Friday, June 21, 2024

514. వృషభం

 

వృషభం



• వృషభం అనగా ఎద్దు. ఎద్దు గురించి తెలియని మనిషి అంటూ ఉండడు. చూడడానికి గంభీరంగా, కొమ్ములు కలిగి, పెద్ద శరీరం తో , నెమ్మదిగా నడుస్తుంది. వృషభాన్ని చూస్తే చిన్న పిల్లలకు, స్త్రీలకు, కొందరు మనుషుల కు భయం వేస్తుంది. ఎందుకంటే పొడుస్తుంది అనే భయం. ఎద్దు మూగ జీవి.


• మనిషి కి నాగరికత అలవాటు అయిన కాలం నుంచి, ఎద్దు తో మనిషి కి విడదీయలేని సంబంధం ఉంది.

• ఎద్దు ను ముఖ్యం గా వ్యవసాయం లో నేలను దున్నడం కోసం ఉపయోగించే వారు. తదుపరి, రవాణా వ్యవస్థ లేని పూర్వ కాలం లో ఎద్ధుల బండి (Bullock Cart) కోసం ఎడ్లను ఉపయోగించి వారు. ఎద్దుల కి  ఉన్న  విశేషత ఏమంటే,  ఎన్ని వందల కేజీ ల ధాన్యం బస్తాల నైనా,  లేదా  ఎంత మంది ఎద్ధుల బండి మీద కూర్చుని ప్రయాణం చేసినా అవి తొణకవు, బెదరవు.  సరికదా , మనిషి చెప్పిన విధంగా వింటూ,  చాలా సార్లు రివట దెబ్బలు తింటూ,  మౌనం గా ఉంటూ,  కంట నీరు కారుస్తూ,  ఎంత బరువైనా సునాయాసంగా మోస్తాయి. ఎవరు ఏం చెప్పినా, తల దించుకుని చేయడం మాత్రమే ఎద్దు యొక్క విధి.


• కానీ ఎద్దు బరువు మోసేటపుడు ఎంత భాద అనుభవిస్తుంది, బరువు మోయడం వలన మెడ పైన గాయాలు, పుండ్లు పడినపుడు ఈగలు వాలితే ఎంత నరకం అనుభవిస్తుంది , తోకతో ఈగలు కొట్టుకుంటూ అపరిశుభ్రమైన గొడ్ల చావిడి లో మల మూత్రాల మధ్య లో పడుకొని ఉంటుంది. మనిషి వలే ఎద్ధుకు మనసు ఉండదా? …. మనిషి శారీరక ధర్మం తో చేసే ప్రతి చర్యను ఎద్దు కూడా చేస్తుంది కదా. ఈ విషయాలను కనీసం ఎవరూ ఆలోచించరు.


• కానీ, కొందరు ఎద్దు ను తమ జీవన అవసరాలకు సేవ చేస్తుంది, అని ప్రేమిస్తూ తమ కుటుంబం లో భాగం గా భావిస్తారు. కానీ మరి కొందరు ఎద్దును ఒక పశువుగా భావించి అవసరాలు తీర్చే జీవిగా చూస్తారు. మనిషి చనిపోతే చర్మం దహనం చేయడానికి మినహా దేనికి ఉపయోగపడదు. కానీ ఒక ఎద్దు చనిపోతే , చర్మం తో ఎన్నో విలువైన తోలు వస్తువులు చేస్తారు.


• ఎద్దు తినేది కేవలం గడ్డి మాత్రమే. కానీ మనుషులకు చేసే సేవ అపారం. నేటి కాలంలో పంట పొలాలు దుక్కడానికి ట్రాక్టర్లు వచ్చాయి, కానీ పూర్వం ఎద్దులకు నాగలి కట్టి దుక్కి దున్నేవారు. అందుకే, ఎద్దులను దైవం గా భావించి, పూర్వ కాలం నుంచి సంక్రాంతి పండుగ రోజు రైతులు ఎడ్లకు పూజ చేసేవారు. నేడు ఈ సంస్కృతి కనుమరుగు అయిపోయింది. మనుషుల కు నేడు, ఎద్దుల పట్ల కృతజ్ఞత భావం ఎందుకు లేదో, భగవంతుడి కే తెలియాలి.


ఇక అసలు విషయానికి వస్తే ….


• ఈ విశ్వ సృష్టి కి కర్త శివుడు.  శివుని ప్రమధ గణాలలో వృషభం (ఎద్దు) ఒకటి . శివుడు తనను మోయ గల శక్తి గుణాలను ఒక్క వృషభానికి మాత్రమే ఇచ్చాడు. అందుకే అది శివుని కి వాహనంగా అయింది. అందుకే ప్రతి శివాలయం లో వృషభ అవతారమైన  నంది,   శివుని కి ఎదురుగా కూర్చుని ఉండడం చూపిస్తారు.   వాస్తవానికి ఇక్కడ అర్దం చేసుకోవలసింది మరొకటి ఉంది. శివుని లో ఉన్న సహనం, ఓర్పు, సేవ, అమాయకత్వం, గంభీరం, ఎద్ధులో సంస్కారాలు గా ఉంటాయి. అదే విధంగా శంకరుని లో ఉన్న రౌద్రం, లయం కూడా ఎద్దు కలిగి ఉంటుంది.


• వృషభం దేవతల కంటే మహిమాన్వితమైనది. సాక్షాత్తు పరమశివుని శక్తి నిండి ఉంటుంది. ఇదే ఎద్దు యొక్క జన్మ రహస్యం.

