Friday, November 18, 2022

272. సంపూర్ణ స్థితి Zero State (0)


  సంపూర్ణ స్థితి  Zero State (0)



• జీరో , సున్నా , శూన్యం విడిగా చూస్తే అది ఒక విలువ లేని సంఖ్య.   సున్నా ని కనుగొన్నది బ్రహ్మ పుత్ర  అయితే  సంఖ్య శాస్త్రం తో  ప్రపంచానికి విలువను  పరిచయం చేసింది  మాత్రం ఆర్యభట్ట. సంఖ్యా శాస్త్రం లో 1 నుండి 9 వరకు ఉన్న సంఖ్య లు చాలా విలువైనవి.  ఈ సంఖ్య లే   దేని విలువ నైనా నిర్ణయిస్తుంటాయి.  ఇది అందరికీ తెలిసిన విషయం. 1 నుండి 9 వరకు మధ్య లో  ఉన్న సంఖ్య ఎంత పెరిగితే అంత విలువ పెరుగుతుంది అని అనుకుంటాం. కానీ స్పష్టం గా, సూక్ష్మం గా గమనిస్తే ఇది అవాస్తవం.


• విలువ లేదు అనుకునే ఒక సున్నా ని ,  ఏదైనా సంఖ్య  చివర   చేరిస్తే నే  (1-9)   దాని విలువ పెరుగుతుంది.  లేకపోతే 1 నుండి 9 మధ్య గల ఈ సంఖ్యల విలువ చాలా అల్పం గా ఉంటాయి.    

అంటే విలువ లేదు అనుకునే సున్నా యే ఎంతైనా, ఆఖరికి అనంతమైన విలువ ను పెంచుతుంది అనేది వాస్తవం.


• అదే విధంగా. అసలు విషయం ఆలోచిస్తే మనిషి తన జీవితానికి కూడా హోదా (status) విలువ ను నిర్ణయించుకుంటాడు. చెప్పాలంటే నేటి కాలంలో పూర్తిగా ఈ హోదా (status) విలువ ని బట్టే సమాజం లో పరిచయాలు, స్నేహాలు, సంబంధాలు, బంధుత్వాలు ఏర్పడడం జరుగుతుంది అనేది పూర్తి వాస్తవం.


• మనిషి కి ఈ హోదాను (status) విలువను నిర్ణయించే వనరులు  ధనం, ఆస్తులు ,  అందం,  ఉద్యోగం , ఐశ్వర్యం ,  చదువు , విలాసాలు .  వీటినే అసలు సిసలైన సంపదలు గా భావిస్తూ,   ఇవి కలిగి ఉన్న స్థాయి ని బట్టి, మనిషి యొక్క హోదా (status) విలువ నిర్ణయించబడి relationships , కొత్త బంధాలు, పుట్టుకు రావడం అనేది నేటి కాలంలో జరుగుతుంది.


• ఈ భౌతిక ప్రపంచంలో ఒక మనిషి తన  చుట్టూ పైన పేర్కొన్న వనరులు ఎంత ఎక్కువగా ఉంటే , అంతగా ఆ మనిషి కి విలువ హొదా (status) నిర్ణయించ బడుతుంది.  ఇవి ఏమియు అంతగా లేని వారికి విలువ, హోదా  లేన్నట్లు  సమాజం లో స్థితి ఉంటుంది.  దీనిని బట్టి చూస్తే ఈ భౌతిక ప్రపంచంలో ఆడంబరాలకి  ఉన్న ప్రాముఖ్యత నిరాడంబరాలకి ఉండదు.  ఇది నిత్యం ఏదొక సందర్భంలో  అందరూ అనుభవిస్తున్న స్థితే.  

ఇదంతా మనుషుల కి  మానసిక ఆలోచనలో నుంచి ఉద్భవించిన స్థితి.  


• అంటే మనుషులు  అంతర్గత  సంపదలైన  గుణం, వ్యక్తిత్వం,  ప్రేమ,  దయ,  మంచితనం , నిస్వార్థం వంటి నిరాడంబర  లక్షణాలు   కంటే  బాహ్య  సంపదలకే  ఎక్కువ ప్రాధాన్యత  ఇస్తూ ఉంటారు  అనేది చాలా వరకు స్పష్టం.


• ఈ సృష్టికి  మూలం , తండ్రి పరమాత్మ శివుడు, అని చాలా మంది కి తెలుసు.  శివుడు ఆది పురుషుడు, మానవాళికి జ్ఞానం తెలియ చేసిన మూల గురువు ,  సర్వ శక్తి సంపన్నుడు,  కాలాన్ని అధీకృతం చేసుకుని  సృష్టి ని పరిపాలించే లోక రక్షకుడు అని  అందరూ విశ్వసిస్తారు ,  పూజిస్తూ ఉంటారు.  

