలు మిమ్మల్ని  మరియు బాబు ను సానుకూల స్థితిలో ఉంచుతాయి.

• అసలు, సంరక్షణ లేదా పట్టించుకోవటం అంటే ఏమిటి? సంరక్షణ అంటే మీరు మరొకరికి సహాయం చేయడానికి మీ సానుకూల అంతర్గత ఆధ్యాత్మిక కాంతిని పంపడం . 

ఆందోళన వలన ఖచ్చితంగా ప్రయోజనం ఉండదు .

• ఒకరి శ్రేయస్సు కోసం , మనలోని శుభకరమైన ఆలోచనలను ఆలోచిస్తూ ఉంటే, ఆ ప్రకంపనలు వారికి చేరుతాయి. ఇలాగే ప్రతికూల తో (Negative ) ఆలోచనలు చేస్తే అవి కూడా వారికి చేరుతాయి .


ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 


యడ్ల శ్రీనివాసరావు  13 Sep 2025 , 5:00 AM.


Monday, September 8, 2025

687. అలంకరణలు - ఆకర్షణలు

 

  అలంకరణలు - ఆకర్షణలు 


• మనిషి కి ఆకర్షణ అలంకారమా ?

  ఇదేం ప్రశ్న వింతగా , అసలు ఆకర్షణ లేకపోతే మనిషి ఎలా జీవించ గలడు ?  ఈ సృష్టి ఎలా నడుస్తుంది ?

  అవును కదా . . . భూమి ఒక అయస్కాంతం . గురుత్వాకర్షణ శక్తి వలనే స్థిరంగా ఒక కక్ష్యలో తన చుట్టూ తాను తిరుగుతూ చంద్రుడు చుట్టూ తిరుగుతూ ఉంది అనేది మనకు తెలిసిన విషయం .   

భూమి పై ఉన్న మనిషి కూడా  విశ్వంలోని  ఆకర్షణ  శక్తి  ప్రభావం వలన  జీవం కొనసాగిస్తూ ఉన్నాడు . అంటే విశ్వ  ఆకర్షణ ,  ప్రతి భౌతికత లో (mass) , సహజసిద్ధంగా  ఏర్పడి  జీవనానికి మనుగడకు  ఆధారభూతం (depend) అయి ఉంది   అనేది స్పష్టం.


  మనిషి భౌతిక జీవి (Mass Body) కాబట్టి, విశ్వ శక్తి సిద్ధాంతం ప్రకారం మనిషి కూడా సహజ సిద్ధంగా ఆకర్షణను కలిగి ఉంటాడు . మనిషి తన శక్తి తో ఆకర్షణ ను క్రియేట్ చేయగలడు , ఎమర్జ్ చేయగలడు అనగా  ఇతరులను ఆకర్షించుకునేలా చేయగలడు. అదే విధంగా ఇతరుల పట్ల ఆకర్షితం ఇవ్వగలడు .


• మనిషి యొక్క  ఆకర్షణ అనేది రెండు రకాలు. ఒకటి  సహజసిద్ధం  , రెండవది కృత్రిమం .

  మనిషి తన శరీరాన్ని వస్త్రాలు , ఆభరణాలు, సౌందర్య సాధనాలు , సుగంధ ద్రవ్యాలు వంటివాటితో అనేక విధాలుగా కృత్రిమంగా అలంకరిస్తాడు . ఈ బాహ్య అలంకరణ తో చుట్టూ ఒక ఆకర్షణ వలయం తయారవుతుంది . ఈ ఆకర్షణ కి చేరువై చుట్టూ చేరేవారు కొందరు ఉంటారు. ఇదే తన సౌందర్యం గా భావిస్తాడు అమాయకపు మనిషి.

  ఇక్కడ ఒక ఆకర్షణ ను క్రియేట్ చేయడం, దానికి ఇతరులను ఆకర్షింప బడేలా చేయడం రెండూ కూడా మనిషి యొక్క స్వభావం సంస్కారం మీద ఆధారపడి అనేక రకాలుగా ఉంటాయి .


