Thursday, June 18, 2026

759. ఎల్లి పోతున్నదే నా నావ

 

ఎల్లి   పోతున్న దే  నా నావ 


• ఎల్లి   పోతున్న దే    నా  నావ 

  మల్లి  . . .   ఎల్లి   పోతున్న దే   నా  నావ.


• గింగురల  గాలి  లో …. 

  గింగురల  గాలి  లో 

  రింగు   రింగులు     తిరుగుతూ   

• ఎల్లి   పోతున్న దే   నా  నావ 

  మల్లి . . .  ఎల్లి   పోతున్న దే   నా నావ.


• కారు   మబ్బు   కమ్మిట్లో 

  చెదురు  మదురు  సినుకుల లో 

  ఉరుకు   పరుగు లెట్టా  నే . . . 

• గోదారి   రేవు కే    చేరా నే  . . .   మల్లి 

  మల్లీ . . . గోదారి   రేవు కే   చేరా నే. 


  కానీ  . . . ఏం   లాభం.


• ఎల్లి   పోతున్న దే   నా నావ 

  మల్లి . ‌ .  ఎల్లి  పోతున్న దే  నా నావ.


• నాటు  పడవ   పోటుగాడు 

  నాటు   పడవ   పోటుగాడు 

• నన్ను   సూసి 

  రమ్మని  సేయి  ఊపినాడు . . . 

• ఉరుకు    దామనుకుంటే 

  ఆ  . . .  ఉరుకు   దామనుకుంటే 

• గోదారి   గల గల  లే 

  ఈ గోదారి  గల గల లే 

  భయపెట్టి   ఆపినాయి .

పొద్దు  కూకుల  నను  రేవు లో 

   కూసో   బెట్టి   నాయి . 


• ఈదురు   గాలులతో 

  సినుకుల    గోలలతో

  అలల     ఉరుకుల తో 

  పున్నమి  యెన్నెల  తో 

  ఏదో  . . . ‌ భయమయితిందే   మల్లి 

  నాలో  ఏదో . . .  భయమయితిందే   మల్లి .


• ఎల్లి   పోతున్న దే  నా  నావ 

  మల్లి  . . .  ఎల్లి  పోతున్న దే   నా నావ.


• గింగురల   గాలి లో …. 

  గింగురల   గాలి లో 

  రింగు    రింగులు      తిరుగుతూ   

• ఎల్లి   పోతున్న దే   నా  నావ 

  మల్లి  . . . ఎల్లి    పోతున్న దే    నా నావ.


🌹🌹🌹🌹🌹


ఈ రోజు సాయంత్రం సరస్వతి ఘూట్ (రేవు) లో వాకింగ్ చేస్తుంటే , అకస్మాత్తుగా ఈదురు గాలులు, చీకటి మబ్బులు, ఉరుములు మెరుపులతో సన్నగా చినుకులు ఆరంభమయ్యాయి.  వాతావరణం అంతా , ప్రకృతి పురి విప్పిన నెమలి లా నాట్యం చేస్తుందా ! అని అనిపించింది.  

అప్పుడే కొన్ని క్షణాల క్రితం రేవు లో  నుంచి ఒక నావ కొంతమంది తో బయలు దేరింది . వారంతా కూలీ పనులు చేసుకునే వారు. గోదావరి మధ్యలో ఉన్న లంకల్లో  (ఎత్తైన ఇసుక దిబ్బలు) ,  గుడిసెలు వేసుకొని  తమ కుటుంబాలతో నివసిస్తారు . వారు రోజు ఉదయం నావలో ఇటు రేవు లోకి (రాజమండ్రి) వచ్చి భవన నిర్మాణ కూలీ పనులు తదితరమైనవి చేసుకొని సాయంత్రం తిరిగి వెళ్ళి పోతారు . 

ఇంతలో ఒక వ్యక్తి పరుగు పరుగున ఆయాసపడుతూ నావ ఎక్కడం కోసం రేవు లోకి వచ్చాడు . కానీ అప్పటికే ఆ నావ కొంత దూరం వెళ్ళి పోయింది . పడవ నడిపే వాడు చేయి ఊపుతున్నాడు . ఈ వ్యక్తి చేసేది ఏమీ లేక రేవు లో కూర్చుని దిక్కులు చూస్తున్నాడు . 

ఆ సమయంలో ఒక వైపు హోరున భయంకరమైన గాలి,  మరోవైపు చీకటి పడుతూ ఉండడం , సన్నగా వర్షం , ఆ నావ గాలికి ఊగడం , అందులోని వారు తడిచి పోవడం , ఈ వ్యక్తి నావ దొరకలేదని నిరాశ గా నిలబడడం , అదంతా మనసు తో చూస్తుంటే ప్రకృతి  ఏదో చెపుతుంది అనిపించింది .  