కానీ ఆలోచించి చూస్తే అంత సర్వ శక్తి సంపన్నుడు  కూడా బైరాగి లా  చిన్న పులిచర్మం తో   నిండా విభూతి పూసుకుని,   చేతిలో త్రిశూలం తో,    మెడలో కాల నాగుతో ,   కపాలాలు ధరించి,   జుత్తు అంతా జడలు జడలు గా చూడడానికి  అందవికారంగా  మరియు నిరాడంబరంగా కనిపిస్తూ,    స్మశానం లో ఉంటాడు.   అంటే ఈ విశ్వాన్ని సంరక్షించే లోక నాయకుడు కి  అన్ని శక్తులు ఉన్నా ఏమీ లేనట్లు నిరాడంబరత తో  శూన్యమైన స్థితి లో    బైరాగి లా జీవితం గడుపుతూ ఉంటాడు.  ఇక్కడ  ముఖ్యంగా గమనించవలసిన విషయం శివుని యొక్క తత్వం. ఆయనకు   సర్వ  సంపదా  శక్తులు  ఉన్నా ,  అవి ప్రరదర్శించకుండా ,  శరీరానికి అంటించుకోకుండా,    ఆలోచనలను  శూన్యం చేసుకుని ,  తనకు తాను విలువ రహితమైన  లేదా  భార రహితమైన  Zero State  శూన్య స్థితి తో  నిరాడంబరంగా  ఆయన జీవిస్తూ , సమస్త మానవాళికి అయన తన రూపం తో సందేశం ఇస్తుంటాడు.  (కేవలం తప్పని సరి పరిస్థితుల్లో నే ఆయన శక్తి ని  ఉపయోగించి దుష్ట శక్తులను నాశనం చేసి లోక కల్యాణం చేస్తాడు.)


• శివుడు అనంతమైన  శూన్య స్థితిని  కలిగి  ఉండడం వలనే ఈ మొత్తం సృష్టి,  సృష్టిలో ఇతర జీవాలు విలువైనవి గా  తయారు కాబడి  ఆవాస యోగ్యం అయ్యాయి.    అంటే శివుని శూన్య స్థితి జీవనం వలన ఈ సృష్టి కి హోదా విలువ status పెరిగింది అనేది గ్రహించవలసిన విషయం.  శివుని కి  శూన్యత్వం లేకపోతే ఈ సృష్టి ఉన్నా సరే విలువలేని ది అనేది స్పష్టం.


• అదే విధంగా ఆధ్యాత్మిక జీవనము  ద్వారా నిరాడంబరంగా  శూన్యమైన స్థితి కి   చేరుకున్న వారు పరిపూర్ణ అలౌకిక శక్తి సంపన్నులు అవుతారు. ఎందుకంటే ఆలోచించి చూడండి అనాదిగా భారతీయ యోగులు, మహర్షులు ఎంత నిరాడంబరంగా ఉండే వారో.  వారిలో శక్తి  అపారం గా ఉండేది.  వందల సంవత్సరాలు జీవించే వారు. 

నేటి కాలంలో ఎంతో హోదా status విలువ కలిగి ఉన్నాము అనుకునే ధనవంతులు,   ప్రధాన మంత్రులు, అంబానీ లు అని ఆడంబరం గా చెప్పు కునే వారంతా ఎక్కడో అడవుల్లో ఆశ్రమాల్లో కాషాయం తో నిరాడంబరంగా ఉన్న సాధువుల కాళ్లు పై పడి  నమస్కరిస్తూ ఉండడం చూస్తుంటాం.

అంటే ఎంత ఆడంబరమైన  సరే  ఏదో ఒక రోజు నిరాడంబరం దగ్గర తల దించు కోవలసిందే ఎందుకంటే అది శివుని ఆజ్ఞ.   శివుడు చెప్పిన జ్ఞానం అర్దం చేసుకుంటే తాను జీవించిన నిరాడంబర విధానం మానవాళికి లోక కల్యాణానికి నిర్దేశించిన మార్గం.


• ఈ భౌతిక ప్రపంచంలో విలువైనవి గా భావించే ధనం, ఆస్తి, ఉద్యోగం, హోదా, వ్యాపారం, విలాసాలు వంటివి కలిగి ఉన్నా  సరే  వాటికి దాసోహం కాకుండా, వాటి ఉచ్చు లో పడకుండా  మనిషి తన  మానసిక స్థితి ని   వీటన్నింటి  కి  అతీతంగా ,  బురదలో కమలపుష్పం లా ఉంచుకో గలిగితే అదే మనిషి మనసు కి    భార రహిత స్థితి,  ఆత్మానంద స్థితి,  శూన్య మైన స్థితి. 