• అందుకే ఎద్దు ఎన్ని దెబ్బలు, గాయాలు, అవమానాలు తగిలినా , భరిస్తూ ఓర్పుతో ఉంటూ శివ శక్తి కలిగి ఉండి, సర్వం సమస్తం తనకు అర్దమవుతున్నా సరే , మౌనం గా ఉంటుంది . కానీ ఏనాడైనా కేవలం భరించలేని స్థితిలో మాత్రమే, ఎద్దు తన విశ్వరూపం చూపిస్తుంది. ఆ సమయంలో దానిని ఆపడం ఎవరి తరం కాదు, శంకరుడు లయం చేసేటప్పుడు చేసే భీభత్సం లా ఉంటుంది.

• అంటే ఎద్దు యొక్క సహజమైన స్వభావం ఓర్పు, సహనం. ఇవి శివుని యొక్క గుణాలు.  అంతేగానీ    అల్పుడైన మనిషి శక్తి కి లొంగి , భయపడి ఎద్దు జీవించదు. ఇది గమనించాలి.

• పరమాత్మ అయిన శివుడు కూడా మనిషి కి ఒకటే చెపుతాడు, ఎద్దు వంటి స్వభావ సంస్కారాలను కలిగిఉన్న మానవుల పై తాను ఆశీనుడై ఉంటాను అని.


• జ్యోతిష్యశాస్త్రం లో వృషభం అనే రాశి ఉంటుంది. ఈ రాశి లో జన్మించిన మనుషుల జీవనం, స్వభావం కూడా ఎద్దు వలే ఉంటుంది. వారు జీవించి ఉన్నంత కాలం ఎద్దు వలే అందరికీ సేవలు చేస్తారు, తన మన పర అనే భేదం లేకుండా అందరినీ తన కుటుంబం వలే ప్రేమిస్తారు, ఇతరుల సంతోషం కోరుకుంటారు, సహయ గుణం కలిగి ఉంటారు. గుర్తింపు ఆశించరు. ఎవరు ఎన్ని హేళనులు చేసినా, వ్యంగ్యాస్త్రాలు సాధించినా ఏమీ తెలియనట్లు మౌనం గా భరిస్తారు. చేయని తప్పులకు అవమానాలు, నిందలు శాంతంగా భరిస్తారు ….. కానీ ఒక్కసారి ఓపిక, ఓర్పు సహనం నశిస్తే  శత్రువుల పై  ఎటువంటి సంహరానికైనా ఒడిగడతారు. వీరికి  క్షమా గుణం ఉండదు 

• సత్య యుగపు రాజకుమారుడైన శ్రీకృష్ణుడు కూడా  వృషభరాశి ,  రోహిణి నక్షత్రం లో జన్మించాడు. ఎన్నో నిందలు, అవమానాలు పడ్డాడు. చివరికి యుక్తి తో కురుక్షేత్రం గావించాడు. శివ పరమాత్మ యొక్క సందేశాన్ని భగవానువాచ అంటూ భగవద్గీత ద్వారా చెప్పాడు.


• వృషభరాశి వారిది అదృష్టమైన జన్మ. వీరు ఎన్నో జన్మ జన్మలు గా చేసిన పాప కర్మల భారమంతా, ఈ జన్మలో చేయని తప్పులకు అవమానాల నిందల దుఃఖ రూపం లో తొలగి పోతుంది. ఈ రాశి వారు ఏనాడైతే తమ మనసు, బుద్ధి, జ్ఞానం తో శివుని పూజించి, శివుని తో పూర్తిగా అనుసంధానం అవుతారో, ఆనాటి నుంచి వారి కి శివశక్తి తరంగాలు నిరంతరం లభిస్తాయి. ఇది వృషభ రాశిలో జన్మించిన అందరికీ కాదు,   కేవలం ధర్మం ఆచరించ గలిగిన వృషభ రాశి వారికి మాత్రమే సాధ్యం అవుతుంది.


• ఎద్దు ఎంతటి బరువైనా మోస్తూ సహాయం చేస్తుంది , కానీ యజమాని నుంచి కాస్తంత ఉదాసీనత మాత్రమే కోరుకుంటుంది. శివుడు కూడా సర్వులకు సేవ, లోక కళ్యాణం చేస్తాడు కానీ, మానవుల నుంచి కాస్తంత స్వచ్ఛమైన ప్రేమతో నిండిన స్మృతి (ఓం నమఃశివాయ 🙏) మాత్రమే కోరుకుంటాడు. అంతేగానీ పూజలు,  నోములు,  వ్రతాలు, అభిషేకాలు ఉపవాసాలు కాదు.


• ఎద్దు జీవించడానికి కావలసింది కాస్తంత దాణా మాత్రమే.

• ఇదే వృషభం – ఎద్దు యొక్క విశిష్టత.

• ఈశ్వరుని సృష్టిలో ప్రతీ జీవికి ఒక ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉంటుంది.


ప్రేరణ :   ఒక నిర్జన ప్రదేశంలో ఒక ఎద్దు గడ్డి మేస్తూ ఉన్న సమయంలో , తదేకంగా గమనించినప్పుడు  దృష్టి లో కలిగిన అనుభవం.  


 ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 

 22 June 2024 , 11:00 am


No comments:

Post a Comment

532. దేహము కాదిది … వేదన కాదిది

  దేహము కాదిది … వేదన కాదిది  • దేహము  కాదిది  ….  దేహము కాదిది   దహనము తో     ఎగిసే    చితి    ఇది. • వేదన   కాదిది    ....   వేదన కాదిది...