తలెత్తుకు జీవిద్ధాం
• మనం ఈ భూమి మీద జీవించడానికి జన్మించాం. మన పాదాల కింద భూమి (నేల) ఉంది , తల పైన ఆకాశం ఉంది. మధ్యలో మనం ఉన్నాం . ఇది అందరికీ తెలిసిన విషయం .
• అయితే ఇక్కడ విశేషత ఏమంటే, ఉత్తములైన పెద్దలు, అనుభవజ్ఞులైన యోగ్యుల నుంచి ఒక మాట వింటుంటాం, అది ఏంటంటే " మనం జీవించినంత కాలం తలెత్తుకు బ్రతకాలి , తల దించుకుని కాదు " అని.
దీని అర్థం , సమాజం లో అందరి చేత శెభాష్ అని అనిపించుకునే లా గౌరవం గా బ్రతకాలి అని అనుకుంటాం . తప్పులేదు . ఇది చాలా మంచి విషయం.
కానీ ఇందులో ఒక ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉందని మనకు తెలియదు .
• మానవుని మూలాల లోకి వెళితే, ప్రతి మనిషి కి (ఆత్మ కి) తప్పకుండా భగవంతుని తో (పరమాత్మ తో) , తండ్రి పిల్లల సంబంధం ఉంది. కానీ మనం నేడు ఈ మాయా లోకం లో జీవిస్తూ ఉండడం వలన మన మూలమైన యధార్థ సంబంధాన్ని పూర్తిగా మర్చిపోయాం. భగవంతుడు అంటే వేరు, అని అనుకొని భక్తి తో పూజిస్తాం . కానీ భగవంతుని తో మనకు ఉన్న గత సంబంధం వలనే (తండ్రి, పిల్లలు) మనం కొలుస్తున్నాం అనే విషయం పూర్తిగా మర్చిపోయాం .
• మరి భగవంతుడు (పరమాత్మ ,తండ్రి ) ఎక్కడ ఉన్నారు? అంటే . . . ఆకాశం , ఆ పై సూక్ష్మ లోకం దాటి ఉన్న పరంధామం లో. (కొందరు దీనినే పరలోకం అంటారు). ఇదంతా యధార్థ మైన సత్యం అని మన ఆత్మ కి ముందే పూర్తిగా తెలుసు .
అందుకు నిదర్శనం , మనం ఏ కులము , ఏ మతము , ఏ వర్ణము , ఏ జాతి వారిమైన సరే , భగవంతుని తలంచు కునేటపుడు , తలని పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ ఓ భగవంతుడా అని తలచుకుంటాం . ఇంకా . . . భగవంతుడు పైన ఉన్నాడు అన్నీ చూస్తుంటాడు అనే మాట కూడా అంటుంటాం . ( అవునా ? . . . కాదా ? ఒకసారి ఆలోచించండి. ) కానీ ఈ రెండు చర్యలు , మన శరీర స్పృహ ద్వారా జరగవు. మన ఆత్మ స్పృహ తో జరుగుతాయి. ఎందుకంటే ఆత్మ కి మాత్రమే మన మూలం తెలుసు. కానీ , నేడు మన లోని ఆత్మ స్పృహ కి , శరీర స్పృహ కి మధ్య అనుసంధానం (కనెక్షన్) లేకపోవడం వలన శరీర స్పృహ కి తెలియకుండా నే , మన ఆత్మ చాలా చర్యలు చేస్తూ ఉంటుంది.
ఇందుకు ఉదాహరణ కొన్నిసార్లు అసాధారణం అనుకున్న పనులు , శక్తి కి మించిన పనులు చాలా సులభంగా చేసేసి ఆశ్చర్యం తో అంటుంటాం . . .
" ఏమో నాకే తెలియకుండా అంతా అలా చేసేశాను ,
నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం నాకు అసలు తెలియదు. కానీ , అలా ఎలా చెప్పానో నాకు అర్దం కావడం లేదు.
నాకు ఆ సమయంలో శక్తి ఎలా వచ్చిందో తెలియదు . కానీ ఆ శక్తి, నిత్యం నాతో ఉండేది మాత్రం కాదు.