ఈ శూన్య మైన స్థితి నే సంపూర్ణ స్థితి అంటారు


ఒక్క మాటలో శూన్య స్థితి గురించి చెప్పాలంటే ఉన్నతంగా ( Positive state)  ఆలోచించే స్థితి  మరియు అల్పంగా (Negative state ) ఆలోచించే స్థితి,  ఈ రెండింటి  మధ్యలో ఉన్నదే  శూన్య స్థితి (Neutral state). 

Mathematical graph లో చూస్తే  zero కి  ఎడమ వైపు negative, కుడివైపు positive  ఉండి మధ్యలో సున్నా ఉన్నట్లే,  ఏదైనా కలిగి ఉన్నా,  లేక పోయినా  సరే  ఒకేలా స్థితప్రజ్ఞత తో  మనసు, బుద్ది, ఆలోచనలను ఉంచుకోవడమే శూన్య స్థితి.   

దీనినే మనసుకు నిశ్చలమైన స్థితి అంటారు..


ఈ శూన్య తత్వం పొందడం వలన మనిషి తాను చేయాలనుకునే పనిని వివేకంతో చేయగలడు. నిత్యం ఉత్సాహం గా ఉంటూ ఆరోగ్యం గా ఉంటాడు.  ఎక్కువ కాలం ఆనందం గా జీవిస్తాడు.  ఆందోళనలు, సమస్యలకు  కు అతీతంగా  జీవన ప్రమాణాలు పెరుగుతాయి.  భౌతిక ప్రపంచంలో అన్నీ పరిపూర్ణం గా  అనుభవిస్తూ నే   ఎటువంటి  మోహలకు, ప్రలోభాలకు  వశం కాడు.  సంపాదించిన ధనం సమర్థవంతంగా వినియోగిస్తాడు.  దైవీక గుణాలు అలవాటు అవుతాయి.  ఇది ధ్యాన సాధన తో మాత్రమే  సాధ్యం అవుతుంది.  శివ పరమాత్ముడు కూడా ధ్యానం తో నే సమస్త సృష్టి ని  చూస్తుంటాడు.


• మనిషి నిరాడంబరంగా , శూన్య తత్వం తో జీవించ గలగడం అనేది   ఎంతో  హొదా status విలువ కలిగినది.  ఈ స్థితి పొందాలి  అంటే అభ్యాసం తప్పని సరిగా చేయాలి.  ఎందుకంటే జన్మ జన్మలు గా  ఆత్మ  తన స్వశక్తి కోల్పోయి ,  దేహమే  శాశ్వతం అనుకొని , శరీరం పై మమకారం పెంచుకోని వికారాలకు, ఆడంబరాలకు అలవాటు పడిపోయి శక్తి హీనత తో దుఃఖం అనుభవిస్తూ ఉంది.


• శివుని పూజించాలి.  కాని అంతకంటే ముఖ్యంగా శివుని  తత్త్వాన్ని సహేతుకంగా అర్థం చేసుకుని ఆచరించాలి. అలా చేస్తే  శివుని చేరుకున్నట్లే.  


ఈశ్వరుని సంకల్పం తో

ఓం నమఃశివాయ 🙏


గమనిక :  నేటి కాలంలో యువత,   సరిగా ఏ విషయం పూర్తిగా అర్దం చేసుకునే సమయం, తీరిక, శక్తి లేక పూర్వీకులు, బుషులు, మహర్షులు ఇచ్చిన ఎంతో విలువైన  జ్ఞాన సంపదను  కాలదన్నుతు , పెద్ద వారు, గురువులు పట్ల గౌరవం , మర్యాద లేకుండా అయోమయంలో  ఆడంబర జీవితం గడుపుతూ , చిన్న వయసుల  లోనే  మానసిక వైఫల్యం పొందుతూ, అర్దం లేని ఆహారపు అలవాట్లు తో అదే అభివృద్ధి అనుకొని  , బయటకు చెప్పుకోలేని  అనారోగ్యాలతో అర్దాంతర మరణాలు, ఆత్మహత్యల భారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.  

వీటన్నింటినీ ఆపాలి అంటే మనిషి కి  శివుని జ్ఞానము,  దైవ చింతన ,  Inner Healing , Zero State of Mind చాలా అవసరం .

 


యడ్ల శ్రీనివాసరావు. 18 Nov 2022 10:30 pm.





No comments:

Post a Comment

481. పరిమళ భాష

  పరిమళ భాష • ఏమిటో     ఈ  భాష   ఎద కే    తెలియని   ఆశ.   అనుభవం  లేని   యాస   సృష్టి   మూలానికి    శ్వాస. • అక్షరాలు   ఉండవు  కానీ   భావం ...