ఆ భావాలే ఈ జానపదం . ప్రకృతి కలిగించిన అవకాశం . 

 . . . మనిషికి ప్రకృతి ద్వారా దొరికినంత ఆనందం ఈ సృష్టిలో ఎక్కడా దొరకదు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రకృతి లోనే , పంచభూతాలు మరియు భగవంతుని శక్తి ఉండడమే ప్రధాన కారణం . ఎందుకంటే  మనిషి కూడా పంచభూతాలతోనే సృష్టించబడి  ఉన్నాడు కదా . . . 


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు  18 June 2026 5:30 PM.















Monday, June 15, 2026

758. నర్తనం

 

నర్తనం


• భావము లో    భాష్యం 

  గోవిందా    . . . గోవిందా 

• భావము లో    భాష్యం 

  గోవిందా    . . . గోవిందా .


• నడయాడే    నర్తకి   పాదము 

  పలకరించే  

  ధరణి   సంభూతము .

• నగుమోము న    దివ్య  తేజము 

  వికసించే     

  శ్రీరంగ    వైభవము .


• భావము లో      భాష్యం 

  గోవిందా     . . .   గోవిందా 

• భావము లో       భాష్యం 

  గోవిందా    . . .    గోవిందా .


• అభినయ   భంగిమ   చలనము లే

  కైలాసుని    నఖశిఖ    పర్యంతములు .

• కళల     కాణాచి   ఈ నర్తన మే 

  పార్వతి  సిగలో    పారిజాతము .


• గజ్జెలు  మోగే    నాదము లో 

  గమకము   లెన్నో   ఆడాయి . 

• సజ్జన    మేగే      నృత్యం లో 

  జీవము  లెన్నో     తరియించాయి .


• భావము లో     భాష్యం 

  గోవిందా   . . .   గోవిందా 

• భావము    లో    భాష్యం 

  గోవిందా    . . .   గోవిందా .


• నర్తనం     ఆవర్తనం     సంవర్తనం

  నర్తనం     సంకీర్తనం    పరివర్తనం 


• భావము లో     భాష్యం 

  గోవిందా   . . .   గోవిందా 

  గోవిందా   . . .   గోవిందా 

  గోవిందా   . . .   గోవిందా .



🌹🌹🌹🌹🌹


• భావము లోనే మూల సూత్రాలకు నిర్వచనం (భాష్యం) ఉంది . గోవిందా . . .  గోవిందా. 

• నాట్యం చేసె నర్తకి  పాదము తో ,  భూమి పుట్టుకను  పలకరించును .

• ముఖమున దైవ తేజస్సు , శ్రీరంగ నాధుని వైభవం వలే వికసిస్తుంది .

• అభినయం చేస్తున్న నృత్య భంగిమల కదలికలు శంకరుని పాదము నుంచి తల వరకు గల రూపములు .

• వంశ కుల ధర్మమైన ఈ కళా నృత్యం పారిజాత పుష్ప మై పార్వతి దేవి సిగ లో ఉండును .

• కాలి గజ్జెలు చేస్తున్న శబ్ధం లో స్వరాల సముదాయాలు ఎన్నో కలిసి ఆడాయి .

• అలంకార మైన ఈ నాట్యం వలన ఎన్నో జీవులు తరించాయి .

• నాట్యం పాఠం వలే వల్లే వేయు మంచి జీవన విధానము.

• నృత్యం  కధనము గా  విశ్వం లో  మార్పు సృష్టించును.



ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 15 June 2026 , 2:00 PM.




Sunday, June 14, 2026

757. శ్రీ మత్ భగవద్గీత

 

శ్రీ మత్  భగవద్గీత



• భగవద్గీత అంటే భగవంతుడు గీసిన గీత గా అభివర్ణించవచ్చు . సమస్త సృష్టి కి బీజ రూపుడు అయిన పరమాత్మ శివుడు , ఈ సృష్టి ని నడిపించడానికి , నియమ నిబంధనల తో కూడిన ధర్మాన్ని రచించాడు . ధర్మం అంటే సృష్టి కళ్యాణం కోసం నిర్మించిన ఆచరణాత్మక విధి విధానాలు , అందులో    ప్రకృతి   పంచభూతాలతో సహ  ప్రతి జీవి , ప్రతి ప్రాణి  కూడా ఒకటికి   మరొకటి సహకరించుకుంటూ, ఏ ఒక్కటీ మరొక దానికి హని కలిగించకుండా జీవించ వలసిన విధి విధానమే ప్రధానం .