• శరీర అలంకరణ కోసం చేసే ప్రతి చర్య యొక్క ముఖ్య ఉద్దేశ్యం సందర్భానుసారంగా ముందు గా నే మనిషి స్పృహ లో తప్పని సరిగా మననం (plan of action) జరుగుతూ ఉంటుంది. ఇది చాలా సూక్ష్మం గా , స్పష్టంగా ఉండి అంతరంగం లో ఉంటుంది .

 ఈ శరీర అలంకరణ తో కూడిన ఆకర్షణ స్వభావం , మనిషి కి సామాజిక కార్యక్రమాల లోను, శుభ కార్యాల లోను , మరియు గ్రూపు సాంగత్యాలలో అనగా  బాహ్య  ప్రపంచంలో  ఉండేటప్పుడు అధికం గా ప్రత్యేకం గా ఉంటుంది.

 ఒంటరిగా , ఏకాంతం గా ఉన్నప్పుడు ఈ శరీర అలంకరణ , ఆకర్షణ పై ఆసక్తి  అనేది సహజం గానే  ఉండదు . ఎందుకంటే చుట్టూ గమనించే వారు ఎవరూ ఉండరు కాబట్టి.


• మరికొందరు తమ మాటలు , హావభావాల తో ఆకర్షించే శక్తి కలిగి ఉంటారు . ఆ మాటలకు , ఉచ్చారణకు ,  పలుకులకు ఇతరులు దాసోహం అయి  ఆకర్షించబడతారు .

ఈ ఆకర్షణ అనేది సహజ సిద్ధమైన స్వభావం అనగా జన్మతః  ఉన్న  సంస్కారం అయినంత వరకు కర్మలు  సహజంగా  సజావుగా సాగుతాయి. 

 అలా కాకుండా కృత్రిమంగా ఉద్దేశ్యపూర్వకంగా , పదిమంది లో గుర్తింపు కోసం, ప్రయత్న పూర్వకంగా, ఉద్దేశ్యం తో చేసిన నాడు ఆది లో బాగానే ఉంటుంది,  కానీ కాలం గడిచే కొద్దీ అదే శాపం గా మారుతుంది .  ఎందుకంటే కృత్రిమ మైన  ఆకర్షణ ఎండకు ఎండి, వానకు తడిసి వెలవెల పోతుంది . అదే విధంగా ఉద్దేశ్యపూర్వకంగా చేసే అలంకరణ ఆకర్షణ కేవలం కొద్ది సమయం, కాలం మాత్రమే మనిషి వద్ద నిలబడతాయి. ఇవి ఏ రోజు అయితే తొలగి పోతాయో, అసలు స్వరూపం బయటకు కనిపించడం తో , ఆకర్షించబడి చుట్టూ చేరిన వారే దూరంగా వెళ్లి పోతారు . 


• మనిషి ప్రకృతి జీవి. ప్రకృతి వలే సహజత్వం తో , ఏ మెరుగులు మెరుపులు అలంకరణలు లేకుండా ఉండగలడో అప్పుడు ఉండే సహజసిద్ధమైన ఆకర్షణ శాశ్వతం. ఇందులో భాషా ఉచ్చారణ, మాట తీరు , నడవడిక , వేషధారణ  చాలా ముఖ్యం .

• పాశ్చాత్య సంస్కృతి ప్రభావం తో , అవసరం లేకపోయినా మాతృభాష ను మార్చి వంకర గా  మాట్లాడే తీరు , వంకరగా రాగాలు పలికే తీరు , ఎద్దు లా పెరిగినా ముద్దు గా మాటలు రానట్లు  మాటను పలికే తీరు శరీరం లోని పైత్యానికి, అనారోగ్యానికి సంకేతం గా భావించాలి. వస్త్రధారణ వేషాలు  ఇలా ఇతరులను  ఆకర్షించడం కోసం చేసే చర్యలు వికృతమై  , ఏదొక రోజు వికటించి తమపై తమకే అసహ్యం విరక్తి కలుగుతుంది అనేది వాస్తవం . ఎందుకంటే ఇది వికృత చేష్ట కాబట్టి . . . మనిషి కి జన్మతః  కలిగి ఉన్న  స్వాభావిక త యే సహజ అలంకరణ, ఆకర్షణ.


