Thursday, September 4, 2025

685 . వినాయకుని విశిష్టత

 


వినాయకుని విశిష్టత


• ప్రస్తుతం అంతా గణపతి నవరాత్రుల సందడి జరుగుతుంది. విగ్రహాలను నిలబెట్టడం లో వీధి వీధిలో పోటీ, చందాలను వసూలు చేయడం లో  (అనేక ప్రాంతాలలో ) భక్తి  పేరుతో  దౌర్జన్యం , మండపం లో దేవుని పాటలు ఉదయం ఒక గంట  మిగిలిన రోజంతా డి.జే. వికారీ  పైత్యపు పాటలు . . . 

చివరి రోజు లడ్డూ వేలం పాటలో   హంగు ఆర్భాటం , ఇక ఆఖరి ఘట్టం నిమజ్జనం ఊరేగింపు లలో  తాగి తందనాలు , గుడ్డలు చింపుకొని డాన్సులు , డి.జే లలో  వికారీ సాహిత్య సినిమా పాటలు …. ఇది నేటి కాలంలో మనిషి భక్తి   పేరుతో  ప్రత్యక్షంగా  దేవుని కోసం  సృష్టించుకున్న   సంస్కృతి .   

కానీ విచిత్రం ఏమిటంటే ,   ఇదే  నేడు మానవులందరికీ  చాలా  ఆహ్లాదకరం  . ఈ విధమైన  వ్యవహారాల తో చేస్తున్న  గణపతి పండుగ  యే అనేకులకు  ఓ విశిష్టత ,  ఒక పెద్ద వినోదం (ఎంటర్టైన్మెంట్) . ఎందుకంటే వారందరి జీవితాలు  ఒత్తిడి తో నిండిపోయాయి కాబట్టి ఈ రకమైన వినోదం అవసరం . 

• నేడు గణపతి గురించి ఇంతకు మించి గొప్ప గా చెప్పుకోవడానికి, సమాజం లో మనిషి దగ్గర  ఏమైనా సమాధానం ఉందా ? . . .  అంటే  అది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం అనిపిస్తుంది.  ఎందుకంటే, నేడు అందరూ కాస్త అటుఇటుగా చూస్తున్నది, చేస్తున్నది,  ప్రోత్సాహిస్తున్నది   ఇదే కదా . భగవంతుని పై ఈ భక్తి ఒక వినోదం , కాలక్షేపం . అందుకే ఇది కలికాలం, మాయా కాలం, పోయే కాలం, వినాశన కాలం .


• అసలు వినాయకుడు గురించి మనం మన తరాలకు ఏం చెపుతున్నాం ? అంటే ఒక అద్భుతమైన  కధ . ఇది కల్పితమా ?  వాస్తవమా? అనేది మనిషి చిన్ని మేధస్సు కు తెలియదు . . .  శివుడు తపస్సు చేసి చాలా కాలం తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంతలో పార్వతీ దేవి ఒక బాలుడు ని కాపలా పెట్టి స్నానానికి వెళ్ళింది. ఆ బాలుడు శివుడి ని అడ్డగించడం వలన శివుడు కోపంతో ఆ చిన్న బాలుడి తల నరికేశాడు. ఆ తర్వాత పార్వతి దేవి ఏడుస్తూ ఉంటే శివుడు ఏనుగును చంపి , దాని తలను ఆ బాలుడికి అతికించాడు . అసలు వింటుంటే, వినాయక వ్రత కల్ప పుస్తకం లో ఇదంతా చదువుతూ ఉంటే ... ఆహా ఎంత అద్భుతం . అనిపిస్తుంది కదా.  ఎందుకంటే మనిషి  మనస్సాక్షి  గుడ్డిది అయిపోయింది కాబట్టి .

• ఇలాంటి కధలు ఎవరు రాసారో, ఎందుకు రాసారో ఆ   భగవంతుడికి కూడా తెలియదు .