• విశ్వానికి హద్దులు లేవు కానీ విశ్వం లో జీవించే ప్రతి జీవానికి హద్దులు పరిమితులు తప్పకుండా ఉన్నాయి . అవి తమ తమ ధర్మానుసారం  జీవించవలసిన అవసరం ఉంది. ఇదే భగవంతుని నియమం. ఇదంతా విశ్వ కళ్యాణం కోసం, ప్రతీ జీవి సుభిక్షంగా జీవించడం కోసం .

• అందుకే భారతీయ సంస్కృతి సంప్రదాయంలో పండుగల్లో ప్రకృతి , పంచభూతాలు , చెట్టు , పుట్ట , పశువు ఇలా అన్నింటిని గౌరవిస్తూ వాటిని పూజించేలా  అంతర్భాగంగా చేశారు . అవి మూఢనమ్మకాలు కానే కావు .  నేటి కాలం లోని అనేకులకు అందు  ఇమిడి ఉన్న శాస్త్రీయత , సూక్ష్మం, జ్ఞానం తెలియక పోవడం వలన  మూఢనమ్మకాలు గా భావిస్తుంటారు .


 శ్రీమత్ భగవద్గీత

 శ్రీ      =  శ్రేష్టమైన

 మత్  = సలహా

భగవద్గీత = పరమాత్మ ని రచన , భగవంతుని నిబంధన , భగవంతుడు గీసిన హద్దు గీత .


• శ్రీ మత్ భగవద్గీత అంటే శ్రేష్ఠమైన సలహాలతో మానవుని కోసం శివ పరమాత్ముడి సృష్టించిన నియమ నిబంధన . ఆ  నిబంధనలను మనిషి దాటకుండా ఉండడానికి  భగవంతుడు గీసిన గీత గా భగవద్గీత ను  అభివర్ణించవచ్చు . (శివుని యొక్క ఈ  గీతా రచనను , సత్య యుగపు రాకుమారుడు అయిన శ్రీకృష్ణుడు తన దివ్యత్వంతో లోక కళ్యాణార్దం భగవంతుని మాట గా అర్జునుడికి వినిపిస్తాడు . శ్రీకృష్ణుడు ఏ దశలో  కూడా నేనే స్వయం భగవంతుడుని అని చెప్పడు ,  భగవానువాచ అని మాత్రమే చెప్తాడు . అంటే దాని అర్థం భగవంతుడు ఇలా చెప్పాడు అని భగవంతుని దివ్య వాణి ని  శ్రీకృష్ణుడు  వినిపిస్తాడు. భగవంతుడు ఒక్కడే అతడే శివుడు, పరమాత్ముడు)


• ఈ సృష్టిలో అన్ని జీవులు , ప్రాణుల కంటే మానవుడు ఒక ప్రత్యేకం. బుద్ధి, వివేకం , ఆలోచన, జ్ఞానం వంటి లక్షణాలు కేవలం మనిషి కి మాత్రమే ఇవ్వబడ్డాయి. ఒక మనిషి మరొక మనిషికీ అపకారం తలపెట్టిన నాడే ఈ సమస్త సృష్టి అదుపు తప్పుతుంది . వినాశనం వైపు అడుగులు వేస్తుంది . ప్రత్యక్షం గా ప్రస్తుత కాలంలో వంద శాతం జరుగుతున్నది అదే .


 ఈ సృష్టిలో కాలం మొత్తం సత్య , త్రేతా , ద్వాపర , కలి , ఈ నాలుగు యుగాలలో నే తిరుగుతుంది . ( Repeated cycle )


• సత్య యుగం లో ప్రతి జీవి , ప్రతి ప్రాణి , ప్రతి మనిషి భగవంతుని రచన ప్రకారమే జీవించేవి . అందుకే అక్కడ అమితమైన ఆనందం తప్ప దుఃఖం భాధ , అన్యాయం, మోసం అనే పదాలు, వాటి అర్థాలు, వాటి అనుభవాలు కూడా ఏ జీవికి తెలియవు . సత్య యుగం లో అవు పులి కలిసి ఆడుకుంటూ, ఒకే నదిలో నీరు తాగుతాయి . సత్య యుగం , ఆది సనాతన దేవి దేవతా ధర్మానుసారం , ధర్మం నాలుగు పాదాల లో నడుస్తుంది . సత్య యుగాన్ని బంగారు యుగం (Golden Age) అంటారు .