• ఓ మనిషి  . ‌. . నీ  బుద్ధి లో ఉండే గుణాలను సహజత్వం తో , సరళత తో , సత్ప్రవర్తనతో ఉంచుకోగలిగిన నాడు నువ్వు విశ్వం చేత ఆకర్షించబడి , విశ్వం ద్వారా లభించే ప్రకాశం, చైతన్యం నీ ముఖం లో, మాటలో, నడవడిక లో ప్రస్పుటంగా గా కనిపిస్తాయి . ఇదే నీకు శాశ్వతమైన అలంకారం తో కూడిన ఆకర్షణ . అప్పుడు నువ్వు దేనికి ,  దేనిని ఆకర్షించే ప్రయత్నం చేయవలసిన అవసరం ఉండదు. అన్నింటిచే  నువ్వే ఒక పరిమళమైన పూవు వలే ఆకర్షించ బడుతూ ఉంటావు .


• మనిషి కి శరీర శుభ్రం, శుభ్రత ఉండాలి.‌ ఇది ఆరోగ్యం కోసం అవసరం . శుభ్రత కి అతీతమైనది అలంకారం, ఆకర్షణ . వీటికి అత్యంత ప్రాధాన్యత సంతరించడం అనేది ఒక మాయావి లక్షణం. మనుషులు చాలా మంది దేహ సౌందర్యమే , తమ ఆత్మ సౌందర్యం గా భావిస్తూ ఉంటారు. ఇది ఒక అమాయకత్వం . వయసు మీరుతున్నా కృత్రిమ అలంకారాల తో ఆకర్షితమవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు . కానీ విశ్వం తో అనుసంధానం అయి విశ్వ సౌందర్యాన్ని  తమ కు  ఆపాదన చేసుకోలేరు .


• రమణ మహర్షి, యోగి వేమన, ముమ్మిడివరం బాలయోగి , ప్రజాపిత బ్రహ్మ బాబా (దాదా లేఖరాజ్) , పరమ హంస యోగానంద, మదర్ థెరిస్సా ఇటువంటి వారు ఇంకా ఎందరో ఎందరో ఉన్నారు . 

మరి వీరిలో ఉన్నది దేహ సౌందర్య  అలంకారం తో కూడిన ఆకర్షణా ?  లేక  ఆత్మ సౌందర్యం తో నిండిన అలంకార ఆకర్షణా ?  . . . దేనిని చూసి వీరి పట్ల సర్వ మానవాళి ఆకర్షితులయ్యారు ? వీరి శరీరాలు నేడు లేకపోయినా సరే, ఇంకా వీరు నేటి మానవాళిని ఎందుకని ఆకర్షిస్తూ ఉన్నారు ? ఎందుకు అంటే వీరు ఈ సృష్టి , విశ్వ శక్తి లో ఉన్న సౌందర్యాన్ని తమ సౌందర్యం గా మరల్చుకొని ఉన్నారు. అందుకే విశ్వం ఉన్నంత వరకు వీరు జీవించే ఉంటారు .


• ఇది మానవుని యొక్క జన్మ మరియు జీవిత మూలం లో కప్పబడి పోయిన ఒక విషయం . అవగాహన కోసం మాత్రమే ఈ రచన యొక్క ప్రయత్నం .


యడ్ల శ్రీనివాసరావు 8 Sep 2025 , 12:30 PM.



Saturday, September 6, 2025

686 . ఆత్మ స్థితం

 

ఆత్మ  స్థితం 


• ఆత్మ   నైన   నేను

  పరమాత్మ ను    చూస్తున్నాను .

• సూక్ష్మ   బిందువైన   నేను

  శివుని  స్మృతి   యాత్ర ను   చేస్తున్నాను .


• ఈ దేహం లో    నేను    ఉన్నాను .

  ఈ దేహం  

  దహనమైనాక   కూడా   ఉంటాను .

• నా    పేరు   ఆత్మ .

  మరణం  లేని    చైతన్యం   నేను .


• ఆత్మ     నైన   నేను

  పరమాత్మ ను    చూస్తున్నాను .