• శివుడు సృష్టి కర్త .  పరంజ్యోతి బిందు శక్తి స్వరూపుడు . శివుడు పరమాత్మ. శివుని కి  దేహం లేదు కాబట్టి  లింగాకారం చూపించారు. మరి శివుడు  తపస్సు చేయడం ఏంటి ? ఆ తపస్సు ఎవరి కోసం చేసాడు ? సరే … సాధారణంగా తపస్సు పూర్తి చేసినవారు క్రోధం , అహం వంటివి జయించి శాంతమైన మనసు తో ఉంటారు. అటువంటిది , కనికరం లేకుండా అహం తో చిన్న బాలుడి తల , లోక రక్షకుడు అయిన  శివుడు నరకడం ఏంటి ? వీటికి మనలో సమాధానాలు ఉన్నాయా ? ఆలోచించండి.


• అసలు శివుడు కి, శంకరుడికి తేడా గ్రహించ లేని స్థితిలో కధలు రాశారు. శివుడు సృష్టి చేస్తాడు . బ్రహ్మ విష్ణు శంకరులు శివుని యొక్క సృష్టి రచన . బ్రహ్మ ద్వారా స్థాపన , విష్ణువు ద్వారా పాలన , శంకరుని ద్వారా వినాశనం (మంచి కోసం, రీ సైక్లింగ్) జరుగుతుంది . శంకరుడు కూడా శివుని ని ధ్యానం తో స్మృతి చేస్తాడు. 


☘️☘️☘️☘️☘️☘️☘️


• ఇకపోతే  . . . వినాయకుడు . . . గణపతి .

ఓం   గం   గణపతయే  నమః.

" ఓం "  ఆత్మ  నైన  నేను  

“ గం ”  అనే స్వరం ఉచ్ఛారణ చేయడం వలన

“ గణ ” (గుణములు) శరీర నరముల  చైతన్య స్థితి ని 

“ పతియే ”   నాయందు నిర్వహించు వానికి

“ నమః “  ప్రణామములు .


• ఈ గణపతి  మంత్ర నామం నిత్యం సవ్యంగా 108 సార్లు , ఆ పైన ఉచ్చరించడం వలన మానవుని నరములు చైతన్యం అయి, మూలాధారం (నాభి కింది స్థానం) నుంచి సహస్రారము (తల పై) వరకు అనంతమైన విశ్వ శక్తి ప్రవహించును.

తద్వారా బుద్ధి వికాసం చెంది , ఆలోచనలు శ్రేష్టం అగును. అప్పటి వరకు మనిషి  కలిగి ఉన్న ఆలోచనలలో చైతన్య  శక్తి  లేకుండుట  వలన , ఏర్పడిన  విఘ్నాలు ఆటంకాలు   సమస్తం తొలగును. సమస్యలకు పరిష్కారం లభించును. అందుకే బుద్ధి కి  చిహ్నం గా గణపతి ని చూపిస్తారు. నరములు చైతన్యం అవడం వలన గణిత శాస్త్రం లో ప్రావీణ్యం పొందుతారు . 

గరిక గడ్డి తాకడం , వాసన పీల్చడం వలన నరముల లో దోషం నివారణ అగును . అందుకే గణపతి కి గరిక నివేదిస్తారు .


☘️☘️☘️☘️☘️☘️


• గణపతి కి ఏనుగు తల ఆపాదించి చూపించడం  వెనుక  ఒక  రహస్యం దాగి ఉంది. అదే  మానవుని శ్రేయస్సు . రాబోయే యుగాలలో మనిషి బుద్ధి పూర్తిగా వికారాల లో  మునిగి భ్రష్టు తో  ఉంటుందని ముందే గ్రహించిన  మునులు , అందు నుంచి బుద్ధి విముక్తి కోసం వినాయకుని పూజించమని తెలిపారు.


• విశాలమైన ఏనుగు చెవులు వలే , మనిషి తన చెవులను  చేసి  అనంతమైన సృష్టి  జ్ఞాన విషయాలు వినాలని .

• ఏనుగు కళ్ల  వలే మనిషి తన కళ్లు పెద్దవి గా చేసి జీవితం లో   ప్రతీ అంశం పట్ల  సూక్ష్మ దృష్టి , దూరదృష్టి  ,  కలిగి ఉండాలని .