 కానీ కలియుగం లో  ధర్మం పూర్తిగా నశిస్తుంది. భగవద్గీత ను కేవలం ఒక గ్రంథం, పుస్తకం వలే చూడడానికి మినహా ఆచరణకు నోచుకోలేని స్థితిలో మనిషి జీవనం  దిగజారి ఉంటుంది . ఇదే భగవంతుడు గీసిన గీతను ఉల్లంఘించడం . అందువలన అశాంతి దుఃఖం హింస తో జన జీవనం నిండుతుంది . ఏ మానవమాత్రునికి ఇందు మినహాయింపు లేదు. కలియుగాన్ని ఇనుప యుగం (Iron Age) అంటారు . ఈర్ష్య ద్వేషం అసూయ కామం క్రోధం తో మానవ జన్మలు పూర్తి భ్రష్టు మయం అయి ఉంటాయి .

 దీనిని ఉదహరించే , రామాయణం లో ఒక మంచి విషయం చెప్పబడింది . సీత లక్ష్మణుడు గీసిన గీత ను దాటి నందుకు , రాక్షసుడైన రావణాసురుడు మాయా రూపం లో  అపహరిస్తాడు. దుఃఖం, కష్టం లో ఉన్న సీత రామునికై ఎదురు చూస్తుంది . . . 

దీని అర్థం భగవంతుడు  గీసిన గీత , నియమం ధర్మాన్ని కలియుగం లో ప్రతి మనిషి ఉల్లంఘించి దాటడం వలన కలియుగ మాయా  వికారాలలో చిక్కుకొని , వాటికి  వశం అయి , దుఃఖం అనారోగ్యం ఈతి భాధలతో విలవిలాడుతూ తిరిగి భగవంతుడిని రమ్మని ప్రార్థిస్తూ  , రక్షించమని ప్రాధేయపడతారు .


• జ్ఞాన యుక్తం తో అర్దం చేసుకోగలిగితే ,  మనిషి  జీవన రక్షణ కోసం రచించిన సత్యం , జీవన వేదమే భగవద్గీత . 

కురుక్షేత్రం అంటే ఎప్పడో జరిగిపోయిన యుద్ధం కాదు . కలియుగం లో భూమి పై ప్రతి మానవుడు మనసు తో అనుభవించే యుద్ధం. అందుకే అది మహా భారతం .  అందులో  కౌరవులు , పాండవులు ఇంకా  భారతంలో ఉన్న అనేక రకాల పాత్రలు పోషించేది నేడు ప్రత్యామ్నాయ రూపం లో మనమే.


శివుడు కల్పించిన అవగాహన కొద్దీ ✍️ .



రోహిణి  అమావాస్య  ప్రకాశం


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు. 14 June 2026 1:00 PM.


Friday, June 12, 2026

756 . హద్దు లేని ఆకాశం నీ ప్రేమ

 

హద్దు లేని  ఆకాశం  నీ  ప్రేమ



• హద్దు  లేని   ఆకాశం   నీ  ప్రేమ .

  హావభావాలు   ఎరుగకనే   చూపావు .

  ఆనందడోలికలలో   ముంచావు .


• హద్దు  లేని   ఆకాశం   నీ  ప్రేమ .


• వర్ణన కే    రాని   అమితం   ఈ అద్బుతం

  ఎన్ని   జన్మల    పుణ్యఫలం .


• నా    కంటనీరు   ఆరుద్రమై

  నీ   పాదము   చేరగా

  నా  హృదయం   తాకేవు .


• నీ  స్పర్శ  ఎరుగని   ఈ తనువు

  పుష్ప మై    ఊగుతూ   ఉంది .

• నా  మనసు     మైనమై

  మౌనం తో   నీ కై   సాగుతూ  ఉంది .


• హద్దు లేని   ఆకాశం    నీ ప్రేమ .

  హావభావాలు   ఎరుగకనే   చూపావు .

  ఆనందడోలికలలో   ముంచావు .


• శివ మనే   శబ్దం    సెలయే రై   సాగెను .

  నా మది లో   మైకాన్ని    శుద్ది   చేసెను .


• మర  జీవము లో    మహత్యమే

  సంజీవని గా     ఇచ్చావు .

• ముల్లోకాల నే    మకరందాలు

  జ్ఞానం తో    చూపావు .


• హద్దు లేని    ఆకాశం   నీ ప్రేమ .

  హావభావాలు   ఎరుగకనే   చూపావు .

  ఆనందడోలికలలో    ముంచావు .

  హద్దు లేని    ఆకాశం   నీ  ప్రేమ .



  హావభావాలు  =   శరీర  భావోద్వేగాలు 

  మర  జీవము =  జీవంలో  మరణ  ఆస్వాదన .

  సంజీవని  =  దివ్య ఔషధం .


  ఓం శాంతి

  ఓం నమఃశివాయ 🙏.