• సూక్ష్మ    బిందువైన    నేను

  శివుని  స్మృతి  యాత్ర ను   చేస్తున్నాను .


• ఒకా   నొక  నాడు . ‌. .

‌ నా తండ్రి    పరమాత్మ ను

‌ విడిచి   భూమి   పై కి    వచ్చాను .

• జన్మలు    తీసుకున్నాక

‌  బంధనాల   వలలో    

  బందీ   అయ్యాను .

• కర్మల   గుహ్యం   తెలియక

  మాయ లో    ఎన్నో

  వికర్మలు    చేశాను .


• భవ  బంధాల లో   ఎన్నడూ 

  సత్యత    కాన  రాలేదు  

  సరికదా  . . .  అవి 

  కర్మ  బుణాలని   తెలిసింది  . 

• ఐహిక    భోగాల లో   ఎన్నడూ 

  సుఖశాంతులు   కాన  రాలేదు

  సరికదా  . . .  అవి 

  నీటి  బుడగ లని   తెలిసింది .


• ఈ గందర  " గోళం " లో  . . .

  నా తండ్రి    పరమాత్మ ను  మరచి 

  అనాధ లా    అయ్యాను .


• ఆత్మ    నైన   నేను

  పరమాత్మ ను      చూస్తున్నాను .

• సూక్ష్మ   బిందువైన    నేను

  శివుని  స్మృతి   యాత్ర ను   చేస్తున్నాను .


• ఈ  దేహం లో    నేను    ఉన్నాను .

  ఈ  దేహం   

  దహనమైనాక   కూడా  ఉంటాను .

• నా   పేరు   ఆత్మ .

  మరణం  లేని   చైతన్యం   నేను .



గుహ్యం  =  రహస్యం 

ఐహిక  =    ప్రాపంచిక 

గోళం  =  భూమి 


యడ్ల శ్రీనివాసరావు 6 Sep 2025 , 10:00 AM.


Thursday, September 4, 2025

685 . వినాయకుని విశిష్టత

 


వినాయకుని విశిష్టత


• ప్రస్తుతం అంతా గణపతి నవరాత్రుల సందడి జరుగుతుంది. విగ్రహాలను నిలబెట్టడం లో వీధి వీధిలో పోటీ, చందాలను వసూలు చేయడం లో  (అనేక ప్రాంతాలలో ) భక్తి  పేరుతో  దౌర్జన్యం , మండపం లో దేవుని పాటలు ఉదయం ఒక గంట  మిగిలిన రోజంతా డి.జే. వికారీ  పైత్యపు పాటలు . . . 

చివరి రోజు లడ్డూ వేలం పాటలో   హంగు ఆర్భాటం , ఇక ఆఖరి ఘట్టం నిమజ్జనం ఊరేగింపు లలో  తాగి తందనాలు , గుడ్డలు చింపుకొని డాన్సులు , డి.జే లలో  వికారీ సాహిత్య సినిమా పాటలు …. ఇది నేటి కాలంలో మనిషి భక్తి   పేరుతో  ప్రత్యక్షంగా  దేవుని కోసం  సృష్టించుకున్న   సంస్కృతి .   

కానీ విచిత్రం ఏమిటంటే ,   ఇదే  నేడు మానవులందరికీ  చాలా  ఆహ్లాదకరం  . ఈ విధమైన  వ్యవహారాల తో చేస్తున్న  గణపతి పండుగ  యే అనేకులకు  ఓ విశిష్టత ,  ఒక పెద్ద వినోదం (ఎంటర్టైన్మెంట్) . ఎందుకంటే వారందరి జీవితాలు  ఒత్తిడి తో నిండిపోయాయి కాబట్టి ఈ రకమైన వినోదం అవసరం . 

• నేడు గణపతి గురించి ఇంతకు మించి గొప్ప గా చెప్పుకోవడానికి, సమాజం లో మనిషి దగ్గర  ఏమైనా సమాధానం ఉందా ? . . .  అంటే  అది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం అనిపిస్తుంది.  ఎందుకంటే, నేడు అందరూ కాస్త అటుఇటుగా చూస్తున్నది, చేస్తున్నది,  ప్రోత్సాహిస్తున్నది   ఇదే కదా . భగవంతుని పై ఈ భక్తి ఒక వినోదం , కాలక్షేపం . అందుకే ఇది కలికాలం, మాయా కాలం, పోయే కాలం, వినాశన కాలం .