ఇది ఇదివరకే ఎప్పుడో అచ్చం ఇలాగే జరిగినట్లు అనిపిస్తుంది .
ఇదంతా నాకు తెలుసు, నేను ఇదంతా ఎప్పడో చూశాను. నాకు ఈ ప్రదేశం కొత్త గా అనిపించడం లేదు .
నేనే ఇదంతా చేశానా ? నమ్మలేకున్నాను "
అని మనలో మనం ఇలా రకరకాలుగా వివిధ సందర్భాలలో అనుకోవడం జరుగుతుంది. ఇదే ఆత్మ శక్తి .
☘️ ☘️ ☘️ ☘️ ☘️ ☘️
ఇక మొదటి విషయానికి వస్తే . . .
• భగవంతుడు , పరమాత్మ శివుడు నివసించే స్థానం పరంధామం , ఇదే మన (ఆత్మల) స్వస్థానం . ఇహ లోకంలో మనం శరీరం విడిచిన (చనిపోయిన ) 13 రోజుల తరువాత , తండ్రియైన పరమాత్మ శివుని వైపు మన ఆత్మ చూస్తుంది . శివుని వద్దకు మరియు ఆత్మ స్వస్థానం అయిన పరంధామం వెళ్ళడానికి ఆత్మ ప్రయత్నం చేస్తుంది .
కానీ , అనేక జన్మలు గా భూమి పై ఆత్మ చేసిన కర్మలు లెక్కలు ఇంకా పెండింగ్ ఉండడం , బుణానుబంధాలు లెక్కలు పెండింగ్ ఇంకా భూమి పై మిగిలి ఉండడం వలన , మరియు ఆత్మ పూర్తిగా సంపూర్ణ పవిత్రత శక్తి సాధించ లేకపోవడం వలన తిరిగి శరీరం తీసుకొని జన్మిస్తుంది. ఆత్మ కి శరీరం ఉంటేనే కర్మలు లెక్కాచారం పూర్తి చేసుకోవడానికి సాధ్యం అవుతుంది . ఇదే మనిషి జనన మరణ చక్రం లోని సూక్ష్మ రహస్యం .
• తలెత్తుకుని బ్రతకాలి అని ఎందుకు అంటారు . అంటే , ఏనాడైతే పైన ఉన్న పరమాత్మ ను మరువకుండా నిత్యం మనసు తో చూస్తూ ధ్యానిస్తూ స్మృతి చేస్తూ ఉంటావో, నీలో అణగారిపోయిన నీ మూల స్వభావాలు , సంస్కారాలు అయిన . . .
ప్రేమ - శాంతి , పవిత్రత - జ్ఞానం , సుఖం - ఆనందం , శక్తి అయిన ఏడు దివ్య గుణాలు తిరిగి నీ ఆత్మలో నిండు కుంటాయి .
ఈ గుణాలు నీ లో నిండి ఉన్న నాడు ఈ భూమి పై దుఃఖం లేకుండా, పవిత్రం గా, ధర్మం గా, సంతోషంగా , గౌరవం గా జీవించిన నాడు శివుని వద్దకు వెళ్తావని , తలెత్తుకు బ్రతకాలి అంటారు . ఇదే ఇందులో ఉన్న ఆధ్యాత్మిక రహస్యం .
• అంతేకానీ అందరూ ఊహించినట్లు ధనం , ఉద్యోగం, పేరు, హోదా, కీర్తి సంపాదిస్తే తలెత్తుకుని జీవించడం అని అనుకోవడం చాలా అమాయకత్వం. ఎందుకంటే ఇవన్నీ తాత్కాలికం . ఇందుకు నిదర్శనంగా ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు . దేశానికి అధినేతలు గా చలామణి అవుతున్న వారికి సర్వ సౌఖ్యాలు, ధనం , కీర్తి , పేరు అన్నీ ఉన్నా చాలా నీచాతి నీచంగా ప్రవర్తిస్తూ బహిరంగంగా బ్రతుకు తున్నారు (అమెరికా , పాకిస్థాన్ అధ్యక్షులు . . . ఇంకా మరెందరో నిత్యం మన కళ్ళ ముందు ఉన్న వారు కూడా . . . )
అందుకే ధనం , అధికారం , కీర్తి , పేరు సంపాదించిందిన మనిషి , ఎంతటి స్థాయి వారైనా సరే బుద్ధి సరిగా లేకపోతే , పవిత్రత శక్తి లేకపోతే సుఖం శాంతి లేక , నిత్యం ఒత్తిడి తో నిద్ర లేక , మానసిక హింస అనుభవిస్తూ , అందరిని హింసిస్తూ , బయటకు చెప్పుకోలేక నరక యాతన తో జీవించ వలసి వస్తుంది . ప్రస్తుతం నేడు , ఈ లోకంలో ఇదే జరుగుతోంది .