• ఏనుగు తల అంత విస్తారం గా మనిషి బుద్ధి మంచి ఆలోచనలతో   కలిగి ఉండాలని .

• గణపతి పొట్ట అంత ఎక్కువగా మనిషి తనలో  జ్ఞానాన్ని  ఇముడ్చు  కోవాలని  .

• మనిషి  స్థిరం గా  ఉన్న ప్రదేశం లోనే  ఉండి , ఏనుగు తొండం చాపి నట్లు గా  సుదీర్ఘమైన శుద్ద సంకల్పాలు లోక కల్యాణం కోసం  చేయాలని .

• మనిషి ఇన్నీ  దైవీ గుణాలు కలిగి ఉంటూ , అహంకారం , ఆడంబరం లేకుండా ఉండాలని ఉద్దేశం తో  అంత పెద్ద గణపతి  ఆకారానికి చిన్న పీట చూపించారు.

• ఇక చివరిగా ఎలుక వినాయకుని వాహనం. అసలు ఇది వాస్తవానికి సాధ్యమే నా ? ఆలోచించండి . . .  దీని సూక్ష్మార్థం వినాయకుడి అంత  భారీ శరీరం మోసేది  సూక్ష్మమైన  ఎలుక  వలే ,    అన్ని సుగుణాలు, లక్షణాలు, కలిగిన మనిషి శరీరాన్ని   నడిపించేది  సూక్ష్మమైన ఆత్మ అని తెలియ  చేయడానికి  ఎలుక తో వినాయకుడిని సృష్టించారు .


వినాయకుడిని పూజించడం వలన మనిషి మహా జ్ఞాని అవుతాడు .


ప్రతీ శుభకార్యానికి ముందు , వినాయకుని పూజ చేయడం వలన  . . . మనిషి బుద్ధి  లో  ఉన్న వ్యర్ద (నెగెటివ్) ఆలోచనలు సంకల్పాలు  సమాప్తం అయి ,  పాజిటివ్ ఆలోచనలు వృద్ధి చెంది  ,  సత్బుద్ధి నొందడం ద్వారా  మంచి శక్తి పొంది  తలపెట్టిన శుభకార్యాలు   ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం గా  పూర్తి కాబడతాయి .


• నేటి మానవుడే , ఒకప్పటి సత్య, త్రేతా యుగాలలో దేవతా లక్షణాలు, దివ్య శక్తులు, బుద్ధులు కలిగి ఉండేవాడు . తరువాత కాలంలో ద్వాపర కలియుగాలలో ఆ మానవుడు అసురుడి లక్షణాలు కలిగి ఉంటాడు . అందుకు నిదర్శనం పైన ఉదహరించిన వికారమైన చేష్టలతో , బుద్ధి హీనత తో చేయకూడని విధంగా గణపతి భక్తి చేయడం.

 భగవంతుని కోసం  చేసే భక్తి పూజ  వెనుక , దాగి ఉన్న సత్యమైన సూక్ష్మం తెలుసుకుంటేనే  శ్రేష్ట ఫలితం లభిస్తుంది .

 

ఈశ్వరుని  జ్ఞానం  పరమ  సత్యం . 

సత్యాన్ని మనిషి  అనేక సార్లు వింటాడు, చదువుతాడు , తెలుసుకుంటాడు.  కానీ ఆచరించడు . ఎందుకంటే  ఆచరిస్తే  అందరితో వివాదాలు తలెత్తుతాయి అనే భయం . 


  ఓం శాంతి 🙏

  ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 4 Sep 2025 , 9:30 PM .


No comments:

Post a Comment

685 . వినాయకుని విశిష్టత

  వినాయకుని విశిష్టత • ప్రస్తుతం అంతా గణపతి నవరాత్రుల సందడి జరుగుతుంది. విగ్రహాలను నిలబెట్టడం లో వీధి వీధిలో పోటీ, చందాలను వసూలు చేయడం లో ...