• అసలు వినాయకుడు గురించి మనం మన తరాలకు ఏం చెపుతున్నాం ? అంటే ఒక అద్భుతమైన  కధ . ఇది కల్పితమా ?  వాస్తవమా? అనేది మనిషి చిన్ని మేధస్సు కు తెలియదు . . .  శివుడు తపస్సు చేసి చాలా కాలం తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంతలో పార్వతీ దేవి ఒక బాలుడు ని కాపలా పెట్టి స్నానానికి వెళ్ళింది. ఆ బాలుడు శివుడి ని అడ్డగించడం వలన శివుడు కోపంతో ఆ చిన్న బాలుడి తల నరికేశాడు. ఆ తర్వాత పార్వతి దేవి ఏడుస్తూ ఉంటే శివుడు ఏనుగును చంపి , దాని తలను ఆ బాలుడికి అతికించాడు . అసలు వింటుంటే, వినాయక వ్రత కల్ప పుస్తకం లో ఇదంతా చదువుతూ ఉంటే ... ఆహా ఎంత అద్భుతం . అనిపిస్తుంది కదా.  ఎందుకంటే మనిషి  మనస్సాక్షి  గుడ్డిది అయిపోయింది కాబట్టి .

• ఇలాంటి కధలు ఎవరు రాసారో, ఎందుకు రాసారో ఆ   భగవంతుడికి కూడా తెలియదు .


• శివుడు సృష్టి కర్త .  పరంజ్యోతి బిందు శక్తి స్వరూపుడు . శివుడు పరమాత్మ. శివుని కి  దేహం లేదు కాబట్టి  లింగాకారం చూపించారు. మరి శివుడు  తపస్సు చేయడం ఏంటి ? ఆ తపస్సు ఎవరి కోసం చేసాడు ? సరే … సాధారణంగా తపస్సు పూర్తి చేసినవారు క్రోధం , అహం వంటివి జయించి శాంతమైన మనసు తో ఉంటారు. అటువంటిది , కనికరం లేకుండా అహం తో చిన్న బాలుడి తల , లోక రక్షకుడు అయిన  శివుడు నరకడం ఏంటి ? వీటికి మనలో సమాధానాలు ఉన్నాయా ? ఆలోచించండి.


• అసలు శివుడు కి, శంకరుడికి తేడా గ్రహించ లేని స్థితిలో కధలు రాశారు. శివుడు సృష్టి చేస్తాడు . బ్రహ్మ విష్ణు శంకరులు శివుని యొక్క సృష్టి రచన . బ్రహ్మ ద్వారా స్థాపన , విష్ణువు ద్వారా పాలన , శంకరుని ద్వారా వినాశనం (మంచి కోసం, రీ సైక్లింగ్) జరుగుతుంది . శంకరుడు కూడా శివుని ని ధ్యానం తో స్మృతి చేస్తాడు. 


☘️☘️☘️☘️☘️☘️☘️


• ఇకపోతే  . . . వినాయకుడు . . . గణపతి .

ఓం   గం   గణపతయే  నమః.

" ఓం "  ఆత్మ  నైన  నేను  

“ గం ”  అనే శబ్ద తరంగం ఉచ్ఛారణ చేయడం వలన

“ గణ ” (గణములు) శరీర నరముల చైతన్యానికి 

“ పతియే ”   ఆధిపత్యము వహించు వానికి

“ నమః “  ప్రణామములు .


• ఈ గణపతి  మంత్ర నామం నిత్యం సవ్యంగా 108 సార్లు , ఆ పైన ఉచ్చరించడం వలన మానవుని నరములు చైతన్యం అయి, మూలాధారం (నాభి కింది స్థానం) నుంచి సహస్రారము (తల పై) వరకు అనంతమైన విశ్వ శక్తి ప్రవహించును.