• ఇక రెండో విషయం . . .
తలదించుకునేలా జీవించ వద్దు అని ఎందుకు అంటారు ? . . . తల దించుకుంటే కనిపించేది నేల, భూమి, భౌతిక ప్రపంచం . ఇందులో శరీర భారం, మాయ , దుఃఖం , విలాసాలు , కామ వికారాలతో పాటు ఈ నేల మీద ధర్మాన్ని అతిక్రమించేవి ఎన్నో పుష్కలంగా ఉన్నాయి . ఇవి మన పాదాల కింద ఉన్న ఈ భూమి మీద మాయా రూపం లో ఉంటాయి . వీటన్నింటి వలన సంతోషం ఆనందం లభిస్తున్నాయి అని అనుకుంటాం , కానీ అవి నీటి బుడగలా అల్పకాలికం మాత్రమే ఉంటాయి . ఇవి మనిషి ని ఆకర్షిస్తూ తలదించుకొనేలా చేసి పతనం చేస్తాయని, క్రమేపీ బలహీనుడి గా అయి , మనిషి ( ఆత్మ ) మరింత క్షోభకు గురవుతాడని అని సూక్ష్మార్థం .
ఇవన్నీ మనిషి మనసు వెనుక జరిగే నిత్య సత్యాలు .
• మనిషి జీవించడానికి ధనం, ఆహారం , గృహం , ఆరోగ్యం, వసతుల సౌఖ్యం , మంచి మానవ సంబంధాలు అత్యంత అవసరం . వీటి సంపాదన కోసం మనిషి మంచి బుద్ధి తో కృషి చేయడం అవసరం.
కానీ , వీటి కోసం మాత్రమే కేవలం మనిషి జన్మించినట్లు , యాంత్రికంగా తనను తాను మరచి , అర్దం లేకుండా జీవించడం వలన చివరికి ఆత్మ కి మిగిలేది క్షోభే . ఎందుకంటే శరీరం ఎలాగో బూడిద అవుతుంది. ఆత్మ కి మరణం లేదు. ఆత్మ మరలా ఇవే స్వభావ సంస్కారాల తో తిరిగి మరో జన్మ ఎత్తుతుంది .
మనిషి కి అంతరం లో ఉండే బలమైన ఆధ్యాత్మిక శక్తి మాత్రమే బాహ్య ప్రపంచంలో సజావుగా జీవించడానికి కావలసిన భౌతిక శక్తి ని సమతుల్యం చేస్తుంది . లేనిచో , నేటి ప్రపంచంలో విస్తరించిన మాయకు (బలహీనత లకు) మనిషి లోని భౌతిక శక్తి పెరుగుతూ ఉన్నట్లుగా అనిపించినా చివరకు పూర్తిగా నిర్వీర్యం అయిపోతాడు .
మనిషి ఈ విషయం స్వయంగా తాను అనుభవ పూర్వకంగా గ్రహించడానికి కొన్నిసార్లు , అనేక జన్మలు కూడా పట్టవచ్చును.
• తలెత్తుకుని జీవిద్ధాం . మన మూలాల లో ఉన్న శివ పరమాత్ముని బుద్ధి తో స్పృశిద్ధాం. మానసిక బలవంతులు గా అయి భౌతిక జీవనం లో ఉండే మాయా బలహీనతలను జయిద్ధాం .
ఇదే మనిషి తనపై తాను విజయం సాధించడం . తలెత్తుకు తిరగడం.
ఓం శాంతి 🙏
ఓం నమఃశివాయ 🙏.
యడ్ల శ్రీనివాసరావు 29 Sep 2025 1:00 PM
No comments:
Post a Comment