మనిషి అన్వేషణ
ఈ భూమిపై మనిషి , మొదట తాను బ్రతకడానికి అన్వేషణ మొదలుపెట్టాడు. తర్వాత తన అవసరాలు తీర్చుకోవడానికి అన్వేషణ మొదలుపెట్టాడు . తర్వాత తాను సుఖపడడానికి అన్వేషణ మొదలు పెట్టాడు. తర్వాత అందరికంటే నేనే గొప్పవాడిని అని నిరూపించుకునేందుకు అన్వేషణ మొదలు పెట్టాడు . తర్వాత అందరిని శాసించడానికి ప్రయత్నం చేశాడు . ఇలా మనిషి అన్వేషిస్తూనే ఉన్నాడు .
జీవితాంతం సుఖాల కొరకు , ఆధిపత్యం కొరకు అన్వేషణ సాగుతుంది . ఇలా ఎప్పటి వరకు అంటే తన అంతిమ శ్వాస వరకు . ఇలాంటి అన్వేషణలో చివరికి మనిషి మనశ్శాంతి సుఖం ప్రశాంతత తృప్తి కలగకుండానే వెళ్ళిపోతాడు.
*మరి ఈ అన్వేషణకు ముగింపు ఎక్కడ ? దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం .
మనిషి అన్వేషణ అంతం లేని యాత్ర.
మనిషి జీవితం ఒక నిరంతర అన్వేషణ.
మనిషి మొదట బ్రతకడానికి ప్రయత్నించాడు. భోజనం కోసం , నీటి కోసం , ఆశ్రయం కోసం పరుగులు పెట్టాడు. అది జీవనానికి పునాది.
కానీ, మనిషికి అది సరిపోలేదు తర్వాత అవసరాలను తీర్చుకోవడం మొదలుపెట్టాడు. వస్త్రం, ఇల్లు, సౌకర్యాలు, భద్రత ఇవన్నీ పొందడం మొదలుపెట్టాడు. అవి సాధించిన తరువాత కూడా మనసు సంతృప్తి చెందలేదు.
సుఖం కోసం పరిగెత్తాడు . ఆ సుఖం వస్తే ఆనందం కావాలి . ఆనందం వచ్చిన తర్వాత ఆధిపత్యం కావాలి. ఆధిపత్యం వచ్చిన తర్వాత అధికారం కావాలి . అధికారం వస్తే గర్వం కావాలి . ఇలా మనిషి "బ్రతకడం" నుండి "శాసించడం" వరకు ప్రయాణం చేశాడు.
కానీ ఈ మొత్తం ప్రయాణంలో మనిషి ఒక ముఖ్యమైన విషయాన్ని కోల్పోయాడు అది ఏమిటంటే “తనను తాను ”.
ఆధిపత్యం చివరలో ఒంటరితనం . తాను అనుకున్నవన్ని సాధించాడు. మనిషికి అన్నీ దొరికినట్లు కనిపిస్తుంది . కానీ మనశ్శాంతి మాత్రం దొరకదు.
కామం తో శారీరక సుఖం, కోరికలతో భౌతిక సుఖం కోసం పరిగెత్తే మనిషి చివరికి తెలుసుకుంటాడు, సుఖం అనేది బయట దొరికేది కాదు , అది తనలో దాగి ఉన్న ప్రశాంతతే నిజమైన సుఖం అని .
*అన్వేషణ యొక్క చివరి ఘట్టం :
జీవితాంతం అన్వేషించిన తర్వాత, మనిషి చివరగా ఆగి వెనక్కి చూస్తాడు .
“ఇంతకాలం నేను ఏమి వెతికాను?” అని.
*అప్పుడు తెలిసేది ఒకటే :
తాను వెతికిన సుఖం డబ్బులో లేదు , తాను కోరిన గౌరవం లభించిన పదవిలో లేదు, తాను వెతికిన శాంతి ఇతరులపై ఆధిపత్యం చేయడం లో లేదు.
అంతా తనలోనే ఉంది ,
అయితే తాను ఎప్పుడూ తన లోనికి . . . లో లోనికి చూడలేదు .
అయినా , అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది . . .
ఒక దశలో జీవితం ముగిసిపోతుంది , కానీ అన్వేషణ మాత్రం శేషం గానే మిగిలిపోతుంది అనే సత్యాన్ని తెలుసుకోని మనిషి , తనలోని శాంతిని గుర్తించని మనిషి , ఎప్పటికీ తృప్తి పొందడు .
అందుకే జ్ఞానులు చెప్పారు . . . “సుఖం బయట వెతకకు , అది నీ అంతరంలో దాగి ఉందని.
ఓం శాంతి
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 15 Dec 2025 , 10:00 AM.


No comments:
Post a Comment