  యడ్ల శ్రీనివాసరావు 12 June 2026 9:00 pm.




Thursday, June 11, 2026

755. మరిచావా నేస్తమా

 

మరిచావా  నేస్తమా 


• మరిచావా  . . .   మరిచావా

  మై మరిచావా   నేస్తమా .

  మట్టి  వాసనలు  మరిచావా  .

• మంచు  తెరల  ఉదయం లో

  మన బడి పయనం   మరిచావా . . . 


• సూరీడు   పలకరింపు లో

  నీ  చూపులు   చిలకరించడం .

• పైరు  గట్టు   గడ్డి బాటలో

  మన  ఎగుడు   దిగుడు

  అడుగుల   వయనం .

• రబ్బరు చెప్పుల   తడబాటు తో

  రబ్బరు చెప్పుల   తడబాటు తో

  రబ్బరు బొమ్మలా   ఎగిరిన   మన  బాల్యం

  మరిచావా . . .  మై మరిచావా .


• మరిచావా  . . .   మరిచావా

  మై మరిచావా    నేస్తమా

  మట్టి వాసనలు    మరిచావా .

• మంచు  తెరల   ఉదయం లో

  మన  బడి   పయనం  మరిచావా . . .


• తూనీగ ల కై      పరుగులు

  తొక్కుడు  బిళ్ళ లో     తైతక్కలు


• చిన్ని పళ్ళతో      నీ చిర్రుబుర్రులు

  చేతి సంచి తో     మన  చెట్టాపట్టాలు .


• వానలు     నింపిన    సంతోషాలు

  వానలు     నింపిన    సంతోషాలు

  వయనం    తెలియని    మన  కేరింతలు

  మరిచావా  . . .  మై మరిచావా .


• మరిచావా . . .  మరిచావా

  మై  మరిచావా     నేస్తమా

‌ మట్టి వాసనలు    మరిచావా .

• మంచు తెరల   ఉదయం లో

  మన  బడి పయనం    మరిచావా . . .


• భయపెట్టే   బడిలో    దండనలు .

  బిక్కు బిక్కుమంటూ  

  బెల్ కోసం   ఎదురు చూపులు .


• పాల ఐస్ కై      పడిగాపులు

  పీచు మిఠాయి కి   పరుగు పందాలు


• మరిచావా  . . .  మరిచావా

  మై  మరిచావా    నేస్తమా

  మట్టి వాసనలు    మరిచావా .

• మంచు తెరల    ఉదయం లో

  మన  బడి పయనం     మరిచావా . . .





యడ్ల శ్రీనివాసరావు 11 June 2026 10:00 PM



Monday, June 8, 2026

754. జీవాత్మ-పుణ్యాత్మ- పాపాత్మ-ప్రేతాత్మ-దేవాత్మ

 

జీవాత్మ

పుణ్యాత్మ- పాపాత్మ-ప్రేతాత్మ-దేవాత్మ



• మనిషి జీవించి ఉన్నంత కాలం లో తన మూల స్వరూపాన్ని తెలుసుకో లేకపోవడం , ఆ మూల స్వరూపాన్ని చేరే ప్రయత్నం చేయక పోవడం లేదా తన మూల స్వరూపానికి అనుసంధానం కాలేకపోవడం వలనే ప్రేతం (దెయ్యం) అనేది ఆవిర్భావం అయింది . వాస్తవానికి ప్రేతం, ప్రేతాత్మ, దెయ్యం అనేవి సినిమాలలో , కధలలో భౌతికంగా కనిపించే రూపాలు కాదు . అవి కంటికి కనపించని నెగెటివ్ దుష్ట శక్తులు . ప్రేతం లేదా ప్రేతాత్మ లో తీరని కోరికల నిధి ఉంటుంది . ఈ సృష్టిలో దైవం ఉన్నట్లే ప్రేతం (దెయ్యం) కూడా ఉంది .