తద్వారా బుద్ధి వికాసం చెంది , ఆలోచనలు శ్రేష్టం అగును. 

అప్పటి వరకు మనిషి  కలిగి ఉన్న ఆలోచనలలో చైతన్య  శక్తి  లేకుండుట  వలన , ఏర్పడిన  విఘ్నాలు ఆటంకాలు   సమస్తం తొలగును. సమస్యలకు పరిష్కారం లభించును. అందుకే బుద్ధి కి  చిహ్నం గా గణపతి ని చూపిస్తారు. నరములు చైతన్యం అవడం వలన గణిత శాస్త్రం లో ప్రావీణ్యం పొందుతారు . 

గరిక గడ్డి తాకడం , వాసన పీల్చడం వలన నరముల లో దోషం నివారణ అగును . అందుకే గణపతి కి గరిక నివేదిస్తారు .


☘️☘️☘️☘️☘️☘️


• గణపతి కి ఏనుగు తల ఆపాదించి చూపించడం  వెనుక  ఒక  రహస్యం దాగి ఉంది. అదే  మానవుని శ్రేయస్సు . రాబోయే యుగాలలో మనిషి బుద్ధి పూర్తిగా వికారాల లో  మునిగి భ్రష్టు తో  ఉంటుందని ముందే గ్రహించిన  మునులు , అందు నుంచి బుద్ధి విముక్తి కోసం వినాయకుని పూజించమని తెలిపారు.


• విశాలమైన ఏనుగు చెవులు వలే , మనిషి తన చెవులను  ఉంచి  అనంతమైన సృష్టి  జ్ఞాన విషయాలు వినాలని .

• ఏనుగు కళ్ల  వలే మనిషి తన కళ్లు పెద్దవి గా ఉంచి  జీవితం లో   ప్రతీ అంశం పట్ల  సూక్ష్మ దృష్టి , దూరదృష్టి   కలిగి ఉండాలని .

• ఏనుగు తల అంత విస్తారం గా  మనిషి బుద్ధి మంచి ఆలోచనలతో   కలిగి ఉండాలని .

• గణపతి పొట్ట అంత ఎక్కువగా మనిషి తనలో  జ్ఞానాన్ని  ఇముడ్చు  కోవాలని  .

• మనిషి  స్థిరం గా  ఉన్న ప్రదేశం లోనే  ఉండి , ఏనుగు తొండం చాపి నట్లు గా  సుదీర్ఘమైన శుద్ద సంకల్పాలు లోక కల్యాణం కోసం  చేయాలని .

• మనిషి ఇన్నీ  దైవీ గుణాలు కలిగి ఉంటూ , అహంకారం , ఆడంబరం లేకుండా ఉండాలని ఉద్దేశం తో  అంత పెద్ద గణపతి  ఆకారానికి చిన్న పీట పై ఆసీనం అయినట్లు చూపించారు.

• ఇక చివరిగా ఎలుక వినాయకుని వాహనం. అసలు ఇది వాస్తవానికి సాధ్యమే నా ? ఆలోచించండి . . .  దీని సూక్ష్మార్థం వినాయకుడి అంత  భారీ శరీరం మోసేది  సూక్ష్మమైన  ఎలుక  వలే ,    ఎన్నో  సుగుణాలు, లక్షణాలు, కలిగిన మనిషి శరీరాన్ని   నడిపించేది  సూక్ష్మమైన ఆత్మ అని తెలియ  చేయడానికి  ఎలుక తో వినాయకుడిని సృష్టించారు .


వినాయకుడిని పూజించడం వలన మనిషి మహా జ్ఞాని అవుతాడు .


ప్రతీ శుభకార్యానికి ముందు , వినాయకుని పూజ చేయడానికి కారణం . . . మనిషి బుద్ధి  లో  ఉన్న వ్యర్ద (నెగెటివ్) ఆలోచనలు సంకల్పాలు  సమాప్తం అయి ,  పాజిటివ్ ఆలోచనలు వృద్ధి చెంది  ,  సత్బుద్ధి నొందడం ద్వారా  మంచి శక్తి పొంది  తలపెట్టిన శుభకార్యాలు   ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం గా  పూర్తి కాబడతాయి .