• ఏనాడైతే మనిషి నేనొక “ఆత్మ” అనే భగవత్ సత్యం ఎరిగి, తన మూల స్థితి ఆత్మ అని తెలుసుకొని , భగవంతుని కి (పరమాత్మ శివుడు) అనుసంధానం అవుతాడో , (బహుశా దీనికి అనేక జన్మలు, యుగాలు కూడా పట్టవచ్చు) ఆనాడే మనిషి , దైవీ శక్తి పొంది దేవత గా వెలుగొందగలడు . అటువంటి మనిషి యొక్క ఆత్మ, ఆ మనిషి మరణం తరువాత పుణ్యాత్మ గా, దేవాత్మ గా కొనియాడ బడుతుంది . ఇందుకు ఉదాహరణ గా నేడు ప్రతీ ఊరిలో గ్రామ దేవతలు గా కొలవబడుతున్న వారంతా కొన్ని జన్మలు, యుగాల క్రితం దైవీకమైన దివ్య శక్తులు తో లోక కళ్యాణం చేసి జీవించిన మానవులే . ఆలోచిస్తే నేడు ఆ గ్రామదేవతలకు ఉన్న పేర్లు , అప్పటి మనుషుల పేర్లే , కానీ వారు దివ్య సాధన తో దైవీ శక్తులు కలిగి ఆ ప్రాంతాలకు మేలు చేయడం వలన దేవతలు గా నేటికీ పూజలు అందుకుంటున్నారు . కానీ దురదృష్టవశాత్తు నేటి కాలం మనుషులు కలియుగ మాయకు దాసోహం అయి. తమ అవసరాల కోసం , అజ్ఞానం తో ఈ గ్రామదేవతల పూజల విధానంలో మూఢనమ్మకాలను (జంతు బలులు, మద్యపానం, జూదం) బలంగా చొప్పించారు . ఇది ఒక విచారకరమైన దౌర్భాగ్యం . దైవాన్ని నిందిస్తూ, దైవం పేరుతో మానవుడు చేసే జంతు బలుల హింస , పాపం తిరిగి జన్మ జన్మలు నరకం అనుభవిస్తాడు . ఎందుకంటే కర్మ సిద్ధాంతం ప్రకారం ఏ హింస మనిషి చేస్తాడో , అదే తిరిగి అనుభవిస్తాడు.


• ఒకవేళ మనిషి , ఒక జన్మ లో తాను జీవించి ఉన్నంత కాలం లో తన మూల స్థితి తో అనుసంధానం కాకుండా, ఆ విషయం తెలుసుకో లేక , కోరికలతో జీవిస్తూ మరణిస్తూ ఉన్నంత కాలం , ప్రేతం వలే ఆ మనిషి అంతర్గత పయనం ఉంటుంది. అందుకే కే కోరికలు భూతాలు (భూతం) అని , భూతాలు పట్టు కుంటే వదలవు అని అంటారు.

  భూతం (కోరిక) ఆవహించింది అంటే, అంత సులభంగా వదలదు. ఒక కోరిక తరువాత మరొకటి అలా పెరుగుతూ నే ఉంటాయి . ఒకానొక దశలో భూతం బలంగానే ఉండిపోతుంది , కానీ మన శరీరం పీడితం అయి బలహీనం గా అయిపోతుంది . అంటే కోరికలు బలం గానే మన ఆత్మ లో మిగిలి ఉంటాయి, కానీ శరీరం మాత్రం నిర్వీర్యం అయి మరణం పొంది దహనం అయిపోతుంది. ఆ కోరికలతో ఉన్న ఆత్మే , ప్రేతాత్మ గా తయారై తిరిగి జన్మించి ఇష్టారాజ్యంగా కోరికలు తీర్చుకునే జీవితం గడుపుతుంది.

• మరి మనిషి లోని భూతాన్ని శాశ్వతంగా వదిలించు కోవాలి అంటే , ఒకటే మార్గం అదే దైవం, దైవ స్మరణ . నేను ఒక చైతన్యవంతమైన ఆత్మ ను , శాంతి సుఖం ప్రేమ జ్ఞానం ఆనందం పవిత్రత అనేవి నా ఆత్మ యొక్క ధర్మాలు అనే విషయం నిత్యం బుద్ధి లో ఉంచుకుని , శివారాధన, శివ ధ్యానం చేయడం వలన . . . మాయా భూతమైన కామము క్రోధము మోహం వంటి వికారి కోరికలలో చిక్కు కోకుండా , మోక్ష సిద్ధి కి అవసరమైన కోరికలతో జీవితాన్ని సంతృప్తి కరంగా తీరం దాటించు కోవచ్చు. ఏనాడైతే భూత కోరికలకు అతీతమై దివ్యత్వం వైపు అడుగులు పడతాయో , అప్పుడు మనిషి ఆత్మ తన లోని మలినాలను శుద్ది చేసుకొని, చైతన్యమై లోక కల్యాణానికి, సమాజ సేవ , నిస్వార్థమైన పరోపకార సిద్ది లభిస్తుంది . సరిగ్గా ఈ సమయంలో శత్రు , దుష్ట శక్తుల సంహారం కూడా తప్పక జరుగుతుంది . ఎందుకంటే ఆత్మ దైవత్వం , మంచి వైపు అడుగులు వేసే సమయంలో శత్రు దుష్టశక్తుల దాడి ఏదో రూపంలో తప్పక ఉంటుంది . ఎందుకంటే నువ్వు తెలిసో తెలియకో నీ లోని చెడు గుణాలు  లేదా నీ చుట్టూ ఉన్న శత్రు దుష్టశక్తుల తో నే అప్పటి వరకూ సహవాసం చేశావు కాబట్టి. వాటిని వదిలి నువ్వు దైవం తో కలుస్తాను అంటే, అవి తప్పక నీ పై తప్పక దాడి చేస్తాయి . చివరికి అవి సమూలంగా సంహరించ బడతాయి.