• నేటి మానవుడే , ఒకప్పటి సత్య, త్రేతా యుగాలలో దేవతా లక్షణాలు, దివ్య శక్తులు, బుద్ధులు కలిగి ఉండేవాడు . తరువాత కాలంలో ద్వాపర కలియుగాలలో ఆ మానవుడు అసురుడి లక్షణాలు కలిగి ఉంటాడు . అందుకు నిదర్శనం పైన ఉదహరించిన వికారమైన చేష్టలతో , బుద్ధి హీనత తో చేయకూడని విధంగా గణపతి భక్తి చేయడం లాంటివి మరెన్నో .

 భగవంతుని కోసం  చేసే భక్తి పూజ  వెనుక , దాగి ఉన్న సత్యమైన సూక్ష్మం తెలుసుకుంటేనే  శ్రేష్ట ఫలితం లభిస్తుంది .

 

ఈశ్వరుని  జ్ఞానం  పరమ  సత్యం . 

సత్యాన్ని మనిషి  అనేక సార్లు వింటాడు, చదువుతాడు , తెలుసుకుంటాడు.  కానీ ఆచరించడు . ఎందుకంటే  ఆచరిస్తే  అందరితో వివాదాలు తలెత్తుతాయి అనే భయం .  అందుకే మనిషి లో ఉన్న  శరీరం మరియు  ఆత్మ పొందవలసిన ఉన్నతి పొంద లేకపోతున్నాయి .


  ఓం శాంతి 🙏

  ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 4 Sep 2025 , 9:30 PM .


Monday, September 1, 2025

684 .తల్లి తండ్రులు – పిల్లలు – ఉపాధ్యాయులు

 


తల్లి తండ్రులు – పిల్లలు – ఉపాధ్యాయులు



• నేటి మన పూర్తి జీవితానికి మన పిల్లలు మరియు మన తల్లి తండ్రుల బంధమే మనకు పునాది.  పిల్లలు అందరూ తమ చిన్నతనంలో అలవర్చుకునే  అలవాట్లు వారి తల్లిదండ్రుల నుండే నేర్చుకుంటారు. తరచుగా తల్లిదండ్రులు పిల్లలపై ,తమకు సానుకూలంగా(అనుకూలంగా) ఉండే అలవాట్లను రుద్దుతుంటారు .

• పిల్లలు కోపం తెచ్చుకున్నా, అబద్ధాలు చెప్పినా, టి.వి, ఇంటర్‌నెట్‌ వంటి సైన్సు మాధ్యమాలలో తప్పుడు సమచారాన్ని చూసినా లేక చిన్న వయసులో తప్పుడు స్నేహం చేసినా, తాగుడు, ప్రొగ తాగడం వంటి అలవాట్లు ఉన్నా తల్లిదండ్రులు పిల్లలను తిడుతూ ఉంటారు.

• తల్లిదండ్రులు ఏర్పరచిన నియమాలను పిల్లలు పాటిస్తూ , పిల్లలు వారి ఆలోచనల స్వభావ సిద్ధంతో తీసుకువచ్చే మార్పులకు తల్లిదండ్రులు చాలాసార్లు సంతృప్తి చెందరు. ఇది పిల్లలు-తల్లిదండ్రుల బంధాన్ని చాలా ఇబ్బందిపాలు చేస్తుంది . వారి మధ్య మానసిక దూరం పెంచుతుంది .

• తల్లిదండ్రులు తమ బాగు కోసమే చెప్తున్నారన్న విషయం తెలిసినా గానీ పిల్లలు ఎందుకు వారి మాట వినరు? 

మాటలకన్నా శక్తివంతమైనవి, పిల్లల భౌతిక స్థాయి పై ప్రభావం చూపించేది తల్లిదండ్రుల యొక్క వ్యక్తిత్వం . ఇది పిల్లలపై  అదృశ్యంగా ( పైకి కనిపించని ) ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రుల మాటలకన్నా వారి వ్యక్తిత్వమే పిల్లలకు త్వరగా చేరుకుంటుంది.

• తల్లిదండ్రులు మార్పును చెప్తారు గానీ మార్పును స్వయం తాము అవలంబించరు. ఏ చెడు అలవాట్లనైతే పిల్లలలో వద్దు అని తల్లిదండ్రులు చెప్తున్నారో అవి వారిలో ఉంటున్నాయి . కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము మొదలైనవి … ఇవి పిల్లల సూక్ష్మ స్థాయికి చేరుకుంటూ ఉంటాయి.

  ఈ ప్రతికూల గుణాలు , శక్తులు పిల్లల మనసులను తల్లిదండ్రులు ఇచ్చే సూచనలు, శిక్షణలకన్నా  ఎక్కువగా ప్రభావితం చేసి, మాటలవలన పొందే ప్రయోజనాన్ని శూన్యంగా చేస్తున్నాయి.


• పిల్లలకు ఉండే మరో ముఖ్యమైన బంధం గురించి ఆలోచిస్తే, వారికి వారి స్కూలు టీచరుతో ఉన్న బంధం. పిల్లలపై ఉపాధ్యాయులకున్న ఆపేక్షలు, మంచిగానీ చెడుగానీ, అవి పిల్లల విద్యా సామర్థ్యాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయని అనేక పరిశోధనల ద్వారా నిరూపించబడింది . విద్యార్థులలో తక్కువ సమర్థత ఉంది అని అనుకునే కంటే . . . టీచర్లు మరియు పిల్లలలో మంచి సమర్థత ఉంది, వారు మంచి ఫలితాలను తీసుకువస్తారన్న నమ్మకాన్ని కనబరిచినప్పుడు పిల్లలు కూడా తమ సమర్థతకు ఏ మాత్రం తగ్గకుండా తమ మానసిక శక్తి తో పని చేసి మంచి ఫలితాలను పొందుతారు.

• తరచుగా పాఠశాలలో, పిల్లల సమర్థత గురించి ఉపాధ్యాయులు మాట్లాడే మాటలకు, ఆలోచించే ఆలోచనలకు పొంతన ఉండటం లేదు . ఉపాధ్యాయుల మాటలు చూస్తే వారికి విద్యార్థులపై పూర్తి నమ్మకము, ఆశ ఉన్నట్లుగా మాట్లాడుతారు, కానీ వారి ఆలోచనలలో మాత్రం అంతటి సానుకూలత ఉండటం లేదు అనేది నిజం . 

పిల్లలు ఫెయిల్ అవుతారేమో అన్న భయంతో కూడిన ప్రతికూల ఆలోచన ఉపాధ్యాయులలో ఉన్నప్పుడు వారు మాటలతో ఎంత ప్రోత్సాహకరంగా మాట్లాడినా కానీ పిల్లల మనసుపై ప్రతికూలత యొక్క ప్రభావమే పడుతుంది. దీని కారణంగా పరీక్షలలో పిల్లలు తక్కువ సమర్థంగా ఉంటున్నారు . 

 నేటి కాలంలో పాఠశాల విద్య బోధన అనేది విలువలకు తిలోదకాలు ఇచ్చేసింది . దీని వలన సమాజ శ్రేయస్సు కి అన్ని విధాలా జరగవలసిన నష్టం జరగడం అనేది ఇప్పటికే ఆరంభం అయింది . దాని ఫలితం నిత్యం అశాంతి, హింస, కామము , క్రోధము తో కూడిన సంఘటనలు  వార్తలలో చూస్తూ ఉన్నాం .  

దురదృష్టం ఏమిటంటే ఇదంతా నేడు సహజం అని అనుకుంటూ మనం జీవించడం. 


యడ్ల శ్రీనివాసరావు 1 Sep 2025 5:00 AM.


690. భగవంతుడు నీ కోరికలు తీరుస్తాడా ?

   భగవంతుడు నీ కోరికలు తీరుస్తాడా ? కర్మ సిద్ధాంతం  • భరత భూమి కర్మ భూమి. అనగా ఈ నేల మీద మనిషి తాను చేసే కర్మల అనుసారం ఫలితం లభిస్తుంది ...