• శరీరం ధరించిన ప్రతి ఆత్మ జీవాత్మే  . ఆ ఆత్మ ఈ భూమి పై జీవించడానికి శరీరం ధరిస్తుంది . ఆ జీవాత్మే , చేసిన  కర్మల అనుసారం పుణ్యాత్మ , పాపాత్మ , ప్రేతాత్మ , దేవాత్మ గా కొనియాడ బడుతుంది.


• ఒక మనిషి లోకానికి ఉపయోగపడే పుణ్య కార్యాలు చేస్తూ మరణిస్తే “పుణ్యాత్ముడు” గా కీర్తించబడతాడు .

• ఒక మనిషి లోకులకు దుఃఖం కలిగిస్తూ, పాప కర్మలు చేస్తూ మరణిస్తే “పాపాత్ముడు” గా దూషించబడతాడు.

• ఒక మనిషి తీరని కోరికలతో మరణిస్తే “ప్రేతాత్మ” గా అయి తనకు తానే పీడించబడుతూ ఉంటాడు .

• ఒక మనిషి భగవంతుని సాధన చేసి, భగవత్ శక్తి ని లోక కళ్యాణార్దం సేవ గా మరల్చి జీవిస్తూ మరణిస్తే “దేవాత్మ” గా పూజలందుకుంటాడు. ఈ దేవాత్మ లే నేటి మన గ్రామ దేవతలు .


ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 9 June 2026 11:00 AM.

Saturday, June 6, 2026

753. భగవంతునిపై అలకలు కోరికలు

 

భగవంతునిపై అలకలు కోరికలు



•  "భగవంతుని పై  అలక" . మానవ జన్మలో మనం సృష్టించుకున్న ఒక అమాయకమైన అనుభూతి . "దైవం"  అంటే ప్రత్యక్షం గా  కనబడని వినబడని నిజం .  ఆ నిజాన్ని , స్వీయ అనుభవం తోనే అనుభూతిని చెందగలం . 

నీవు కోరనిదే నీకు అనురక్తి లేనిదే ఒక అతీతమైన శక్తి నీతోటే నడవదు . దైవలోకం అన్నది అతీంద్రియ సుఖం పొందిన మానవుని మనసు దివ్యత్వం పొందినపుడు కనిపించే లోకం , అది మనిషి లోని ఒక మానస సరోవర మందిరం . అందున దేవుడు సర్వ శక్తులతో మహిమాన్వితుడై ఉంటాడని అనుభవాలతో నిరూపణ అవుతుంది .

• గుడి , క్షేత్రం లేక జాతర ఇలా ఎక్కడ అయినా మనం కోరుకున్న మనం సృష్టించుకున్న మన మంచికోరే దేవతలు కొలువై ఉన్నారనేది మన నమ్మకం. ఆ నమ్మకం మనలని నడిపిస్తుంది అదే నమ్మిక మనలని భగవారాధనకు ప్రేరేపిస్తుంది.

  నీ కర్మల ఫలితంగా లేక నీ నడవడి కారణం గా నీకు జీవితంలో కలిగే ఇబ్బందులు , నీకు ప్రకృతి ద్వారా ఎదురయ్యే సమస్యలు . ఇవన్నీ నీ మదిని చేరి నిన్ను కొత్త ఆలోచనలో పడేస్తాయి అదే దేవునిపై  "అలక" .


• భగవంతుడు  ఒక  "దారం"  అయి దండలో ఎప్పుడూ స్థిరం గా నే ఉంటాడు , కానీ దానికి కట్టిన పుష్పాలే , మనుషులు అయి వచ్చి చేరతాయి . మళ్ళీ వాడిపోయిన వెంటనే రాలిపోతాయి.

 ఇక్కడ దండ శాశ్వతమా లేక దారము శాశ్వతమా అంటే ? దారమే శాశ్వతం.  కానీ, పువ్వులు లేని దారముకి విలువ ఎక్కడిది ?

  అంటే మనుషులు కోరని దేవుడు ఉండునా ? అలాగని దారము లేని దండ నిలుచునా ? అంటే నువ్వు మాలలో చేరనిదే నీకు విలువెక్కడిది ?. . . అనగా భగవంతుని సాన్నిధ్యం లో చేరనిదే నీ మానవ జన్మకు పరిపూర్ణత సాధించలేవు .

  నీకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు గొప్పవాడు గాను , ప్రతికూలమైనప్పుడు మహిమ లేని వాడు కాదు. అందుకే కాలానికి కాలునికి కర్మలతో కట్టుబడి ఉండేవే మన జీవితాలు .


🌹🌹🌹🌹


• ”కోరిక” లేని చోట “కాలుడు” కొలువై ఉంటాడు. అని నిర్వాణ షట్కం లో ఆదిశంకరులు చెప్పారు . కానీ మనం ప్రతి విషయంలో అంతా “ఈశ్వరేచ్చ” అంటాము . 

కోరిక లేని వాడు (భగవంతుడు) మన గురించి కోరుకునేది ఏమిటి ? కర్మలు చేయనిదే మనిషి జన్మలకు విముక్తి ముక్తి ఉండవు . అలాంటప్పుడు కర్మానుసారం కోరికలు లేనప్పుడు అంత్య సిద్ధి సాధ్యమా?

ఈ జగత్తులో కోరిక లేని మనుషులు ఉంటారా ? అదెలా సాధ్యం ? భగవంతుని ఆరాధన చేయడం లో కూడా ఒక కోరిక ఉన్నది కదా ? కేవలం భగవతారాధన కోసమే మనసుని కట్టడి చేయగల జన్మ ఉంటుందా ?

 సాధారణంగా బియ్యపు గింజలు లో రాళ్ళని ఏరతాము కానీ మనుషులలో ఉత్తమోత్తములు కొందరు మహానుభావులు పుడతారు , వారు తీరు చూస్తే మనకు రాళ్ళలో బియ్యపు గింజలు ఏరిన మాదిరి అగుపిస్తుంది.  వాళ్లకి కోరిక మీద కట్టడి ఉంటుంది . కట్టడి అనే మాట కూడా సబబు కాదేమో ?  కట్టడి  అంటే బలవంతంగా కోరికను మనసులో అణచుకోవడం ,  అది సరికాదు . . . అలా కాకుండా వారికి కోరిక నియంత్రణ లో ఉంటుంది అనడం సబబు . నియంత్రణ అంటే కోరిక అనేది మనసును ప్రేరేపించుదు . అదే మనకు వారిలో  ప్రస్పుటిస్తూ ఉంటుంది . కంచి పరమాచార్యులు , పూజ్యులు రమణ మహర్షి , బ్రహ్మ బాబా , స్వామి పరమానంద యోగానంద , పరమహంస  మొదలగువారు అనేకులు ఈ కోవలోకి వచ్చు వారే.

 “ఆత్మానాత్మ” వివేకము కలిగిన వారు మంచి చెడుల మధ్య వ్యత్యాసం గమనించి సత్కర్మలు చేయుదురు అని శంకరులు  చెప్పియున్నారు. భగవంతుడు తనకు కోరికలు లేవు అన్నాడు గానీ సత్కర్మలు చేయు మానవ కోరికలను కట్టడి చేయమని చెప్పలేదు. ఎందుకంటే మనకు తెలిసిన భగవరాధనలో మంచి కోరిక కు సముచిత స్థానం ఉన్నది.


• నీ కోరిక ఇతరులకు సేవ అయినపుడు . . .  

  నీ కోరిక ఇతరుల సంతోషం గావించినపుడు . . 

  నీ కోరిక పరులకు మేలు కలిగించేది అయినపుడు.

  నీ కోరికే నీకు మోక్ష సిద్ధి నిస్తుంది . ఎందుకంటే నీ కోరిక లో  నువ్వు అవశేషం గా  ఎన్నటికీ మిగిలి ఉండవు  కాబట్టి .

కోరికలు లేని వాడే ఇతరుల సముచిత కోరికలు తీర్చగలడు. అదే శివ తత్వం . ఆ స్థితిని పొందాలంటే నీ లోని  కోరికలు పరిసమాప్తి కావాలి .  ఇతరుల కోరికే , నీ కోరిక కావాలి . 


 ఓం శాంతి

 ఓం నమఃశివాయ

 యడ్ల శ్రీనివాసరావు 7 June 2026 , 10:30 AM.


759. ఎల్లి పోతున్నదే నా నావ

  ఎల్లి   పోతున్న దే  నా నావ  • ఎల్లి   పోతున్న దే    నా  నావ    మల్లి  . . .   ఎల్లి   పోతున్న దే   నా  నావ. • గింగురల  గాలి  లో ….    గిం...